
స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచిపోయాయి. పాలకులు మారినా, స్వరాష్ట్రం సిద్ధించాక రాష్ట్రంలో నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందించలేకపోతున్నాం. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని ఎన్నో ఏళ్లుగా హామీలు ఇస్తూనే ఉన్నారు. కానీ మాటలకు చేతలకు మాత్రం పొంతన ఉండడం లేదు. నేటికీ నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందడం లేదు. రాష్ట్రంలోనీ సాధారణ పౌరులు వారి సంపాదనలో దాదాపుగా 80% విద్య, వైద్యానికే ఖర్చు చేస్తున్నారనీ ఒక అంచనా. భారతదేశంలో అత్యధికంగా విద్య, వైద్య రంగాల్లో దోపిడీ జరుగుతుంది, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే. ప్రైవేటు రంగంలో ఫీజులను నియంత్రించలేకపోవడం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణపై పాలకులకు చిత్తశుద్ధి లోపించడమే ఈ దుస్థితికి కారణం.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సామాజిక బాధ్యతగా, విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండాలో సూచిస్తూ ప్రతిపాదనలను నాటి ప్రభుత్వానికి సమర్పించారు. వాటిని ఆనాటి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కేవలం గురుకుల విద్యా వ్యవస్థను మాత్రమే ప్రోత్సహిస్తూ వచ్చింది. ఫలితంగా అప్పటికే కొనసాగుతున్న పాఠశాల విద్య నిర్లక్ష్యానికి గురైంది.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని, కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో అందరికీ నాణ్యమైన విద్యను అందిస్తామని, పది సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో గత ప్రభుత్వం పాఠశాల విద్యకు కేటాయించిన బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్లో సగటుగా 6.6% మాత్రమే.
ఫలితంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో 5,895 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా నడుస్తున్నాయి. 2,097 పాఠశాలల్లో అసలు పిల్లలే లేరు(జీరో స్కూల్స్). విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి 15 సంవత్సరాలు కావస్తున్న రాష్ట్ర బడుల్లో మూత్రశాలలు బాలురకు 74.1%, బాలికలకు 85.14% మాత్రమే ఉపయోగించే స్థితిలో ఉన్నాయి.
రాష్ట్రంలో ప్రతి ఏటా జీరో బడులు(పిల్లలు లేని బడులు)పెరుగుతున్నాయి. ప్రభుత్వ బడులకు ఆదరణ తగ్గుతుందనే విషయం అర్థం అవుతుంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం గాడి తప్పడానికి గత దశాబ్ద కాలంలో కేవలం గురుకులాలను ప్రోత్సహిస్తూ మిగతా బడులను నిర్లక్ష్యం చేయడం, మౌలిక సదుపాయాల కొరత, టీచర్ల కొరత, పర్యవేక్షణ లోపం, సత్ఫలితాలను ఇవ్వని పథకాల అమలు, ప్రభుత్వ బడులపై తల్లిదండ్రులకు ఏర్పడిన అభిప్రాయం, విద్యారంగానికి సరిపోయే బడ్జెట్ కేటాయించకపోవడం వంటివి ఉన్నాయి.
తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి గత సంవత్సరంలో ₹21,292 (7.75%) కోట్లు కేటాయించారు.దేశంలోని టాప్ 20 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అత్యల్పంగా 7.75% నిధులను కేటాయించింది. డిల్లీ 21.1%,,కర్ణాటక 11%, ఆంధ్రప్రదేశ్(12.6%), కేరళ(14%), తమిళనాడు(14.1%) రాష్ట్రాలు విద్యారంగం అభివృద్ధికి, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు మనకంటే ఎక్కువ నిధులు కేటాయించాయి. ఆ రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్ర విద్యారంగా కేటాయింపులు చాలా తక్కువ.
నాటితో పోల్చుకుంటే నేటితరం ఉపాధ్యాయుల్లో సామాజిక స్పృహ తగ్గిందని చెప్పవచ్చు. ప్రజా ఉద్యమాల్లో వీరి భాగస్వామ్యం కూడా తగ్గింది.
ప్రగతిశీల చైతన్యపూరిత భావజాలానికి బదులుగా కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ, స్వచింతన విద్యా రంగంతో పాటు ఉపాధ్యాయుల్లో కూడా నెలకొన్నాయి. ప్రజలకు ఉపాధ్యాయులకు మధ్య అవినాభావ సంబంధం తగ్గింది. గతంతో పోలిస్తే నేటితరం ఉపాధ్యాయులపై ప్రజల్లో ప్రేమ అభిమానాలు, గౌరవం కూడా తగ్గాయి. వాటిని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత నేటి తరం ఉపాధ్యాయుల పైన ఉంది. ఉపాధ్యాయులకు బోధనా నైపుణ్యాల పెంపు కోసం ప్రతి సంవత్సరం వృత్యంతర శిక్షణలను ఇస్తూ, పర్యవేక్షణ అధికారులతో నిరంతరం పర్యవేక్షిస్తే సత్ఫలితాలు సాధించవచ్చు. పర్యవేక్షణ అధికారులుగా బోధనా అనుభవం లేని వారిని నియమిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. జిల్లా, మండల స్థాయి పర్యవేక్షణ అధికారులుగా బోధనా అనుభవం గల వారిని మాత్రమే నియమించాలి. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని విద్యార్థుల ఉపాధ్యాయుల సమస్యలను అర్థం చేసుకోవాలంటే బోధనా అనుభవం ఉన్న అధికారులతో మాత్రమే సాధ్యమవుతుంది.
విద్యకు 15% నిధులు బడ్జెట్లో కేటాయించి, ప్రభుత్వ బడులను పటిష్టం చేసి రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత ఉచిత విద్యను అందిస్తామని వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు కేవలం 7.75% మాత్రమే గత బడ్జెట్ లో కేటాయింపులు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యకు కేటాయించిన సగటు బడ్జెట్ 14.7%లో ఈ కేటాయింపులు సగం మాత్రమే అని మనం గమనించాలి.
విద్యారంగాన్ని సంక్షోభం నుండి బయట పడేయాలంటే రాష్ట్రంలో వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న 30,306 పాఠశాలలో చదువుతున్న 28,95,456 మంది విద్యార్థులు, 2020 సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న 3,30,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు. 35,000 అంగన్వాడీ సెంటర్లో ఉన్న మూడు లక్షల పూర్వ ప్రాథమిక విద్యార్థుల అవసరాలను పరిగణలోకి తీసుకోవాలి. రాబోయే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం విద్యారంగ పరిరక్షణ చేయాలంటే, రాష్ట్రంలోని బాలలకు నాణ్యమైన విద్య ఉచితంగా అందాలంటే ప్రభుత్వం నియమించిన విద్యామిషన్ సిఫారసులను తప్పకుండా అమలు చేయాలి. బడ్జెట్ కేటాయింపులు పెంచి, విద్యా కమీషన్ సిఫార్సులను అమలు చేస్తేనే రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ సాధ్యమవుతుంది, బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందుతుంది.
– పాకాల శంకర్ గౌడ్
ఫోన్ నెంబర్: 9848377734
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.