
పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద శిక్షణ కేంద్రాలుగా గుర్తించిన ప్రాంతాలపై బుధవారం వేకువజామున భారతదేశం క్షిపణిదాడులు చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దౌత్య మంత్రాంగం చురుగ్గా కదులుతోంది. భారతదేశం ఓ అడుగు ముందుకేసి తమ దాడుల నేపథ్యాన్ని, జాతీయ మనోభావాలను, దీర్ఘకాలంగా దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్య, దాని పర్యవసానాలను వివిధ దేశాధినేతలు, దౌత్యవేత్తలకు వివరిస్తోంది.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జయశంకర్ రోజంతా ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నారు. భారతదేశం సాగించిన క్షిపణి దాడులను సహృదయంతో అర్థం చేసుకోవాలని, ఈ చర్యలకు మద్దతు కూడగట్టడం కోసం అమెరికా, చైనా, రియాద్, ఫ్రాన్స్ ప్రభుత్వాలతో సంప్రదిస్తూనే ఉన్నారు.
వివిధ దేశాలు రాజకీయ భూగోళంలో వారికంటూ ఉన్న నిర్దిష్ట వ్యూహాల ప్రకారం స్పందిస్తున్నప్పటికీ అందరి స్పంందనల్లోనూ కనిపించే ఉమ్మడి అంశం ఒక్కటే. భారత్, పాకిస్తాన్లు దౌత్య సంబంధాలు తెంచుకోరాదు, సంయమనం పాటించాలి అన్నదే ఈ ఉమ్మడి అంశం.
పహల్గాంలో 25మంది పర్యాటకులను, ఓ కశ్మీర్ పర్యాటక సహాయకుడిని పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు కాల్చి చంపిన రెండు వారాల తర్వాత మే ఏడో తేదీ రాత్రి 1.05 గంటలకు పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని ఉగ్రవాద శిక్షణ కేంద్రాలపై భారత సైన్యం వరుస దాడులు చేసింది.
దాడులు మొదలైన వెంటనే భారత జాతీయ భద్రతా సలహాదారు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుతోనూ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతోనూ, ఇంగ్లాండ్కు చెందిన జొనాథన్ పావెల్తోనూ, ఫ్రాన్స్కు చెందిన ఎమాన్యుయెల్ బొన్నెతోనూ, జపాన్కు చెందిన మసాకా ఒకానోతోనూ, రష్యా జాతీయ భద్రతా సలహాదారు సెర్గీ షోయిగుతోనూ మాట్లాడారు.
భారత్ పాకిస్తాన్ వివాదంలో అరబ్బు దేశాలకున్న ఆసక్తి, ప్రాధాన్యత రీత్యా దోవల్ యునైడెట్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహనూన్ బిన్ జాయెద్తోనూ, జాతీయ భద్రతా మండలి కార్యదర్శి జనరల్ అలి అల్ షాంసితోనూ, సౌదీ అరేబియా జాతీయ భద్రతా సలహదారు ముసాయిద్ అల్ ఐబన్తో నేరుగా మాట్లాడారు.
మరోవైపు చైనాకు చెందిన వాంగ్ యితో కూడా దోవల్ మాట్లాడారు. వాంగ్ యి భారత్ చైనా సరిహద్దు చర్చల్లో దోవల్తో పాటు పని చేస్తున్న వ్యక్తే కాకుండా చైనా కమ్యూనిస్టు పార్టీలో ఉన్నత బాధ్యతల్లో ఉన్న వ్యక్తి. చైనా విదేశాంగ మంత్రి కూడా.
ఇదిలా ఉండగా పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్కు తగిన గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్న తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ దేశంలోని పలు దేశాల రాయబారులతో ప్రత్యక్షంగా మంతనాలు నడిపారు. ఢిల్లీలోని చైనా రాయబారి జి ఫెహుయోంగ్ను కూడా భారత విదేశాంగ శాఖ పరిగణలోకి తీసుకుని పరిణామాలను వివరించారు.
ఈ సంప్రదింపులన్నిటిలోనూ ‘భారత దేశం జరిపిన క్షిపణి దాడులు ఆచితూచి చేసినవి, రెచ్చగొట్టుడు ఉద్దేశంతో జరిపినవి కావు, దాడుల సందర్భంగా భారత్ ఎంతో సంయమనం పాటించింది’’ అని భారతదేశ ప్రతినిధులు వివరించారు. ‘‘ఉద్రిక్తతలు పెంచాలన్న కోరిక భారత్కు ఏమీ లేదని, ఒక వేళ పాకిస్తాన్ హద్దు మీరితే అన్నిరకాలుగా సంసిద్ధంగా ఉన్నామని’’ దోవల్ వివిధ దేశాల భద్రతా సలహాదారులకు, దౌత్యవేత్తలకు వివరించినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
భారత్ పాకిస్తాన్ల మధ్య తాజా పరిణామాల గురించి స్పందించిన తొలి విదేశీ నేత అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ ఉద్రిక్తతలు సిగ్గుచేటు అని ఆయన ప్రకటించారు. ఓవల్ ఆఫీసులోకి వస్తున్న సమయంలో ఈ దాడుల గురించి తెలిసింది. రెండు దేశాల మధ్య గతంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటిదేదో జరుగుతుందని కొంతమందికి సందేహం ఉంది. ఈ రెండు దేశాలు ఎన్నో దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే శతాబ్దాలుగా ఘర్షణ పడుతూ ఉన్నాయి. ఈ ఘర్షణలు త్వరలో సమసిపోతాయని ఆశిస్తున్నాను అన్నారు. రెండు దేశాలూ సంయమనం పాటించాలని మాత్రం చెప్పలేదు.
బుధవారం మాత్రం మరింత వివరంగా స్పందించారు. ‘‘ఓహ్.. ఇది చాలా ఆందోళనకరం. నా మట్టుకు నేను చెప్పాలంటే ఇద్దరితోనూ వ్యవహారం నడపగలను. నాకు ఇద్దరూ బాగా తెలిసిన వాళ్లే. ఇద్దరూ కూర్చుని పరిష్కారం చేసుకుంటే మంచిది. ఇద్దరూ ఇంతటితో ఆగాలని ఆశిస్తున్నాను. ఆగుతారనుకుంటున్నాను. కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు ఇద్దరూ వ్యవహరించారు. ఇక చాలిస్తే మంచిది. ఈ విషయంలో నేనేదైనా సహాయం చేయగలిగితే చేస్తాను.’’ అన్నట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ స్పందన దీనికి పూర్తి భిన్నంగా ఉంది. దక్షిణాసియాలోని రెండు ముఖ్యమైన దేశాల మధ్య సాయుధ ఘర్షణ ప్రపంచ శాంతికి విఘాతమని, తక్షణమే రెండు దేశాలు సంయమనం పాటించాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రెజ్ అధికార ప్రతినిధి జారీ చేసిన ప్రకటనలో తెలిపారు.
అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో ఓ ట్విటర్ పోస్ట్ చేస్తూ రెండు దేశాల మధ్య పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నానంటూ ట్రంప్ అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. ఈ ఉద్రిక్తతలు త్వరగా చల్లబడాలని కోరుతున్నాను. రెండు దేశాలు శాంతియుత పంథాను అనుసరిస్తాయని ఆశిస్తున్నాను అని ఆ పోస్టులో తెలిపారు.
రూబియో ప్రకటన తర్వాత అమెరికా విదేశాంగ శాఖ కూడా ఓ ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటనలో రూబియో భారత్, పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారులను సంప్రదించారని తెలిపింది. ఉద్రిక్తతలు పెంచేలా చర్యలు తీసుకోవద్దనీ, రెండు దేశాల మధ్య దౌత్య చర్చలకు అవకాశాలు కొనసాగించాలని రూబియో ఇరు దేశాలను కోరినట్లు ఈ ప్రకటన తెలిపింది. రోజంతా వివిధ దేశాలు భారత్ పాకిస్తాన్లు సంయమనం పాటించాలని పిలుపునిస్తూ పలు ప్రకటనలు జారీ చేశారు.
దాడులను తీవ్రంగా ఖండించిన తర్వాత రష్యా విదేశాంగ మంత్రి మారియా జఖరోవా విడుదల చేసిన ప్రకటనలో రెండు దేశల మధ్య ఉన్న ఉద్రిక్తతలు 1972 నాటి సిమ్లా ఒప్పందం, 1999 నాటి లాహోర్ ఒప్పందం ఆధారంగా రాజకీయ దౌత్య మార్గాల్లో శాంతియుతంగా పరిష్కరించబడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పరిస్థితులు మరింత దిగజారకుండా రెండు దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బీజింగ్లో ఓ ప్రకటన విడుదల చేసిన చైనా విదేశాంగ శాఖ భారతదేశం చర్యలు విచారకరమని అభిప్రాయపడింది. అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకమన్న తమ వైఖరిని పునరుద్ఘాటిస్తూ భారత్, పాకిస్తాన్లు శాశ్వత ఇరుగు పొరుగు దేశాలనీ, చైనా కూడా వారికి పొరుగు దేశమని విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన వ్యాఖ్యానించింది. రెండు దేశాలూ ఈ ప్రాంతంలో శాంతి స్థాపన వంటి విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారేలా వ్యవహరించరాదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు.
ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారెట్ మాట్లాడుతూ ‘‘రెండు దేశాలూ సంయమనం పాటించి ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలి’’ అన్నారు. ఫ్రాన్స్ విదేశాంగ శాఖ విడుదల చేసిన మరో ప్రకటనలో ఉద్రిక్తతలు నివారించి, పౌరులకు రక్షణ కల్పించేందుకు రెండు దేశాలు ప్రయత్నించాలని పిలుపునిచ్చింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ భూబాగంలోకి ప్రయోగించిన క్షిపణులను మోసుకెళ్లింది ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న రాఫెల్ యుద్ధవిమానాలే.
నూతనంగా నియమితులైన జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వాదెఫాల్ ఈ పరిణామాలు చోటుచేసుకునే సమయంలో అధికారిక పర్యటన నిమిత్తం పారిస్లో ఉన్నారు. ఫ్రాన్స్ జాతీయ భద్రతా సలహాదారుతో కలిసి భారత ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండేలా చూసేందుకు రెండు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పౌరులను రక్షించాలని జర్మనీ విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బ్రెస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు, చర్యలు ప్రారంభించేందుకు తాను రెండు దేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడాననీ, శాంతి, సంయమనం, స్వీయ నియంత్రణ తక్షణావసరమని వక్కాణించారు. యూరోపియన్ యూనియన్ విదేశాంగ ప్రతినిధి విడుదల చేసిన ప్రకటనలో రెండు దేశాల మధ్య దీర్ఘకాలం నిలిచి పోయేలా శాంతి చర్చలు మొదలు కావాలని ఆకాంక్షించారు. ఇంగ్లాండ్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ విడుదల చేసిన ప్రకటనలో పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే ఏ ఒక్కదేశమూ గెలిచే పరిస్థితి లేదని గుర్తు చేశారు. ఈ మధ్యనే భారత్, ఇంగ్లాండ్ల మధ్య స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం కుదురింది. భారత్, పాకిస్తాన్లు ముఖాముఖీ చర్చలతో సున్నితమైన మార్గాల ద్వారా శాశ్వత పరిష్కారాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని బ్రిటన్ ప్రభుత్వం కాంక్షిస్తున్నట్లు తెలిపారు.
జపాన్ విదేశాంగ మంత్రి భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో దాదాపు 15 నిమిషాలు ఫోన్లో మాట్లాడారు. తాజా పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం చేసిన దాడులు రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి సైనిక ఘర్షణగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రాన్స్, ఇంగ్లాండ్ల లాగానే పహల్గాం దాడులను ఏ కారణాలతోనూ సమర్ధించుకోలేమని స్పష్టం చేసింది జపాన్. పారదర్శకతతో కూడిన దర్యాప్తుతో దోషులను శిక్షించాలని కోరుతూ జపాన్ రెండు దేశాలు ఆవేశకావేశాలకు లోనుకావద్దని పిలుపునిచ్చింది.
జపాన్ విదేశాంగ మంత్రితో జరిగిన ఫోన్ సంభాషణను ప్రస్తావిస్తూ భారత విదేశాంగ మంత్రి జయశంకర్ జపాన్ స్పందనను ప్రశంసించారు. భారతదేశం దీర్ఘకాలంలో సీమాంతర ఉగ్రవాదం వలన ఎదుర్కొంటున్న సమస్యలను జపాన్ విదేశాంగ మంత్రి దృష్టికి తెచ్చినట్లు ఒక పోస్ట్లో తెలిపారు.
గల్ఫ్ దేశాల్లో కతార్ ప్రధాని తనకు ఫోన్ చేశారని జయశంకర్ వెల్లడించారు. రెండు అణ్వాయుధ దేశాలు సంయమనం పాటించాలని, సంక్షోభాన్ని దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని, మంచి ఇరుగుపొరుగుగా ఉండాలని దోహా ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించారు. గల్ఫ్ దేశాల్లో భారత్తో అత్యధికంగా ఆర్థిక వాణిజ్య సంబంధాలు కలిగిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఇదేవిధంగా స్పందించింది. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఇరాన్ విదేశాంగ మంత్రి బుధవారం సాయంత్రం భారతదేశం చేరుకున్నారు. రెండు దేశాలు ప్రాదేశిక సమగ్రతను గౌరవించుకుంటూ వ్యవహరించాలని, బలప్రయోగానికి ఎటువంటి అవకాశాలూ ఇవ్వరాదని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి ఆర్రఫీు పోయిన వారం పాకిస్తాన్లో పర్యటించారు.
మరోవైపున టర్కీ ప్రధాని ఎర్దోగాన్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో మాట్లాడుతూ ఇప్పటివరకూ సంయమనం పాటించటాన్ని హర్షించారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ ముస్లిం దేశాల సమాఖ్య ప్రతినిధులతోనూ, ఇస్లామాబాద్లోని వివిధ దేశాల రాయాబారులతో సంప్రదింపులు జరిపారు. మరోవైపు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ ఢిల్లీలోని వివిధ దేశాల రాయబారులతో పాటు ఐక్యరాజ్యసమతి భద్రతామండలి సభ్య దేశాల ప్రతినిధులను కూడా కలిసి పరిస్థితి వివరించారు. ఈ చర్చల్లో ఉన్న ఓ బ్రిటన్ దౌత్య అధికారి భారతదేశం ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి లక్షిత ప్రదేశంలోని మసీదును పేల్చేసిందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీనికి స్పందనగా మసీదుతో సహా మొత్తం భవంతులన్నీ ఉగ్రవాదులకు శిక్షణ కేంద్రాలుగ ఉన్నాయని భారత ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
దేవి రూప మిత్ర
అనువాదం: కొండూరి వీరయ్య