
ఆంధ్రప్రదేశ్లోని మల్లం గ్రామంలో ఒక దళిత ఎలక్ట్రీషియన్ చనిపోయిన తరువాత, బాధిత కుటుంబీకులు పరిహారం డిమాండ్ చేశారు. అప్పటికే కోపంతో ఉన్న ఆధిపత్య కాపు కులస్తులు వాళ్లను బహిష్కరించారు. దీనికి సంబంధించిన సమాచారం అధికారులకు తెలిసిన తర్వాత, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో ఈ చర్య ప్రస్తుతం విమర్శలకు గురవుతోంది.
విశాఖపట్నం: గత వారం ఆంధ్రప్రదేశ్లోని ఒక గ్రామంలో ఒక దళిత సమాజం సామాజిక బహిష్కరణను ఎదుర్కొంది. ఇదంతా ఒక దళిత ఎలక్ట్రీషియన్ మరణం తర్వాత చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందిచిన మానవ హక్కుల సంఘాలు అధికారులను తీవ్రంగా విమర్శించాయి. ఎందుకంటే, బహిష్కరణకు పాల్పడ్డారని ఆరోపించబడిన వారిపై ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద చట్టపరమైన కేసు నమోదు చేయకుండా అధికారులు తొందరగా “శాంతి కమిటీ”ని ఏర్పాటు చేశారు.
ఈ సంఘటన కాకినాడ జిల్లాలోని మల్లం గ్రామంలో జరిగింది, ఇది రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం తాలుకా పరిధిలోకి వస్తుంది.
అసలు విషయం ఏంటి?
పల్లపు సురేష్ బాబు(38)అనే ఎలక్ట్రీషియన్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివసించేవాడు. ఏప్రిల్ 16న అతను మల్లం పెద్ద వీధి(ప్రధాన వీధి)లోని ప్రభావవంతమైన కాపు కుల ఎలిసెట్టి జెల్లబాబు ఇంటికి కరెంట్ పని చేయడానికి వెళ్ళాడు. అక్కడ కరెంట్ షాక్ తగలడం వల్ల అతను చనిపోయాడు. చనిపోయిన వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సురేష్ బాబు మరణం తరువాత, అతని వర్గానికి చెందిన ప్రజలు ఇంటి యజమాని జెల్లబాబు నుంచి పరిహారం డిమాండ్ చేశారు. మరుసటి రోజు, పరస్పర ఒప్పందంలో పరిహార మొత్తాన్ని రూ 2.70 లక్షలుగా నిర్ణయించారు. కానీ రూ 70,000 మాత్రమే ఇచ్చారు. జెల్లబాబు కాపు కులానికి చెందిన వ్యక్తి. వారిని సంఖ్యాపరంగా ఇంకా రాజకీయాల్లో ప్రభావవంతమైనవారిగా భావిస్తారు. కానీ, జెల్లబాబు స్వయంగా ధనవంతుడు కాదు.
” కేవలం రూ 70,000 పరిహారం అందడంతో విషయం వేడెక్కింది. బాధితుడి కుటుంబం, దళిత వర్గానికి చెందిన ప్రజలు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు.” అని హ్యూమన్ రైట్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ద వైర్కు తెలిపారు.
మరి దళితుల బహిష్కరణ ఎందుకు?
”దళితులు న్యాయం కోసం గట్టిగా డిమాండ్ చేయడం వల్లే వారు సామాజికంగా బహిష్కరించబడ్డారని మేము నమ్ముతున్నాము” అని శ్రీధర్ అన్నారు.
ఏప్రిల్ 18- 19 తేదీలలో కాపు కులానికి చెందిన పెద్దలు ఎస్సీ కాలనీలోని దళితులందరిపై సామాజిక బహిష్కరణను అమలు చేశారు. ఏప్రిల్ 22న హెచ్ఆర్ఎఫ్ నిజనిర్ధారణ బృందం గ్రామాన్ని సందర్శించింది. దళితులకు అవసరమైన వస్తువులను అమ్మకుండా నిరోధించడానికి దుకాణదారులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నది. అంతేకాకుండా దీంతోపాటు, రవాణా సౌకర్యం కూడా నిరాకరించబడింది.
“మేము పేపర్ ప్లేట్లు తయారు చేసే పని చేస్తాము. కానీ మా వీధి యువకుడు చనిపోయినప్పటి నుంచి, వారు మమ్మల్ని పనికి రావద్దని చెప్పారు. మేము న్యాయం అడిగామైతే వారు మమ్మల్ని ఇలా శిక్షిస్తున్నారు.” అని ఒక దళిత మహిళ ఒక వార్తా ఛానెల్తో తన ఆవేదనను వ్యక్తం చేసింది.
“మేము ఉదయం 5 గంటలకు టీ తాగడానికి కాపు హోటల్కి వెళ్ళాము. మా పెద్దలు మీకు టీ, టిఫిన్ ఇవ్వొద్దని చెప్పారని, మీరు వెళ్ళవచ్చని హోటల్ యజమాని కరాకండిగా చెప్పాడు. దీంతో చేసేది ఏం లేక అప్పుడు మేము మారుమాట్లాడకుండా వెనుతిరిగాము”. అని చంద్రరావు అనే దళిత పెద్దమనిషి తెలిపారు.
అధికారుల తీరుపై విమర్శలు
ఎటువంటి ఘర్షణలు జరగకుండా ఉండటానికి స్థానిక అధికారులు రెండు వర్గాల ప్రజలతో కూడిన ‘శాంతి కమిటీ’ని ఏర్పాటు చేశారు. కానీ చాలా మంది దీనిని విమర్శించారు, ఇది చట్టపరమైన జవాబుదారీతనం కంటే ఉపరితల రాజీని చూపుతుందని అన్నారు.
“శాంతిభద్రతలను కాపాడటం ముఖ్యం. ఇంకా ముందు జాగ్రత్తగా, శాంతి కమిటీని ఏర్పాటు చేయడం కూడా అర్థమయ్యేదే. కానీ మొదటి ప్రాధాన్యత ఏం అవ్వాల్సిందంటే, ఎవరైతే సామాజిక బహిష్కరణ చేశారో వారిపై ఎస్సీ/ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. దీని బదులుగా, నేరాన్ని కప్పిపుచ్చడానికి ఒక శాంతి కమిటీని హడావిడిగా ఏర్పాటు చేశారు” అని శ్రీధర్ చెప్పుకొచ్చారు.
బహిష్కరణ ఒక శిక్ష లాంటిదని ఆయన అన్నారు. “బాధితుడి కుటుంబం అంబేడ్కర్ విగ్రహం దగ్గర నిరసన ప్రారంభించినప్పుడు, కాపు కులానికి ఈ విషయం కలత చెందేలా చేసింది. దళితులు ఇలా బహిరంగంగా న్యాయం కోరితే అది ఒక అలవాటుగా మారుతుందని వాళ్లు భావించారు. దీంతో వారికి “గుణపాఠం నేర్పాలని” బహిష్కరించారు.”
నిజనిర్ధారణ బృందంలో భాగమైన సామాజిక కార్యకర్త తోట రాంబాబు మాట్లాడుతూ, అధికారులు “ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలనే తప్పనిసరి చట్టపరమైన ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు” అని అన్నారు. ”ఈ చట్టం ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని లేదా సమూహాన్ని ఆర్థికంగా లేదా సామాజికంగా బహిష్కరించడం లేదా బెదిరించడం వంటి కిందికి రాదా” అని ఆయన ప్రశ్నించారు.
“పరిహారం ప్రకటించడం, క్షమాభిక్ష ఏర్పాటు చేయడం, శాంతి కమిటీ ఏర్పాటులాంటివి నేరాలకు ముగింపు పలుకుతాయా? దీంతో నేరస్తుడు క్షమార్హుడు అవుతాడా? దీంతో దళితులకు జరిగిన అవమానం తుడిచిపెట్టబడుతుందా?” అని ఆయన అన్నారు. అంతేకాకుండా “నిందితులను రక్షించడానికి మాత్రమే” ఇటువంటి చర్య తీసుకున్నట్లు కనిపిస్తుందని ఆయన హెచ్చరించారు.
వివక్షతకు సుదీర్ఘ చరిత్ర..
గ్రామంలో దళితులు చాలా కాలంగా వివక్షకు గురవుతున్నట్టు ఫిర్యాదు చేస్తున్నారని శ్రీధర్ తెలిపారు.
ద వైర్తో మాట్లాడుతూ, “నేటికీ, గ్రామంలో దళితులకు జుట్టు కత్తిరించుకునే లేదా గడ్డం చేసుకునే సౌకర్యం దొరకదు.” వాళ్ళు పిఠాపురం లేదా కాకినాడ వెళ్ళాల్సి వచ్చుద్ది” అన్నారు.
ఈ గ్రామంలో దళితులతో జరుగుతున్న హింసకు సంబంధించి సుదీర్ఘ చరిత్ర ఉంది. 2022లో సామాజిక కార్యకర్త రాజమణి మల్లాంలో ఒక సంఘటన తర్వాత నిజనిర్ధారణ చేశారు. “మల్లంలో ఎస్సీ/ఎస్టీ ప్రజలను కొట్టడం, దుర్భాషలాడడం కొత్త విషయం కాదు” అని ఆయన తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ “2022 ఏప్రిల్ 14న దళితులు అంబేడ్కర్ జయంతి జరుపుకున్నప్పుడు, వారిని తిట్టారు. ఆ వేడుక ఫొటోను ఒక దళిత యువకుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు, కాపు యువకుడైన కారెడ్ల తరుణ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. పెద్దల జోక్యంతో తరుణ్ ఏప్రిల్ 18న అంబేడ్కర్ విగ్రహానికి “పాలాభిషేకం” చేశాడు. దీంతో అసంతృప్తి వ్యాపించింది.”
కొన్ని వారాల తరువాత ఏప్రిల్ 29న, గ్రామంలోని ఓనుములమ్మ జాతర సందర్భంగా హింస చెలరేగింది. “ఐదుగురు ఎస్సీ యువకులు జాతర చూడటానికి వెళ్ళారు. అక్కడికి చేరుకోగానే, కాపు యువకులు, “మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?” అని అరిచారు. అంతేకాకుండా ఎస్సీ యువకుడు దాట్ల అర్జున్ను రక్తం వచ్చే వరకు కొట్టారు.” అని రాజమణి అనే మహిళ చెప్పారు.
అదే రాత్రి కాపు యువకుల గుంపు దళిత కాలనీ(మాల పేట)మీద దాడి చేసిందనే ఆరోపణ ఉంది. “వారు మహిళలను దుర్భాషలాడుతూ, వారి బ్లౌజులను చింపేశారు. కడిటి కృష్ణారావు అనే దళిత ఉపాధ్యాయుడు ప్రతిఘటించినప్పుడు, అతన్ని లాక్కుంటూ తీసుకెళ్లి దారుణంగా కొట్టారు. అతను రక్తంలో తడిసి స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా కొట్టారు” అని రాజమణి తెలిపారు.
గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారని, కానీ అప్పటి తాత్కాలిక వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు “నామమాత్రపు ఎఫ్ఐఆర్” మాత్రమే నమోదు చేశారని రాజమణి అన్నారు.
“ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది, ఇప్పుడు వారు మరో సామాజిక బహిష్కరణ విధించారు. వారు ఎంతకాలం ఇలాంటి ప్రతీకార జాతి హింసకు పాల్పడుతూ ఉంటారు?” కాపు నాయకుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నుంచి జవాబుదారీతనం కోరుతూ రాజమణి ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ కోరాడ
అనువాదం: క్రిష్ణా నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.