
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ “పిఠాపురంలో కులాల మధ్య ఐక్యత మొదలైంది” అని అన్నారు. సంవత్సరం గడిచిందో లేదో “పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా”లో దళితులు గ్రామ బహిష్కరణకు గురైయ్యారు. గ్రామ బహిష్కరణకు గురైన విషయం రాష్ట్రమంత ఎలగడిలా వ్యాపించింది. అయినా కానీ పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద స్పందించలేదు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మల్లాంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. సాంఘిక బహిష్కరణకు గురైన విషయం బహిష్కరణకు గురైన మాల సామాజిక వర్గానికి కూడా తెలియదు. తీరా ఆ మరుసటి రోజు ఉదయం ఆ విషయం తెలిసింది. తెలిసినవెంటనే ఒక్కొక్కరు సందిగ్ధంలో పడిపోయారు. అసలు కారణం చెప్పకుండా ఎందుకు వెలివేశారు? అని అనుకున్నారు. ఎప్పుడైతే బహిష్కరణ విషయం మెల్లమెల్లగా గ్రామంలో అందిరికి తెలిసిందో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులను అదుపులోకి తేవడం కోసం అధికారులు రంగంలోకి దిగారు. ఇరువర్గాలతో శాంతికమిటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పరిస్థితి అదుపులోనే ఉందని కలెక్టర్ చెప్పారు. తన సొంత నియోజకవర్గంలో ఇంత జరిగిన ఈ విషయం మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడలేదు. మరోవైపు షాక్ తగిలి చనిపోయిన వ్యక్తి బాధిత కుటుంబాన్ని వైసీపీ నేత వంగా గీత పరమర్శించారు.
అయితే, మల్లాంలో బహిష్కరణ ఉన్నపళంగా జరగలేదని దీని వెనుక వరుస పరిణామాలు జరిగాయని, వెలివేసిన పెత్తందార్ల, వెలివేతకు గురైన బాధితుల మాటలను గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది.
అసలు ఏం జరిగింది?
మల్లం గ్రామంలోని ఒక ఇంటిలో ఎలక్ట్రికల్ పని చేయడానికి పల్లపు సురేష్బాబు అనే వ్యక్తి వెళ్లాడు. అనుకోకుండా కరెంట్ షాక్కు గురై చనిపోయాడు. దీంతో దళిత సంఘాలు నిరసన తెలిపాయి. ఎలక్ట్రికల్ పని చేయించుకున్న ఇంటి యజమాని జల్లిబాబు రూ.10లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి. దీంతో పాటు అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించాయి. పోలీసులకు సమాచారం అందడంతో పిఠాపురం సీఐ గ్రామానికి చేరుకున్నారు. సీఐ సమక్షంలో జరిగిన చర్చల్లో రూ.2.75 లక్షలు పరిహారం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ సంఘటన తర్వాత అగ్రవర్ణాలు గ్రామంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించుకున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ దళితులను పనుల్లోకి రానివ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం ఉదయం గ్రామంలో చికెన్ షాపులు, హోటళ్లకు వెళ్లిన దళితులకు మాంసం, టిఫిన్లు విక్రయించ లేదు. అంతేకాకుండా పొలాలు, ఇతర పనులను దళితులకు అప్ప గించలేదు. దీంతో దళితులు నిరాశ, నిస్పృకు గురైయ్యాయి. అంతేకాకుండా “ఈ చర్య మా మనోభావాలను దెబ్బతీసింది” అని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలోని మల్లం గ్రామంలో సాంఘిక బహిష్కరణకు గురైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేసరికి ఇది కాస్తా ఆంధ్రా, తెలంగాణలో ఎలగడిలా వ్యాపించింది.
ఒప్పందం- శాంతి చర్చలు
ఈ నేపథ్యంలో మల్లాంలో కాకినాడ ఆర్డీవో మల్లిబాబు, వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు, పిఠాపురం సీఐ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ జానీబాషా పర్యటించారు. పరిస్థితిని సమీక్షించారు. తమను సాంఘిక బహిష్కరణకు గురి చేయడం, తర్వా త జరిగిన సంఘటనలు గురించి దళితులు వారికి వివరించారు. దళితులను సాంఘిక బహిష్కరణకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అంబేడ్కర్ యువజన సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు.
అయితే మల్లాంలో పరిస్థితులపై జిల్లా కలెక్టర్ సగిలి షాన్మోహన్ సమీక్షించారు. కలెక్టర్ ఆదేశాలతో పిఠాపురం తహశీల్దార్ కార్యాలయంలో కాకినాడ ఆర్డీవో మల్లిబాబు ఇరువర్గాల ప్రతినిధులతో శాంతికమిటీ ఏర్పాటు చేసి చర్చించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. దళితులు, దళితేతరులు సామరస్యంగా మెలగాలని సూచించారు. సాంఘిక బహిష్కరణ వంటి అంశాలు జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చర్చల్లో సీఐ, తహశీల్దారు గోపాలకృష్ణ, పెద్దాపురం ఏఎస్డ్ల్యూవో వాణి పాల్గొన్నారు. కాగా మల్లాంలో పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని కలెక్టర్ ప్రకటించారు. అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా అన్నిచర్యలు తీసుకున్నామని చెప్పారు.
సాంఘిక బహిష్కరణ అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించామని కలెక్టర్ సగిలి షాన్మోహన్ తెలిపారు. ఈ సమస్యకు సంబంధించిన పూర్వపరాలను పరిశీలించి సాంకేతికంగా పరిష్కరించే నిమిత్తం కాకినాడ ఆర్డీవో, పిఠాపురం తహశీల్దార్, సీఐ, ఏఎస్డబ్ల్యూవో ఆధ్వర్యంలో ఇరువర్గాలతో శాంతి కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. దళిత సామాజిక వర్గంపై విధించిన సాంఘిక బహిష్కరణను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇరువర్గాల్లో ఎవరైనా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం, ప్రకటనలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానించారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏమైనా వివాదాలు జరిగితే కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలని స భ్యులు అంగీకారానికి వచ్చారని కలెక్టర్ చెప్పారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.