
ప్రతి కాలంలో ఏవో కొన్ని చెడు రోజులు వచ్చిపోయినట్టుగా పంతొమ్మిది వందల నలభై ఏడు గొడవలు వచ్చాయి, పోయాయి. అలాని కరీందాద్ ఇదంతా ఏదో దేవుడు ఆడిన వింత నాటకమనుకుని ఊరికే కూర్చోలేదు. అతను ఈ తుఫానుని మగాడిలా ఎదురుకున్నాడు. శత్రు మూకలతో అనేక సార్లు తలపడ్డాడు. ఓడించడానికి కాదు, కేవలం ఎదుర్కొవడానికి. శత్రువుల బలం చాలా ఎక్కువని అతనికి తెలుసు. అలాని ఆయుధాలని చేతిలోకి తీసుకోకపోవడం అతనికే కాదు, ఏ మగాడికైనా అవమానకరం అని అతని నమ్మకం. నిజం చెప్పాలంటే ఇది వెర్రెత్తిన మూకలతో అతను ధైర్యంగా తలపడ్డాన్ని చూసిన వేరే వాళ్ళ ఉద్దేశ్యం మాత్రమే. కరీందాద్నే ఈ విషయం గురించి అదే శత్రుమూకలపై ఆయుధాలు ఎత్తకుండా పక్కకు పడేయడం అతని దృష్టిలో మగాడికి అవమానమాని అడిగితే అక్కడికేదో మీరు అతన్ని జటిలమైన లెక్క అడిగినట్టు అతను ఆలోచనలో పడిపోతాడు. అతనికి కూడడం, తీసివేయడం, గుణించడం, భాగించడం లాంటివేవీ తెలియవు. పంతొమ్మిది వందల నలభై ఏడు గొడవలు వచ్చాయి, పోయాయి. ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎంత ఆస్తి నష్టమయ్యిందని జనాలు కూర్చుని లెక్కలు వేసుకోవడం మొదలు పెట్టారు. కానీ కరీందాద్ దీని గురించి అసలు పట్టించుకోలేదు. అతనికి తెల్సిన ఒక విషయమేమిటంటే తన తండ్రి రహీందాద్ ఈ యుద్ధానికి పనికొచ్చాడు. అతని శవాన్ని కరీందాద్ తన భుజాల మీద ఎత్తుకున్నాడు. ఒక బావి దగ్గర తవ్విన గుంతలో తన చేతులతో పూడ్చిపెట్టాడు.
ఊరిలో ఇంకా ఎన్నో ఘటనలు జరిగాయి. లెక్కలేనంత మంది యువకులు, ముసలివాళ్ళు మరణించారు. ఎందరో అమ్మాయిలు అదృశ్యమయ్యారు. కొందరు దారుణాతి దారుణంగా తమ శీలాన్ని పోగొట్టుకున్నారు. గాయాల పాలైనవారు తమ దురదృష్టానికి, శత్రు మూకలు నిర్దయతకి ఏడ్చారు. కానీ కరీందాద్ కళ్ళల్లోంచి ఒక్క నీటి బొట్టు కూడా రాలలేదు. తన తండ్రి రహీందాద్ వీరత్వంపై అతనికి గర్వంగా ఉండేది. కత్తులు, కర్రలతో దాడి చేస్తున్న పాతిక ముప్ఫై మందిని ఎదురుకుంటూ అతను చివరికి శక్తి మిగలక పడిపోయాడు. అతని మరణ వార్త కరీందాద్కి తెలియగానే, తండ్రి ఆత్మతో ఇలా అన్నాడు “ఏంటి యార్! ఇదేం బాలేదు. ఎప్పుడూ ఆయుధం దగ్గర పెట్టుకోమని చెప్పాను కదా నీకు!”
అతను రహీందాద్ శవాన్ని భుజాలపై మోసుకుంటూ వెళ్ళి, బావి దగ్గర గుంత తవ్వి అక్కడే పూడ్చిపెట్టాడు. అక్కడే నిలబడి ఫాతిహా కింద ఈ ముక్కలు అన్నాడంతే “పాపపుణ్యాల లెక్క ఖుదా చూసుకుంటాడు. నీకు స్వర్గం ప్రాప్తించాలని కోరుకుంటున్నాను.”
రహీందాద్ అతనికి తండ్రే కాదు, మంచి దోస్తు కూడా. దొమ్మీలలో అతన్ని చాలా నిర్దయగా చంపారు. ఆ దారుణమైన హత్య ప్రస్తావన వచ్చినప్పుడల్లా హంతుకులని అందరూ బాగా తిట్టుకునేవారు, కానీ కరీందాద్ మౌనంగా ఉండిపోయేవాడు. చేతికొచ్చిన పంటంతా నాశనమైపోయింది. రెండు ఇళ్ళు మంటల్లో మాడి మసైపోయాయి. కానీ అతనెప్పుడూ తన నష్టాల లెక్కలు చూసుకోలేదు. అప్పుడప్పుడూ మాత్రం అనేవాడు, జరిగినదంతా మన తప్పు వల్లే జరిగిందని. ఏం తప్పు జరిగిందని ఎవరైనా అడిగితే మాత్రం మళ్ళీ గమ్మునైపోయేవాడు.
ఊరి జనం ఇంకా శోకంలో ఉండగానే కరీందాద్ పెళ్ళి చేసేసుకున్నాడు. అతను ఎప్పటినుంచో కన్నేసి ఉంచిన తన ప్రేయసి జీనానే చేసుకున్నాడు. జీనా కూడా శోకంలో ఉంది. యుక్త వయసులో ఉన్న ఆమె అన్నని చంపేశారు. తల్లిదండ్రుల మరణం తర్వాత ఆమెకి ఆ అన్నే అండాదండా. జీనాకి కరీందాద్ అంటే వల్లమాలిన ప్రేమ ఉందనడంలో ఎలాంటి సంశయమూ లేదు. కానీ అన్న మరణం ఆమె ప్రేమపై నల్లని ముసుగు వేసింది. ఎప్పుడూ నవ్వే ఆమె కళ్ళల్లో ఇప్పుడు నీళ్ళు మాత్రమే ఉన్నాయి. కరీందాద్కు ఏడ్వడటమంటే మహా చిరాకు. జీనాని ఏడుస్తుండగా ఎప్పుడు చూసినా అతను చాలా నొచ్చుకునేవాడు. అయినా ఆడవాళ్ళంతే అనుకుని ఎందుకనవసరంగా ఆమెని ఇంకా బాధపెట్టడమని పైకి ఈ ప్రస్తావన తెచ్చేవాడు కాదు. కానీ ఒక రోజు అతను ఊరుకోలేకపోయాడు. పొలంలో అతను జీనాను పట్టుకుని “శవాలని కాల్చి, పాతిపెట్టి ఏడాది పూర్తయ్యింది. ఇప్పుడు వాళ్ళకి కూడా ఈ సంతాపమంటే భయం వేస్తుండొచ్చు.. వదిలేయ్, నా జాన్.. జీవితంలో ఇంకెన్ని చావులు చూడాలో, వాటికోసం కొన్ని కన్నీళ్ళని మిగలనీ… ” అన్నాడు.
ఆ మాటలు జీనాకి నచ్చలేదు. కానీ ఆమెకి అతనంటే ప్రేమ. అందుకనే ఒంటిరిగా ఈ మాటల గురించి ఆలోచించి, ఆలోచించి వాటికో అర్థం ఏర్పర్చుకుంది. చివరకు ఆమెకి కరీందాద్ అన్న మాటలు సరైనవేనని అనిపించాయి.
పెళ్ళి మాట ఎత్తేసరికి పెద్దలు, ముసలివాళ్ళు అభ్యంతరం చెప్పారు. కానీ అభ్యంతరం చాలా తేలిగ్గా వీగిపోయింది. వాళ్ళు సంతాపం పాటిస్తూ పాటిస్తూ ఎంత నీరసపడిపోయారంటే నూరుశాతం అడ్డుకోగలిగే ఇలాంటి విషయాలలో కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయారు. అలా కరీందాద్ పెళ్ళి అయ్యింది. భాజా భజంత్రీలు వచ్చాయి. ప్రతి ఆచారం పాటించారు. కరీందాద్ తన ప్రేయసిని పెళ్ళికూతురిగా ఇంటికి తీసుకొచ్చాడు.
అల్లర్ల తర్వాత దాదాపు ఏడాది వరకూ ఊరు మొత్తం వల్లకాటిగా మారింది. కరీందాద్ బారాత్ చేసిన ధూమ్-ధామ్కి ఊరిలో చాలా మంది నిశ్చేష్టులయ్యారు. వాళ్ళకి ఇది కరీందాద్ బారాత్ కాదు, ఏదో భూత ప్రేతానిది అన్నట్టు అనిపించింది. కరీందాద్ దోస్తులు ఈ సంగతి అతనికి చెప్పగానే పగలబడి నవ్వాడు. ఒక రోజు తన కొత్త పెళ్ళికూతురితో ఈ మాటంటే ఆమె ఉలిక్కిపడి గాభరాపడిపోయింది.
కరీందాద్ ఆమె సన్నని చేతులు తన చేతిలోకి తీసుకుని“ఈ భూతం ఇక జీవితాంతం నీతో ఉంటుంది, రహ్మాన్ సాయీ మంత్రం వేసినా దిగదు” అన్నాడు.
జీనా గోరింటాకున్న తన చేతులని నోటికి అడ్డంగా పెట్టుకుని, కొంచెం సిగ్గుపడుతూ “కీమే.. నీకు ఎవరన్నా భయం వేయదేంటి?” అంది. కరీందాద్ తన సన్నని నల్లని మీసాల మీద నాలుక కొస తిప్పి నవ్వుతూ “భయం ఏమైనా వేయాల్సిన పదార్థమా ఏంటి?”
********
జీనా తల్లి కాబోతుంది, ఆమె శోకం ఇప్పుడు చాలా వరకూ దూరమయ్యింది. కరీందాద్ ఆమెలో నిగారింపు చూసి, మురిసిపోతూ “ఖుదా కీ కసం, జీనా.. నువ్వు ఇంతక ముందెప్పుడూ ఇంత అందంగా లేవు. నువ్వు ఇంత అందంగా పుట్టబోయే బిడ్డకోసం తయారయ్యుంటే, నేను వాడితో గొడవ పడతాను”అని జీనాతో అన్నాడు.
ఇది విని జీనా సిగ్గుపడుతూ, తన మట్టికుండలాంటి కడుపుని దుప్పటికి ఆన్చింది. కరీందాద్ నవ్వుతూ “ఎందుకు దాస్తావు ఈ దొంగని.. నీ సింగారమంతా ఈ పంది నా కొడుకు కోసమేనని నాకు తెలీదా!” అంటూ ఆమెని ఇంకా ఆటపట్టించాడు.
“ఎందుకు నిన్ను నువ్వే తిట్టుకుంటావు?” అంటూ జీనా ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది.
కరీందాద్ నల్లని సన్నని మీసాలు మెల్లిగా ఊగాయి. “కరీందాద్ పెద్ద పంది.”
చిన్న ఈద్ వచ్చింది. పెద్ద ఈద్ వచ్చింది. కరీందాద్ రెండు పండుగలు అట్టహాసంగా జరిపించాడు. పెద్ద ఈద్కు పన్నెండు రోజుల ముందే అల్లరిమూకలు వచ్చి దాడి చేస్తే, ఆ దాడిలో అతని నాన్న రహీందాద్, జీనా అన్న ఫజల్ హత్యకు గురైయ్యారు. జీనా ఆ రోజులని, ఆ చావులని తల్చుకుని బాగా ఏడ్చింది. కానీ గాయాలని గుర్తుపెట్టుకోని అలవాటున్న కరీందాద్ సమక్షంలో తన బాధ బయటకు కనిపించేలా ఆమె బాధపడలేదు.
జీనా తన జీవితంలోని ఇంత పెద్ద నష్టాన్ని అప్పుడే ఎలా మర్చిపోతుందోనని ఆమెకి ఆశ్చర్యంగా ఉండేది. తల్లిదండ్రులు ఎలా పోయారో ఆమెకి అసలు గుర్తే లేదు. ఫజల్ ఇలాహీ ఆమె కన్నా ఆరేళ్ళు పెద్ద. అతనే ఆమె తల్లి, తండ్రి, అన్న. అతను తన కోసమే పెళ్ళి చేసుకోలేదని జీనాకి తెల్సు. ఆమె శీలాన్ని కాపాడ్డానికే అతను బలయ్యాడని ఊరు మొత్తం తెల్సు. అతని మరణం ఆమె జీవితంలో అన్నింటికన్నా పెద్ద లోటు, ఖచ్చితంగా. సరిగ్గా పండుగకి పన్నెండు రోజుల ముందు తనని ముంచేసిన కాళరాత్రి. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఆ దుర్ఘటన పర్యవసనాల నుంచి ఆమె ఎంత దూరంగా వెళ్ళిపోతుందోనని ఆమెకి వింతగా ఉంటుంది.
గుర్రాలని, తాజీయాని(ఒక ఊరేగింపు) చూడాలని కోరికగా ఉందని మొహర్రం దగ్గర పడేసరికి కరీందాద్ని మొదటిసారిగా జీనా ఒక కోరిక కోరింది. తన స్నేహితురాళ్ళ ద్వారా ఆమె వాటి గురించి చాలా విని ఉంది. ఆమె కరీందాద్తో “నేను బాగైపోతే, నువ్వు తీసుకెళ్తావా గుర్రాలని చూపించడానికి?” అంది.
కరీందాద్ నవ్వుతూ “నువ్వు బాగవ్వక పోయినా తీసుకెళ్తాను. ఈ పంది నా కొడుకుని కూడా.”అని బదులిచ్చాడు.
ఆ తిట్టు జీనాకు చాలా బాధపెట్టింది. ఆమె నొచ్చుకునేది. కానీ కరీందాద్ ముచ్చట్లు ఎంత నిర్మొహమాటంగా ఉండేవంటే జీనాలోని చేదంతా చెప్పలేనంత తీయగా మారిపోయేది. పందికొడుకులో ఎంత ప్రేమ నిండి ఉందోనని అనుకునేది.
********
హిందుస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని కొంతకాలంగా పుకార్లు షికార్లు చేశాయి. అసలు పాకిస్తాన్ వేరు అవ్వడంతోనే యుద్ధం కూడా ఖరారైంది. తప్పనిసరైపోయింది. ఎప్పుడు జరుగుతుందో మాత్రం ఊరిలో ఎవరికీ తెలీదు. కరీందాద్ని ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే, అతను ముక్తసరిగా “ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. ఊరికే ఎందుకు దాని గురించి ఆలోచించడం?” అని అనేవాడు.
జీనా ఈ యుద్ధం గురించి విన్నప్పుడల్లా ఆమెకి బుర్ర పనిచేయడం మానేసేది. ఆమె ఎప్పుడూ శాంతిని కోరుకునే మనిషి. మామూలుగా వచ్చే “నువ్వంటే నువ్వు, నేనంటే నేను” గొడవలంటేనే ఆమెకి భయం. అదీ కాక, జరిగిన అల్లర్లలో ఆమె ఎన్ని రక్తపు కథలు కళ్ళారా చూసిందో, తన అన్ననే పోగొట్టుకుంది. చాలా భయపడుతూ కరీందాద్తో “కీమే.. ఏమవుతుందంటావ్?”అని అడిగింది.
కరీందాద్ నవ్వేవాడు. “నాకేం తెల్సు. అబ్బాయో, అమ్మాయో.”
ఇది విని జీనా విస్తుపోయింది, కానీ కరీందాద్ మాటల్లో పడి రాబోయే యుద్ధం గురించి మొత్తం మర్చిపోయింది. కరీందాద్ బలవంతుడు. ధైర్యవంతుడు. జీనా అంటే హద్దుల్లేని ప్రేమ అతనికి. పిస్తోలు కొన్నాక కొద్ది రోజులకే అతను గురిపెట్టడంలో నిష్ణాతుడయ్యాడు. ఇవ్వన్నీ జీనాకి ధైర్యం ఇచ్చేవి. అయినా భయంతో వణుకుతున్న తన స్నేహితురాళ్ళ నుంచి యుద్ధం గురించి మగవాళ్ళు లేపిన పుకార్లు వింటే, ఆమెకి చేష్టలుడిగిపోయేవి.
భుక్తోదాయి అనే ఆమె రోజూ జీనాని చూడ్డానికి వచ్చేది. ఒక రోజు ఆమె హిందుస్తానీయులు నదిని ఆపేస్తున్నారన్న కబురు పట్టుకొచ్చింది. జీనాకి అర్థం కాలేదు. భుక్తోదాయిని వివరాలు అడిగింది: “నదిని ఆపుతున్నారా? ఏ నదిని ఆపుతున్నారు?”
“మన పొలాలకి నీళ్ళు వచ్చే నదిని”అని భుక్తోదాయి బదులిచ్చింది.
జీనా కొద్దిసేపు ఆలోచించి “చిన్నమ్మా.. నువ్వు కూడా ఎలాంటి పిచ్చిమాటలు మోసుకొస్తున్నావు? నదిని ఎవరైనా ఆపగలరా? అదేమైనా కాలువానా మూసేయడానికి?” అని బదులిచ్చింది.
భుక్తో జీనా కడుపు మీద మెల్లమెల్లగా నిమురుతూ “బీబీ.. నాకు తెలీదు. నేను విన్నది చెప్పానంతే. ఈ కబురు ఇప్పుడు వార్తాపత్రికల్లో కూడా వచ్చింది” అంది.
“ఏ కబురు?” జీనా నమ్మలేక అడిగింది.
భుక్తో జీనా పొట్టని ముడతలు పడ్డ తన చేతులతో పైకీ కిందకీ ఊపుతూ, “అదే.. నదిని ఆపే సంగతి..” అని చెప్పి, జీనా కడుపు మీద ఆమె వేసుకున్న కమీజు మెల్లిగా కప్పి, అప్యాయంగా “అల్లా దయుంటే బిడ్డ ఇవ్వాల్టికి పదిరోజులకి పుట్టాల్సిందే” అంది. కరీందాద్ ఇంటికి రాగానే జీనా మొదటగా నది సంగతే అడిగింది. అతను ముందు మాటమార్చడానికి ప్రయత్నించాడు. కానీ జీనా పదేపదే అడిగేసరికి “అలాంటిదేదో విన్నాను” అని కరీందాద్ సమాధానం ఇచ్చాడు.
“ఏంటి?” అని జీనా అడిగింది.
“అదే.. హిందుస్తానీయులు మన నది ఆపేస్తున్నారని..”
“ఎందుకు?”
“మన పంటలు నాశనమైపోవాలని” కరీందాద్ జవాబిచ్చాడు.
ఇది విని జీనాకు నదిని ఆపొచ్చునన్న నమ్మకం కలిగింది. విపరీతమైన నిస్సహాయతలో “ఎంతటి క్రూరులు వాళ్ళు!” ఇంతే అనగలిగింది.
కరీందాద్ కాసేపు అయ్యాక నవ్వుతూ “అది వదిలేయ్! భుక్తోదాయి చిన్నమ్మ వచ్చిందా?”
“ఆ.. వచ్చింది”అని జీనా మనసెక్కడో పెట్టి చెప్పింది.
“ఏం అంది?”
“ఇంకో పది రోజుల్లో బిడ్డ పుట్టేస్తాడని చెప్పింది.”
“జిందాబాద్..!” అని కరీందాద్ గట్టిగా అరిచాడు.
జీనాకి నచ్చలేదు. గొణుక్కుంది. “నీకెలా సంతోషమనిపిస్తుంది? ఎలాంటి కర్బాలా వస్తుందో!”
********
కరీందాద్ పంచాయితికి వెళ్ళాడు. అక్కడ దాదాపుగా అందరు మగవాళ్ళు పోగయ్యారు. చౌదరి నత్తూని చుట్టుముట్టి అతన్ని నదిని ఆపడం గురించి అడిగారు. ఇంకెవరో పండిత్ నెహ్రూని నోటికొచ్చినట్టు తిట్టారు. ఇంకొందరు మౌనంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. నదిని మళ్ళించడం సాధ్యమని ఎవరూ నమ్మలేకపోయారు. ఏం జరిగినా అది తమ పాపాల ఫలితమని కొందరి నమ్మకం. అందుకని ఈ విపత్తుని దాటడానికి మసీదుకెళ్ళి అందరూ కలిసి ప్రార్థించడం మేలని వారి సూచన. కరీందాద్ ఒక మూల కూర్చొని మౌనంగా విన్నాడు. హిందుస్తాన్ వాళ్ళని తిట్టడంలో నత్తూ చౌదరి అందరికన్నా ముందున్నాడు. తీవ్రమైన నొప్పి ఉన్నవాడిలా కరీందాద్ కూర్చున్న చోట ఊరికే కదులుతూ ఉన్నాడు. “నదిని దారి మళ్ళించడం చాలా నీచమైన ఆయుధం, దారుణమైన పని, చెప్పలేనంత భయంకర నేరం, చేయలేనంత పాపం, దిగజారుడుతనం, యజీదు చేసిన పనిలాంటిది” అని అందరూ ఒక్క మాటగా అంటున్నారు. కరీందాద్ రెండు మూడు సార్లు దగ్గాడు, ఏదో చెప్పడానికి తయారవుతున్నవాడిలా. చౌదరి నత్తూ నోటి నుంచి మళ్ళీ బండబూతుల వెల్లువ మొదలయ్యేసరికి కరీందాద్ “ఎవర్నీ తిట్టకు చౌదరీ!” అని అరిచాడు.
తల్లిని గురించిన బూతు ఏదో చౌదరి నాలుక మీద అంటుకుపోయి బయటకు రాలేదు. అతను వెనక్కి తిరిగి విచిత్రంగా కరీందాద్తో “ఎవర్నీ అనొద్దా? ఏం, ఏమవుతారు వాళ్ళు నీకు?” అన్నాడు.
“నాకేమవుతారా? నా దుష్మన్లు అవుతారు” అని కరీందాద్ ఓపిగ్గా అన్నాడు.
అడ్డుపడిన చౌదరి గొంతు ఒక్కసారిగా ఊపందుకుంది. ఎంత ఊపందుకుందంటే మీసాల జుట్టు చెదిరిపోయింది. “విన్నారా మీరంతా! దుష్మన్లు వాళ్ళు. అందుకని వాళ్ళకి ప్రేమనందివ్వాలి, అవునా, హుజూర్?!”
“కాదు చౌదరి. నా ఉద్దేశ్యం వాళ్ళని ప్రేమించమని కాదు. నేను వాళ్ళని తిట్టొద్దని మాత్రమే అంటున్నాను” అని కరీందాద్ చాలా నిమ్మళంగా జవాబిచ్చాడు.
కరీందాద్తో పాటు అతని చెడ్డీ దోస్తు మీరా భక్ష్ కూర్చున్నాడు. “ఎందుకు?” అని అతను అడిగాడు.
కరీందాద్ మీరా భక్ష్ వైపుకి తిరిగాడు. “ఏం లాభం చెప్పు, యార్.. వాళ్ళు నీళ్ళు ఆపి నీ భూములని బంజర భూములు చేయాలని అనుకుంటున్నారు. నువ్వేమో వాళ్ళని తిట్టి హిసాబ్ బరాబర్ చేద్దామనుకుంటున్నావు. ఇదెక్కడి తెలివి? తిట్లెప్పుడు అందుకోవాలంటే ఇంకేం జవాబు ఇవ్వలేనప్పుడు.”
“నీ దగ్గర సమాధానం ఉందా?” మీరా భక్ష్ అడిగాడు.
కరీందాద్ కాసేపటి తర్వాత “ప్రశ్న నాది కాదు. వేలాది, లక్షలాది ప్రజలది. నా ఒక్కడి జవాబు అందరి జవాబు అవ్వలేదు. ఇలాంటి సందర్భాలు ఆలోచించే పకడ్బందీ జవాబు తయారు చేసుకోవాలి.. వాళ్ళు ఒక్కరోజులో నదిని మళ్ళించలేరు. చాలా ఏళ్ళు పడుతుంది. కానీ ఇక్కడ మీరంతా తిట్లు ఎత్తుకుని ఒక నిమిషంలో మీ అక్కసునంతా వెళ్ళగక్కుతున్నారు”అని బదులిచ్చాడు.
ఆపైన మీరా భక్ష్ భుజంపై చేయి వేసి చాలా నింపాదిగా “నన్ను అడిగితే హిందుస్తానుని నీచము, దుర్మార్గము, నికృష్టము అనడం కూడా తప్పు” అన్నాడు.
మీరా భక్ష్కి బదులు చౌదరి నత్తూ “వింటున్నారా?” అని అరిచాడు.
కరీందాద్ మీరా భక్ష్ వైపే చూస్తూ, “శత్రువుల నుంచి జాలి, దయ ఆశించడం మూర్ఖత్వం. యుద్ధం మొదలయ్యాక, శత్రువు పెద్ద పెద్ద రైఫిళ్ళు పట్టుకొచ్చారని ఏడ్వడం దేనికి? మనం చిన్న బాంబులు విసిరితే వాళ్ళు పెద్ద బాంబులు విసురుతారు. కావాలంటే నీ ఆత్మనే అడుగు ఈ నింద కూడా ఒక నిందేనా అని? చంపడానికి చిన్న చాకూ వాడతారు, పెద్ద చాకూ వాడతారు. నేను అబద్ధం చెప్తున్నానా?”
మీరా భక్ష్ బదులు చౌదరి నత్తూ ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ వెంటనే మళ్ళీ ఊగిసలాడాడు. “కానీ ప్రశ్న ఏటంటే వాళ్ళు నీళ్ళు ఆపేస్తున్నారు.. మనల్ని ఆకలితో, దాహంతో చంపుతారు.”
కరీందాద్ మీరా భక్ష్ భుజం మీద నుంచి చేయి తీసి చౌదరి నత్తూ వైపుకి తిరిగాడు. “చౌదరి వాళ్ళని శత్రువులని తీర్మానించుకున్నాక వాళ్ళ మీద ఆకలి, దాహంతో చంపుతారన్న ఆరోపణలు ఎందుకు? వాళ్ళు ఆకలితో, దాహంతో చంపకుండా, నీ పచ్చని పంటపొలాలని బంజరు భూములుగా మార్చకుండా నీకోసం పులావు డేక్షాలు, షర్భతుల కుండలు పంపుతారా? నీ వేటకోసం, విలాసం కోసం ఇక్కడ తోటలు పెంచుతారా?”
చౌదరి నత్తూ చిత్తైపోయాడు. “ఏం వాగుతున్నావ్ నువ్వు?”
మీరా భక్ష్ కూడా మెల్లిగా కరీందాద్ని “అవును యార్, ఏం వాగుతున్నావ్ నువ్వు?” అడిగాడు.
“వాగుడు కాదు, మీరాన్ భక్ష్” కరీందాద్ వివరించడానికనట్టు అతని వైపు తిరిగాడు. “నువ్వే ఆలోచించు. పొట్లాటకు దిగిన ఇద్దరూ ఒకరినొకరు కిందకు లాగాలనే చూస్తారు. పహల్వాన్ లంగోటి ఎత్తి కట్టి, మైదానంలోకి దిగాకా అతనికి ఏ యెత్తైనా వేసే హక్కు ఉంది.”
మీరాభక్ష్ వాల్చిన తలని ఆడిస్తూ “అవును.. నిజమే!”అని అన్నాడు.
“అప్పుడు నదిని ఆపడం కూడా సబబే! మనకది నేరమవ్వచ్చు కానీ అది వాళ్ళ హక్కు” అని కరీందాద్ అన్నాడు.
“హక్కేంటి హక్కు? నీ నాలుక నీళ్ళు లేక ఎండిపోయి నేలని నాకేటప్పుడు అడుగుతాను నిన్ను, ఇది నేరామా, హక్కా అని? నీ పెళ్ళాం బిడ్డలు అన్నపు గింజ లేక విలవిలాడేటప్పుడు చెప్పు ఇది నేరం కాదు, హక్కని.”
కరీందాద్ ఆరిన తన పెదాలను తడుపుకుంటూ మళ్ళీ అన్నాడు: “అప్పుడు కూడా ఇదే అంటాను, చౌదరి.. నువ్వెందుకు వాళ్ళు మాత్రమే మన దుష్మన్లని మర్చిపోతావు? ఏం, మనం వాళ్ళ దుష్మనులం కామా? మన అదుపులో ఉండుంటే ఈ పాటికి నీటిని మనం ఆపేవాళ్ళం కాదా? కానీ ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి, చేయాలనుకుంటున్నారు కాబట్టి, దానికి విరుగుడేంటో మనం ఆలోచిద్దాం. ఊరికే తిట్టుకుంటుంటే ఏమవుతుంది? శత్రువులు నీకోసం పాల ప్రవాహాలు పారించరు చౌదరి నత్తూ.. వాళ్ళకి చేతనైతే మనకి వచ్చే ప్రతి నీటి బొట్టులో విషం కలుపుతారు. నువ్వు దాన్ని అన్యాయం అంటావ్, అమానవీయం అంటావ్, ఎందుకంటే అలా చంపటం నీకు నచ్చదు.. పెళ్ళి సంబంధం కుదుర్చుకునే ముందు పెట్టుకునే షరతుల్లా శత్రువులతో పెట్టుకునే వీలుంటుందా? నువ్వు మమ్మల్ని ఆకలితో చంపొద్దు, దాహంతో చంపొద్దు, కావాలంటే తుపాకితో చంపు.. వీలైనంత పెద్ద తుపాకితో, నీ మనసుకి నచ్చినంతగా చంపు అని అనడానికి? ఇదే అర్థంలేని వాగుడంటే.. కాస్త చల్లని మనసుతో ఆలోచించు.”
చౌదరి నత్తూ ఊగిసలాటలో ఆఖరి మెట్టుకు చేరుకున్నాడు. “నా మనసు మీద ఐసు పెట్టైతే..”
“ఇది కూడా నేనే తేవాలా?” అంటూ కరీందాద్ నవ్వేశాడు. మీరా భక్ష్ భుజంపై కొట్టి, అక్కడి నుంచి లేచి, పంచాయితి నుంచి వెళ్ళిపోయాడు.
ఇంటి వాకిలిలోకి ప్రవేశిస్తుండగానే భుక్తా దాయి ఎదురొచ్చింది. కరీందాద్ని చూసి నవ్వింది.
“ముబారక్ హో, కరీం. చంద్రుడులాంటి కొడుకు పుట్టాడు. ఏదైనా మంచి పేరు వెతికిపెట్టుకున్నావా లేదా?”
“పేరా?” కరీందాద్ ఒక క్షణం ఆలోచించాడు. “యజీద్… యజీద్!”
భుక్తా దాయి నోరు వెళ్ళబెట్టుకుని ఉండిపోయింది. కరీందాద్ నినాదాలు చేసుకుంటూ లోపలికెళ్లాడు. జీనా మంచం మీద పడుకునుంది. ముందరి కన్నా పాలిపోయి ఉంది. ఆమె పక్కలో ఒక గులాబి మొగ్గలాంటి పసికందు బొటను వేలు చీకుతున్నాడు, చప్పుడు చేస్తూ. కరీందాద్ ఆ పిల్లవాడి వైపు ప్రేమగా, గర్వంగా చూస్తూ, బుగ్గపైన వేలుని ఆడిస్తూ అన్నాడు, “రా, నా యజీద్..”
జీనా నోటినుంచి నీరసంగా ఒక అరుపు వినిపించింది.. “యజీదా?”
కరీందాద్ క్షుణ్ణంగా పిల్లాడి ముక్కూ, నోరూ చూస్తూ అన్నాడు: “అవును. అదే వీడి పేరు.”
జీనా గొంతు ఇంకా నీరసపడిపోయింది. “నువ్వేమంటున్నావ్ కీమే.. యజీదా?”
కరీందాద్ నవ్వాడు. “ఏముందందులో, పేరే కదా?”
“కానీ, ఎవరి పేరు?” జీనా ఇంతే అనగలిగింది.
కరీందాద్ గంభీరంగా జవాబిచ్చాడు. “వీడూ ఆ యజీద్లానే అవ్వాలనేం లేదుగా.. అతను నది నీటిని ఆపాడు.. వీడు కలుపుతాడు.”
రచయిత: సాదత్ హసన్ మంటో
ఉర్దూ నుంచి అనువాదం: పూర్ణిమ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.