
నక్సలిజాన్ని తుదముట్టించడం ద్వారా తన రాజకీయ పలుకుబడికి మరింత వన్నె చేకూర్చుకోవాలని కేంద్ర హోంశాఖామంత్రి అమిత్షా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ఆపరేషన్ కగార్” ఛత్తీస్ఘడ్ రాష్ట్రాన్ని మునుపెన్నడూ కనీవినీ ఎరుగనంత స్థాయిలో రక్తపుటేరులో ముంచెత్తుతున్నది. 2025 ఏడాది తొలి మూడు నెలల కాలం ముగిసేనాటికి భద్రతా బలగాలు 145 మంది నక్సల్ అనుమానితులను హతమార్చినట్లు దక్షిణాసియా ఉగ్రవాద పోర్టల్ వెబ్సైట్ వెల్లడించింది. ఇది 2024లో హతుల సంఖ్యలో(235) దాదాపు సగానికి సమానం. 2023లో కేవలం 23 మంది మావోయిస్టు అనుమానితుల మరణాలతో పోలిస్తే గత 15 నెలల కాలంలో మావోయిస్టు అనుమానితుల మృతుల సంఖ్య ఎంతగా పెరిగిందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. మనిషి ప్రాణాలకు వెలకట్టి నజరానాలు ప్రకటించడానికి ఈ మరణాల సంఖ్య అధికాధికం కావడానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. మృతి చెందిన ప్రతి నక్సలైట్కు కేంద్రహోంశాఖ 25 లక్షల రివార్డు ఇస్తానని ప్రకటించింది.
“ఆపరేషన్ కగార్” అంటే స్థూలార్థంలో “అంతిమ పోరాటం”గా చెప్పుకోవచ్చు. ఇది నాలుగు అంచెల వ్యూహం. ముందు పీఠీ స్థావరాలను నెలకొల్పడం. ఇంటలిజెన్స్ సమాచార సేకరణ కోసం ఉపగ్రహ ఛాయాచిత్రాలను, డ్రోన్లను వాడుకోవడం. నక్సల్ విముక్తి ప్రాంతాలుగా ప్రకటించిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకున్న 612 ప్రాంతాలలో పోలీస్ స్టేషన్లను పెట్టని కోటలుగా నెలకొల్పడం, ఉదారమైన లొంగుబాటు విధానాన్ని అమలు చెయ్యడం. ఈ పథకం ద్వారా గత పదేళ్లకాలంలో 7,500 మంది నక్సలైట్లు లొంగిపోయారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
సున్నితీకరించిన ఈ కథనాన్ని సైనిక హెలికాప్టర్లలో నిర్దేశిత ప్రాంతాలకు చేరవేసిన జర్నలిస్టులు చిలుకపలుకల్లా వల్లెవేశారు. తప్పితే ఇందులో ఇమిడి ఉన్న మానవమూల్యం గురించి ఆ జర్నలిస్టులు పల్లెత్తు మాటమాట్లడలేదు.
పెరుగుతున్న మృతదేహాల సంఖ్య..
నిషేధిత మావోయిస్టు పార్టీ సాయుధ విభాగమైన ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం- ఈ సైన్యంలో ఉన్న దళాలు ఎన్ని? ఎంతమంది సాయుధ సైనికులు ఉన్నారు. వారి దగ్గర ఉన్న ఆయుధ వివరాలు ఏంటి అనేది ఏనాడూ బయట పెట్టలేదు. గెరిల్లా యుద్ధతంత్రంలో ఈ రహస్యమే కీలకం. మావోయిస్టు పార్టీ అధికారికంగా ఈ వివరాలు ప్రకటించని నేపథ్యంలో బస్తర్లో ఎంతమంది నక్సలైట్లు ఉన్నారు? రాజ్యం రోజువారీ ప్రకటిస్తున్న నక్సల్స్ మృతుల సంఖ్యలో అసలైన నక్సల్ ఎంతమంది అని లెక్క తేల్చడం చాలా క్లిష్టమైన వ్యవహారం.
నానాటికీ పెరుగుతున్న మృతదేహాల సంఖ్య రెండింతలా ప్రయోజనాలను నెరవేరుస్తుంది. ఒకటి నక్సల్ ప్రమాద తీవ్రత తెలియచెప్పడానికి, రెండు అంతటి తీవ్ర ప్రమాదాన్ని అంతమొందించడంలో సాధిస్తున్న విజయాన్ని ఘనంగా ప్రకటించుకోవడానికి ఉపకరిస్తుంది. తీవ్రతరం చేసిన సైనిక చర్య ద్వారా మరింత హింసకు పూనుకోవడానికి తగిన సంక్షోభ పరిస్థితులను, పరిష్కారాన్ని రెండింటినీ రాజ్యమే సృష్టిస్తున్నది. కార్పొరేట్ సంస్థల ఎక్సలేటర్లు ఆదివాసుల నివాస భూములను ఇష్టారాజ్యంగా తవ్వుకోవడానికి వీలుగా “నక్సల్స్ బూచి రాజ్యానికి వాటంగా కలిసి వచ్చింది. రాజకీయ అవసరాలకు తగినట్టుగా ఈ “బూచి” తీవ్రతను కావాలంటే ఎక్కువ చేసి వద్దనుకుంటే తక్కువ చేసి చూపించడానికి రాజ్యానికి వెసులుబాటు దక్కింది.
ఆపరేషన్ కగార్లో హతమైపోయినవారి గురించి టీవీలలో ప్రైమ్ టైమ్ చర్చలు జరగవు. బాధితులు వెళ్లబోసే నిజాలు టీవీ స్క్రీన్ల మీద మనకు కనిపించవు. ఈ కాల్పులలో పసిపిల్లలు మరణిస్తున్నారు. ఆడవాల్లు సజీవంగా చిత్రహింసలకు, ఆకృత్యాలకు, బలాత్కారాలకు గురయి అంతిమంగా తుపాకి గుండ్లకు బలయిపోతున్నారు” అని గిరిజన హక్కుల కార్యకర్త సోనిసోరి సైనిక చర్య గణాంకాల మాటున మరుగున పడిపోయిన దారుణ కృత్యాల గురించి ఒక ఇంటర్వ్యూలో వివరించింది. ఎన్కౌంటర్ మృతులలో అత్యధికులు మావోయిస్టులు కాదని వారు సాదాసీదా ఆదివాసీ గ్రామీణులని కూడా ఆమె స్పష్టం చేసింది. ఈ కిరతకాలన్నీ సాక్ష్యంగా పౌరసమాజం ముందు ఉంచినా ఈ రోజుకీ ప్రభుత్వపరమైనా ఈ అరాచకాలు, ఆకృత్యాలు అడ్డూఅదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. అయినా జాతి చైతన్యం ఇంకా మొద్దు నిద్ర నుంచి మేల్కొనలేదు.
ఇదే ఏ ఢిల్లీ మహానగరంలోనో, తమిళనాడు రాష్ట్రంలోనో జరిగి ఉంటే ప్రణాళికాబద్ధంగా సాగుతున్న ఈ బలాత్కారాలు, హత్యలకు వ్యతిరేకంగా మనం వీధుల్లోకి వచ్చి గొంతెత్తి నిరసన తెలియచెప్పేవాళ్లం. సామాజిక మాధ్యమాల్లో హాష్ట్యాగ్ల నిరసన హోరెత్తిపోయేది. కానీ ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గం ఛత్తీస్ఘడ్వంటి ఒక వెనుకబడిన రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతమైన బస్తర్లో కావడం, అదీగాక అన్యాయమై పోతున్నది ఆదివాసీలు కావడం. అన్నిటికీ మించి ఇప్పుడు ఈ బాధితుల పక్షాన గొంతు విప్పితే ఎక్కడ “అర్బన్ నక్సల్స్” అన్న ముద్ర పడుతుందో అన్న విచికిత్సకు లోనయి ఎందుకు వచ్చిన తలనొప్పిలే అని సౌకర్యవంతంగా మౌనాన్ని ఆశ్రయిస్తున్నాం. మనం పట్టీపట్టనట్టుగా వ్యవహరించడం అంటే మనం కూడా నేరస్థులకు సహకరించడం వంటిదే. నగర జీవుల అసమ్మతిని అణిచివెయ్యడానికి “అర్బన్ నక్సల్స్” అన్న ముద్ర వేస్తున్న వ్యూహంలో భాగంగానే గ్రామీణ- గిరిజన ప్రాంత ప్రతిఘటనలను శివక్షార్హమైన నేరంగా పాలకవర్గాలు చిత్రీకరిస్తున్నాయి. అడవుల నుండి నగరాల వరకు విస్తరిస్తున్న ఈ “ముద్ర”ల పర్వం మూలంగా మిత్ర శక్తులు కూడా మిన్నకుండి పోవడంతో ఈ అరాచకాలు, హింసాపర్వం అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్నది.
ఆదివాసులకు ఆదివాసులకు ప్రత్యర్థులుగా నిలబెడుతున్న తీరు..
“లొంగుబాటు” విధానాన్ని కూడా ఆదివాసులను వాళ్లలో వారినే ప్రత్యర్థులుగా మార్చే ఆయుధంగా ప్రభుత్వం వాడుకుంటుంది. “జిల్లా రిజర్వ్గార్డ్”ల పటాలంలో 20శాతం మందిని ఇలా లొంగిపోయిన నక్సలైట్లతో నింపుతున్నది. వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా ఛత్తీస్ఘడ్ ప్రభుత్వం 2008లో కొత్తగా “జిల్లా రిజర్వ్గార్డ్”ల పేరిట ఒక పోలీసు పటాలాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఇదేదో అదాటున తీసుకున్న అసంకల్పిత చర్యకాదు. ఆదివాసీ సముదాయంలో ఉండే ఐక్యతను, సంఘీభావాన్ని దెబ్బతీసే ఉద్దేశ్యంతోనే ఈ పోలీసు పటాలాన్ని రూపొందించారు. భూమిని కాజేసీ, ఆ ప్రాంత ప్రజానీకాన్ని నిర్వాసితులుగా మార్చి, అవసరమైతే అక్కడి జనాన్ని తుదముట్టించి అయినా అక్కడి వనరులు తవ్వి తీసుకోవడానికి పెట్టుబడిదారీ విధానం రాజ్యయంత్రాంగం పీకపట్టుకుని మరీ తనకు అనుకూలంగా పనిచేసేలా చూసుకుంటుంది. ఈ నిర్మూలనా ప్రణాళికను పెట్టుబడిదారీ విధానం రాజ్యానికి బెత్తాయిస్తే రాజ్యం తన చేతులకు మట్టి అంటకుండా ఆ పనికి వేరే వారికి బదలాయిస్తుంది.
ఈ బదలాయింపు క్రమం చాలా సులువుగా, క్రూరంగా జరిగిపోతుంది. ఆదివాసీ జన సముదాయం మధ్య ఉండే సజీవ సంఘీభావ సంబంధాలను రాష్ట్ర పోలీసులు క్రూరంగా అణిచివేసి రాత్రికి రాత్రే వారిని ఒకరినొకరు చంపుకోవడం లాభదాయకమైన ప్రక్రియగా భావించేలా శిక్షణ ఇస్తారు.
బస్తర్ ఆదివాసీ ప్రజానికాన్ని 2005 నుండి రాష్ట్రప్రాయోజిత ప్రైవేట్ సైన్యంగా పేరొందిన “సల్వాజుడం”లో ఉండగా చేసిన ఆకృత్యాలకు ప్రతిదతండన చవిచూడాల్సి ఉంటుందన్న భయంతోనో అనేక మంది ఆదివాసులు నక్సలైట్లమని చెప్పుకుని లొంగిపోతున్నారు.
(బస్తర్ జిల్లాలోని జగదల్పూర్లో హోలీ పండుగను పురస్కరించుకుని మార్చి 13న భద్రతా బలగాలు ఫ్లాగ్మార్చ్ నిర్వహిస్తున్నప్పటి చిత్రం. నక్సలిజాన్ని అంతమొందించడానికి కేంద్రప్రభుత్వం “డెడ్లైన్” విధించిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో అర్థసైనిక బలగాల సంఖ్య, కదలికలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఫొటో క్రెడిట్: పిటిఐ)
ఇలా లొంగిపోయిన నక్సలైట్లలో కేవలం 3 శాతం మంది మాత్రమే ఛత్తీస్ఘడ్ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకాలకు అర్హులని ప్రభుత్వం నియమిత స్క్రీనింగ్ కమిటీ నిర్ధారించింది. అంటే ప్రభుత్వం ప్రకటించిన లొంగుబాట్లు మోసపూరితం, కల్పితమైనవేనా, అమాయక ఆదివాసులను దొరకబుచ్చుకుని నక్సలైట్నని చెప్పి లొంగిపోతావా లేక జైల్లో మగ్గిపోతావాని బెదిరించి ప్రకటించిన “లొంగుబాటులేనా”అని హక్కుల కార్యకర్తలు ప్రశ్నించడంలో తప్పులేదనిపిస్తుంది.
లొంగిపోయిన నక్సలైట్లు హింసావలయం నుంచి బయటపడే అవకాశాలు లేకుండా పోతున్నాయా? ఒకప్పుడు రాజ్యానికి వ్యతిరేకంగా హింసకు పాల్పడినవారు లొంగిపోయాక రాజ్యం తరఫున కిరాయి సైనికుడిగా మారిపోతున్నాడు.
ఎక్కడి సహజ ఖనిజ వనరులు తవ్వి తీసుకుని అపారమైన లాభాలు పోగేసుకోవాలని కార్పోరేట్ సంస్థలు తహతహలాడిపోతున్నాయో ఆయా ప్రాంతాలలోనే ఇంతటి అమానవీయ హింస, రక్త పాతాలు చోటు చేసుకుంటున్నాయి. జియోలాజికల్ డిపార్ట్మెంట్ సర్వేలో ఎక్కడయితే ఈ సహజ ఖనిజ వనరులు విస్తారంగా లభ్యమవుతాయని నిర్ధారణ అయ్యిందో ఆయా ప్రాంతాలలోనే ఆపరేషన్ కగార్ ఉధృతంగా సాగడం యాధృచ్ఛికం కాదు.
ఖనిజ వనరుల సంపద మీద కన్ను
మావోయిస్టుల ప్రభావం నుంచి విముక్తమైన పంచాయితీలలో “మూకుమ్మడి లొంగుబాట్ల”కు ఛత్తీస్ఘడ్ ప్రభుత్వం నజరానాలు ప్రకటించడంతో పాటు కోటి రూపాయల విలువ చేసే కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా తిరుగుబాటు అణిచివేతకు పన్నిన ప్రతివ్యూహంలో మనుషులను మార్కెట్ సరుకుగా మార్చేస్తున్న అధికారిక కథనాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న అణిచివేత వ్యూహం సహజ ఖనిజవనరులు పుష్కలంగా లభిస్తున్న ఆదివాసీ నివాసిత ప్రాంతాల నుంచి గిరిజనులను ప్రణాళికాబద్ధంగా తుడిచిపెట్టిన ఆ భూభాగాలను కార్పొరేట్లకు కట్టబెట్టాలనే లక్ష్యంతో కొనసాగుతుంది తప్ప వేరోకటి కాదు.
ఛత్తీస్ఘడ్లో ఏటా 25 నుంచి 30 వేల కోట్ల రూపాయల ఖనిజ వనరుల ఉత్పత్తి కొనసాగుతున్నది. దేశంలో ఉన్న ఇనుము, తగరపు ఖనిజ నిల్వలలో మూడవ వంతు నిల్వలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. అలాగే దేశ ఇనుము, సిమెంట్ ఉత్పత్తిలో నాల్గవవంతు ఈ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నది. దేశ బొగ్గు సంపదలో ఐదవవంతు నిక్షేపాలు ఈ రాష్ర్టంలోనే ఉన్నాయి. దేశవ్యాప్త ఖనిజ వనరుల ఆదాయంలో 15శాతం ఈ రాష్ట్రం నుండే సమకూరుతున్నది. అయినప్పటికీ మానవాభివృద్ధి సూచికలో 28 రాష్ట్రాలలో 26వ స్థానంలో అత్యంత దిగువన ఉన్నది. మూడవవంతు ఇళ్లకు తాగునీటి సౌకర్యం లేదు. దారిద్ర్యం రేటు జాతీయ సగటు స్థాయి కన్నా రెండు రెట్లు ఎక్కువగా ఉన్నది.
కార్పోరేట్ సంస్థల దోపిడికి సాక్ష్యంగా ఇక్కడి పిల్లలు పోషకాహానలేమితో కృశించిపోయిన శరీరాలతో కనబడతారు. ప్రతి ముగ్గురిలో ఒకరు పాఠశాల విద్య నుండి అర్థాంరంగా దూరమవుతున్నారు. చదువు నేర్చిన ఆదివాసీలు వ్యవస్థను అర్థం చేసుకుని ఎదిరిస్తారేమో అనే భయం కామోసు వీరిని విద్యకు దూరం చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఖనిజ సంపదని గూడ్సు బళ్లలో తోడుకుని దేశంలోని ఎక్కడెక్కడి ప్రాంతాలకో తోలుకుపోతున్నారు. 40 శాతం ఆదివాసీ ప్రజానీకం పోషకాహార లేమితో బక్కచిక్కి పోతున్నారు.
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని ఖనిజసంపద తవ్వుకున్న కార్పోరేట్ కంపెనీలకు తవ్వుకున్నంత ఆదాయాన్ని గడించి పెడుతున్నాయి. కానీ, రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నాయి. ఆర్థికవేత్తల పరిభాషలో దీనిని “వనరుల శాపం” అంటారు. ఇక్కడి ఖనిజ సంపద తోడుకుని కార్పోరేట్ కంపెనీలు తెగబలిసిపోతుంటే ఈ సంపదగల భూమి ఆసాములయిన ఆదివాసులను ఒక పథకం ప్రకారం ఆకలికి మాడ్చి, లొంగదీసుకుని భయంతో మౌనాన్ని ఆశ్రయించేలా చేస్తున్నారు.
శాంతియుత ప్రతిఘటన..
ఛత్తీస్ఘడ్లో సాగుతున్న ఈ వనరుల దోపిడికి వ్యతిరేకంగా ప్రమాదకరమైన ప్రతిఘటన ఎదురవుతున్నది. ఆ ప్రతిఘటన సాయుధ తిరుగుబాటు కాదు రాజ్యాంగ హక్కులను సాయుధంగా మలుచుకునే శాంతియుత ప్రతిఘటన. రాజ్యాంగపరంగా తమకు లభించాల్సిన హక్కుల కోసం శాంతియుతంగా, ప్రజాస్వామికంగా ఆదివాసులు చేపట్టిన ప్రజా ఉద్యమాలను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా, నిర్లజ్జగా నేరపూరితంగా చిత్రీకరించింది.
రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో పొందుపరిచిన భూభాగాల్లో నెలకొల్పిన అక్రమ స్థావరాలకు, సాగిస్తున్న చట్టవిరుద్ధ హత్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మూలవాసీ బచావో ఆందోళన్(ఎంబీఎం) సంస్థను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్నది. సిల్జర్లో జరిగిన ఊచకోతను, ముత్వెండి కాల్పులలో మరణించిన ఆరు నెలల పసిపాప మరణాన్ని, గ్రామాల మీద బాంబు దాడులను నిరసిస్తూ, ప్రభుత్వ ప్రాయోజిత ఆదివాసీలను తుడిచిపెట్టే కార్యక్రమానికి సహకరించకపోవడమే ఎంబీఎం చేసిన నేరం. “అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తూ”, భద్రతా బలగాల శిబిరాలను వ్యతిరేకిస్తున్న కారణంగా ఎంబిఎం సంస్థ మీద నిషేధం విధిస్తున్నట్లు ఛత్తీస్ఘడ్ ప్రభుత్వం 2024 సెప్టెంబరు 30న ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంబిఎం సంస్థను నిషేధిస్తూ వాడిన అధికారిక భాషలో అంతర్గతంగా రాజ్యాంగ వాగ్ధానాలకు పెట్టుబడిదారీ అత్యవసరాలకు మధ్య నెలకొని ఉండే గతితార్కిక వైరుధ్య వాస్తవ రూపం ఇమిడి ఉన్నది. ప్రభుత్వం నిర్వచించిన “అభివృద్ధి”ని ఎవరు అంగీకరించడానికి తిరస్కరించినా సహించేది లేదని ఆ ఉత్తర్వుల ప్రతిపదార్థం. గ్రామ సభల ఆమోదం లేకుండా ఆదివాసుల భూముల జోలికి రాకూడదన్న రాజ్యాంగ హక్కుల గురించి అడగడానికి ఆదివాసీ ప్రాంతాలను అంతర్గత వలసలుగా మార్చడాన్ని ప్రతిఘటించడానికి వాళ్లకి ఎంత ధైర్యమని ప్రభుత్వం హుంకరిస్తుంది.
ఆదివాసీ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న ఇరవైల ప్రాయంలో ఉన్న పొట్టం సునీత, మిడియామి రఘులను 2022 మే నెలలో నేను సిల్జర్లో కలిశాను. వాళ్ల వాక్చాతుర్యం, ఉద్యమ నిర్మాణ ప్రతిభలు ప్రభుత్వాన్ని భయపెట్టాయి. దాంతో వీరిద్దరి మీద “నక్సల్స్” అని ముద్ర వేసి రెండేళ్లుగా జైల్లో ఉంచింది.
శాంతియుత ధర్నాకు నాయకత్వం వహించిన ఈ ఇద్దరి మీద తప్పుడు అభియోగాలు మోపి అక్రమంగా అరెస్టు చేయించడం ద్వారా “తాము శాంతిని కోరుకుంటున్నాం” అని ప్రభుత్వం చేసే ప్రకటనలలో బోలుతనాన్ని, నిజాయితీలేమిని బయటపెట్టుకున్నది. ఆధిపత్యం, ఆక్రమణల భౌతిక సంబంధాలను మరుగుపరచడానికి కాకుండా రాజ్యం నిజంగానే “శాంతి” మంత్రం వల్లిస్తుందనుకుంటే ప్లకార్డులు చేతబూని నేలమీద కూర్చుని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిని నేరస్థులుగా పరిగణించి అరెస్టులు చేయించి శిక్షలకు ఎందుకు గురిచేస్తున్నట్లూ?
ఆదివాసుల గోడు వినేది ఎవరు?
రాజ్యం అనుసరిస్తున్న విధానాల స్వభావంలోని వైరుధ్యాలు ఒకటొకటిగా ఇలా బట్టబయలవుతున్నాయి. పంచాయితీల(షెడ్యూల్డు ఏరియాలకు వర్తింపజేసే) చట్టం- 1996, అటవీ హక్కుల చట్టం- 2006, ఈ రెండు చట్టాలూ ఐదవ షెడ్యూల్లోని ప్రాంతంలో చేపట్టే కార్యక్రమాలకు గ్రామసభల ఆమోదం ఉండి తీరాలని స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇవాళా రేపూ ఈ రాజ్యంగహక్కును అమలు చెయ్యమని డిమాండ్ చెయ్యడం రాజద్రోహనేరంగా పరిగణిస్తున్నారు.
ఆదివాసుల సమస్యల పరిష్కారానికి అవకాశం ఉన్న చట్టబద్ధమైన ప్రతి చోటును రాజ్యం ప్రణాళికా బద్దంగా మూతపెట్టేసి తప్పుడు ప్రత్యామ్నాయాలను చెలాయిస్తుంది. “అయితే కార్పోరేట్ సంస్థల దోపిడిని మౌనంగా అంగీకరించండి, లేదంటే మావోయిస్టులు అనే ముద్ర వేయించకుని పర్యవసానాలకు సిద్ధపడండి” అని జనాన్ని బెదిరిస్తున్నది. వందల ఏళ్లుగా ఆదివాసులను సాకుతున్న అటవీ ప్రాంతాలను “అభివృద్ధి” పేరిట కుళ్లగించి పారేస్తున్నారు. దేశ, విదేశాల భద్రతా వ్యవహారాల సీనియర్ విశ్లేషకుడు ఒకరు మాటల మధ్యన యధాలాపంగా నాతో ఇలా అన్నారు. “విజయం సాధించామని ప్రకటించుకోవడం చాలా ప్రమాదకరమైన వ్యవహారం. (మాజీ కేంద్ర హోంశాఖామంత్రి) చిదంబరం ఈ పాఠం చాలా కఠినమైన పద్ధతిలో నేర్చుకున్నారు. అమిత్ షా కూడా ఈ పాఠం నేర్చుకుంటారు. ఖతం కార్యక్రమంతో మావోయిస్టులను గాల్లో కలిపెయ్యలేదు.”
“నక్సల్ ప్రయాణాన్ని 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి తుడిచిపెట్టేస్తాం” అని అమిత్ షా ఏకపక్షంగా ప్రకటించిన గడువు “సహజమైన పద్ధతులలో నక్సలిజాన్ని నిర్మూలిస్తాం” అని అర్థం కాదు, రాజకీయ నాటకీయతతో ప్రకటించిన వ్యూహం. ఈ గడువు గాల్లో నుంచి సృష్టించినది కాదు, సైనిక వ్యూహం అంత కంటే కాదు, ఎన్నికల మీద ఎన్నికలు తరుముకు వస్తున్న కాలంలో మీడియాలో పతాక శీర్షికలకు ఉద్దేశించినది.
(2024 నవంబరు 22న సుక్మాలో ఎన్కౌంటర్లో 10 మంది నక్సల్స్ను హతమార్జిన నేపథ్యంలో జిల్లా రిజర్వ్గార్డ్లు సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం. ఫొటో క్రెడిట్- పిటిఐ)
మావోయిస్టుల ఉనికి “దీర్ఘకాలిక యుద్ధం” సిద్ధాంతం మీద నిర్మితమై ఉన్నది. నీటి ప్రవాహం బండరాళ్లను కోసుకుంటూ అరగదీసినట్లు ప్రభుత్వ, భద్రతా బలగాల ఓరిమిని మావోయిస్టులు పరీక్షకు పెడుతుంటారు. కాపుకాసి వేటు వెయ్యడం ద్వారా మరింత మంది పౌరుల శవాలు పోగుపడతాయే తప్ప ఫలితం ఉండదు.
మరయితే తీవ్రవాద ప్రయాణాన్ని నిర్మూలించడానికి నిర్దిష్టమైన గడువు ప్రకటించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి? అమిత్షా “సమర్ధత”ను ఎవరూ ప్రశ్నించలేనిదిగా నిరూపించుకోవడమే ఈ గడువు ప్రకటన వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. హోంమంత్రి “ఉగ్రవాదం” పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడనే ప్రజాభిప్రాయాన్ని బలంగా పాదుకొల్పడానికి ఆదివాసుల మృతదేహాలను ప్రచారస్త్రంగా వాడుకుంటూ ఉన్నారు. పర్యవసానంగా బస్తర్ తదితర అటవీ ప్రాంతాలు రక్తమోడుతున్నాయి. అమాయక ఆదివాసులు చంపబడుతున్నారు. ఈ ప్రాంతాల్లో మైనింగ్ అడ్డూ అదుపూ లేకుండా కొనసాగడానికి మరిన్ని సైనిక బలగాలను మోహరించడానికి “ఉగ్రవాదాన్ని” సాకుగా వాడుకుంటున్నారు.
పెరుగుతున్న అర్థ సైనిక బలగాల మోహరింపు..
సిఆర్పిఎఫ్ తదితర అర్ధ సైనిక బలగాలు బస్తర్లో 182 శిబిరాలు నెలకొల్పాయని వార్తా పత్రికలు వెల్లడిస్తున్నాయి. ఒక్క 2024 సంవత్సరంలోనే సగటున నెలకు 15- 30 శిబిరాలు నెలకొల్పారు. ఆదివాసీ నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలో 5 కిలోమీటర్ల మేర ఈ అర్థసైనిక బలగాల శిబిరాలు విస్తరించి ఉన్నాయి.
ఈ తాత్కాలిక సైనిక శిబిరాలను రాజ్యం “సమీకృత అభివృద్ధి కేంద్రాలు”గా మార్చాలని దుర్మార్గపు పన్నాగం పన్నింది “సమీకృత అభివృద్ధి కేంద్రం” అనే అసమ శబ్ధోక్తి “బహిరంగ నిర్బంద శిబిరాలకు” పర్యాయపదం.
ఈ “కేంద్రాలు” అంతిమంగా పౌర జీవనాన్ని సైనిక పహారాలో గడిపేందుకు దారితీస్తాయి. ఈ లోగుట్టును కప్పిపెట్టడానికి వీటికి గోండీ భాషలో “మాన్వనవోనర్”(మానూతన గ్రామం) అని పేరు పెట్టారు. క్రూరత్వానికి సొగసైన పదాలతో అలంకరించి ఊరేగిస్తున్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, చౌకదుకణాలు, బ్యాంకులు ఇలా సమస్తం కోటలాంటి సైనిక ఆవరణలో ఒదిగించడం అభివృద్ధి కాదు, ఇది నాలుగు గోడల మధ్యన వ్యూహాత్మకంగా సాగిస్తున్న నిఘా మాత్రమే.
2022లో నేను సిల్జర్లో ఎంబీఎం మాజీ అధ్యక్షుడు మిడియామి రఘుతో మాట్లాడినప్పుడు సైనిక శిబిరాలు వస్తే వాటితో పాటే పాఠశాలలు ఆసుపత్రులు వస్తాయని చెప్పారు. సైనిక శిబిరాలు రావడంతోటే ఇక్కడి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. జనానికి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లే వీలు లేకుండా పోయింది. అడవిలోకి వెళ్లేదానికి లేదు. సంతకి వెళ్లేదానికి లేదు. అడవి నుంచి తినడానికి ఏమన్నా తెచ్చుకునే వీలులేదు. పొరబాటున మహిళలు ఒంటరిగా బయటికి వెళ్లారా, అడవికి పోయారా ఇక పోలీసుల పాలబడినట్లే అని చెప్పుకొచ్చాడు.
పౌరులకి, రాజ్యానికి మధ్యన నెలకొన్న ఈ సైనిక కవచం తప్పించుకోజాలని ఉచ్చులా మారింది “ఈ అర్థసైనిక బలగాల మీద ఉంచినది వాస్తవ లక్ష్యాలను సాధించడానికి వారు అడవుల లోపలికి వెళ్ల సాహసించడంలేదు. సైనిక క్యాంప్లు నెలకొల్పాక వాళ్లు పన్నిన ఉచ్చులో ఆదివాసులు ఏదో రకంగా పడి బలయిపోతున్నారు” అని 2025 ఫిబ్రవరిలో మిడియామి రఘు అరెస్టు కావడానికి ముందు వివరించాడు.
జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు, అర్థసైనిక బలగాలు , అటవీ అధికారులు అందరూ ఏకీకృత సైనిక కమాండ్ కింద పని చెయ్యాల్సి రావడంతో అధికారం కేంద్రీకృతమై పోయింది. ఇది సాధారణ పౌరజీవితానికి ప్రమాదకరం అని నాగరిక సమాజాలు భావిస్తాయి. కానీ బస్తర్ జిల్లాలో ఇది అత్యంత సాధారణమైన సహజమైన అంశంగా మారిపోయింది. ఇక్కడ ఆసుపత్రికో, రేషను తీసుకురావడానికో ఇంటి నుంచి బయటికి వెళ్లిన మనిషి తిరిగి ఇంటికి వస్తాడనే గ్యారంటీలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
బస్తర్ సైనికీకరణ..
బస్తర్ సైనికీకరణ కేవలం దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశం కాదు. అంతర్జాతీయంగా తిరుగుబాటు ధోరణుల అణిచివేతకు ఒక పరీక్షా కేంద్రంగా మారిపోయింది. దీని పర్యవసానాలు అంతర్జాతీయంగా ఉంటాయి.
ఘర్షణాత్మక ప్రాంతాలు
ప్రభుత్వం నెలకొప్పిన ఎఫ్ఓబిలలో 60 నిమిషాల పాటు ఏకధాటిగా 5 కిలో మీటర్ల పరిధిలో నిఘా నిర్వహించగల నేత్ర 3, భారత్ డ్రోన్ల సహా అత్యాధునిక ఆయుధ సంపత్తిని కలిగి ఉన్నాయి. కాంపాక్ట్ లాంచ్పాడ్లతో పాటు భూమి మీద కదలికలు మనుషులవా, జంతువులవా అని ఆకాశం నుంచి పసిగట్టగలిగి క్షణాల్లో సమాచారం అందించగలిగే సాధనాలనూ వినియోగిస్తున్నారు. ఈ సాధనాలు, డ్రోన్లు కానీ అడవిలో కనిపించిన మనిషి అటవీ ఉత్పత్తులు సేకరించడానికి వచ్చిన ఆదివాసీనా, నక్సలైటా అన్న తేడాను పసిగట్టలేవుకదా?
అన్నింటికీ మించి బస్తర్లో మానవరహిత ఏరియల్ వాహకాలు అయిన “హెరోన్”ల వాడకం ఆందోళనకర అంశం. ఇవి ఇజ్రాయిల్ ప్రభుత్వ సంస్థ “ఏరోస్పేస్ ఇండస్ట్రీ” తయారు చేస్తుంది. గత సంవత్సరంన్నర కాలం నుంచి గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న మానవ మారణకాండలో ఈ “హెరోన్”లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. భారత సైనిక బలగాలు గత రెండు దశాబ్దాలుగా పైలట్ రహిత వాహనాలను వాడుతున్నాయి. కానీ ప్రస్తుతం ఈ మానవ రహిత సాధనాలను సాయుధం చేసి మారీ దాడులకు వాడుతున్నారు. హెరోన్ డ్రౌన్లు ఇప్పుడు మారణయంత్రాలుగా మారాయి.
“ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ” వెబ్సైట్లో హెరోన్ల దాడి చెయ్యగల సామర్థ్యం గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. “ఆపరేషన్ కాస్ట్ లీడ్” పేరిట 2008- 09 సంవత్సరాల్లో పదుల సంఖ్యలో గాజా నివాసితులైన పాలస్తీనియన్లను ఈ డ్రోన్ల ద్వారా ప్రయోగించిన మిస్సైళ్లతో హతమార్చినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ వెల్లడించింది. 2013లో భారత మీడియా సంస్థలు ఈ హెరోన్ డ్రోన్లు ఒట్టి పనికిమాలినవని, నక్సల్స్ క్యాంప్లకు బదులు ఆదివాసీ గ్రామాల ఛాయా చిత్రాలను మాత్రమే పట్టిస్తున్నాయని తీసిపారేశాయి.
ఇదంతా కేంద్రంలో బీజేపీ అధికారానికి ఎగబాకక ముందు నాటి ముచ్చట. అప్పట్లో జాతీయ మీడియా నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లో పాల్గొన్న ఒక అధికారి అడవిలో “డ్రోన్ పసిగట్టిన ప్రతి కదలిక మీదా గుండు గురిపెట్టలేం. ఇది భారతదేశం. మనమేమీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అమెరికన్లం కాము” అని వ్యాఖ్యానించారని వివరించింది. కానీ ఇవాళ ప్రభుత్వానికి పత్తేదారుగా మారిపోయిన ప్రధాన స్రవంతి మీడియా దండకారణ్యం మీద 35,000 అడుగుల ఎత్తున ఏకధాటిగా 10 గంటల పాటు నిఘా నిర్వహిస్తూ అడవిలో కదలికలను చిత్రీకరిస్తూ, వైర్లెస్-ఫోన్ల సంభాషణల శబ్దాలను పసిగట్టగలవు ఈ హెరోన్ డ్రోన్లు అని డాంబికంగా ప్రచారం చేస్తున్నాయి. భద్రతా బలగాలేమో “ఫోన్కాల్ జాడగాని, మంటగానీ రెబల్స్ ఉనికిని నిర్దిష్టంగా పట్టిస్తా ఉన్నాయి” అని ఈ డ్రోన్లకు కితాబులు ఇస్తున్నారు. అడవిలో ఎవరన్నా అనధికారికంగా ఊపిరి తీసుకుంటున్నారని అనిపిస్తే చాలు వారికి మరణశాసం విధించేస్తున్నారు.
మూలవాసులపై యుద్ధం..
అటు కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వానికి సందు దొరికిన్పుడల్లా అభినందనల జల్లుకురిపించడానికి పోటీ పడుతున్న ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు కానీ ఇజ్రాయిల్ గాజా పౌరులపై ప్రయోగించి పరీక్షించిన ఈ ఆయుధాలను స్వదేశంలోని పౌరుల మీద వినియోగిస్తున్నాం అన్న ఇంగితాన్ని కానీ, ఇది తిరుగుబాటును ఎదుర్కొనే పద్ధతి కాదని కానీ అంగీకరించడానికి సిద్ధంగా లేవు. ఇది ఆదివాసుల మీద ప్రకటిస్తున్న యుద్ధం మినహా మరొకటి కాదు. శత్రుదేశాలుగా భావించి ఇజ్రాయిల్ చేసే దాడుల తరహా రాజ్యం మూలవాసుల మీద ఎక్కుబెట్టింది. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి రాజకీయపరంగా తీసుకోవాల్సిన చర్యలను పక్కనపెట్టి భయోత్పాతం సృష్టించి, అలవిమాలిన హింసకు పాల్పడి ఉగ్రవాదాన్ని ఏరిపారెయ్యాలని చూస్తున్నది.
జాతీయభద్రత పేరిట ఆదివాసులను వాళ్ల నివాస ప్రాంతాల నుంచి తుడిచి పెట్టాలనే అమిత్షా మాస్టర్ ప్లాన్ను అమలు చెయ్యడమే ఆపరేషన్ “కగార్” అసలు లక్ష్యం. ఇది మావోయిస్టులను కట్టడి చెయ్యడం కన్నా అమిత్షాను అసమాన పరాక్రమశాలిగా లోకానికి చాటి చెప్పడానికి ఉద్దేశించిన ఆపరేషన్ అని రాజకీయ వ్యూహకర్తలు, విశ్లేషకులు ఎవరైనా ఇట్టే పసిగట్టగలుగుతారు. దేశంలోని అంతర్గత శత్రువులని(?) అంతమెందించడం ద్వారా అమిత్షా గొప్పదేశ భక్తుడని, ప్రధాని మోడీకి భుజ బల సమానుడని, మోడీకి వారసుడని చాటి చెప్పడమే ఈ ఆపరేషన్ వెనుక దాగి ఉన్న లక్ష్యం.
మావోయిస్టుల ప్రమాదాన్ని అంతమొందించడానికి గడువులు ప్రకటించడం దేశాన్ని క్రమంగా సైనికీకరించే ప్రణాళికలో భాగమే. విరామం లేకుండా బలప్రయోగానికి పాల్పడడం, నిఘా నీడన బతకాల్సి రావడం ఇవన్నీ మనందరికీ దాపురించే రోజులు ఎంతో దూరంలో లేవు.
ఈ ఆపరరేషన్ ద్వారా మితవాద శక్తులు ఎవరిని శత్రువులగా ప్రచారం చెయ్యాలనే ప్రణాళికలను కూడా అమలు చేస్తున్నారు. మావోయిస్టులను “శత్రువులు”గా ప్రచారం చెయ్యడంతో పాటు, ప్రభుత్వ విధానాలను విమర్శించేవారిని “అర్బన్ నక్సల్స్”గా చిత్రీకరిస్తూ వారిని కూడా శత్రువుల క్యాటగిరీలో చేర్చేస్తున్నారు. ఆదివాసీ ఉద్యమాలు, ఆందోళనల అణిచివేత, అక్రమ అరెస్టులు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే, ప్రతిఘటించే ఏ ప్రజా ఉద్యమాలనయినా నేరపూరితంగా చిత్రీకరించనున్నారనే ముందస్తు హెచ్చరికను సూచిస్తున్నాయి. కార్మిక సంఘాలకు కూడా ఇందులో మినహాయింపు ఉండదు.
“ఆపరేషన్ కగార్” కార్పోరేట్ శక్తుల మితవాద శక్తుల చేతుల్లో ఉన్న రాజ్యం మధ్య ఉన్న అక్రమ చెలిమికి సంకేతం. భుజాన తుపాకులు ధరించి సంచరించే గెరిల్లాల నుంచి కన్నా సమాజానికి ఈ అపవిత్ర కూటమి ఎక్కువ చేటు చేస్తుంది.
ప్రజాస్వామ్యంపై దాడి
మైనింగ్ కార్పోరేట్ కంపెనీలకు ఎలాంటి ఆటంకాలు లేని భూములు కావాలి. రాజ్యం కిరాయి తుపాకిగా మారి దేశభక్తి ముసుగులో సైనిక బలగాలను సరఫరా చేస్తున్నది. వనరుల వెలికితీత నిరాఘాటంగా సాగిపోవాలని అంతర్జాతీయ పెట్టుబడి డిమాండ్ చేస్తున్నది. సైనిక క్షేత్రాలు నెలకొల్పడం ద్వారా అమిత్ షా ఆ కోరిక నెరవేరుస్తున్నాడు. ఈ బలప్రదర్శనకు “ఉగ్రవాదం అణిచివేత” అనేది ఒక ముసుగు మాత్రమే. మావోయిస్టుల బూచిని ఉపయోగించుకొని దేశంలో ప్రజాస్వామిక వ్యక్తీకరణకు చోటులేకుండా చెయ్యాలనేదే అమిత్షా పన్నాగం. ఈ పథకం పారితే మిగిలేది మౌనం, ప్రభుత్వ విధేయతలు మాత్రమే.
ఒక పక్క బస్తర్లోని ప్రభుత్వ ఆసుపత్రుల మార్చ్యురీలలో ఆదివాసుల మృతదేహాలు పేరుకుపోతూ, గుర్తు తెలియని సమాధి ఫలకాలు మొలుస్తూ ఉంటే మరో పక్కన అర్థ సైనిక బలగాలు రివార్డులు, ప్రమోషన్లు అందుకుంటూ ఉన్నాయి. రాజ్య నిర్బంధంలో చిక్కుకుని తుపాకి కాల్పులలో పసిపిల్లలు చనిపోతున్నారు. మగపశువుల బలాత్కారాలను భరించలేని ఆదివాసి మహిళలకు తుపాకి తూటాలతో మోక్షం ప్రసాదిస్తున్నారు. ఈ దుర్మార్గాలకు కేవలం సైనికులను తప్పుపట్టడం కాదు, ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా ఘనంగా చాటుకునే ఈ దేశంలో ఇలాంటి రాజ్య హింసకు రూపకర్తలయిన వారిని నిగ్గదియ్యాలి.
దండకారణ్య అటవీ ప్రాంతం ఇవాళ సామూహిక శిక్షకు గురవుతున్నది. మన కళ్లముందే ఘోరమైన యుద్ధ నేరాలు కొనసాగుతున్నాయి. ఈ దుర్మార్గాలను చూస్తూ మౌనంగా ఉండడమంటే మనకూ ఈ హింసలో భాగం ఉన్నట్లే. దీనిని అడ్డుకోకపోతే ఇది దావానంలా వ్యాపించి మనందరినీ చుట్టుముడుతుంది. పారాహుషార్.
మీనా కందసామి
అనువాదం: కె సత్యరంజన్
( మీనా కందసామి స్త్రీవాద రచయిత్రి, కవయిత్రి, గత దశాబ్దకాలంగా రాసిన రాజకీయ కవిత్వాన్ని “టుమారో సమ్ వన్ విల్ అరెస్ట్ యూ” పేరిట పుస్తకంగా ఈ మధ్యనే వెలువరించారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.