
1948 జనవరి 30న గాంధీజీ భౌతికంగా తనువు చాలించారు. కానీ నేటికీ…ఆధునిక ప్రపంచ పటానికి పాఠ్యపుస్తకమై సత్యప్రకాశంతో, అహింసా వినీలాకాశంలో విశ్వ శాంతి పరిమళాలను వెదజల్లుతూనే ఉన్నారు.
కొన్ని కోట్ల గుండెల్లో ప్రేమ యుద్ధం చేస్తూ తన చిరునవ్వుల సాక్షిగా మానవత్వమై ఉదయిస్తూనే ఉన్నారు. ఈ ప్రాభవం, ప్రభావం ఇంకా కొన్ని శతాబ్దాలు కొనసాగుతూనే ఉంటుంది. అందుకే సినీ గీత రచయిత సీతారామ శాస్త్రి కలం గాంధీతత్వమై అక్షర జలపాతాన్ని…భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమయాతన తీర్చిన వరదాతరా గాంధీ
గుప్పెడు ఉప్పును పోగేసి…
నిప్పుల ఉప్పెనగా చేసి
దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత….
సిసలైన జగజ్జేత
పదవులు కోరని పావన మూర్తి
హృదయాలేలిన చక్రవర్తి
అంటూ ప్రేరణాత్మకంగా కురిపించింది మనపై…!
ప్రతి సంవత్సరం జనవరి 30న మనదేశమంతటా అమరవీరుల దినోత్సవం పేరుతో స్వాతంత్ర్య సంగ్రామంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావులను స్మరించికుంటూ వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము.
ఈ శతాబ్దపు వివిధ రంగాల్లో ప్రపంచ ప్రముఖులైన ఆల్బర్ట్ ఐన్ స్టీన్, ఆంగ్ సాన్ సూకీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సీవీ రామన్, బెర్నార్డ్ షా, మార్టిన్ లూథర్ కింగ్, దలైలామా, నెల్సన్ మండేలా, స్టీవ్ జాబ్స్, కైలాష్ సత్యార్థి, బరాక్ ఒబామా, చార్లీ చాప్లిన్ వంటి తదితరులు సైతం గాంధీజీ నుంచి స్ఫూర్తి పొందిన వారే. ఈ శతాబ్దపు అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రముఖంగా వినిపిస్తూ కనిపించే వ్యక్తిత్వపు హిమగిరి పేరు గాంధీజీ.
సత్యం, అహింస పునాదులపై విశ్వమానవతా ప్రేమ శిఖరాన్ని తన సందేశంగా, మన దేశపు ముఖచిత్రంగా గాంధీజీ నిలిపారు .ఆయన మార్గంలో నడిచి, అందరికీ ఆదర్శంగా నిలిచి ఎంతోమంది నోబెల్ బహుమతులు గెలిచారు. ఇంకా గెలుస్తారు. కొన్ని కారణాల వల్ల గాంధీజీకి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించలేకపోయినందుకు నోబెల్ కమిటీ విచారం వ్యక్తంచేసింది. ఎన్నో ప్రపంచ స్థాయి ఉద్యమాలకు సత్యాగ్రహం, నిరాహారదీక్ష వంటి శాంతియుత మార్గాలే హైవేలుగా పనిచేశాయి. పనిచేస్తున్నాయి. ఫలితాలు వచ్చాయి.
వ్యవసాయం, వ్యాపారం, వాణిజ్యం, విద్య, వైద్యం, సైన్స్, పర్యావరణం వంటి ఏ రంగాల్లోనైనా ఆయన జీవిత పరిశోధనలే నేడు మనం అనుసరిస్తున్న పాఠ్యాంశాలు అయ్యాయి. ప్రేమతో, సామరస్యంతో ద్వేషంపై గెలవొచ్చని, సహనానికి మించిన సింహాసనం లేదని, యుద్ధం పేరుతో అధిపత్యం మాయలో మనుషుల్ని చంపడం దారుణమని మతోన్మాదం మంచిది కాదని గాంధీజీ ఏనాడో హెచ్చరించారు.
ప్రపంచ ఆకలిని తీర్చే అన్నం పెట్టే రైతన్న మన దేశపు ఆత్మగా అభివర్ణించారు. కార్మికులు, సైనికుల త్యాగం గొప్పదన్నారు.
కేవలం పాలన మారటమే స్వాతంత్ర్యం కాదని…., అస్పృశ్యత,అంటరానితనం,అజ్ఞానం, పేదరికం, నిరుద్యోగం, అసమానతల, మత విద్వేషాల వంటి మహామ్మారులను మనదేశం నుంచి తరిమేయటమే నిజమైన స్వాతంత్ర్యం అనీ చెప్తూ చరిత్ర వెంట పాదయాత్రచేసి ప్రజల్లో చైతన్యం నింపారు. ఆయన అస్తమించి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా అవే మహమ్మారులు మనదేశంలో కూడా అప్పుడప్పుడు అక్కడక్కడా కనిపిస్తూనే వున్నాయి. కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నాయి.
కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని,మూడవ ప్రపంచ యుద్ధం పోకడలు కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో యావత్ ప్రపంచానికి ఒకే ఒక దిక్సూచి గాంధీజీ. కన్నుకు కన్నే సమాధానం అయితే ఈ ప్రపంచం ఏనాడో గుడ్డిదయిపోయేదంటూ మరో న్యూటన్ భౌతిక శాస్త్ర గురుత్వాకర్షణ నియమం లాగా ఓ బతుకు శాస్త్ర మా”నవ” ఉనికి నియమం ఆనాడే చెప్పారు.
గ్లోబల్ వార్మింగ్తో పర్యావరణాన్ని నాశనం చేస్తున్న నేటి ఆధునిక మానవుని గురించి “ప్రకృతి మన అవసరాలను మాత్రమే తీరుస్తుంది మన కోరికలను కాదని ” సూచించాడు. పట్టణీకరణ యావ లో పడి గ్రామాలే ఈ దేశానికి పట్టుగొమ్మలు అన్న విషయాన్ని మరువకూడదన్నారు. ఆయుర్వేదం, ధ్యానం వంటి ఆరోగ్య విధానాలను తను ఆచరించి నేటి తరానికి ఆదర్శమయ్యారు.
మనిషిలోని అంతర్లీనంగా దాగి ఉన్న ఆధ్యాత్మిక, నైతిక విలువలను వెలికితీయటమే విద్య పరమార్థం కవాలని, చిన్నారుల మనసుల్లో విద్వేషపు విషబీజాలు నాటేందుకు సాధనం కాకూడదనీ హెచ్చరించారు. శాస్త్రీయంగా ఎదుగుతూనే సాంకేతికత చాటున హింసను సృష్టించడం, ప్రకృతిని విధ్వంసం చేసే చర్యలు చేపట్టడం భవిష్యత్ తరాలకు ప్రమాదమన్నారు. నైపుణ్యాలను పెంపొందిస్తూ, జీవనోపాధిని ఇచ్చే విధంగా ఆధునిక విద్య వుండాలని ఆకాంక్షించారు. ఈ దేశ భవిష్యత్తు పార్లమెంటులో కాదు పాఠశాలల్లోనే నిర్మించబడుతుందనే దార్శనికతను గాంధీజీ బలంగా విశ్వసించారు.
తనచేతిలో భగవద్గీత పట్టుకొని తన జీవన సమరాన్ని శోధించిన గాంధీజీ ఆత్మ కథ “The story of My experiments with Truth”(సత్య శోధన) పుస్తకం ప్రఖ్యాత గ్రంథం బైబిల్ స్థాయి గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో ఈ పుస్తకం అనువాదం పొందినది. ప్రపంచ ప్రముఖ రచయితలు సైతం గాంధీజీ పై ఎన్నో పుస్తకాలు రచించారు. గాంధీ రాసిన పుస్తకాలు, గాంధీజీ పై వచ్చిన పుస్తకాలు బెస్ట్ సెల్లర్ జాబితాలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ విగ్రహాలు,ఆయన పేరుమీద నడిచే స్వచ్చంధ సంస్థలు, అవార్డులు,విద్యాసంస్థల వంటివి చాలానే ఉన్నాయి. భారతప్రభుత్వం కూడా అంతర్జాతీయ స్థాయిలో మానవాళిని ప్రభావితము చేసిన ప్రముఖులకు గాంధీ పేరుమీదే గాంధీ శాంతి బహుమతి అందిస్తున్నది.
ఇలాంటి సజీవ సాక్ష్యాలు ఎన్నున్నా గాంధీజీ జీవన సంద్రంలో ఓ నీటిబొట్టుగా చెప్పగలం. ప్రపంచస్థాయిలో విశ్వమానవుడిగా అ’సాధారణ’ వ్యక్తిగా విశేష ప్రాచుర్యం పొందిన గాంధీజీని నేడు మన భారతీయులలో కొంతమంది కులం, మతం కోణంలో చూస్తూ, చూపిస్తూ సంకుచితంగా ఆలోచించడం మనం ఆందోళన చెందాల్సిన విషయం. మన దేశ స్వాతంత్ర్య సంగ్రామానికి మాత్రమే ఆయనను పరిమితం చేస్తూ కొన్ని రాజకీయ పార్టీలు చేసే రాజకీయ నాటకీయపు పరిణామాలు ఇకనైనా ఆపాలి. అందరివాడుగా వున్న ఆయనను కొందరివాడుగా చేయడం మానుకోవాలి. మన దేశంలోనూ, విదేశాల్లోనూ అప్పుడప్పుడు అక్కడక్కడ ఆయన విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి మానసిక పరిపక్వత లేని పనులను మనమంతా ఏకమై ఖండించాలి. మన జాతి సమగ్రతను కాపాడాలి.
గాంధీజీ పుట్టిన దేశం అంటూ ప్రపంచం మనల్ని గౌరవిస్తున్న తీరుతో ప్రతి భారతీయుడి గుండె గర్వపడాలి. ఆయన కలలుకన్న విశ్వశాంతి వికాసానికి మనమంతా సమిధలు కావాలి. విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ “రక్తమాంసాలతో కూడిన గాంధీజీ లాంటి యుగపురుషుడు ఈ భూమిపై నడిచాడంటే భవిష్యత్తు తరాలు నమ్మవు..! అంటూ గాంధీజీకి అందించిన అక్షర నివాళి ఇంకా కొన్ని శతాబ్దాలు గాంధీని, గాంధీయిజాన్ని వేలకోట్ల తారల వెలుగై సత్యంతో ప్రకాశించేలా చేస్తాయి.
ఆయన వర్థంతి సందర్భంగా ఆయనకు ఇష్టమైన పాటతో శ్రద్ధాంజలి ఘటిద్దాం.
రఘుపతి రాఘవ రాజారాం…
పతిత పావన సీతారాం…
ఈశ్వర అల్లా తేరే నామ్
సబ్ కో సన్మమి దే భగవాన్
ఫిజిక్స్ అరుణ్ కుమార్
ప్రయివేటు టీచింగ్ ఫ్యాకల్టీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.