
మేధో స్వాతంత్య్రం విషయాల్లో అమెరికా విశ్వవిద్యాలయాలకు ప్రపంచవ్యాప్తంగా విలక్షణమైన గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ఇటువంటి విశ్వవిద్యాలయాలు కూడా ప్రస్తుతం ట్రంప్ పడగ చిమ్ముతున్న విషానికి బెంబేలెత్తుతున్నాయి. ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి విద్యావేత్తలను లక్ష్యంగా చేసుకున్నాడు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా రాజ్యాంగం భరోసా ఇచ్చిన వైవిధ్యం, సమానత్వం ఇంకా సమ్మిళిత చర్యలన్నీ ఆధిపత్య జనాభా పట్ల వివక్ష చూపటంలో భాగమేనని వ్యాఖ్యానించాడు. మిచిగాన్లోని గ్రాండ్ వ్యాలీ స్టేట్ యూనివర్సిటీ, మసాచుసెట్స్లోని న్యూ ఇంగ్లాండ్ కాలేజ్ ఆఫ్ ఆప్టోమెట్రీ వంటి చిన్న ప్రాంతీయ పాఠశాలల నుంచి హార్వర్డ్, యేల్ వంటి ఉన్నత ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వరకు 50కి పైగా విశ్వవిద్యాలయాలపై అమెరికా పరిపాలన సమాఖ్య దర్యాప్తులను ప్రారంభించింది.
ట్రంప్ విశ్వవిద్యాలయ పరిశోధన నిధుల కోతను ప్రతిపాదించటం ద్వారానూ, నిర్దిష్ట పాఠశాలలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారానూ ఉన్నత విద్యా సంస్థలపై ఒత్తిడిని పెంచాడు. క్యాంపస్లో యూదు వ్యతిరేక ఆందోళనలను అడ్డుకోవటంలో విఫలమైనందుకు కొలంబియా విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం నుండి వచ్చే 400 మిలయన్ డాలర్ల గ్రాంట్ను నిలిపివేశాడు. దాంతో ఈ నిధులు లేకపోతే అల్లాడిపోతామని తెలిసిన కొలంబియా విశ్వవిద్యాలయం విద్యార్థుల నిరసన విధానాలను కఠినతరం చేయడం నుంచి మొత్తం విద్యా విభాగాన్ని పరిపాలనా పర్యవేక్షణలో ఉంచడం వరకు ట్రంప్ డిమాండ్లలో చాలా వరకు అంగీకరించింది. అయినా నేటికీ నిధులు విడుదల కాలేదు.
కార్నెల్, నార్త్వెస్ట్రన్, ప్రిన్స్టన్, బ్రౌన్ ఇంకా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం కూడా ఇటీవల గ్రాంట్లను స్తంభింపజేశాయి. ఫెడరల్ నిధులలో తొమ్మిది బిలియన్ డాలర్లు ఖర్చు చేయరాదంటూ ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్కు నోటీసు పంపింది. దీంతో అమెరికా అంతటా పలు విశ్వవిద్యాలయాలు ట్రంప్ కబంధ హస్తాల్లో చిక్కుకోకుండా ఉంటే బాగుండు అనుకునే పరిస్థితులు తలెత్తాయి. ఇందులో భాగంగా ట్రంప్ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని విభాగాలను రద్దు చేయటం, మరికొన్నింటిని తాత్కాలికంగా మూసివేయటం, అధ్యాపక సిబ్బంది స్థానాల కుదింపు వంటి అనేక చర్యలకు పాల్పడుతున్నాయి. వైవిధ్యంతో కూడిన, ప్రభుత్వ వ్యతిరేక విశ్లేషణలు, వ్యాఖ్యానాలు తాము నిర్వహించే సంస్థల నుంచి రాకుండా జాగ్రత్త పడుతున్నాయి.
అయితే అన్ని సంస్థలు ఈ విధానాలను పాటించడం లేదు. వెస్లియన్ వంటి కొన్ని యూనివర్సిటీలు తమ వైవిధ్య సూత్రాలను వదులుకోవడానికి నిరాకరించాయి. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వంటి సంస్థలు ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలను సవాలు చేస్తూ కేసులు వేశాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విద్యా స్వేచ్ఛ ఇంకా మొదటి సవరణను ఉల్లంఘిస్తున్నాయని వాదించాయి. అయితే ఈ ప్రతిఘటనలు సార్వత్రిక తిరోగమన ప్రయాణంలో మినహాయింపులుగానే మిగిలిపోయాయి.
తులనాత్మక, అంతర్జాతీయ విద్యలో పండితుడిగా వివిధ రాజకీయ వ్యవస్థలు, సాంస్కృతిక సందర్భాలు ఇంకా చారిత్రక క్షణాలలో విద్యా సంస్థలు నిరంకుశపు ఒత్తిడికి ఎలా స్పందిస్తాయో నేను తెలియజేస్తాను. కొన్ని విశ్వవిద్యాలయాలు పరిపాలనకు కట్టుబడి ఉండటం వారి నిధులను, స్వాతంత్య్రాన్ని కాపాడుతుందని నమ్ముతున్నప్పటికీ, కొన్ని చారిత్రక అనుభవాలు దీనికి భిన్నంగా ఉన్నాయి.
జర్మన్ విశ్వవిద్యాలయాలు: ఒక పాఠం
1975లో రాసిన ‘‘ది అబ్యూస్ ఆఫ్ లెర్నింగ్: ది ఫెయిల్యూర్ ఆఫ్ జర్మన్ యూనివర్సిటీస్’’ అనే పుస్తకంలో, 20వ శతాబ్దంలో ప్రపంచ మేధో ప్రభావపు స్వర్ణయుగంలోకి ప్రవేశించిన జర్మన్ విశ్వవిద్యాలయాలు నాజీ పాలనను ప్రతిఘటించకుండా ఎలా లొంగిపోయాయో చరిత్రకారుడు ఫ్రెడెరిక్ లిల్జ్ వివరించారు.
1933లో అధికారాన్ని స్వాధీనం చేసుకునే ముందు కూడా, నాజీ పార్టీ విద్యార్థి సంఘాలు ఇంకా సానుభూతిపరులైన అధ్యాపకుల ద్వారా జర్మన్ విశ్వవిద్యాలయాలను నిశితంగా పర్యవేక్షిస్తూ, రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగినవారిని, ముఖ్యంగా యూదులు, మార్క్సిస్టులు, ఉదారవాదులు, శాంతికాముకులను – తొలగించింది. 1933లో హిట్లర్ అధికారం చేపట్టిన తర్వాత, అతని పాలన యూదులు- రాజకీయ ప్రత్యర్థుల విద్యా సంస్థలను ప్రక్షాళన చేయడానికి వేగంగా కదిలింది. 1933లో ప్రొఫెషనల్ సివిల్ సర్వీస్ పునరుద్ధరణ చట్టం ప్రకారం రాజకీయంగా అనుమానితులైన యూదులు, ఇతర ‘‘ఆర్యన్లు కాని’’ ప్రొఫెసర్లు ఇంకా అధ్యాపక సభ్యులను తొలగించాలని ఆదేశించింది.
త్వరలోనే, ప్రొఫెసర్లు హిట్లర్కు విధేయత చూపాలని ఆదేశాలు కూడా జారీచేయబడ్డాయి, ‘‘జాతీయ రక్షణ’’, ‘‘జాతి శాస్త్రం’’- యూదు వ్యతిరేకతతో పాటు ఆర్యన్ ఆధిపత్యాన్ని సమర్థించడానికి ఉపయోగించే ఒక నకిలీ శాస్త్రీయ చట్రాన్ని పాఠ్యాంశంగా రూపొందించారు. యావత్ విద్యా వ్యవస్థనూ నాజీ భావజాలానికి సేవ చేయడానికి మొత్తం విభాగాలను పునర్నిర్మించారు. స్టట్గార్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి కొన్ని సంస్థలు హిట్లర్ అధికారంలోకి వచ్చిన కొన్ని వారాలలోనే గౌరవ డాక్టరేట్తో సత్కరించడానికి కూడా తొందరపడ్డాయి. అతను ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. ప్రతిష్టాత్మక విద్యావ్యవస్థల ఈ ఆత్రం పాలకులతో పాలకుల మనోభావాలతో జతకట్టాలన్న వారి ఆదుర్దాను వెల్లడిస్తుంది.
జర్మన్ విశ్వవిద్యాలయాల సంఘం వంటి వృత్తిపరమైన సంఘాలు, విశ్వవిద్యాలయాలు తమ స్వయంప్రతిపత్తిని కోల్పోయి నాజీ రాజ్యానికి లోబడి మారడానికి ముందు ప్రతిఘటించడానికి కీలకమైన అవకాశాలను విస్మరించి మౌనంగా ఉన్నాయి. భాషావేత్త మాక్స్ వీన్రీచ్ తన 1999 పుస్తకం ‘‘హిట్లర్స్ ప్రొఫెసర్స్’’లో రాసినట్లుగా, చాలా మంది విద్యావేత్తలు దీనిని పాటించడమే కాకుండా, తమ పరిశోధనలను నాజీ పార్టీ అవగాహనను పునర్నిర్మించడం ద్వారా హిట్లర్ పాలనకు, చర్యలకు చట్టబద్దత కల్పించే క్రమంలో భాగస్వాములయ్యారు. హిట్లర్ కాలంలో నాజీలతో కలిసి పని చేసిన మేధావులందరూ నాజీ సిద్దాంతం, కల్తీ లేని ఆర్యజాతి, యూదులు చొరబాటుదారులు వంటి వాదనలను సమర్ధించే విధంగా పరిశోధనలు, నిర్ధారణలు చేయటం ద్వారా నాజీ సిద్ధాంతపు మేధో చట్రాన్ని నిర్మించడంలో సహాయపడ్డారు. కొంతమంది విద్యావేత్తలు ప్రతిఘటించి, తొలగించబడ్డారు, బహిష్కరించబడ్డారు లేదా ఉరితీయబడ్డారు. చాలా మంది మౌనప్రేక్షకులుగా ఉండిపోయారు.
జర్మన్ విద్యాసంస్థల పరివర్తన నెమ్మదిగా జరిగే ప్రవాహం కాదు. వేగవంతమైన, క్రమబద్ధమైన సమగ్ర పరిశీలన. కానీ హిట్లర్ ఆదేశాల అమలుకు ఈ కొత్త క్రమాన్ని పాటించడానికి, సమర్థించడానికి ఇంకా సాధారణీకరించడానికి చాలా మంది విద్యావేత్తల ఆసక్తి దోహదం చేసింది. ప్రతి నిర్ణయం – తొలగించబడిన ప్రతి పేరు, సవరించిన ప్రతి సిలబస్, మూసివేసిన ప్రతి కార్యక్రమం ఇంకా విభాగ స్థానంలో పాలకులకు అవసరమైనట్లుగా, దేశభక్తి పేరుతో నాజీ సిద్ధాంత ప్రచారవ్యూహంతో రూపొందించబడింది. కొన్ని సంవత్సరాలలో, జర్మన్ విశ్వవిద్యాలయాలు జ్ఞానార్జన సాధనాలుగా కాక పాలకవర్గం చేతుల్లో పావులుగా మారాయి. యుద్ధం తర్వాత డినాజిఫికేషన్, ప్రభుత్వ పెట్టుబడులతో పాటు అంతర్జాతీయ పునఃసమ్మేళనం ద్వారా, పశ్చిమ జర్మన్ విశ్వద్యాలయాలు మేధోపరంగా పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి. దీనికి పదేళ్లకుపైగా శ్రమ చేయాల్సి వచ్చింది.
సోవియట్ రష్యా, ఫాసిస్ట్ ఇటలీ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాయి.
నిరంకుశ పాలనల కింద పడిపోయిన ఇతర దేశాలు కూడా ఇలాంటి దారులను అనుసరించాయి. ఫాసిస్ట్ ఇటలీలో ఈ మార్పు హింసతో కాదు, సంతకంతో ప్రారంభమైంది. 1931లో ముస్సోలినీ పాలన అన్ని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లను జాతీయ ప్రభుత్వానికి విధేయులమై ఉంటామని ప్రమాణం చేయాలని ఆదేశించింది. 1,200 కంటే ఎక్కువ మందిలో కేవలం 12 మంది మాత్రమే నిరాకరించారు. ఈ ప్రమాణం వారి బోధన లేదా పరిశోధనపై ఎటువంటి ప్రభావం చూపదని పట్టుబట్టడం ద్వారా చాలా మంది తమ సమ్మతిని సమర్థించుకున్నారు. కానీ బహిరంగంగా విధేయతను ధృవీకరించడం ద్వారా ఇంకా ఎటువంటి వ్యవస్థీకృత ప్రతిఘటనకు తావులేకుండా, విద్యా సంఘం పాలనకు అనుగుణంగా ఉండటానికి తన సంసిద్ధతను సూచించింది. ఈ వ్యతిరేకత లేకపోవడం ఫాసిస్ట్ ప్రభుత్వానికి విశ్వవిద్యాలయాలపై నియంత్రణను కఠినతరం చేయడానికి ఇంకా దాని సైద్ధాంతిక ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడేలా అనుమతించింది.
సోవియట్ యూనియన్లో ఈ నియంత్రణ సింబాలిక్ సంజ్ఞలకే పరిమితం కాలేదు. ఇది మొత్తం విద్యా వ్యవస్థను పునర్నిర్మించింది. 1917లో రష్యన్ విప్లవం తర్వాత, బోల్షెవిక్లు విశ్వవిద్యాలయాలను ‘‘భూస్వామ్య అవశేషాలు’’గా రద్దు చేయాలన్న డిమాండ్లకు, వాటిని సోషలిస్ట్ రాజ్యానికి సేవ చేసే కేంద్రాలుగా పునర్నిర్మించుకోవాలన్న ప్రతిపాదనల మధ్య ఊగిసలాడారని చరిత్రకారులు జాన్ కాన్నెల్లీ, మైఖేల్ గ్రుట్నర్ తమ ‘‘డిక్టేటర్షిప్ కింద విశ్వవిద్యాలయాలు’’ అనే పుస్తకంలో వివరించారు. చివరికి, వారు రెండోదాన్ని ఎంచుకున్నారు, విశ్వవిద్యాలయాలను సైద్ధాంతిక విద్య ఇంకా సాంకేతిక శిక్షణ సాధనాలుగా పునర్నిర్మించారు. మార్క్సిస్ట్-లెనినిస్ట్ లక్ష్యాలతో గట్టిగా అనుసంధానించబడింది.
జోసెఫ్ స్టాలిన్ పాలనలో, విద్యా మనుగడ పండిత యోగ్యతపై కంటే అధికారిక సిద్ధాంతానికి అనుగుణంగా ఉండటానికే ప్రాధాన్యతనిచ్చింది. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన పండితులను బహిష్కరించారు. కమ్యూనిస్ట్ పార్టీని కీర్తించడానికి చరిత్రను తిరిగి రాశారు. మార్క్సిస్టు లెనినిస్టు అవగాహనకు లోబడి ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాలను రూపొందించేందుకు, అమల్లో పెట్టేందుకు ప్రయత్నం చేశారు.
ఈ నమూనాను ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో తూర్పు- మధ్య ఐరోపా అంతటా ఎగుమతి చేశారు. తూర్పు జర్మనీ, చెకోస్లోవేకియా మరియు పోలాండ్లలో, మంత్రిత్వ శాఖలు పాఠ్యాంశాలను నిర్దేశించాయి. అన్ని విభాగాలలో మార్క్సిజం- లెనినిజం తప్పనిసరి అయ్యాయి. ఇంకా భిన్న విశ్వాసపాత్ర నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులకు అనుకూలంగా అడ్మిషన్ల విధానాన్ని మార్చారు. కొన్ని సందర్భాల్లో పాత మేధో సంప్రదాయాలకు కట్టుబడి ఉన్నవారు వెనక్కి తగ్గారు. ముఖ్యంగా పోలాండ్లో ప్రతిఘటన మందగించినప్పటికీ సైద్ధాంతిక నియంత్రణ విధించడాన్ని నిరోధించలేకపోయారు. 1950ల ప్రారంభం నాటికి, ఈ ప్రాంతం అంతటా ఉన్న విశ్వవిద్యాలయాలు కాన్నేల్లీ ‘‘బందీ సంస్థలు’’ అని పిలిచేవిగా మారాయి. స్వతంత్ర పరిశోధన కేంద్రాల స్థానంలో అధికారానికి లోబడి వ్యవహరించే కేంద్రాలుగా మారాయి. ఇటీవలి ఉదాహరణ టర్కీ, అక్కడ, 2016 తిరుగుబాటు విఫలమైన తరువాత, 6,000 మందికి పైగా విద్యావేత్తలను తొలగించారు. విశ్వవిద్యాలయాలు మూసివేయబడ్డాయి. అంతేకాకుండా ‘‘విధ్వంసక’’ పరిశోధనలు నిషేధించబడ్డాయి.
చరిత్ర చేస్తున్న హెచ్చరిక
ఉన్నత విద్య పాలనలో ట్రంప్ పరిపాలన ముందస్తుగా, ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం విశ్వవిద్యాలయాలను ప్రభుత్వ ప్రభావం లేదా నియంత్రణలోకి తీసుకురావడానికి చేసిన చారిత్రక ప్రయత్నాలను గుర్తు చేస్తుంది. ‘‘వివక్షత’’ కలిగిన విద్యా కేంద్రాల్లో వివిధ సామాజిక ఆర్థిక రాజకీయ భావజాలాలకు ప్రాతినిధ్యం వహించేలా అమలు జరుగుతున్న వైవిధ్యపూరిత విధానాలను తొలగించేందుకు, కళాశాల క్యాంపస్లలో యూదు వ్యతిరేకతగా భావించే వాటితో పోరాడటానికి అలా చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ సమాఖ్య నిధులను నిలిపివేయడం ద్వారా, పరిపాలన విశ్వవిద్యాలయాలను సైద్ధాంతిక అనుగుణ్యతకు లోబడి ఉండాలని ఒత్తిడి చేస్తోంది. ఎవరి జ్ఞానం, పరిశోధన, అవగాహన ఆమోదయోగ్యమో ఎవరిది కాదో కూడా ముందస్తుగానే నిర్ధారించే పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ట్రంప్ డిమాండ్లకు కొలంబియా ప్రతిస్పందన స్పష్టమైన సందేశాన్ని పంపింది: ప్రతిఘటన ప్రమాదకరం, కానీ సమ్మతికి ప్రతిఫలం లభించవచ్చు. అయినప్పటికీ 400 మిలియన్ డాలర్ల నిధులు ఇంకా చేతికి దక్కలేదు. రాయితీల వేగం, పరిధి ఒక ఉదాహరణను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాజకీయ పరిణామాలను నివారించడం అంటే విధానాలను తిరిగి రాయడం, విభాగాలను పునర్నిర్మించడం ఇంకా వివాదం నుండి వెనక్కి తగ్గడం, బహుశా ఎవరైనా అడగకముందే అని ఇతర విశ్వవిద్యాలయాలకు సూచిస్తుంది. ట్రంప్ పరిపాలన ఇప్పటికే ఇతర విశ్వవిద్యాలయాలకు విస్తరించబడింది. వాటిలో లింగమార్పిడి విధానాలపై పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, వాతావరణ కార్యక్రమాలకు ప్రిన్స్టన్, యూదు వ్యతిరేక ఆరోపణలపై హార్వర్డ్ లక్ష్యంగా ఉన్నాయి. తదుపరి వేటు ఎవరిమీద అన్నదే ప్రశ్న.
విద్యా శాఖ 50కి పైగా సంస్థలపై దర్యాప్తు ప్రారంభించింది. అవి ‘‘విద్యా కార్యక్రమాలు, కార్యకలాపాలలో జాతి ప్రాధాన్యతలు ఇంకా స్టీరియోటైప్లను’’ ఉపయోగిస్తున్నాయని ఆరోపించింది. ఈ సంస్థలు ఎలా స్పందించాలని నిర్ణయించుకుంటాయన్నది ఉన్నత విద్య బహిరంగ విచారణకు ఒక స్థలంగా మిగిలిపోతుందో లేదో నిర్ధారించే పరిణామాలు కానున్నాయి.
లోబడి ఉండాలనే ఒత్తిడి కేవలం ఆర్థికపరమైనది కాదు, ఇది సాంస్కృతికమైనది కూడా. కొన్ని సంస్థలలోని అధ్యాపకులకు ఇమెయిల్లు, పబ్లిక్ కమ్యూనికేషన్లో ‘‘సామాజిక సాంస్కృతిక రాజకీయ వైవిధ్యం’’ అనే పదాన్ని ఉపయోగించవద్దని సలహా ఇస్తున్నారు, హెచ్చరికలు లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. విద్యావేత్తలు వారి ఈమెయిల్ సంతకాల నుంచి సర్వనామాలను తీసివేస్తున్నారు. ఇదే పద్ధతులు పాటించమని విద్యార్థులను కూడా అడుగుతున్నారు. నాకు అటువంటి హెచ్చరికలు అందుతూనే ఉన్నాయి. ఇతర సంస్థలలోని నా సహచరులకు కూడా. నిరసనలలో పాల్గొన్నారనే ఆరోపణల కారణంగా అనేక మంది బహిష్కరించబడిన లేదా తిరిగి ప్రవేశించడానికి నిరాకరించబడిన తర్వాత వీసాలపై ఉన్న విద్యార్థులు అమెరికా వెలుపల ప్రయాణించవద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతలో, విద్యాసంస్థల లోపల ఇంకా వెలుపల ఉన్న వ్యక్తులు సైద్ధాంతిక ఉల్లంఘనలుగా భావించే వాటి కోసం వెబ్సైట్లు, సిలబస్లు, ప్రెజెంటేషన్లు మరియు పబ్లిక్ రైటింగ్లను పరిశీలిస్తున్నారు. ఈ రకమైన తోటి సహచరుల నిఘాలో ఎవరైతే ప్రభుత్వ ఆలోచన, అవగాహన, విధానాలకు లోబడి ఉంటారో గుర్తించి వారికి ప్రతిఫలాలు అందించేందుకు ఉపయోపగుతుంది. భిన్నంగా ఉన్నవారిపై క్రమశిక్షణ చర్యల పేరిట వేధింపులకు తెర తీసేందుకు దారితీస్తుంది. విశ్వవిద్యాలయాలు తాము చెప్పే వాటిని మాత్రమే కాకుండా, వారు బోధించే, మద్దతు ఇచ్చే మరియు నిలబడే వాటిని నియంత్రించడం ప్రారంభించినప్పుడు అవి రాజకీయ బెదిరింపులకు ప్రతిస్పందించడానికి బదులుగా పాలకవర్గ భావాలను, వాటి సారాన్ని జీర్ణం చేసుకుంటున్నాయి. అణువణునా నింపుకుంటున్నాయి. చరిత్ర నిరూపించినట్లుగా ఈ స్థితి వారి విద్యా స్వాతంత్య్రం ముగింపుకు నాంది కావచ్చు.
(ఇవెటా సిలోవా, అరిజోనా స్టేట్ యూనివర్సిటీలోని కంపారిటివ్ అండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ వ్యాసం మొదట క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కింద “ద కన్వర్జేషన్” సైట్లో ప్రచురించబడింది.)
అనువాదం : కొండూరి వీరయ్య
(ఈ విశ్లేషణ నేపథ్యంలో భారతదేశంలో మేధో స్వాతంత్య్రం గొంతు నులుముతున్న మతోన్మాద రాజకీయాలు, ఉన్నత విద్యారంగం, స్వతంత్ర పరిశోధనలపై జోహా హసన్ అభిప్రాయాలను మూడు భాగాలుగా ద వైర్ తెలుగు పాఠకులకు అందించింది. వాటి కోసం ఈ లింకులను చూడొచ్చు – సంపాదకులు)
మొదటి భాగం , రెండవ భాగం , మూడవ భాగం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.