
కొన్ని కథలు మనుషులను బతికిస్తాయి. విషాదాన్ని నింపుకున్న హృదయానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఆ కథలలోని కొన్ని వాక్యాలు మానని గాయాలకు కూడా మందు రాస్తాయి. రచయిత పసునూరి రవిందర్ రాసిన కండీషన్స్ అప్లై కథా సంపుటిలోని కథలు కూడా అచ్చం అలాంటివే. దళితుల జీవితాలలోని వ్యథలను రచయిత కథలుగా బాగా మార్చారు. సనాతన ధర్మంగా పిలువబడుతున్న వైదిక మతం సమాజాన్ని చీల్చి కొందరికి అధికారాన్ని ఇచ్చింది. మరికొందరికి అధికారాన్ని దూరం చేసింది. రాజ్యాధికారానికి దూరమై తరతరాలుగా కొందరు శూద్రులుగా మానసికంగా, శారిరకంగా హింసించబడ్డారు. దళితులుగా హింసించబడుతున్నారు. వారి జీవితాలు ఒకప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఈ కథలు అద్దంపడతాయి.
అభూత కల్పనలు, ఊహాతీత ఘటనలు ఏవీ కండీషన్స్ అప్లై కథలలో ఉండవు. మన సమాజంలో నిత్యం జరిగే ఘటనలే ఇందులో కథా వస్తువుగా ఉంటాయి. కొందరు ఈ మధ్య హిందువులం బంధువులం సింధూ నీటి బిందువులం, మనమందరం ఒకటేనని ఓ వైపు అంటున్నారు. మరోవైపు హిందూ మతంలోని దళితులను, ఆదివాసులను అణిచివేస్తున్నారు. ఏ విధంగా సమాజాన్ని చీల్చాలో, తాము రాజకీయంగా ఏ విధంగా ఎదగాలో పెత్తందారులకు తెలిసినంతగా బడుగు బలహీనవర్గాలకు తెలియదని ఇందులోని కథలు తేటతెల్లం చేస్తాయి.
సింహం జింక పిల్లను వేటాడినట్టు భారతదేశంలో దళితులను తరతరాలుగా సమస్యలు నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. హిందూ మతంలో ఉంటే మనిషిగా దళితులను గుర్తించరు. ఆర్థికంగా, మానసికంగా హింసిస్తారు. తిండికి కూడా దూరం చేస్తారు. అదే తిండి కోసం హిందూ మతాన్ని వదిలి వేరే మతాన్ని తీసుకుంటే రైస్ బ్యాగ్ అని అవమానిస్తారు. శ్వాగ్ సినిమాలోలా డబ్బుల కోసం మతం మార్చుకున్నారని హేళన చేస్తుంటారు. అగ్రవర్ణాలుగా చెలామణి అయ్యేవారికి ప్రతి తరంలో తమ చేత మానసికంగా, శారీరకంగా హింసించబడే బానిసలు కావాలి. వీరి పైశాచికత్వానికి బలికావడానికి అమాయకులు కావాలి. ఇటువంటి లోతైన విషయాలను పసునూరి కథలు ప్రపంచానికి చాటి చెపుతాయి.
పసునూరి రచనల్లో శ్రమైక జీవన సౌందర్యం కనబడుతుంది. సంపుటిలోని కథలన్నీ మన చుట్టూ జరిగే ఘటనలే కాబట్టి కథల్లో జీవం ఉంది. శ్రమ జీవుల నుంచి పుట్టిన వాక్యాలు సజీవంగా ఉంటాయి. ఇవి కొన్నేళ్ల పాటు కాదు, కొన్ని తరాలనే శాసిస్తాయి. అలా పసునూరి రచనలు ఒక శతబ్దాన్నే శాసిస్తాయని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. కథలలోని ప్రభావవంతమైన పాత్రల ద్వారా సమాజంలోని అందరికీ మార్గదర్శకుడిలా రచయిత పసునూరి మనకు కనబడతారు. రచయిత తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించారు.
జ్ఞానంతోనే కాక అనుభవంతో కూడుకున్న జ్ఞానంతో చెపితే ఆ వ్యక్తి చెప్పింది లోకం వింటుందని జపాన్ రచయిత మసనోబు ఫుకుఓకా అంటారు. తాను చూసిన, అనుభవించిన వాటిన రచయిత కథలుగా మార్చారని కొన్ని కథల ద్వారా అర్ధం అవుతుంది. ఈ కాలపు మార్గదర్శకుడిలా నిలబడ్డ రచయిత పసునూరి రవిందర్ కథలు సమాజాన్ని కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. రచయిత తన అక్షరాలను దళితుల, కొందరి చేత పీడించబడే పీడితుల చేతి ఆయుధాలుగా మర్చారు.
సాహితీకారులు కూడా ఓ రకంగా చరిత్రకారులే, రచయిత పసూనూరి రవిందర్ కూడా ఓ చరిత్రకారులే. తన పూర్వీకులు వదిలేసిన చరిత్రను ఆయన వెలికి తీసి, కథలతో ప్రపంచానికి చెపుతున్నారు. వర్తమానంలో తన చుట్టూ జరిగే అన్యాయలను, అక్రమాలను ధిక్కార కలమై ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా వర్తమానాన్ని చరిత్రీకరిస్తున్నారు. గతాన్ని వర్తమానంతో చెప్పే కళ చాలా తక్కువ మందికి ఉంటుంది. తన రచనల ద్వారా పసునూరి రవిందర్ ఆ కళలో నిష్ణాతులలా కనబడుతున్నారు.
దుర్గం అశోక్
8106709871
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.