
తమ అభిమాన టీం బాగా ఆడుతారని మైదానానికి వెళ్లిన ప్రేక్షకులకు, వారు సరిగ్గా ఆడకపోతే తీవ్ర అసంతృప్తికి లోనవుతారు. టీవీ ముందు కూర్చొని ఆట చూస్తున్న ప్రేక్షకుల పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా కేసీఆర్ ప్రసంగం కోసం సభకు వెళ్లిన వారికి, టీవీల్లో, సోషల్ మీడియాలో చూసిన వారికి కూడా ఇలాంటి అనుభూతే ఎదురైంది. పార్టీ పెట్టి 25 సంవత్సరాలైన సందర్భంగా బీఆర్ఎస్ హన్మకొండలో నిర్వహించిన రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం కోసం ఆ పార్టీ కార్యకర్తలే కాదు, తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రాంగణానికి వచ్చిన సంఖ్యను, నాయకులు జన సమీకరణగానే చూడాలి. కాబట్టి, కేసీఆర్ ప్రసంగం పట్ల ఉన్న ఆసక్తిని గమనించడానికి పీపుల్స్ పల్స్ యూట్యూబ్లో కేసీఆర్ లైవ్ ప్రసంగాన్ని వీక్షించిన నెటిజన్స్ సంఖ్యను రికార్డు చేసింది. తెలుగునాట ప్రధాన న్యూస్ ఛానెళ్ల యూట్యూబ్ హ్యాండిల్స్లో అన్నిట్లో కలిపి సుమారు నాలుగు లక్షల మంది ఆయన లైవ్ ప్రసంగాన్ని వీక్షించారు. ఈ సంఖ్య ప్రజల్లో ఉన్న ఆసక్తిని సూచిస్తుంది. కానీ, ఆ ప్రసంగం అంచనాలను నిలబెట్టుకోలేకపోయింది. కేసీఆర్ తన పాలనలో విజయాలను గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ భవిష్యత్ వ్యూహంపై దశాదిశా నిర్దేశం ఇవ్వలేకపోయారు. ఇది బీఆర్ఎస్ కార్యకర్తలను నిరాశకు గురి చేసింది.
కేసీఆర్ తీసుకొచ్చిన వినూత్న, ప్రజాకర్షక పథకాలతో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున అభిమానం సొంతం చేసుకుంది. అయిన్నప్పటికీ 2023లో ఆ పార్టీ పరాజయం పాలైంది. అయితే తమ వ్యూహం ఎక్కడ, ఎందుకు విఫలమైందో తెలుసుకునే ప్రయత్నం ఇప్పటికీ చేయలేదని బీఆర్ఎస్ రజతోత్సవ సభతో మరోసారి రుజువైంది. లోపం ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా బీఆర్ఎస్కు ఓటేయకుండా ప్రజలే మోసపోయారనే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఓటమి కారణాలను అంగీకరించకపోతే, గెలుపుకు మార్గాలు వేయడం కష్టమని ఆ పార్టీ తెలుసుకోవాలి. కేవలం ప్రజాకర్షక పథకాలు మాత్రమే పని చేయవని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, పౌరుల హక్కులను భంగం కలిగించకుండా ప్రజాస్వామ్య బద్ధంగా పాలన అందించాల్సిన బాధ్యత పార్టీలకు ఉంటుందని బీఆర్ఎస్ ఓటమి గుణపాఠంగా నేర్చుకోవాలి.
పాత సీసాలోనే కొత్త నీళ్లు పోసిన కేసీఆర్..
అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతే పథకాలు పోతాయేమోననే భయం ప్రజల్లో కనిపించడం లేదు. దీనికి ఇటీవల ఆంధ్ర, తెలంగాణలో జరిగిన ఎన్నికలే నిదర్శనం. ఒకసారి ఇచ్చిన హామీ వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని, మంచి పథకాలను కొత్త ప్రభుత్వాలు కూడా పక్కన పెట్టలేవనే విషయం ప్రజలకు తెలిసిపోయింది. అందుకే, ప్రజలు పథకాలనే కాకుండా నాయకుల ప్రవర్తనను, పరిపాలన ధోరణులను గమనిస్తూ ఓట్లేస్తున్నారు. ప్రజాస్వామ్యం లోపించడం, పాలనలో ప్రజల భాగస్వామ్యం తగ్గిపోవడాన్ని జీర్ణించుకోలేకే ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారనడంలో సందేహం లేదు. దీనికి తోడు నిరుద్యోగులను పట్టించుకోకపోవడం, గ్రామాల్లో రైతు కుటుంబాల్లో అసంతృప్తి పెరగడం వల్లనే బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమని లోక్నీతి- సీఎస్డీఎస్ సర్వేలో తేలింది. అయినా ఇవేం ఆత్మ విమర్శ చేసుకోకుండా కేసీఆర్ మళ్లీ పాత సీసాలోనే కొత్త నీళ్లు పోశారు. ఓటమి కారణాలను విశ్లేషించుకోకుండా ప్రజలే తప్పు చేశారన్నట్టుగా మాట్లాడడం ప్రతికూల సందేశాన్ని పంపింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. కానీ, వారి తరఫున ప్రతిపక్షంలో ఉండి గొంతు వినిపించాల్సిన బాధ్యతను కేసీఆర్ విస్మరించారు. అసెంబ్లీకి రాకపోవడాన్ని ఆయన ఎలా సమర్థించుకుంటారు? ఆయన అసెంబ్లీకి రాకపోగా కేటీఆర్, హరీష్ రావుని పిల్లలు, పిల్లగాళ్లు అనడం వల్ల వాళ్లను తక్కువ చేసినట్టయింది. వాళ్లు పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర కూడా చిన్నదైపోయింది. నేనే సుప్రీం అనే ధోరణిని కేసీఆర్ ఇంకా దూరం పెట్టలేదు. రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతిక పరంగా ప్రజలను భాగస్వామ్యం చేసుకోవాలి. కానీ, ప్రజలే తన దగ్గరకు వస్తారనే భావనలో ఉన్నట్టు కేసీఆర్ ప్రసంగం ధ్వనించింది. ప్రజలు అభివృద్ధిలేమినైనా తట్టుకుంటారుగానీ, అహంకారాన్ని తట్టుకోలేరని చరిత్రలో ఎన్నో సంఘటనలు నిరూపించిన సంగతిని ఆయన తెలుసుకోవాలి.
పోటీ చేయడానికి భయపడుతోన్న బీఆర్ఎస్..
2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. అంతకముందు అధికారం చేపట్టకపోయినా, ఆర్థికంగా బలమైన మూలాలు లేకపోయినా రాష్ట్ర సాధన కోసం అనేకసార్లు పదవి త్యాగం చేసి, పలుమార్లు ఉపఎన్నికలను ఎదుర్కొంది. దానికి ప్రతిఫలంగా పదేళ్లు అధికారం కూడా సొంతం చేసుకుంది. కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన ఆ పార్టీలో పోరాట స్పూర్తి కొరవడింది. నాడు ఉప ఎన్నికల్లో ఓటమి భయం లేకుండా పోరాడిన బీఆర్ఎస్ ఇప్పుడు పోటీ చేయడానికే భయపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ ఇవ్వాలనే సోయి కూడా లేకుండా బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టింది. దీంతో ఆ పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తర్వాత వచ్చిన ఉమ్మడి కరీంనగర్, నిజమాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ పోటీ చేయకుండా వ్యూహాత్మక తప్పిదం చేసింది.
నాడు ధైర్యంగా ఉపఎన్నికలను ఎదుర్కొన్నది ఆ పార్టీ ఇదేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజలు అధికార పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న సమయంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి అస్త్రాన్ని అందించింది. పార్లమెంటు ఎన్నికలతో పాటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీని గెలిపించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు షేర్ 2019తో పోలిస్తే 16.6 శాతం నుంచి 11.4 శాతానికి పడిపోయింది. దీంతో ఇప్పుడు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ మధ్యలో నలిగిపోయే పరిస్థితి తెచ్చుకుంది.
పదకొండేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు పదకొండు రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించిన కేసీఆర్, బీజేపీ లోపాలు అంతకు మించి ఏమీ చెప్పలేకపోయారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో పలుమార్లు బీజేపీ తీసుకొచ్చిన పలు బిల్లులకు మద్దతు ఇచ్చింది. ఢిల్లీలో బాగుంటూ గల్లీలో కొట్టుకుంటున్నారనే భావన ప్రజల్లో రావడానికి కూడా కేసీఆర్ తీరే కారణం. మావోయిస్టుల ఏరివేయడానికి బీజేపీ ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ విషయాన్ని కేవలం వామపక్షభావ సానుభూతిపరులను ఆకట్టుకోవడానికే ప్రస్తావించినట్లు ఉంది. కానీ దానిపై తర్వాత ఆ పార్టీ నుంచి మరో ప్రకటనే లేకపోవడం దేనికి నిదర్శనం.
పార్టీ కీలక నేతల మధ్య విభేదాలు..!
ఏ పార్టీలోనైనా అంతర్గత కలహాలు ఉంటే అవి ఆ పార్టీ ఎదుగుదలకు అడ్డుపడతాయి. పార్టీలో తాను, తన కుమారుడు కేటీఆర్ మాత్రమే పెద్దలు అన్నట్టు రజతోత్సవ వేదికపై ఇద్దరి చిత్రాలను మాత్రమే ప్రదర్శించారు. దీంతో కేటీఆర్, కవిత, హరీశ్ మధ్య విభేదాలు ఉన్నాయనే అనుమానాలకు బలం చేకూరింది. కేవలం ఆయన మాత్రమే మాట్లాడేలా ఈ సభను డిజైన్ చేశారు. ఇది పార్టీ ఐక్యతపై, ప్రజాస్వామిక స్పూర్తిపై ప్రశ్నలను లేవనెత్తింది. వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవనేలా కేసీఆర్ స్పష్టతనివ్వకపోతే, పార్టీ మూడు ముక్కలయ్యే ప్రమాదం కూడా ఉంది. కేసీఆర్పై ప్రజలకు అభిమానం ఉన్నా, అదే స్థాయిలో కేటీఆర్పై లేదనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి.
కేసీఆర్ ఫామౌజ్కు పరిమితమయితే, కేటీఆర్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారు. క్షేత్రస్థాయిలో తిరగడం లేదని ఆయన మాటల్లో అహంకారం తగ్గలేదనే విమర్శలు ఉన్నాయి. మాస్ ఇమేజ్ లేకపోవడం వల్ల పార్టీ కార్యకర్తలు కూడా ఆయనను ఇప్పటికీ సంపూర్ణంగా అంగీకరించలేక పోతున్నారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే ఇన్నాళ్లు బయటకు రాలేదు. ఇక నుంచి బయటకు వస్తాను. ప్రజల తరఫున పోరాడతాను’’అని కేసీఆర్ ప్రకటించారు. గత 16 నెలలుగా ఆయన ధోరణిని గమనిస్తున్న ప్రజలు ఈ మాటలను నమ్మేస్థితిలో లేరు.
వెంటాడుతున్న అంతర్గత విభేదాలు..
రజతోత్సవ సభలో కేసీఆర్ తన ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఇస్తాననే హామీలు, చెప్పిన గ్యారెంటీల గురించి నిలదీసే ప్రయత్నం చేశారు. కానీ అసెంబ్లీలో ఈ అంశాలను లేవనెత్తి ఉంటే ఆయన విశ్వసనీయత పెరిగేది.
బీఆర్ఎస్ తన 25 ఏళ్ల ప్రయాణంలో ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. గతంలో ప్రతి ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేసిన బీఆర్ఎస్, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడుతోంది. అంతర్గత విభేదాలు వెంటాడుతున్నాయి. పార్టీని క్షేత్రస్థాయిలో నడిపిస్తున్నది ఎవరో అనే సందేహాం కూడా కార్యకర్తలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్న సమయంలో, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పటికైనా ప్రయత్నాలు మొదలుపెట్టాలి.
2023 ఓటమి కారణాలను విశ్లేషించి, లోపాలను సరిదిద్దుకోవాలి. సకల జనుల సమస్యలకు సరికొత్త పరిష్కారాలతో ప్రజల్లోకి వెళ్లాలి. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు మధ్య విభేదాలను పరిష్కరించి, పార్టీలో ఐకమత్యాన్ని పెంచాలి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చురుకైన ప్రతిపక్ష పాత్ర పోషించి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలదీయాలి. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీ తన సంస్థాగత బలాన్ని పెంచుకుంటోంది. కాబట్టి, బీఆర్ఎస్ ఈ పరిణామాలను గమనించి, కొత్త వ్యూహాలతో ముందుకు రావాలి. లేకపోతే రాజకీయంగా బీఆర్ఎస్ మరింత బలహీన పడవచ్చు.
ప్రవీణ్ జంపాల, రీసర్చర్,
పీపుల్స్ పల్స్రీసర్చ్ ఆర్గనైజేషన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.