కవయిత్రి ఈ కవిత్వ సంపుటిని తన జీవన సహచరుడు ఎన్ భగవాన్కు అంకితం చేశారు. లోచూపు అనే పేరుతో డా ఎన్ గోపి చక్కటి, విలువైన ముందు మాట రాశారు. సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ఆర్థిక సహకారంతో ఈ కవిత్వ సంపుటి ముద్రించబడింది.
“అక్షర నేత్రాలు” కవితా సంపుటిలో మొత్తం 54 కవితలున్నాయి. పేదరికం, బ్రతుకు పోరాటం, స్ఫూర్తి, వనం లేని మనం, జలం లేని జనం, చరవాణి, ఆత్మజ్ఞానం, ఎండిన ఆకులు, మౌనఘోష, ప్లాస్టిక్ ఊబిలోకి పయనం, నెచ్చిలిలాంటి కవితలు అనుభవ పరిణతితో అక్షరీకరించబడ్డాయి.
ఎన్నో దృశ్యాలను చూపించే చిత్రాలు అక్షర నేత్రాలు..
ఆనందమనే కవితలో కవయిత్రి భావసాంద్రతకు అద్దం పడుతుంది. ఒక చోట ఆ కవితలో ఇలా అంటారు.
ఓ పసి నవ్వులో జారిన ముత్యాల గుప్పిటను ఏరుకొని/ భూమికి ఆవలి అంచులోకెళ్లి తెరిచి చూసి మురిసి పోతాను/ క్షణకాలపు స్పప్నంలో తేలిపోతుంటాను.
“పేగులు ఎండిన పేద రైతు” కవితలో ఒక చోట అభివ్యక్తి ఆర్థంగా ఉంది. మూడు పూటలా మనం తినే ప్రతిగింజ వెనక అతడి పోరాటం/ అది మన ఖాళీ కడుపులు నింపేందుకే/ అతడు పడే ఆరాటం..
మన నిత్య జీవితంలో, నెలల పిల్లాడి నుంచి కండ్లు కానరాని వృద్ధుని దాకా చరవాణి దేహంలో భాగమై కూర్చుంది. పక్కవాణ్ని పలకరించం కానీ, ప్రపంచంతో సంభాషిస్తున్నాం. మానవీయతను తెలియకుండానే త్యజిస్తున్నాం. ఈ మానసిక స్థితిన కవయిత్రి ఈ విధంగా తన కవితలో ముగింపు ఇచ్చారు.
“మంచి కోసం వాడితే మధురవాక్యం/ చెడు కోసం ప్రయత్నిస్తే మరణవాక్యం” అన్నారు. రమణ మహర్షి సూక్తిలో “జీవితం” కవితలో గొప్ప తాత్త్వికతతో కవయిత్రి ముగింపు పలికారు.
“అందుకే నీలో ఉన్న నిన్ను మచ్చిక చేసుకుని/ అందరినీ కలుపుకుంటూ సాగిపోయే ప్రయాణమే జీవితం” అంటారు.
ఎన్నో దృశ్యాలను చూపించే చిత్రాలు నా అక్షర నేత్రాలన్న లహరి కలంలోంచి మరిన్ని శక్తి వంతమైన కవితలు రావాలని ఆకాంక్షిస్తున్నాను.
(సమీక్షులు తంగిరాల చక్రవర్తి 2025 ఆగస్టు 16న తుదిశ్వాస విడిచారు. మానవవాది– సమసమాజ స్వాప్నికుడయి కవి, రచయితగా ఆయన సాహిత్యంలో కృషి చేశారు. నాటక ప్రయోక్త, సీనియర్ జర్నలిస్టుగా కూడా తంగిరాల చక్రవర్తి సేవలు అందించారు. ఆయనకు నివాళితో..)
