
గత ఏడాది జూన్ నెలలో ఎస్ బ్యాంక్ సుమారు 500 మంది క్రింది స్థాయి ఉద్యోగులకు ఉద్వాసన పలికిందనీ అందులో ఎక్కువ మంది రిటైల్ రుణాల విభాగానికి చెందిన ఉద్యోగులని “ఎకనామిక్ టైమ్స్” పత్రిక ఒక వార్తను 2024 జూన్ 25న ప్రచురించింది. ఒక ఏడాది తరువాత, నలుగురు ఉన్నతాధికారులకు అందులో ముగ్గురు రిటైల్ రుణవిభాగానికి చెందినవారు, బ్యాంక్ ఉద్వాసన పలికిందని “మింట్” పత్రిక వెల్లడించింది. అంటే ఉద్వాసనల పర్వం చాలా మెల్లగా పై స్థాయికి ఎగబాకుతుందన్నమాట. కాకపోతే ఇది ఇంకా పై స్థాయికి ఎప్పుడు చేరుతుందనేదే ఇప్పుడు సమస్య, ఇప్పటి వరకు ఉద్వాసనలు పలుకుతున్న వారికి ఉద్వాసన పలికేది ఎప్పుడు?
వాస్తవానికి ఇంత పనికిమాలిన రిటైల్ వాణిజ్య వ్యూహం రూపొందించిన బ్యాంక్ అత్యున్నత స్థాయి అధికారగణం బోర్డు డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైల్ రుణవిభాగం, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్టీ) చీఫ్ క్రెడిట్ రిస్క్ ఆఫీసర్లు(సీసీఆర్ఓ) ఈ వైఫల్యానికి బాధ్యత వహించాలి.
లోపభూయిష్టమైన రిటైల్ రుణాల వ్యూహం రూపొందించి అమలు చేయించిన ఈ నలుగురి మీద చర్యలు తీసుకోవాలి. అదనపు సిబ్బంది, అధిక తలసరి వ్యయం, రిటైల్ రుణవిభాగ సిబ్బంది డైరెక్ట్ సేల్స్ ఏజెంట్స్ మీద ఎక్కువగా ఆధారపడడం, నాసిరకం రుణాలు ఇవ్వడం, వీటన్నింటి పర్యవసానంగా బ్యాంక్కు నష్టాలు వాటిల్లాయి. కార్పొరేట్ రుణ విభాగం సంపాదించిన లాభాల నుంచి ఈ నష్టాలను పూడ్చుకోవాల్సి వచ్చింది. రిటైల్ రుణవిభాగ నష్టాలను కూడా తక్కువ చేసి చూపించారు. ఈ నష్టాలకు నేరుగా కేటాయింపులు చెయ్యకుండా “అనిర్థారిత వ్యయం” పద్దు కింద తప్పుడు లెక్క చూపించారు.
వాస్తవానికి కార్పొరేట్ రుణ విభాగం నీరుకారిపోవడడం మూలంగా 2020 మార్చి నెలలో ఎస్ బ్యాంక్ రుణవితరణ మీద రిజర్వ్ బ్యాంక్ “మారటోరియం” ప్రకటించింది. ఈ దుస్థితి నుంచి బయటపడడానికి రిటైల్ రుణ విభాగం లాభాలను ఆర్జించడానికి ప్రధాన చోదకశక్తిగా తోడ్పడి ఉండాల్సింది. కానీ, అధిక మూల్యంతో తెచ్చిన నిధులతో ఇచ్చిన 1,286 బిలియన్ల రుణాలు(ఈ మొత్తం 30 శాతం ఆస్తులకు, 41 శాతం రుణాలకు సమానం) నాణ్యత లేనివిగా తయారయి తక్కువ ఆదాయం గడించడం మూలంగా ఐదేళ్ల తర్వాత లాభాల బాట పట్టిన కార్పొరేట్ రుణ విభాగం ఆర్జించిన లాభాల నుంచి ఈ నష్టాలను సర్దుబాటు చేయాల్సి వచ్చింది.
ఎస్ బ్యాంక్ సీఈఓ సిబ్బంది ఉద్దేశించి జారీ చేసిన అంతర్గత ఈ-మెయిల్లో ఈడీ రిటైల్ రుణ విభాగం, సీఎఫ్ఓ, సీసీఆర్ఓలను పరోక్షంగా ఈ నష్టాలకు బాధ్యులుగా గుర్తించారు. కాకపోతే నేరుగా ఆ విషయం ప్రస్తావించకుండా రిటైల్ రుణ విభాగంలో దుబారాను తగ్గించి సదరు విభాగాన్ని బ్యాంక్ బ్రాంచి కేంద్రంకంగా పునర్నిర్మించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పదాల గారడీకి పునుకున్నరని “మింట్” వెల్లడించింది. రిటైల్ రుణ విభాగాన్ని పర్యవేక్షించాల్సిన ముగ్గురు ఉన్నతాధికారులు ఈ విభాగం ఈడీగా కొనసాగుతున్న రంజన్ పెంటాల్కు నేరుగా నివేదించాల్సిన విచిత్రమైన స్థితి కొనసాగుతుంది.
రిటైల్ రుణవిభాగం తీవ్ర నష్టాలు పాలవడానికి బాధ్యతవహించాల్సిన సదరు పెద్దమనిషికి ఆ విభాగ పునర్నిర్మాణంలో భాగంగా కించిత్తు ఇబ్బంది లేకుండా బ్యాంక్ చేసుకున్నది రాజన్పెంటాల్తో ఇతర ఉన్నత కార్యనిర్వాహక అధికారులు కూడా రిటైల్ రుణ విభాగం నష్టకారకుల జాబితా నుండి తప్పించుకోజాలరు.
ఎస్ బ్యాంక్ సీనియర్ కార్యనిర్వాహక అధికారులు ఎవరు ఎవరికి రిపోర్ట్ చేస్తారో తెలియచెప్పే పట్టిక
రిటైల్ రుణవ్యూహంలో 2022 ఆర్థిక సంవత్సరం నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్లు బ్యాంక్ వెల్లడించిన సమాచారాన్ని బట్టే అర్థమవుతుంది. 2022- 23 ఆర్థిక సంవత్సరాల్లో రిటైల్ రుణ విభాగం అతి స్వల్ప లాభాలు అర్జించింది. అదే సందర్భంలో ఈ స్థాయి మిగిలిన బ్యాంక్లతో పోల్చి చూసినప్పుడు ఎస్ బ్యాంక్ “అనిర్థారిత వ్యయం” పద్దు కింద చాలా పెద్ద మొత్తాన్ని కేటాయించింది. కార్పొరేట్ రుణ విభాగం, ట్రెజరీ విభాగాల నిర్వహణా వ్యయాలు చాలా సులువుగా గుర్తించగలిగే పద్ధతిని బ్యాంక్ అనుసరిస్తున్న కారణంగా ఈ “అనిర్ధారిత వ్యయం” రిటైల్ రంగ కార్యకలాపాలకు సంబంధించినదే అని స్పష్టం చేస్తున్నాను. 2022 నుంచి రిటైల్ రుణ విభాగం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ విభాగం నిజవ్యయాలను బ్యాంక్ సీఎఫ్ఓ బ్యాంక్ సీఈఓకు నివదేంచి ఉండాల్సింది.
ఎస్ బ్యాంక్ రిటైల్ రుణ విభాగ లాభాలు- అనిర్ధారిత వ్యయాలు( మిలియన్లలో)
FY2022 | FY2023 | FY2024 | 9MFY2025 | |
రిటైల్ లాభాలు | 31 | 686 | -9726 | -13756 |
అనిర్థారిత వ్యయాలు | -14196 | -15553 | -8531 | -4062 |
సర్దుబాటు చెయ్యగా | -14165 | -14867 | -18257 | -17818 |
బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ అతి స్వల్పంగా, సుమారు 2.5 శాతం ఉన్న కారణంగా నిర్వహణా వ్యయాల పట్ల అత్యంత శ్రద్ధ వహించడం చాలా కీలకమైన అంశం. అయితే, రిటైల్ రుణ విభాగాన్ని బాల్యావస్థ నుంచి భారీగా విస్తరించడానికిగానూ నిర్వహణా వ్యయం కూడా భారీగా ఉండడంతో తప్పు లేదని కార్యనిర్వాహక అధికారులు భావించినట్లు ఉన్నారు. బ్యాంక్ సమీకృత ఆదాయం, వ్యయాల నిష్పత్తి 2022 ఆర్థిక సంవత్సరంలో 70.6 శాతం కాగా 2023 నాటికి ఇది 74.5 శాతంగాను 2024 డిసెంబరు వరకు(9 నెలల కాలానికి) 72.8 శాతంగానూ ఉన్నది. రిటైల్ రుణ విభాగాన్ని విస్తరిస్తున్నప్పటికీ పై ఆదాయ వ్యయాల గణాంకాల దృష్ట్యా వ్యయాలను నియంత్రించడం మీద బ్యాంక్ సీఎఫ్ఓ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ఉండాల్సింది. కానీ రిటైల్ రుణ విభాగం ఆశించిన లాభాలను ఆర్జించలేకపోతున్నప్పటికీ వ్యయం ఇష్టారాజ్యంగా పెరిగిపోవడానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు కనబడుతున్నది.
ఆధారం: ఎస్ బ్యాంక్
ఎస్ బ్యాంక్ రిటైల్ రుణ విస్తరణ కోసం డైరెక్ట్ సేల్స్ ఏజెంట్స్ మీద ఎక్కువ ఆధారపడింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 63శాతం రుణాలు ఈ ఛానల్ ద్వారానే సేకరించారు. 2025 డిసెంబరు నాటికి ఈ ఆధారపాటును 50 శాతానికి తగ్గించుకున్నారు. డైరెక్ట్ సేల్స్ ఏజెంట్స్, థర్డ్ పార్టీ వెండార్ వంటి దళారీ వ్యవస్థల మీద ఆధారపడి రుణాలు ఇచ్చేటప్పుడు అత్యంత గరిష్ట జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యవస్థలు అనైతిక పద్ధతులకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సున్నితమైన అంశాన్ని బ్యాంక్ కార్యనిర్వాహక అధికారులు విస్మరించడం మూలంగా బ్యాంక్ వ్యయాలు అపరిమితంగా పెరిగిపోయాయి. రిటైల్ రుణ విభాగంలో డైరెక్ట్ సేల్స్ ఏజెంట్స్, థర్డ్ పార్టీ వెండార్ల మీద పెట్టే వ్యయాన్ని క్రమబద్దీకరించి అదుపులో ఉంచాల్సిన సీఎఫ్ఓ ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారు.
బ్యాంక్ రిటైల్ రుణ విభాగాన్ని భవిష్యత్తులో లాభాలు ఆర్జించే పెట్టే ఈ కామర్స్ స్టార్టప్ మాదిరిగా లక్షల కోట్ల రూపాయల నగదును రుణ వితరణకు ఖర్చు చెయ్యడానికి అనుమతించిన బ్యాంక్ సీఈఓ, సీఎఫ్ఓ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ప్రస్తుత దుస్థితికి పూర్తి బాధ్యతవహించాలి. రుణ వితరణ మీద రిజర్వ్ బ్యాంక్ విధించిన మారటోరియం నుంచి సడలింపు పొందిన ఏ బ్యాంక్ అయినా ఇంత దూకుడుగా, విచ్చలవిడిగా రిటైల్ రుణపందేరానికి పాల్పడడం నిజంగా పెను విషాదమే.
ఏదేని బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్లు స్వల్పంగా ఉండి, ఆదాయ- వ్యయ నిష్పత్తి అధికంగా ఉంటే ఆ బ్యాంకు ఆస్తులు(ఇచ్చే అప్పులు) నాణ్యతాపరంగా భేషుగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎస్ బ్యాంక్లో ఈ పర్యవేక్షణా బాధ్యత సీసీఆర్ఓ మీద ఉంది. ప్రత్యేకించి బ్యాంక్ రిటల్ రుణవితరణ, విస్తరణల కోసం థర్డ్ పార్టీ వెండార్స్ మీద ఆధారపడిన మూలంగా ఈ పర్యవేక్షణ మరింత బాధ్యతాయుతంగా నిర్వహించాల్సి ఉండింది. ఎస్ బ్యాంక్ ఇచ్చిన రిటైల్ రుణాలు అధికారికంగా తక్కువ ఆదాయాన్ని గడించేవిగానూ, నాణ్యతాపరంగా నాసిరకంగా ఉన్నాయి. రిటైల్ రుణాలలో 31 నుంచి 90 రోజుల్లో చెయ్యాల్సిన చెల్లింపుల బకాయిలు(నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్)గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా బ్యాంకింగ్ వ్యవస్థ ఇచ్చిన రిటైల్ రుణాలు నాణ్యతాపరంగా దిగజారుతున్న నేపథ్యంలో ఎస్ బ్యాంక్ రిటైల్ రుణాల నాణ్యత మరింత తీసికట్టుగా తయారయింది. తక్కువ ఆదాయాన్ని గడించే రిటైల్ రుణాలు నాణ్యతాపరంగా చాలా మెరుగ్గా ఉండాలి. కానీ ఎస్ బ్యాంక్ విషయంలో ఈ రెండు ప్రమాణాలూ దెబ్బతిన్నాయి. రుణ వితరణలో ఇమిడి ఉండే “రిస్క్” నియంత్రణలో ఎస్ బ్యాంక్ ఘోరంగా విఫలమైంది.
ఎస్ బ్యాంక్ రిటైల్ రుణాలలో 31- 90 రోజుల బకాయిలు
ఎస్ బ్యాంక్ రిటైల్ రుణాలలో స్థూల పారు బకాయిలు
ఆధారం: ఎస్ బ్యాంక్
ఒక పక్కన ఎస్ బ్యాంక్ నిర్మహణా ఖర్చులు అలవిమాలిన రీతిలో పెరిగిపోతూ, రిటైల్ రుణాలు తక్కువ ఆదాయాన్ని, నాణ్యతాపరంగా నాసిరకంగా ఉన్నప్పటికీ ఈ రుణ విభాగాన్ని పర్యవేక్షించే సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులకు నజరానాలు బాగానే ముట్టాయి. రాజన్ పెంటాల్కు 2023 ఫిబ్రవరిలో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదోన్నతి కల్పించారు. 2023 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ సీనియర్ కార్యనిర్వాహక అధికారులకు అధిక మొత్తంలో జీతభత్యాలు ముట్టచెప్పారు. రిటైల్ రుణ విభాగం పెద్దగా వాస్తవ లాభాలు గడించే పరిస్థితిలేనప్పటికీ భారీగా ఇచ్చిన రుణాలనే అద్భుతమైన పనితీరుగా బ్యాంక్ భావించినట్లున్నది.
సీనియర్ ఎగ్జిక్యూటివ్ల జీతభత్యాలు
ఆధారం: ఎస్ బ్యాంక్
ఒక ఏడాది గడిచాక ఎస్ బ్యాంక్ రిటైల్ రుణ విభాగంలో 500 మంది జూనియర్ సిబ్బందికి ఉద్వాసన పలికింది. మరో ఏడాది గడిచాక నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లను, అందులో రిటైల్ రుణ విభాగానికి చెందిన ముగ్గురిని ఇంటి బాట పట్టించింది. రిటైల్ రుణ విభాగాన్ని పునర్వవస్థీకరించడానికి, దుబారాను అరికట్టడానికి సదరు చర్యలు తీసుకున్నామని బ్యాంక్ ప్రకటించినప్పటికీ ఐదేళ్ల క్రితం బ్యాంక్ చేపట్టిన రిటైల్ రుణ వ్యూహం ఘోరంగా విఫలమయ్యిందని స్పష్టం అవుతుంది.
బ్యాంక్ ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవీ కాలం 2025 అక్టోబరుతో ముగియనున్నది. తదుపరి సీఈఓ ఎంపిక కోసం రూపొందించిన పేర్ల జాబితాను బ్యాంక్ బోర్డ్ డైరెక్టర్లు రిజర్వ్ బ్యాంక్ ఆమోదం కోసం పంపనున్నది. రిటైల్ రుణ విభాగంలో నెలకొన్న దుస్థితి రీత్యా ప్రస్తుత సీఈఓను మరో విడత ఆ పదవిలో కొనసాగించడానికిగాను, రిటైల్ బ్యాంక్తో సంబంధం ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ల పేర్లను గానీ బోర్డు డైరెక్టర్లు సిఫార్సు చేసే అవకాశం కనిపించడం లేదు ప్రస్తుత కార్పొరేట్ విభాగ అధిపతినిగానీ, బయటి వ్యక్తులకు గానీ ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బ్యాంక్ నూతన సీఈఓగా బయటి వ్యక్తి ఎవరన్నా నియమించబడినా, లేక కార్పొరేట్ విభాగం నుంచి ఎంపికయినా వాళ్లు తక్షణం బ్యాంక్ లాభాలను ఎండగట్టడానికి కారణమైన రిటైల్ రుణ వ్యూహాన్ని రూపొందించి, అమలు చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్లు అందరి మీదా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వారికి ఉద్వాసన పలకాలి. బ్యాంక్ మీద మారటోరియం విధించిన నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన ప్రస్థుత సీఈఓ బ్యాంక్ వ్యవస్థాపక సీఈఓ రాణాకపూర్తో కలిసి పనిచేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్లను కొనసాగిస్తూ వారి మీదే ఆధారపడి పనిచెయ్యాల్సి వచ్చింది. రాణాకపూర్ హయాంలో కొనసాగిన అత్యధిక పారితోషకాలు, ఏమి చేసైనా సరే అధికశాతం వ్యాపారాభివృద్ధి సాధించాలి, పర్యవేక్షణా రాహిత్యం, లోపభూయిష్టమైన పని సంస్కృతివంటి దుర్లక్షణాలు కొనసాగాయి.
కొత్తగా సీఈఓ బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి ముందు ఉన్నటువంటి సవాళ్లు అంత తేలికయినవి కావు. బ్యాంక్ స్థూల ఆస్తులలో 30 శాతం ఆస్తులు మీద నయా పైసా ఆదాయం రాని పరిస్థితులలో వీటిని మార్కెట్లో ఎవరికైనా అంటగట్టడం అంత తేలికగా సాధ్యపడే విషయం కాదు. ఈ రుణ బకాయిలు పూర్తిగా వసూలైనా కావాలి లేదా పాత బకాయిల కింద రద్దు చెయ్యాలి. దానితో పాటు సమాంతరంగా నాణ్యమైన కార్పొరేట్, రిటైల్లను సాధించుకోవాలి. ప్రస్తుతం దేవ ఆర్థిక వ్యవస్థ నానాటికీ దిగజారుతున్న నేపథ్యంలో ఈ లక్ష్యాన్ని సాధించడం అంత సులువైన అంశం కాదు.
ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంక్ బోర్డ్ డైరెక్టర్ల పనితీరు, ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డైరెక్టర్ల పనితీరు చాలా నిరాశాజనకంగా ఉన్నది. రిటైల్ రుణ విభాగం ఎన్ని త్రైమాసాలు గడిచినా “బ్రేక్- ఈవెన్” సాధించలేకపోవడానికి గల కారణాలు వివరించమని నిలదీయకపోవడం అత్యంత బాధ్యతారాహిత్యం. బోర్డు డైరెక్టర్లు కళ్లు తెరిచేసరికి జరగాల్సిన నష్టం చెయ్యిదాటిపోయింది. భారతదేశంలోనే అతి పెద్ద బ్యాంక్ నుంచి రిటైల్ రుణ విభాగ నిష్ణాతులుగా ప్రైవేట్ ఈక్విటీకి ప్రాతినిణధ్యం వహిస్తున్న స్వతంత్ర బోర్డు డైరెక్టర్లు వారి అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని ఉపయోగపెట్టిన దాఖలా కనబడడం లేదు.
ఎస్ బ్యాంక్ బోర్డు డైరెక్టర్లు
మారటోరియం నుంచి బయటపడి తిరిగి పట్టాలు ఎక్కుతున్న బ్యాంక్ స్వయంకృతాపరాధం మూలంగా మరలా ప్రతిష్టంభనకు లోనయ్యింది. బ్యాంక్కు అవసరమైన మూలధనాన్ని తిరిగి స్టేట్బ్యాంక్, ఇతర బ్యాంక్లు, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు సమకూర్చాల్సి వచ్చింది. సమగ్రమైన, లాభదాయకమైన రిటైల్ రుణ వ్యాపార వ్యూహాన్ని రూపొందించుకుని బ్యాంక్ పనితీరును, స్థూల లాభాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత 5 ఏళ్లుగా మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో కూడా బజాజ్ ఫైనాన్స్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్వంటి 5 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు రిటైల్ రంగంలో బలంగా నిలదొక్కుకుని ఆ కంపెనీల వాటాదారులకు రిటైల్ రుణ దుస్సాహసిక వ్యూహానికి నమూనాగా నిలిచింది.
హేమింద్ర కిషన్ హజారీ
అనువాదం: కె సత్యరంజన్
(వ్యాస రచయిత హేమింద్ర కిషన్ హజారీ “సెబీ”లో రిజిస్టర్ కాబడిన స్వతంత్ర పరిశోధనా విశ్లేషకులు (రిజిస్టర్ సంఖ్య:ఐఎన్హెచ్ 000000594). అంతేకాకుండా ఎస్ బ్యాంక్లో వాటాదారులు. ఈ వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతమైనవి, వ్యాసంలో ప్రస్తావించబడిన విషయాలు కేవలం సమాచారం కోసమే తప్ప పెట్టుబడులకు సంబంధించిన సలహా కాదు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.