
జాతీయ భాష అంటే రాజ్యాంగవ్యతిరేకం తెలుసా?
ఉన్నదున్నట్టు, హటాత్తుగా హిందీ మీద ప్రేమ వచ్చి పొంగి పోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ అధినేత శ్రీశ్రీశ్రీ చంద్రబాబునాయుడుగారికి, ఉపముఖ్యమంత్రి శ్రీశ్రీశ్రీ పవన్ కుమార్ గారికి. “హిందీ జాతీయ భాష. ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష” అని ఆలోచించి చెప్పారో లేక ఎవరో రాసి పంపిన పదాల్లో తెలియదు కాని, మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సాధికారికంగా ప్రకటించారు. దాని అర్థాలు ఏమిటో ఇంత తీవ్రమైన అంశాలో తెలిస్తే ఎంత బాగుండేది.
మనకు 22 అధికార భాషాలున్నాయి. ఎందుకున్నాయో కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా 43 రకాల భాషలను అధికారిక భాషలు అని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు గర్వించాలి. ఇదొక భారతీయ అద్భుత వైవిధ్యం. భారత రాజ్యాంగంఎనిమిదవ షెడ్యూల్ లో భాషల గురించి తెలుసుకోవాలి.
8th SCHEDULE OF THE INDIAN CONSTITUTION
ఎన్ టి ఆర్ ఆత్మక్షోభ
అంతేకాకుండా కొత్త ప్రవచనం కూడా చేసారు చంద్రబాబు గారు. “మాతృభాషకు ప్రాముఖ్యత ఇవ్వాలి, ఢిల్లీలో కమ్యూనికేషన్కు ఉపయోగకరంగా ఉన్నందున హిందీ నేర్చుకోవాలి. జీవనోపాధి కోసం మనం నేర్చుకునే ఇతర భాషలు’’ అన్నారు. ఇంతవరకు ఏ బాధా లేదు. కాని హిందీ జాతీయ భాష… ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష” అని ప్రకటించడం ఏమిటో మనకు భాష్యం (వివరణ) చెప్పవలసి ఉంది. బహిరంగ ప్రసంగంలో లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెబితే వేరు. కాని అసెంబ్లీకో చెప్పిన మాటలకు చాలా విలువ ఉంటుంది. అధికారికంగా ఎం ఎల్ ఏల ముందు, తక్కువ ఉన్నా ఈ ప్రతిపక్షమై అయినా, ఒకరో ఇద్దరోనైనా వినే ఉండవచ్చుకదా. ఇది సిగ్గు పడవలసిన మాట. తెలుగుదేశం వ్యవస్థాపకుడు అయిన కీశే మొదటి అధ్యక్షుడు మొదటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు ఏలోకంలో ఉన్నాడో గాని, ఆత్మ ఉంటే ఉంటే ఆత్మహత్య చేసుకునే వాడేమో.
ఇది రాజకీయం కాదు.
అంతకన్నా తీవ్రమైన ఆలోచన. ఇది హిందీ వ్యతిరేకతతో చెప్పడం లేదు. డిఎంకె రాజకీయాలతో మమేకం కావడానికి కాదు. బిజెపికి వ్యతిరేకించడానికి కాదు. కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేసినా ప్రస్తుతానికి వాటిని పట్టించుకోవనవసరం లేదు. నేను హిందీ మాట కూడా అనడం లేదు. కేవలం ‘‘జాతీయ భాష’’ అనే ప్రకటన, అదీ అసెంబ్లీలో, సభామధ్యమున, శతథా సహస్రథా అని దానవీరశూర కర్ణ డైలాగ్ వంటి ప్రకటన చేయడం సరైందేనా? ఎన్ టి ఆర్ ఏనాటికీ అనే వాడు కాదు.
ఒక్కోసారి రాజ్యాంగం చదవండి. రాజ్యాంగ నిర్మాణంలో తీవ్రంగా చర్చించుకున్న కానిస్టిట్యూషన్ అసెంబ్లీ లో డిబేట్లు పేర్కొన్న అంశాలు చూడండి. దాని పరిణామాలు అర్థం చేసుకుంటే బాగుండేది.
ఇప్పుడు ఇది దక్షిణాన పెద్ద వివాదంగా తెలుగుదేశం కూడా ఇరుక్కుపోయింది. ఎన్నికల సంవత్సరంలో, భాష, సంస్కృతి, రాజకీయాల వల్ల ఉత్తరాదిపై ఆధిపత్యాన్ని సంపాదించడానికి, మరోవైపు దేశం మొత్తం మీద బిజెపి ఆధిపత్యానికి ప్రయత్నంచేస్తున్న మధ్య డిఎంకె నాయకత్వాన్ని వహిస్తున్నారు. సరిహద్దులను దాటి భాషా సంస్కృతిక అంశాలు ఉత్తర దక్షిణాది రాష్ట్రాలలో కొత్త ప్రతిధ్వనులు వస్తున్న దశ వచ్చింది.
తమిళనాడు నుండి జాతీయ విద్యా విధానం మూడు భాషా సూత్రానికి తీవ్ర వ్యతిరేకత మధ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు 11 మార్చి నాడు ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ‘స్వర్ణ ఆంధ్ర 2047 విజన్‘ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వివరిస్తూ చంద్రబాబునాయుడు, మాతృభాష నేర్చుకోవడం గొప్పదని, దానిప్రాముఖ్యత గురించి మాట్లాడారు. కొత్త భాష నేర్చుకోవడం ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న యువతకు పోటీతత్వాన్ని అందించగలదని ఆయన అన్నారు. ఇందులో పరస్పర వైరుధ్యాలను గమనించారో లేదో తెలియదు.
ఇంతకు ముందు, వారం కిందట, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కల్యాణ్ “ఆర్థిక లాభం” కోసం తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేసినప్పుడు డిఎంకె నాయకులు అభ్యంతరం చెప్పలేదని విమర్శించారు. డిఎం కె విమర్శలకు పవన్ కల్యాణ్ Xలో పోస్ట్ ప్రకటనలో, NEP 2020 హిందీని తప్పనిసరి చేయలేదని, కానీ ప్రజలను తప్పుదారి పట్టించడానికి “దాని విధించడం గురించి తప్పుడు కథనాలు” ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నట్టు వచ్చింది.
ప్రముఖ సీనియర్ మంత్రి, ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, చంద్రబాబు నాయుడి 1978 నుంచి మంత్రిగా రాజకీయాల్లోవెలిగిపోతున్నారు. మన కు హిందీ జాతీయ భాషా లేక అధికార భాషా అనేది ఆయనకు అర్థం కాకపోలేదేమో అనిపిస్తుంది.
ఇంగ్లీషును చంద్రబాబుగారు అంతర్జాతీయ భాష అనే దర్జా ఈ మహావిశ్వానికి సమర్పించారు. కొన్ని శతాబ్దాలు ఇంగ్లీషువారి పాలనలో బానిసలైన మన జీవనం మొత్తం ప్రపంచానికి గొప్పది కేవలం ఆంగ్లమే అనుకోవడం కూడా వివాదమైందే. ప్రస్తుతం మనం కేవలం హిందీ జాతీయ భాషా లేక అధికార భాషా అని కాస్తా మెదడుకు మేత తినిపించాలి.
అధికార భాష ఒక్కటి కాదు, అనేకం!
భాష ఒక ధార, దారి. ఆ ధార ద్వారా, ఈ దారిలో జ్ఞానం వస్తుంది. ఆ తెలివి వస్తే మొత్తం దేశానికి విశ్వానికి పరిపాలించే శక్తి వస్తుంది. మనది సొంత భాష. అది మన తెలుగు మాతృభాష. మొత్తం జాతికి ఈ ఒక్కటే భాష అనడానికి అర్థం లేని మాట. ఎందుకంటే కొన్ని కొట్ల మందికి ఇంగ్లీషు రాదు. కొన్ని వారికి తెలుగు రాదు. మరికొందరికి హిందీ రాదు. మొత్తం రాజ్యాంగం లో అనేకానేక అధికార భాషలని ప్రకటించారు. కాని ఎక్కడా జాతీయ భాష అని అనలేదు. దాదాపు 300 మంది రాజ్యాంగ రచయితలు బాగా చర్చించి మన హిందీ అధికార భాష అన్నారే కాని, మొత్తం 22 భాషలు (అత్యధికమైనంగా మాట్లాడుకునే తెలుగుతో సహా) అధికార భాషలే అన్నారు. అదే విధంగా అనేకానేక భాషలు భారతదేశంలో అధికారిక భాషలున్నాయి.
ఓసారి రాజ్యాంగాన్ని చదవండి
ఆర్టికల్ 343 భారత రాజ్యాంగంలో మన భాష గురించి ఉంది. విశేషం ఏమంటే ఆర్టికల్ 343(1) ప్రకారం హిందీ అధికార భాష అంటూ ఆర్టికల్ 343లో ఒకే ఒక్క భాష మాత్రమే అనలేదు. ఆర్టికల్ 343(2) ప్రకారం ఇంగ్లీష్ భాష కోర్టుల్లో ఇప్పడికీ ఉంది. రాష్ట్రాల్లో కూడా నడుస్తున్నది. దురదృష్ఠ వశాత్తూ తెలంగాణ ఆంధ్రలో కూడా తెలుగు మాట్లాడడమే తప్పయ్యే పరిస్థితి దశలో మనం తెలిసీ తెలియని ఇంగ్లీషు జడ్జిలు, లాయర్లు, సాక్షులు కూడా మాట్లాడడం, చివరకు సాక్షితెలుగులో చెబితే కోర్టు క్లర్క్ లు వారికి తోచిన రీతిలో ఇంగ్లీషులోని అనువదించి, (వధించి) ఒక నిర్జీవనమైన ఇంగ్లీషులో తీర్పులకు వాడుకుంటున్నారు. సిగ్గుపడాల్సిందే. ముఖ్యంగా రెండు తెలుగురాష్ట్రాలలో భాషలలో యాసలలో కూడా ఈ విధంగా సిగ్గుపడక తప్పదు. ముఖ్యమంత్రులైనా, ఉపముఖ్యమంత్రులైనా, మంత్రులై అదే గతి.
జాతికి మొత్తం ఒకే భాష ఎప్పుడవుతుంది?
పార్లమెంట్ లో రాబోయే రోజుల్లో ఒకే భాష, లేదో ఏదో ఒక భాష,హిందీ తెలుగు, తమిళ వంటి కోట్లమంది ఉపయోగించే భాషలలో జాతీయ భాషయై ఉండే అవకాశం రాజ్యాంగంలో ఉందన్నారు. పార్లమెంట్ ద్వారా జాతీయ భాష అని నిర్ణయించవచ్చు. అందుకు మొత్తం హిందూదేశంలో అంటే అన్ని రాష్ట్రాలలో కూడా హిందీ వచ్చి ఉంటే, చెప్పగలిగే ఉంటే, రాయగలిగి ఉంటే అది కూడా హిందీ జాతీయ భాష అయ్యేది.
వసుధైవ కుటుంబకం
ఏదైనా ఒక జాతీయ భాష లేకపోగా, అఖిల భారతదేశానికి తెలిసే ఒక భాష తెలిసిన వారెవరూ లేరు. ఈ పెద్దలు ఇంగ్లీషు జాతీయ భాష అనవచ్చునని ఉందనుకుంటారు. అచ్చ తెలుగు కూడా మన తెలుగుదేశం వారికి ఉందని తెలుసనుకుంటారు. ఈ రెండే కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే దశ. ఆర్టికల్ 343(3) ప్రకారం అటువంటి ఏకైక భాష చట్టం తేవడానికి పార్లమెంట్ లోని పెద్దలు కలిసిరాలేరు. ప్రయత్నాలు కూడా చేయలేరు. ఒకే దేశం, ఒకే వోటు, ఓకే ఎన్నికలు. ఒకే కోడ్ అనుకుని ఉపన్యాసాలు దంచేస్తున్నామే కాని. అందరికీ ఒక భాష నేర్పుదామనే సద్బుద్ధి ఎవరికి ఉంది? వసుధైవ కుటుంబకం అనేది మహా ఉపనిషత్తులో సంస్కృత పదబంధం ఉంది (దీని అర్థం, “ప్రపంచం ఒకే కుటుంబం”) ఈ శ్లోకం భారత (పాత) పార్లమెంటు ప్రవేశ హాలులో చెక్కారు. ప్రపంచం సంగతి తరువాత, మన ఇంత పెద్ద దేశానికి ఒకటే భాష ఉండాలనే ఆలోచన లేదు. కాని దక్షిణ, ఉత్తర, పశ్చిమ, తూర్పు అని విభజించే రాజకీయక్రీడలు, కేవలం ఎన్నికల కోసం చేస్తున్నారు.
ఐపిసి నుంచి బి ఎన్ ఎస్ అంటే హిందీ అవుతుందా?
మన జాతీయ విద్యావిధానంలో ఎన్ ఇ ఫి లో మాతృభాష ఉపయోగించాలని రాసుకున్నారు. ఆయా మాతృభాషలన్నిటికీ నేర్చుకోవాలని ఉందా? తమిళ మిత్రులు పొరుగు భాషపు పదాలు వాడరు. పక్క రాష్ట్రంవారు మళయాళం వారు వాడరు. ఆ ఊళ్లకు గుళ్లకు వెళితే ఆపేరు ఏమిటో తెలిసినా చెప్పరు. అందువల్ల మోసాలకు గురై నష్టపోతున్నారు కూడా. తెలుగు వారి గురించి విడిగా చెప్పుకోవాలి. అదేమంటే తెలుగు మాటలు కూడా ఇంగ్లీషులో రాసుకుంటాం. నేర చట్టాల పేర్లను ఇంగ్లీషునుంచి హిందీకి మార్చారు. నిజంగా గొప్ప సంస్కరణమే, కాని దాన్ని ఐపిసి నుంచి బి ఎన్ ఎస్ అని ఇంగ్లీషులోనే అంటున్నాం. సిగ్గు సిగ్గు.
మాతృభాషను నిజంగా ఎవరు నేర్చుకుంటున్నారు? ఎవరు నేర్పుతున్నారు? నేర్చుకోవడం సులభం అంటారే కాని, ఈ ముఖ్య, ఉపముఖ్యమంత్రులు వారి పిల్లలు ఈ మాతృభాష లో నేర్పుతున్నారనడం హిపోక్రసీ కాదా. బడి చదువులన్నీ చిన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాతృభాషలో చదువుకుని ఉండవచ్చనుకుంటున్నాను. కాని వారి కుమారులు, మనమలు, మనమరాళ్లు ఏ భాషలో నేర్పుతున్నారు సార్? (మరో సారి సిగ్గు పడాలి.) చంద్రబాబు సరే, లోకేశ్ బాబు ఇప్పుడు మంత్రిగారు కదా, ఎక్కడ చదువుకున్నాడు? జ్ఞానం అనేది తెలుగువారికి పెరుగుతుందని అనుకుంటే చంద్రబాబు నాయుడు తన కొడుకును మాతృభాషలో నేర్పించే జ్ఞానం ఎందుకు రాదు? ఇది కపటత్వం కాదా? (నేను కూడా ఇంగ్లీషు భాషలో నేర్పాను,కాని తెలుగులో కూడ బడిలో చెప్పకపోయినా, మేం విడిగా తెలుగు నేర్పుతున్నాం). ఇదే కపకత్వం, హిపోక్రసీ.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగం చేసే తెలుగుదైనమాతృభాష ప్రేమ పెరిగిపోయిందని అనుకుందాం. తెలుగు మీడియం స్కూల్ ఉండాల్నా లేక తీసిపారేద్దామా? ఇంతకుముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం బడులే ఉండాలని అన్నారు. నిజమైన మాతృభాష జ్ఞానాన్ని పెంచుతుంది అని నమ్మితే. ఇది నిజమే కానీ ఎవరూ కాదనలేరంటే, మనం ప్రాక్టికల్ గా ఉండాలంటున్నారు. ఎన్ ఇ పి విధానంలో రాసుకున్నా ఇదే అంటున్నారు. ఇది శాస్త్రీయంగా రుజువైంది అనీ అది విశ్వమంతా నిరూపితమైంది ఎన్ ఇ పిలో పదేపదే రాసుకున్నారు. హిపోక్రసీ. (మరో సారి సిగ్గుపడాలి)
జర్నలిజం ప్రొఫెసర్, మాజీ ఎం ఎల్ సి గారు శ్రీ కె నాగేశ్వర్ గారు ఓ ప్రశ్న వేసారు. ‘‘ఇది ఏమిటంటే ఇంగ్లిష్ ప్రపంచ వాణిజ్య భాష. మనం ఎవరిని ఇష్టపడం, వ్యాపారం ఎలా జరుగుతుంది? జపాన్, చైనా, జర్మనీ, రష్యా, రష్యా అంతర్జాతీయ వాణిజ్యం, అంతర్జాతీయ మార్కెట్లు, ఇవన్నీ ఆంగ్లంలోనే. ఎందుకంటే ఇంగ్లిష్ డాలర్లలో ఉంటుంది. ఇది ప్రపంచ వాణిజ్య భాష. ఇది ప్రపంచ కమ్యూనికేషన్ భాష. ప్రపంచ విజ్ఞానం కలిగిన భాష. జ్ఞానపు భాష ఇది జ్ఞానానికి మూలం ఇది అని చంద్రబాబునాయుడు’’ వివరించారు. ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ డాక్యుమెంట్ తెలుగు నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావాలి. ఎఫ్ బీ ఐ పరిశోధన అవసరం. అంతా తెలుగులోనే ఉంటుందా? తెలుగులో సుప్రీంకోర్టు తీర్పు వస్తుందా? సుప్రీంకోర్టు తీర్పులో గూగుల్ ట్రాన్స్ లేట్ ను ఎన్ని తెలుగులో వాడుతున్నారు. కానీ అసలు తెలుగులో ఎన్ని కోర్టు తీర్పులు వచ్చాయి? వైజ్ఞానిక పరిశోధన, వైద్య పరిశోధన తెలుగు లో ఉందా? ప్రపంచానికి ఆంగ్లంలో పరిజ్ఞానం ఉంది, వాస్తవంలో అది ఆధిపత్యం చెలాయిస్తుంది. మన కోరిక సరే కాని అది వాస్తవం.
చైనా, జర్మనీ, ఇటలీ వంటి దేశాలలో సొంత భాషనే వాడుకుంటున్నారని తెలియడం లేదా? రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ఆంగ్ల విద్యను అభ్యసించాలి. పేద పిల్లలకు ఇంగ్లిష్ విద్య దొరకదు. మన తెలుగు మాట్లాడే ‘తెలుగు దేశమా’అని చెప్పగలరా? ముఖ్యమంత్రి, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ తెలుగు మీడియా కావాలనీ, తెలుగు సులభంగా నేర్చుకోవచ్చనీ. ఇది కుల భాషా కాదనీ, అందరి తెలుగు భాష అని అంటున్నారు. తెలుగు చదివే వారందికీ వారిదే తెలుగు భాష అవుతుంది. అది అధికార భాష కేవలం ఈ రెండు రాష్ట్రాల్లో ఉండాలి. త్రిభాషా సూత్రం (ఇంగ్లీషు, హిందీ, ప్రాంతీయ భాషలు) అనీ మనమే అంటున్నాం. మరి ‘‘జాతీయ భాష’’ అనేమాట ఎక్కడునుంచి వచ్చింది?
ఆర్టికిల్ 343 కీలకం
ఆర్టికల్ 343 కింద రాజ్యాంగ పరిషత్తు చర్చలలో ఈ ప్రశ్న ప్రస్తావన వివరంగా వచ్చింది. బ్రిటిష్ ఇండియాలో విదేశమన్నా స్వదేశమన్నా జాతీయ అన్నా అంతర్జాతీయ అన్నా అది 1947 ముందునుంచి, ఇప్పడిదాకా ఇంగ్లిష్ వాడుకుంటున్నాం. తెలియకపోయినా ముక్కలు ముక్కలుగా నైనా వాడుతున్నాం. హిందీతో సహా సమానంగా అన్ని భాషలను కాపాడుకోవాలనే ఆలోచనే వీరికి లేదు. పైగా శాసనసభలో ఉపన్యాసాలు దంచుతున్నారు.
బ్రిటిష్ వారు విదేశీ భాష నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన తరువాతకూడా ఆంగ్లం అధికార భాషగా అవతరించింది. అనేకానేక రాష్ట్రాలలో ఇంగ్లీషు అధికార భాషగా ఉంది మరి ప్రజలు వాడుకునేదేమిటి? అది జాతీయ భాష అనేమాట ఎక్కడనుంచి ఉంది? ఎంత అన్యాయం.
డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్: రాజ్యాంగ పరిషత్తు లో చర్చ
మన భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యులుగా ఉన్న రాజనీతి వేత్తలు నేతలు వారి ప్రతినిధులు హిందీ అనేది భారతదేశానికి ‘‘చెందిన భాష’’ మాత్రమే. కోట్లాది మందిలో ఇది హిందీయేతర రాష్ట్రమని రాజ్యాంగ రచయితలో ప్రముఖులైన గోవిందాస్ అన్నారు. హిందీ దేవనాగరి, ద్రావిడ భాషల నుంచి వస్తుంది. తెలుగు, తమిళం, మలయాళం కన్నడ లిపి పూర్తిగా భిన్నమైన ద్రావిడ భాషలో ఉన్నాయి. ఈ రెండు భాషలు హిందీ, దేవనాగరి లిపి లో ఉన్నాయి.
దక్షిణ భారతదేశం నుంచి హిందీయేతర రాష్ట్రాల వరకు రాజ్యాంగ పరిషత్తులో తీవ్ర చర్చ జరిగింది. తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కీలకమైన అంశాలు చెప్పారు. జాతీయ భాష అంటే దేశంలోని ప్రతి ప్రాంతంలో భాష వాడుకునే శక్తి ఉండాలని అన్నారు. అందరికీ అందుబాటులో ఉన్నా, కొందరికి మాత్రమే తెలిస్తే అది జాతీయ భాష అవుతుందా? అది కేవలం అధికార భాష అవుందని రాజ్యాంగ పరిషత్ తొలి అధ్యక్షుడు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ వివరించారు. అందరు ఒప్పుకుంటే, మెజారిటీ ఉంటే అంగీకరించితే అది జాతీయ భాష అయ్యే అవకాశం ఉంటంది. చట్ట బద్ధత వస్తుందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
నిబంధనలు చర్చ
మన భారత రాజ్యాంగంలో అధికారిక భాషకు సంబంధించినవి XVII భాగంలో చాలా ఉన్నాయి. XVII భాగంలో మరో నాలుగుఅధ్యాయాలు, తొమ్మిది ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికిల్స్ లో‘అధికారిక భాష’ (ఆర్టికల్స్ 343, 344); ‘ప్రాంతీయ భాషలు’ (ఆర్టికల్స్ 345-347) అని రెండు భాగాలు ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రాల అధికార భాషలకు ప్రాంతీయ భాషలని పేర్కొంటున్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టుల భాష, చట్టాలు (ఆర్టికల్ 348) చేయడానికి వాడే భాష అని విడిగా ఉందనుకోవలసిందే. నిజానికి చట్టాల భాష అని జనం భాష అని వేరే వేరే ఉంటే ఇంకా కష్టం అవుతుంది.
అవి ‘అధికారిక భాషలే’ కాని ‘జాతీయ భాష’ కాదు
అదిగాక రాజ్యాంగం XVII భాగం లో అధికారిక భాషకు నిబంధనలు ముఖ్యమైనవే ఉన్నాయి. పార్లమెంటు (భాగం V, అధ్యాయం II) రాష్ట్ర శాసనసభలు (భాగం V, అధ్యాయం III) గురించి చెప్పే అధ్యాయాల్లో, శాసనసభా ప్రక్రియల భాషకు సంబంధించి, ఆర్టికల్స్ 120, 210 లు నిబంధనలు వివరిస్తున్నాయి. III భాగంలోని ప్రాథమిక హక్కుల విభాగంలోని ఆర్టికల్స్ 29, 30 సంస్కృతిక విద్యా హక్కులను గురించి పేర్కొన్నాయి. భాషాపరమైన తక్కువమందున్న మైనారిటీల హక్కులు గ్యారంటీ ఇస్తున్నాయి. ఎనిమిదవ షెడ్యూల్ కొన్ని భారతీయ భాషలకు ‘అధికారిక’ హోదాను కల్పించాయి.
ఒకే భాషలో మైనారిటీ సమస్య: ఆర్టికిల్ 3
‘‘ద ఆక్స్ పోర్డ్ హాండ్ బుక్ ఆఫ్ ద ఇండియన కాన్ స్టిట్యూషన్’’ అనే ఉద్గ్రంధాన్నిఎడిట్ చేసిన ముగ్గురు ప్రముఖులలో ఒక రచయిత సుజిత్ చౌదరీ గారు రాజ్యాంగంలో భాష కుసంబంధించిన వివరమైన వ్యాసం రాసారు.
ఇందులో భాష కోసంమనంప్రత్యేకంగా అనకపోయినా ఆర్టికిల్ 3 వంటి నిబంధనలో కూడా ప్రస్తావన ఉంది. ఉదాహరణకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన. ఆర్టికల్ 3, ఇది పార్లమెంటుకు రాష్ట్రాల భౌగోళిక పరిమితులను మార్చడానికి కొత్త రాష్ట్రాలను సృష్టించడానికి అధికారాన్ని ఇస్తున్నది. ఇక్కడ భాషాపరమైన మైనారిటీల హక్కులు ఉపయోగపడింది తెలంగాణా, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాల విషయంలో రాజ్యాంగమైన, న్యాయమైన అంశాలు ఉన్నాయి.
హిందీని ప్రభుత్వ అధికార భాషగా స్వీకరించాలంటే వ్యతిరేకత చాలా కాలం నుంచి అందరికీ తెలుసు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. విస్తృత వైవిధ్యాన్ని కలిగిన ప్రపంచంలో భారతదేశ సమగ్రతను కాపాడేందుకు ఒకతాటి పౌరసత్వాన్ని ఏర్పరచాలనే ఉద్దేశంతో అనేక భాషలను అధికారిక భాషలున్నాయని ఉండవలసి వచ్చింది. అందుకు మన అనేక ఉదాహరణలు అనుభవాలు, సామాజిక, ప్రాంతీయ, రాజకీయా అనుభవాలు ఉపయోగిస్తాయి. ముఖ్యంగా
- సాధారణ భాష ద్వారా అక్షరాస్యతను ప్రోత్సహించడం ద్వారా సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ఒక లక్ష్యం.
- ప్రజాస్వామిక, జాతీయ రాజకీయాలను సాధించే ఒక సామాన్య వేదికను ఉండాలనేది మరో లక్ష్యం.
- ప్రజలు ప్రభుత్వ పరిపాలనతో నేరుగా సంభాషించగలగేలా ఒక స్వదేశీ భాషను ప్రోత్సహించడన్నది ఒక కీలకమైన ఆలోచన.
అని సుజిత్ చౌదరీ వివరించారు. అందులో హిందీ మాట్లాడని రాష్ట్రాల ప్రజలు హిందీకి ప్రాధాన్యత ఇచ్చి ప్రాంతీయ భాషలకు అధికారిక హోదా కల్పించడం అవసరం అనుకున్నారు. అది నిజమే కూడా. ఆర్థిక, రాజకీయ అధికారాన్ని హిందీ మాట్లాడేవారి వైపు బలవంతరంగా మళ్లించేవిధంగా విధానాలు అమలు చేయకూడదని అన్నారు. కనుక కేంద్రంలో ఇంగ్లీష్ను ఉపయోగించే కొనసాగించేందుకు, ప్రాంతీయ భాషలకు అధికారిక హోదాను కల్పించేందుకు పోరాడారు. అదే ఇప్పడికీ పనిచేస్తున్నది. దాని అవసరం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.
భారతదేశ భాషా రాజకీయాలలో భాషా స్థితి మార్పుల వెనుక ఉన్న ముఖ్యమైన అంశాలు భౌతిక వనరుల పట్ల పోటీ కూడా ఆలోచించాలి. అధికారిక భాషపై చర్చలు కేవలం సాంస్కృతిక విభేదాలను మాత్రమే కాకుండాకాదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాల కోసం జరిగే పోటీని కూడా ఉంటాయి. అందులో సమస్యలు తీవ్రంగా ఉంటాయని సుజిత్ చౌదరీ అన్నారు.
భారత రాజ్యాంగంలోని భాషా నిబంధనలు రాజ్యాంగ రూపకల్పన దాని అమలుకు సంబంధించి అనుభవం చెప్పే పాఠాలు ఏమంటే అధికారిక భాషను అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో తప్పనిసరిగా ఉపయోగించి తీరాలనే అభిప్రాయాన్ని భారత రాజ్యాంగం ఒప్పుకోలేదు. స్పష్టంగా తిరస్కరిస్తుంది. దీనిలో అధికారిక భాష ఎంపికను వాడుకోవాలి, స్థానిక స్థాయిలో భాషను ఏవిధంగా ఉపయోగించాలి. ప్రత్యేకమైన విధానాలు సాధనాలు ఉపయోగిచడం సాధ్యమా అని ఆలోచించాలి. కనుక మొత్తం దేశానికి ఒకే భాష సాధ్యం కాదు. మరికొన్ని అధికార భాషాలు చేర్చడం ‘మన రాజ్యాంగ రాజీ’ సాధించడానికి సాధనంగా మారుతుంది,
రాజ్యాంగంలో XVII భాగంలోని ప్రత్యేక నిబంధనలు రాజ్యాంగ రాజీని సాధించడానికి వివిధ వ్యూహాలను ఉపయోగించాయి, (ఆర్టికల్ 343, ఆర్టికల్ 344, ఆర్టికల్ 345, ఆర్టికల్ 3పరిశీలించండి).
అధికారిక భాష రాజకీయాలకు ప్రాముఖ్యమైన వేదికలు రాజ్యాంగ సభ, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు అయినప్పటికీ, కోర్టులు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయి, ముఖ్యంగా మైనారిటీ భాషా విద్యపై కేసుల పరిష్కారంలో ఆర్టికల్ 30 ఉపయోగపడింది.
న్యాయాస్థానాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా భాషను ఏ విధానాల ద్వారా నిర్ణయించగల హక్కును, దానితో మైనారిటీ భాషా విద్యా హక్కుల మధ్య సంబంధాన్ని తీర్పులలో సమర్థవంతంగా విశ్లేషించాయి.
ఇదంగా ఎందుకంటే ఈ ప్రక్రియలో, స్వాతంత్ర్యోద్యమం నుంచి ఏర్పడిన సమగ్ర భారతీయ పౌరసత్వ భావన. మనదేశానికి అన్ని భాషా సముదాయాలకు ఆధారమైన భూమిక గా అవుతుంది. మరో రకమైన పౌరసత్వ భావన అవసరమా లేదా అని కూడా న్యాయాస్థానాలు చర్చించాయి.
రాజ్యాంగ నిర్మాణ పరిషత్తు (రాజ్యాంగ అసెంబ్లీ) లో ఏది అధికారిక భాష అనే అంశంపైనే పెద్ద వివాదం చెలరేగింది. బ్రిటిష్ పాలనలో ఒక్క శాతం మంది మాత్రమే ఇంగ్లీష్ లో పరిపాలన సాగింది. దాదాపు పన్నెండు ప్రాంతీయ భాషలు ఉపయోగంలో ఉన్నాయి. అందులో హిందీని ఎక్కువమంది, దాదాపు 40 శాతం మంది మాట్లాడుతున్నారు. కొందరు మాత్రమే ఇతర భాషలు మాట్లాడగలరు. దక్షిణ ప్రాంతంలో చాలా తక్కువమందికి హిందీ తెలుసు. మన సొంత భాషలు ఉన్నాయి. పొరుగు భాషలు అర్థం కాదు. వాడలేరు. అందరికీ ఇంగ్లీషు వచ్చినవారని అనలేం. కనుక అనేకానేక భాషలను కలుసుకుంటూ ఇంగ్లీషు ద్వారా కోర్టుల్లో, డిల్లీలో అనుసంధానం చేస్తూ ఉంటున్నాయి. కనుక హిందీ, ఇంగ్లీషు అధికార భాషలు రెండూ ఉండాల్సిందే. కాని అది సరిపోదు. కనుక ఆర్టికిల్ 343 హిందీ మన అధికారిక భాష అని మొదట ప్రకటించారు. హిందీ విజయం సాధించింది అంటూ అక్కడ ఆపలేము. వెంటనే 343(2) అవసరమైంది. ఇంగ్లీషు స్థానంలో మరో భాషను తెచ్చుకోలేక, మొదట 15 సంవత్సరాల దాకా ఇంగ్లీషునే అధికారిక భాష కావలసిందే అని అర్థమైంది. 343(3) కింద నిరవధికంగా శాసన భాషగా ఇంగ్లీషు కొనసాగుతూ వచ్చింది. కనుక ఇంగ్లీషుతో మరొక భాష జతతో తాత్కాలిక ‘అధికార భాష’ గా నడవాల్సిందని తప్పలేదు. ఆర్టికిల్ 348(1)(బి)(1) కింద ఇంగ్లీషు ప్రాథమిక భాషగా అంటూ, నిరవధికంగా ద్వితీయమైన భాషగా నడపవలసి వస్తున్నది. హిందీగా ప్రత్యామ్న భాష గా ప్రకటించడానికి ఎన్నో ప్రయత్నాలు, కృషి అందరికీ హిందీ తెలుసుకునే పథకాలు అమలు చేసే పనేదీ చేయకుండా ‘‘తరువాత చూద్దాంలే’’ అని ప్రభుత్వాలు వాయిదావేయడం నిష్క్రియ, మనది.
కేంద్ర, రాష్ట్రాల భాష
ఆర్టికిల్ 346 కింద భారత కేంద్ర, రాష్ట్రాల మధ్య రచించే భాషను ఇంగ్లీష్ అని నిర్ణయించారు. ఇది అవసరం. లేకపోతే ఒక రాష్ట్ర భాషనుంచి మరో ప్రాంత భాషకు చెప్పడం సాధ్యం కాదు. ఒక రకంగా ఇంగ్లీషు వాళ్లు ఈ దేశానికి ఎంతో గొప్పమేలు చేసారు. ఆర్టికిల్ 343 దేశపాలనా భాష కూడా ఇంగ్లీషే. అయినా అది జాతీయ భాష కాదు.
ఆర్టికిల్ 350 చూడండి. ప్రతివ్యక్తికీ తన భాషలో ఏ అధికారికైనా తన బాధ చెప్పుకునే హక్కు ఉందని ప్రకటించింది. కాని ఆర్టికిల్ 343 కింద దేశపాలనలో అంతర్గత భాష ఇంగ్లేషే అవుతుంది. ఆర్టికిల్ 344 కింద ఇంగ్లీషునుంచి హిందీలోకి మార్చడానికి ఒక ప్రత్యేక కమిషన్ నియమించింది. కాని బి గి ఖేర్ అధ్యక్షుడుగా ఉన్నపుడు కొట్టివేశారు.
ఐ ఎ ఎస్ వంటి పరీక్షలలో తప్పనిపరిగా ఇంగ్లీషులో ఉండాలని నిబంధన చేస్తే డిల్లీ హైకోర్టు ఆర్టికిల్ 14కు అది భంగకరమని మంచి తీర్పు ఇచ్చింది. లేకపోతే ఇతర భాషలపైన ఫెడరల్ సిద్దాంతానికి వ్యతిరేకమై, ఇంగ్లీషు నియంతృత్వం విధిస్తే అందరి భాషలై విధ్వంసమైతాయని తెలియడం లేదా? ఆయా భాషల్లో పోటీ పరీక్షలు నేర్చుకోవడం ఉద్యోగాలు సాధించడం ఏ విధంగా జరుగుతుంది. చివరకు తెలుగులో బతకడమే అసాధ్యం చేస్తారా? ముఖ్యమంత్రిగారు ఉపముఖ్యమంత్రి జవాబు ఇస్తారా?
మాడభూషి శ్రీధర్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.