
2017 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వంలో గుంటూరు ఎంపిగా ఉన్న గల్లా జయదేవ్, అప్పటి ఆర్&బి శాఖా మంత్రి అయ్యన్న పాత్రుడు(ప్రస్తుత శాసన సభ స్పీకర్) శంకర్ విలాస్ బ్రిడ్జిని పరిశీలించి, అనంతరం 167 కోట్లతో లాడ్జి సెంటరు నుంచి హిందూ కాలేజీ జంక్షన్ వరకు ఫ్లైఓవర్ నిర్మిస్తామని, ఈ లోపు ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ముందుగా ఆర్యూబీ (రైల్ అండర్ బ్రిడ్జి) నిర్మిస్తామని ప్రకటించారు.
గుంటూరు ఎంపి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి సేతు బంధన్ పథకం క్రింద 98 కోట్ల నిధులు సాధించుకు వచ్చాము. కాబట్టి ఆ నిధులకు లోబడే శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తి చేయాలని హడావిడిగా డిపిఆర్ తయారు చేయటం, ఆమోదించటం, టెండర్ ప్రక్రియ పూర్తి చేయటం మొత్తం చకచకా పూర్తి చేయించారు.
శంకర్ విలాస్ బ్రిడ్జి చరిత్ర..
బ్రిటీష్ కాలంనాటి నుంచి విద్యా, వైద్య రంగాలకి బీజంపడి, అనతికాలంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో(అప్పటి మద్రాసుతో సహా) కీలక నగరంగా అభివృద్ది చెందింది గుంటూరు. నగరానికి నడిబొడ్డున కోస్తా జిల్లాల ప్రజలందరికీ వైద్య సేవలు అందించటానికి బ్రిటీషు పాలకులు 1848 సంవత్సరంలోనే పదకొండు(11) ఎకరాల స్థలంలో ప్రభుత్వ వైద్యశాలను ప్రారంభించారు. ఆనాటి నుండి అంచెలంచలుగా అభివృద్ధి చెందిన ఈ వైద్యశాల నేటికీ రోజుకు దాదాపు నాలుగు వేల మంది వైద్య సేవల కోసం బారులు తీరే స్థాయికి ఎదిగింది. దానికి అనుబంధంగానే వైద్య విద్యను అనుసంధానం చేస్తూ గుంటూరు మెడికల్ కళాశాల 1946 జులై 1 నుంచి ప్రారంభమయి, నాటి నుండి నేటి వరకు వేలమంది ఉద్దండులయిన వైద్యులకు తెలుగు రాష్ట్రాలకే కాక ప్రపంచ స్థాయికి ఎదిగేలా చేసింది.
అనునిత్యం ప్రభుత్వ వైద్యశాలకి వెళ్లే ప్రజలు, ఇప్పటి బ్రిడ్జి స్థానంలో ఉన్న రైల్వే గేటు వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. దీనిని గమనించిన స్వాతంత్ర సమరయోధులు ఆనాటి మునిసిపల్ చైర్పర్సన్ నడింపల్లి నరసింహారావు చొరవచూపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 1958లో శంకర్ విలాస్ బ్రిడ్జిని పూర్తిచేసి, ప్రజల ఇక్కట్లను తప్పించి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
నేటి గుంటూరు..
ఈ డెబ్భై సంవత్సరాల కాలంలో గుంటూరు నగరం బ్రిడ్జికి ఇరువైపులా రెండు ఆర్ధిక కేంద్రాలుగా విస్తరించింది. తూర్పు వైపున వందల సంఖ్యలో ప్రయివేటు వైద్యశాలలు, బంగారు ఆభరణాల తయారీ కేంద్రాలు, క్లాత్ మర్చంట్ హోల్సేల్ వ్యాపారస్తులు, నిత్యావసర సరుకుల హోల్సేల్ వ్యాపారస్తులు, పండ్లు, పూలు, కూరగాయల హోల్ సేల్ దుకాణాలతో ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఎదిగింది. ఒక అంచనా ప్రకారం తూర్పు నగరంలోనే ప్రభుత్వ వైద్యశాల కాకుండా షుమారు 250 ప్రయివేటు వైద్యశాలలు, అందులో ఆరోగ్యశ్రీ ఉన్నవి షుమారు 75 వైద్యశాలలు నెలకొన్నాయి. అంటే సుమారు 1200 మంది వైద్యులు, ఐదు వేల మంది పారామెడికల్ సిబ్బంది, 100 అంబులెన్స్లు కలిగి ఉన్నాయి. అంటే వాణిజ్యం, వైద్య కేంద్రంగా తూర్పు నగరం అభివృద్ధి చెందింది. చుట్టు ప్రక్కల ఆరు లేక ఏడు జిల్లాల నుంచి వైద్యం కోసం ప్రతి రోజు గుంటూరుకు వచ్చే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. ప్రభుత్వ వైద్యశాలకు 108, ప్రైవేటు అంబులెన్స్లు 100కు పైగా తిరుగుతుంటాయి.
ఇక పశ్చిమ గుంటూరు మొత్తం విద్యాకేంద్రంగా, వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. 1980 దశకంలో రవి కాలేజీతో మొదలైన ప్రైవేటు విద్యా వ్యవస్థ నేడు నగరంలో పొలిమేరల్లో 20 ఇంజనీరింగు కాలేజీలు, రెండు ప్రైవేటు వైద్య కళాశాలలు, 130కి పైగా ప్రైవేటు స్కూళ్ళు, భాష్యం, నారాయణ, చైతన్య వంటి కార్పోరేట్ విద్యా సంస్థలు విస్తరించాయి. శంకర్ విలాస్ బ్రిడ్జికి పశ్చిమ భాగాన మొత్తం వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెంది, దాదాపు రెండు కిలోమీటర్ల మేర వ్యాపార వర్తక సముదాయాలు, మాల్స్ విస్తరించాయి. నిత్యం వందల సంఖ్యలో ఆటోలు, కాలేజీ బస్సులు ఈ విద్యార్థుల కోసం నగరమంతా ప్రయాణం సాగిస్తుంటాయి. వేల మంది విద్యార్థుల కోసం, హాస్టళ్ళు, వసతి గృహాలు పశ్చిమ ప్రాంతమంతా విస్తరించాయి. పశ్చిమ ప్రాంతమంతా వివిధ కాలనీలుగా, పేటలుగా ప్రణాళికా బద్ధంగా విస్తరించటం వలన ఈ రోజు వందల సంఖ్యలో అపార్ట్మెంట్లు, ఆకాశ హర్మ్యాలు నిర్మించబడ్డాయి. నగరంలో ప్రయాణించే కార్లలో 70 శాతం, బస్సులలో 90 శాతం ఇటు నుంచే రవాణా సాగిస్తాయి. ఆసియాలోనే అతి పెద్ద మిర్చియార్డు అటువైపే కేంద్రీకరించబడింది. కోల్టు స్టోరేజీలు, స్పిన్నింగ్ & జిన్నింగ్ మిల్లులు ఇటువైపే విస్తరించి ఉన్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజా ప్రతినిధుల నివాసాలు కూడా పశ్చిమ నగరంలో కేంద్రీకరించబడి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే నగరంలోని 11 లక్షల జానాభాలో 60 శాతం మధ్య తరగతి, 90 శాతం ఎగువ మధ్యతరగతి లేదా సంపన్నుల ఆవాస కేంద్రంగా పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందింది.
శంకర్ విలాస్ బ్రిడ్జి సేవలు భవిష్యత్తు అవసరాలు..
ఒక్కమాటలో చెప్పాలంటే, దేశమంతటిని కలిపే రైల్వే లైనులు గుంటూరు నగరాన్ని రెండు ముక్కలుగా చేసినా, శంకర్ విలాస్ బ్రిడ్జి ఆ రెండు భాగాలను రెండు సంస్కృతులుగా, రెండు ఆర్థిక రాజధానులుగా, రాష్ట్ర ఖ్యాతి గాంచిన విద్యా, వైద్య కేంద్రాలు నగర పౌరులకు అనుసంధానం చేసి – అన్నతమ్ముల అనుబంధంలా పెనువేసుకుపోయేలా అభివృద్ధి చేసింది. రెండు మూడు తరాల ప్రజలకు ఆత్మ బంధువు అయ్యింది. కాగా, నేడు పెరిగిన జనాభా దృష్ట్యా, విస్తరిస్తున్న నగరం దృష్ట్యా, ఇప్పటికే రోజులో సుమారు 50వేల వాహనాల రవాణా బాధ్యతను మోస్తున్న బ్రిడ్జిని, రానున్న వంద సంవత్సరాల అవసరాలు, ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పాలకులు, ప్రజలు ఈ బ్రిడ్జి స్థానంలో ఒక నూతన ఫ్లై ఓవర్ కావాలని, అవసరముందని గుర్తించారు. బ్రిడ్జికి ఇరువైపుల విద్యా, వైద్యం, వ్యాపార కేంద్రాలు ఈ డెబ్భై వసంతాలలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. కాబట్టి వీటికి సాధ్యమైనంత వరకు నష్టం వాటిల్లకుండా ఒక ఐకానిక్ నిర్మాణం జరగాలని ప్రజలు కోరుకున్నారు.
అందుకు అనుగుణంగానే 2014లో తెలుగుదేశం ప్రభుత్వంలో గుంటూరు ఎంపిగా ఉన్న గల్లా జయదేవ్, మంత్రి అయ్యన్నపాత్రుడు 167 కోట్లతో ఒక ఐకానిక్ ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదన, డిజైను రూపకల్పన చేసి, నిర్మాణం చేపడతామని ప్రకటించారు. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్య రీత్యా ఈ రహదారిని ఆరులైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తేనే ప్రజలకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవని, అందుకనే నాలుగు లైన్ల ఫ్లైఓవర్ని నిర్మించి రెండు వైపుల ఆర్యుబి ఏర్పాటు చేసి ప్రజల అవసరాన్ని ఆకాంక్షలు తీరుస్తామని ప్రకటించారు.
జెఏసి ఎందుకు ఏర్పడింది..
అధికారంలోకి తిరిగి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వంలో గుంటూరు ఎంపి, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నగరానికి మంచి చేయాలనే ఆలోచనతోనే మరుగునపడిన ఫ్లైఓవర్ ప్రాజెక్టు సాధించటం కోసం కేంద్రం వద్ద కృషి చేసిన మాట వాస్తవం. అయితే సమస్య ఎందుకొచ్చింది ? బ్రిడ్జి అవసరాలను బట్టి నిధులా? లేక నిధుల కేటాయింపులను బట్టి బ్రిడ్జా? ఇక్కడ అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. గతంలో ఇదే ప్రభుత్వానికి చెందిన ఎంపి, మంత్రి ప్రతిపాదించిన 167 కోట్ల ఐకానిక్ ఫ్లైఓవర్ హిందూ కాలేజి సెంటరు నుంచి లాడ్జి సెంటర్ వరకు ఉంది. ఫ్లైఓవర్కు రెండు వైపుల ఆర్యుబిలు కూడా ఉన్నాయి. దీని వలన రెండు లాభాలు ఉన్నాయి. మొదటిది కిలో మీటరకు పైగా ఉండే ఈ నిర్మాణం వలన ఇరువైపుల వ్యాపార, వర్తక, వైద్య, విద్యాలయాలకు అతి తక్కువ నష్టంతో పూర్తవుతుంది. రెండోది ముఖ్యమైనది ఏమిటంటే ఇది సింగల్ పిల్లర్ ఫ్లై ఓవర్ కనుక రెండు వైపులా ట్రాఫిక్కి ఎటువంటి అవాంతరాలు లేకుండా సాగిపోవచ్చు. వాహనాల పార్కింగ్ సమస్య కూడా ఉండదు. సర్వీసు రోడ్డు సమస్య ఉండదు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ముందే రెండు ఆర్యుబిల నిర్మాణం జరుగుతంది. కాబట్టి, నిర్మాణం రెండు, మూడేళ్ళ కాలం పట్టినా ప్రజల రవాణాకు ఎటువంటి ఆటంకం ఉండదు.
అసలు కథ ఇక్కడే మొదలయ్యింది. ఫ్లైఓవర్ నిర్మాణానికి కావాల్సిన నిధులు సేకరించే క్రమంలో కేంద్రమంత్రి ఇతర మార్గాలన్నిటినీ వదిలేసి, నేరుగా సేతు బంధన్ పథకం కింద 98 కోట్లు మంజూరు చేయించుకు వచ్చారు. సేతు బంధన్ పథాకాన్ని రాష్ట్ర, జాతీయ రహదారులలో నిర్మాణంలో గ్రామీణ ప్రాంతాలలో రైల్వే లైనులు ఆటంకం కలిపిస్తుంటే ఆర్ఓబి లేదా ఆర్యుబిలను నిర్మించడానికి రూపకల్పన చేయబడిన పథకం. ఈ పథకం క్రింద వందకోట్లకు మించి నిధులు ఇవ్వబడవు. ప్రత్యామ్నాయ వనరుల కోసం అన్వేషించకుండా, నేరుగా ఈ పథకంలో బడ్జెటును, రాష్ట్ర రాజధాని అమరావతి జిల్లా కేంద్రంలో, దాదాపు 11 లక్షల జనాభా ఉన్న నగరానికి ఇది తేవటం మొదటి తప్పు. రెండవ తప్పిదం గత సంవత్సరం అక్టోబర్ నెల 19వ తేదీన రాష్ట్ర రోడ్డు& భవనాల శాఖ అధికారికంగా ఒక ఫ్లైఓవర్ డిజైన్ను రూపొందించి విడుదల చేశారు. 1.4 కిలోమీటర్లు ఉన్న ఈ ఫ్లైఓవర్ అరండల్ పేట 12వ లైను నుండి ఉల్ఫ్ హాల్ కాంపౌండ్ దగ్గర ఉన్నటువంటి అమరావతి బస్ స్టాప్ వరకు డిజైను చేశారు. దీనికి ఎంత బడ్జెట్ అవసరమో లెక్కలు వేయకుండా, కేంద్ర మంత్రి సేతు బంధన్ పథకంలో 98 కోట్లు తెచ్చారు. దానికి అనుగుణంగా మళ్ళీ డిజైను మార్చి, ప్లై ఓవర్ని బ్రిడ్జిగా మార్చి బ్రిడ్జి నిడివి 930 మీటర్లుకు కుదించేశారు. ఇప్పుడు ఈ నమూనా ప్రకారంమే బ్రిడ్జి కట్టబోతున్నామని ఎవరు అడ్డుకున్నా ఆగదని ప్రకటిస్తున్నారు.
జాయింట్ యాక్షన్ కమిటీ పోరాటం ఇక్కడి నుండే ఆరంభమయ్యింది. ఎన్నికలలో గెలిచిన తర్వాత మీరే ప్రకటన చేసి, ఒక అద్భుతమైన ఐకానిక్ ఫ్లైఓవర్ రాబోతున్నదని ప్రజలలో ఆశలు రేపారు(గల్లా జయదేవ్ డిజైను). తరువాత మీరే అక్టోబర్లో దాన్ని కుదిస్తూ 1.46 కిలోమీటర్ల ఫ్లైఓవర్ డిజైను విడుదల చేశారు. డిజైనులను బట్టి ఎంత బడ్జెటు అవసరమవుతుందో లెక్కలు వేయకుండా, వనరుల సమీకరణ గురించి ఆలోచించకుండా, సేతు బంధన్తో 98 కోట్లు తెచ్చి, నిధులను బట్టి బ్రిడ్జి స్వరూపాన్ని మార్చేశారు. అవసరాలను బట్టి నిధుల కోసం ప్రయత్నించకుండా, నిధులని బట్టి అవసరాలను కుదింపచేయటం ఎట్టి పరిస్థితులలోను సహేతుకం కాదు. అందులోనూ ఒక దీర్ఘకాలిక బహుళ ప్రయోజనాలను తీర్చే ఇటువంటి ప్రాజెక్టులకు ఈ హ్రస్య దృష్టి అస్సలు పనికి రాదు. జాయింట్ యాక్షన్ కమిటీ మొదటి నుంచి సేతుబంధన్ స్కీమ్ను గుంటూరు నగరానికి వర్తింపచేయటాన్ని వ్యతిరేకిస్తుంది. కేంద్ర మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్ని మాటలు తిప్పితిప్పి చెప్పినా, ఈ స్కీమ్ ద్వారా అంతకుమించి రావు కాబట్టే బహుళ ప్రయోజనాల ప్రాజెక్టును తాకట్టు పెట్టి, ఎందుకు ఉపయోగం లేని మరొక బ్రిడ్జిని రూపకల్పన చేశారు.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం నడుస్తుంది. దానికి ఇచ్చిన కౌంటర్లో ప్రభుత్వ అధికారులు పేర్కొన్న రెండు అంశాలను ప్రస్తావిస్తున్నాము. ప్రకాశం, బాపట్ల జిల్లాలలోని టంగుటూరు, చీరాలవద్ద ఇప్పటికే మంజూరైన సేతుబంధన్ ఆర్ఓబి నిధులను మళ్ళించి, ఆ రెండు ప్రాజెక్టుల విధులను కేంద్ర మంత్రి గుంటూరు బ్రిడ్జి కోసం కేటాయించేలా కృషి చేశారని రోడ్లు, భవనాల శాఖ హైకోర్టులో లిఖిత పూర్వకంగా తెలిపింది. ఇక్కడ రెండు అంశాలు స్పష్టం అవుతున్నాయి. మీకు మొదటి నుంచి ఊదరగొడుతున్న ఐకానిక్ ఫ్లైఓవర్ కోసం మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని ఋజువు అయ్యింది. కేంద్ర మంత్రిగా ఉన్న మీరు, పక్క జిల్లాలో మంజూరైన నిధులను గుంటూరుకు కేటాయించి, అద్భుతాలు సాధించినట్లు ప్రకటనలు ఇచ్చుకోవడం ఎంతవరకు సబబు.
మూడవది అత్యంత కీలకమైనది. ట్రాఫిక్ సర్వేపై మీ ప్రభుత్వం హైకోర్టులో సమర్పించిన వాంగ్మూలం యాభై సంవత్సరాల నుండి వంద సంవత్సరాల దాకా పెరగనున్న ప్రజా రవాణా అవసరాలను, పెరగబోతున్న జనాభాను, బహుళ ప్రయోజనాలు నెరవేర్చే నగరం నడిబొడ్డున నిర్మించే ఫ్లైఓవర్కు మీరు చేసిన ట్రాఫిక్ సర్వే రానున్న పది సంవత్సరాలకే అంచనా వేశారని లిఖిత పూర్వకంగా కోర్టులో తెలియచేయడం ఎంత నిర్లక్ష్యం. అంటే ఈ ప్రాజెక్టుపై, దీని అవసరాలపై, దీర్ఘకాలిక ప్రయోజనాలపై మీ ప్రభుత్వానికి ఎటువంటి శ్రద్ధా, ఆసక్తి, కనీస బాధ్యత లేదనేవి స్పష్టంగా అర్థమవుతోంది. గుంటూరు నగరానికి తామేదో చేసేస్తున్నామని చూపించుకోవడానికి చేస్తున్న ఈ తొందరపాటు చర్యల వలన భవిష్యత్తరాలు తీవ్రంగా నష్టపోతాయనే కనీసపు ఆలోచన కూడా ఈ విజనరీ నాయకులకు లేకపోవడం గుంటూరు నగర ప్రజల దురదృష్టం.
ప్రస్తుత డిజైను అమలు జరిగితే వచ్చే నష్టాలు..
930 మీటర్లకు కుదించిన బ్రిడ్జి కోసం 120 అడుగుల విస్తీర్ణ రోడ్డు అవసరమని 1.5 కిలోమీటర్ల మేర విస్తరణ చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మీరు విడుదల చేసిన డిపిఆర్లో ఈ మొత్తం నిడివిలో 8 చోట్ల అలైన్మెంట్లో మలుపులు ఎందుకు వచ్చాయి. బ్రిడ్జికి పశ్చిమ వైపున బ్రాడీపేట ఐదవ లైను వరకు ఎక్కువ స్వాధీనం చేసుకునేలా ఆరవ లైను నుంచి చివరి వరకు అరండల్ పేట వైపు ఎక్కువ తీసుకోవటంలో ఉద్దేశం ఏంటో ప్రజలకు తెలియజేయాలి. 120 అడుగుల రోడ్డు అలైన్మెంట్లో ఒక వైపు తక్కువ మరొకవైపు ఎక్కువ తీసుకోవటానికి కారణాలను బహిరంగపరచాలి.
ఈ ప్రాజెక్టు మొత్తం 120 అడుగుల రోడ్డు విస్తీర్ణంలో ప్లాను చేశారు. 70 అడుగుల వెడల్పుతో 930 మీటర్ల నిడివితో బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. 70 అడుగుల బ్రిడ్జితో రెండు వైపుల ఐదు అడుగుల చొప్పున మొత్తం పది అడుగులు ఫుట్పాత్ లు రానున్నాయి. అంటే 60 అడుగుల వెడల్పుతో బ్రిడ్జి ఉంటుంది.
నాలుగు లైన్ల బ్రిడ్జి కాబట్టి మధ్యలో 3.36 అడుగుల డివైడర్ రానున్నది కాబట్టి బ్రిడ్జి వెడల్పు 73.36 అడుగులు ఇక సర్వీస్ రోడ్డుకు మిగిలింది 46.6 అడుగులు అంటే రెండు వైపులా 23.33 అడుగులు, ఇందులో 5.6 అడుగులు రెండువైపులా డ్రైనేజ్కి పోగా వాహనదారులకు మిగిలింది 18.6 అడుగులే. ఎర్త్వాల్తో కట్టే బ్రిడ్జి కనుక అండర్ పాస్లు ఇచ్చిన ప్రాంతం మినహా మిగతా ప్రాంతమంతా రవాణాకి ఆటంకమే బ్రిడ్జి నిడివి కుదించటం వలన పశ్చిమ వైపు ఎనిమిది తొమ్మిది లైన్ల మధ్య ప్రారంభమై తూర్పు వైపు రాష్ట్ర ప్రాంతీయ గ్రంధాలయంకి అంటే కోపరేటివ్ సూపర్ బజార్ దగ్గర దిగబోతుంది. అంటే పశ్చిమం వైపు బ్రాడిపేట, ఆరండాల్ పేటలో 10వ అడ్డరోడ్ల వరకు 18 అడుగుల సర్వీస్ రోడ్డు వస్తుంది. ఇప్పుడున్న బ్రిడ్జి రెండు అడ్డ రోడ్లకు మాత్రమే పరిమితం. రాబోవు బ్రిడ్జి పది అడ్డరోడ్లను రెండు వైపులా అడ్డగిస్తుంది. కేవలం 4- 5 లైన్ల ఎదుట మాత్రమే అండర్ పాస్లు రాబోతున్నాయి. ఇక్కడ షాపులు ముందు పార్కింగ్ ఎలా? పార్కింగ్ అనుమతిస్తే వాహనదారులకు ఎలా? అలాగే బ్రిడ్జికి తూర్పు వైపు ప్రభుత్వ వైద్యశాల, ఏసీ కళాశాల, ఉమెన్స్ కాలేజీ ఒక వైపు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ, కోర్టు సముదాయాలు ఉన్నాయి. బ్రిడ్జి దిగిన అంబులెన్స్లు యూటర్న్ను తీసుకోలేక బాగా ముందుకు వెళ్లి యూటర్ను తీసుకొని మళ్ళీ వచ్చేది 18.6 అడుగుల సర్వీస్ రోడ్డులో వెనక్కి వచ్చి అండర్ పాస్ ద్వారా జిజిహెచ్కు వెళ్లాల్సిన పరిస్థితి. అంతే కాదు ఉమెన్స్ కాలేజీ దగ్గర సిగ్నల్స్ పెడితే కనీసం 30 సెకండ్లు బ్రిడ్జి దిగినా వాహనాలు ఆగాలి. అంటే బ్రిడ్జి దిగిన వెంటనే 250 అడుగుల్లో సిగ్నలింగ్ వస్తే ఎంత ట్రాఫిక్కు ఆగిపోతుందో అంచనా వేశారా?
ఇదంతా ఎందుకు జరిగింది అంటే కారణం ఎర్త్వాల్తో నిర్మించే బ్రిడ్జి అండర్ పాస్లకు తప్ప ఎక్కువ భాగం ఎర్త్ వాల్తో కట్టే బ్రిడ్జి కాబట్టి ఈ దుస్థితి. అదే ఫ్లైఓవర్ డిజైన్ ప్రకారం సింగిల్ పిల్లర్తో నిర్మాణం చేస్తే, ఫ్లై ఓవర్ క్రింద భాగం అంతా పిల్లర్ పిల్లర్ మధ్య వాహనాల రాక పోకలకి ఎటువంటి ఆటంకం ఉండదు. చాలా మేరకు పార్కింగ్ సమస్య తీరుతుంది. అందుకనే జాయింట్ యాక్షన్ కమిటీ మొదటి నుండి బ్రిడ్జి నమూనా కాకుండా ఫ్లై ఓవర్ నమూనాతో నిర్మాణం జరగాలని డిమాండు చేస్తోంది. మరొక్కమాట, హిందూ కాలేజి సెంటరు నుండి లాడ్జి సెంటర్ వరకు దాదాపు రెండు కిలోమీటర్లు నిడివిగల ఈ రోడ్డుకి రెండువైపులా 33 (ముప్పైమూడు) రహదారులు అనుసంధానమై ఉన్నాయని, అవి తూర్పు పశ్చిమ ప్రాంతాల ప్రజలను ఈ రోడ్డుకి చేరుస్తున్నాయనే స్పృహ అధికారులకు ఉంటే, ఈ ఫ్లైఓవర్ ఎంత ముఖ్యమైనదో, నగరంలోని రెండు ప్రాంతాల ప్రజల రాకపోకలకు ఇది ఎంత అవసరమో అర్థమవుతుంది. అంతేకాదు, రాష్ట్ర రాజధానిగా ఉన్న అమరావతికి కలిపే రహదారులు పశ్చిమ భాగాన, ప్రభుత్వ వైద్యశాల, వందల కొద్దీ ప్రైవేటు వైద్యశాలలు, అతి ముఖ్యమైన ఆర్టిసి బస్టాండు తూర్పువైపున ఉండటం ఈ రెండు ప్రాంతాల ప్రాధాన్యత తెలియజేస్తోంది.
ఆఖరిది అతి ముఖ్యమైనది..
ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ముందే ఆర్యుబి నిర్మించాలని జెఏసి డిమాండు చేస్తోంది. తొలత ఆర్&బి ఇచ్చిన డిజైనులో ఆర్యుబి చోటు ఇవ్వలేదు. నగరంలో కొంత మంది మేధావులు కేంద్ర మంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్ళిన తరువాత డిజైనులో ప్రతిపాదనలు జోడించారు తప్ప, అది ఇప్పుడు సాధ్యం కాదని, సాంకేతిక సమస్యలు వస్తాయని, ఆర్ఓబి నిర్మాణమైన తరువాత అవసరమొస్తే ఆలోచిస్తామని ప్రకటించారు. ఇక్కడ జెఎసి మూడు ప్రశ్నలు సంధించింది. మొదటిది మీ ప్రభుత్వమే, మీ ఎంపి, మంత్రి ప్రకటించిన ప్రాజెక్టులో రెండు వైపులా ఆర్యుబి నిర్మించబోతున్నామని తెలిపారు కదా, 7 సంవత్సరాల క్రితమే సాధ్యమైన సాంకేతికత, ఇప్పుడు ఎలా అసాధ్యమైనదనేది మా ప్రశ్న? రెండవది ఆర్ఓబి నిర్మించిన తరువాత ఆర్యుబి గురించి ఆలోచిస్తామని ప్రకటిస్తున్న మీరు, ఇప్పుడు అడ్డు వచ్చిన సాంకేతిక సమస్యలు, బ్రిడ్జి నిర్మాణం అయిపోయిన తరువాత మళ్ళీ గుంటలు తీసి ఆర్యుబి నిర్మిస్తే అప్పుడు సాంకేతిక సమస్యలు రావా? తొలుత నుంచి మీరు ప్రకటించేదానికి ఆచరణలో మీరు చేస్తున్న దానికి ఎక్కడా పొంతన లేదని స్పష్టమవుతుంది. ఇంత కీలకమైన ప్రాజెక్టులో ఎవరికీ ఎటువంటి స్పష్టత, దూరదృష్టి, లేకుండానే హడావిడిగా తోచింది తోచినట్లు చేస్తున్నారనేది బట్టబయలు అయ్యింది.
ఫ్లైఓవర్ డిజైన్ ప్రకారం 120 అడుగుల రోడ్డు ప్రాజెక్టు కాబట్టి కార్పొరేషన్ అధికారులు రెండు వైపులా ఉన్న భవనాలను కొంతమేరకు సేకరించి తొలగించే చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ కూడా చట్ట ప్రకారం పాటించాల్సిన అనేక అంశాలను మరుగున పెట్టి ఒత్తిడులు, దుష్ప్రచారంతో భవన యజమానులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అనేది నగ్నసత్యం. మొన్న ఒక పత్రిక సమావేశంలో ఓ ప్రజాతినిధి అవసరమైతే బుల్లోజర్లు కూడా వినియోగించటానికి వెనకాడమని ప్రకటించటం దానికి పరాకాష్ట.
గత సంవత్సరం నవంబర్లోనే ఖరారైన డిపిఆర్ను ఎందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల ముందు పెట్టలేదు. ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన తయారు కాలేదని స్పందించటం దేనికి సంకేతం. చివరకు మార్చి నెలలో డిపిఆర్ను ఆర్అండ్బి శాఖ వెబ్సైట్లో విడుదల చేశారు. కానీ ప్రజలకు అందుబాటులోకి తేలేదు. డిపిఆర్ డిజైన్ విడుదల చేసిన వారంలోపే టెండర్లను ఆహ్వానించడం వెనువెంటనే టెండర్ ఖరారు చేసే పని మొదలు పెట్టబోతున్నారని ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.
ఆఖరుగా ఒక్కమాట..
ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయం దాదాపు రెండు నుండి 3 సంవత్సరాల కాలం పట్టొచ్చు. అంటే ఈ సమయంలో నగరం నడిబొడ్డున ఉన్న రవాణా వ్యవస్థని మూసివేస్తే, ప్రజలకు ప్రత్యామ్నాయం ఏమిటి ? రోజుకు 50 వేల వాహనాలతో రద్దీగా ఉండే ఈ బ్రిడ్జి అందుబాటులో లేకుండా, ఈ వాహనదారులకి ఏది మార్గం? అతి చిన్నదిగా ఉన్న డొంక రోడ్డు ఆర్యుబిని మూడు నెలలు మూసేస్తేనే నగర ప్రజలు అల్లాడిపోయారు. ఊరు చుట్టూ తిరిగి వస్తారనే అర్థం లేని వాదన చేస్తున్నారే తప్ప, బ్రిడ్జి నిర్మాణం ముందే అండర్పాస్ కాని, ఆర్యుబిని కాని ఎందుకు నిర్మించట్లేదనేది కీలక ప్రశ్న? అంబులెన్స్లలోనే ప్రజలు మరణిస్తున్నారు. అందుకనే బ్రిడ్జిని పొడిగిస్తున్నామని అన్న కేంద్ర మంత్రి, నిర్మాణ సమయంలోను, నిర్మించిన తరువాత కూడా (18 అడుగుల సర్వీసు రోడ్డు) ఈ మరణాలను ఎలా ఆపదలచుకున్నారో సెలవివ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.
అందుకే జెఎసి, ఆర్యుబి నిర్మాణం కోసం పట్టుపడుతోందనేది నిర్విదాంశం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, విజనరీ నాయకులు చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి, జరిగిన పొరపాట్లను సరిదిద్ది, భావితరాలకు బహుళ ప్రయోజనాలు ఒనగూర్చే ఏకైక ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకుంటే, గుంటూరు నగర ప్రజానీకమే కాకుండా, జిల్లా యావత్తు మీ వెంటే ఉండి సహకరిస్తుందనీ, రానున్న తరాలు మిమ్మల్నే కొనియాడుతాయని తెలియజేస్తున్నాం.
ఎల్ఎస్ భారవి
కన్వీనర్, జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్
బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.