
“శాంతిని బలప్రయోగం ద్వారా నెలకొల్పలేము. దాన్ని వివేకం ద్వారానే సాధించగలం” అని అల్పర్ట్ ఐన్స్టీ న్ అన్నాడు. బలప్రయోగ విన్యాసాల ద్వారా, ఆధిపత్య ఆటలో భాగంగా మాత్రమే శాంతి/శాంతి చర్చలు అనే అంశాన్ని ప్రభుత్వము, మావోయిస్టు పార్టీ ముందుకు తెస్తున్నాయి. ప్రజాప్రయోజనాల యుక్తాయుక్త విచక్షణ, వివేకం ద్వారా శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశం ఆ రెండు వైరి పక్షాలకు ఎంతమాత్రమూ లేదని, పౌర సమాజ మేధావుల అంతరంగాలలో బలంగా ఉన్న భావన. యుద్ధంలో వెసులుబాటు కోసం శాంతి అనే తంత్రాన్ని వినియోగించడం వల్ల ఇరుపక్షాలకు, ప్రజలకు ఫలితమేమీ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా శాంతి ప్రక్రియను యుద్ధ పర్యవసానంగా చూస్తారేగాని, యుద్ధ కొనసాగింపులో విరామంగా చూడడం వల్ల అక్కడి ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. యుద్ధం లేదా శాంతి అనేవి రెండు మాత్రమే సమాజంలోని వైషమ్యాలకు పరిష్కారంగా భావించే యుగ్మ(ద్విభాగశీల/ ద్వంద్వాత్మక) దృష్టి(బైనరీ విజన్)తో ఇరు పక్షాలూ ప్రజలను విస్మరిస్తున్నారు.
శాంతి అనేది యుద్ధంలో పై చేయి సాధించే జూద క్రీడ కాకూడదు. మావోయిస్టులు మందు పాతర పేల్చి పోలీసులను హతమార్చి, తాత్కాలికంగా పై చేయి సాధించినపుడు, ప్రభుత్వాలు శాంతి చర్చలను ప్రతిపాదించడం జరిగింది. అదే విధంగా ప్రభుత్వ బలగాలు మావోయిస్టులను, స్థానిక ఆదివాసులను హతమార్చి పై చేయి సాధించినపుడు, పౌర సమాజ సంస్థలు, ప్రజా సంఘాల ఒత్తిడి ద్వారా శాం తి చర్చలకు ఆమోదిస్తున్నట్లు ప్రకటించడం 1990ల నుంచి జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. ఇరు పక్షాలు అననకూల పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చినపుడు ప్రజల పేరు మీదనే శాంతి చర్చలకు ప్రతిపాదన చేస్తారు. యుద్ధంలో ఆధిపత్యం ఎలా సాధించాలనే లక్ష్యంతోనే ఆ ప్రతిపాదనలు సాగాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
2004లో ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పీపుల్స్ వార్(మావోయిస్టు ) పార్టీ మధ్య విఫల, విషాద పర్యవసాన చర్చలు జరిగాయి. అయితే చరిత్రలో ఘటనలు తరచూ పునరావృతమవుతాయని, అవి మొదటగా సంభవించినపుడు గంభీరంగా ఉంటే, మళ్ళీ పునరావృతమైనపుడు ప్రహసనంగా మారుతాయన్న నానుడి శాంతి చర్చల విషయంలో కూడా మరోసారి రుజువైంది. 2004లో చర్చల సందర్భం చాలా గంభీరంగా సాగింది. సమాజంలోని అన్ని వర్గాలవారు వాటి నుంచి మంచి ఫలితాలను ఆశించి నిరాశ చెందారు. అయితే ఇరు వైరి పక్షాలకు జవాబుదారీ వహించలేని అశక్త బృంద౦, పౌరసమాజం పేరుతో ప్రజలందరికీ ప్రాతినిథ్యం వహిస్తున్నామనే స్వయం ప్రకటిత, అధ్యారోపిత అస్తిత్వవాద సమూహం, వారితో పాటు కొన్ని కాలంచెల్లిన ప్రజాసంఘాలు మావోయిస్టుల పరోక్ష ప్రేరణతో ప్రజలపై మారణహెూమం ఆపాలనే నినాదంతో శాంతి చర్చలని ముందుకు తీసుకొచ్చారు.
ప్రజలు స్పాంటేనిటీ(ప్రాప్తకాలజ్ఞత)లోను, తక్షణ ప్రయోజనాలను ఆశించి వ్యవహరిస్తుంటారు. మావోయిస్టులు పై చేయి సాధించినపుడు, వారి కార్యక్రమాలను సొంత ఇంటి వ్యవహారాలుగా పరిగణించి అనుసరించిన ప్రజలే, ప్రభుత్వ బలగాలు ఆధిపత్యం సాధించినపుడు భయంతో వారికి దూరమవుతారు. సాయుధ పోరాటంలో ప్రజలను కూడా భాగస్వాములు చేయించి మావోయిస్టులు నడుపుతున్న ప్రజాయుద్ధాన్ని అణచివేసేందుకు రాజ్యం చేసే ప్రయత్నాల్లో ప్రజలు కూడా నేలకొరగడం కద్దు. మావోయిస్టులతో చేసే యుద్ధం పేరుతో రాజ్యం ప్రజలను ఊచకోత కోయడం ఏంటని మేధావులు వేసే ప్రశ్నలో తర్కం ఎక్కడిది? మావోయిస్టుల సారధ్యంలో ప్రజల భాగస్వామ్యంతో సాగుతున్న ప్రజాయుద్ధాన్ని అడ్డుకునేందుకు చేసే యుద్ధంలో రాజ్యం పైచేయి సాధించినపుడల్లా తక్షణ ప్రయోజనాల ఆశించి జీవనం సాగిస్తున్న ప్రజలు ఆ ప్రజాయుద్ధంలో భాగస్వాములు కాలేని స్థితికి చేరుకుంటారు. ప్రజలు ఎప్పుడూ భరించగలిగే, అస్తిత్వ హననం కాని ఘర్షణతో కూడిన శాంతిని కోరుకుంటారు. సామరస్యతకు భగ్నం కలిగించని ఘర్షణను ఆహ్వానిస్తారు. ఆ మేరకే మావోయిస్టుల సారధ్యంలోని ప్రజా యుద్ధంలో నిరాయుధ బలగాలుగా, ప్రత్యయాలుగా భాగస్వాములవుతుంటారు.
మావోయిస్టులు ప్రజాయుద్ధం తొలి దశల్లో ప్రజల భాగస్వామ్యం చూసి వాళ్ళందరూ శాశ్వత ఘర్షణకు, దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధమయ్యారని భావించి, అందుకనుగుణమైన ఎత్తుగడలను రూపొందించారు. అయితే యుద్ధం మరింత గంభీరంగా మారే క్రమంలో ప్రజలు క్రమంగా ప్రజాయుద్ధంలో నిరాయుధ బలగాల పాత్రను కూడా పోషించలేని స్థితికి చేరుకుంటారు. ప్రజా ఉద్యమ రాజకీయాలు అనే మహా సముద్రంలో (కొనసాగింపుగా) అలలు/ఉప్పెన/సునామీ వంటిదే దీర్ఘకాలిక ప్రజాయుద్ధం.
ప్రజా యుద్ధం= సాయుధ బలగాలు(విప్లవ సైన్యం)+ నిరాయుధ బలగాలు(ప్రజల నిరాయుధ భాగస్వామ్యం). ప్రజా ఉద్యమాలు లేకుండా ప్రజాయుద్ధం అనేది ఒక ఎండమావి మాత్రమే. దేశవ్యాప్తంగా ప్రజలు వివిధ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై సామ్రాజ్యవాద స్థానిక, జాతీయ, అంతర్జాతీయ శక్తులకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ఉద్యమించడమే ప్రజా ఉద్యమం. ప్రజా యుద్ధ ప్రవాహం, ప్రజా ఉద్యమ ప్రవాహం రెండూ సమగ్ర సామాజిక విప్లవానికి పరస్పర పూరకాలుగా నిలుస్తాయి. ప్రజా ఉద్యమ రాజకీయాల కొనసాగింపు, పరాకాష్ఠగా ప్రజాయుద్ధం అవతరిస్తుంది. ప్రజా ఉద్యమం హేతువు అయితే, ప్రజా యుద్ధమనేది ప్రత్యయం అవుతుంది. ఆ రెండూ పరస్పర పూరకాలుగా మాత్రమే విప్లవం ఉనికిలోకి వస్తుంది. ప్రజాఉద్యమం మూల కారణమైతే, ప్రజాయుద్ధమనేది దాని వైషమ్యరూపం, దాని పర్యవసానం. ప్రజాసైన్యం, ప్రజాయుద్ధం లేనిదే ప్రజలకు ఒరిగేదేమీ లేదనే మిథ్యా నినాదంతో ప్రాణత్యాగాలకు వెరవకుండా మావోయిస్టులు యుద్ధానికి తలపడ్డారు. దాంతో మావోయిస్టు పార్టీ చివరికి ఒక కమ్యూనిస్టు రాజకీయ పార్టీగా కూడా ఆవిరై పోయి, సాయుధ నిర్మాణాల నిర్జీవ చట్రంగా నిలిచింది.
సున్జు, సన్బిన్, క్లాస్విట్జ్ తదితర ప్రపంచ యుద్ధ నిపుణుల యుద్ధ సూత్రాలను జీర్ణం చేసుకోలేకపోవడం, అన్వయించలేకపోవడం వల్ల మావోయిస్టులు నష్టపోతున్నారని అర్థం చేసుకోవడం శుద్ధ అమాయకత్వం. అలాంటి శాస్త్రాలు రూపొందని రోజుల్లో కూడా వివిధ ప్రజా యుద్ధాలు గెలపోటములకు గురైయ్యాయి. విప్లవ స్వయం చలిత నియమాలను, ప్రజలకు నాయకత్వ శ్రేణులకు మధ్య గతితర్కాన్ని, సమాజ స్వీయాత్మక గతితర్కాన్ని (సబ్జెక్టివ్ డైలెక్టిక్స్) జీర్ణం చేసుకోలేక పోవడంతో మావోయిస్టు పార్టీ ప్రజల నుంచి పరాధీనమైంది. రాజ్య యుద్ధ వ్యూహంలో మావోయిస్టు సాయుధ బలగాల నుంచి నిరాయుధ బలగాలైన ప్రజలు పరాయికరణ చెందడమనే ప్రక్రియ కీలకమైంది. దాంతో ప్రజాయుద్ధంతో తలపడుతున్న రాజ్య బలగాల యుద్ధం ప్రజలపై ఊచకోతగా, మారణహెూమంగా అధ్యారోపితమైనట్లు (సూపర్ ఇంపోజ్) కనిపిస్తుంది. ప్రజలే (వాస్తవంలో ‘మానవులే’) చరిత్ర నిర్మాతలు అనే పవిత్ర నినాదం కాస్తా, ‘అమాయక ప్రజల’పై మారణహెూమం అనే రూపాన్ని సంతరించుకుంటుంది.
మావోయిస్టులను తుదముట్టించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా తెలంగాణ-చత్తీస్గడ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో 20 వేల మంది బలగాలతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ భారీ సాయుధ విన్యాసంలో మావోయిస్టులతో పాటు పెద్ద సంఖ్యలో (500కు పైగా) తటస్థ ఆదివాసులు చాలా మంది ఉన్నారన్న సమాచారం విచారకరం. మార్చి నెలలో హైదరాబాద్లో మావోయిస్టు ప్రాయోజిత పౌరసమాజ ముఖ్యులు కొందరు ముందుకు తెచ్చిన శాంతి చర్చల ప్రతిపాదనకు మావోయిస్టులు స్పందించి చర్చలకు సిద్ధమని రెండు లేఖలని పత్రికలకు విడుదల చేశారు. అందుకు ప్రతిస్పందనగా చత్తీస్గడ్ ప్రభుత్వం మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావడానికి ఇష్టపడితే తాము కూడా శాంతి చర్చలకు సిద్ధమేనని ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఏప్రిల్ 21 నుంచి హెలికాప్టర్ చక్కర్లు, ఫిరంగుల మోతలు, భారీ పేలుళ్ళు కర్రి గుట్టల్లో మారుమోగుతున్నాయి.
మావోయిస్టులు, వారి మద్దతుదారులు, పౌర సమాజ ప్రముఖులు పదేపదే శాంతి చర్చలకోసం విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తలిపేరు నుంచి చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా తర్లగూడ వరకు 90 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న కర్రిగుట్ట కొండల్లో ప్రభుత్వం భారీ ఎత్తున గాలింపు చర్యలను చేపట్టింది. వేసవికాలంలో(ఏప్రిల్-జులై) ప్రభుత్వ బలగాల చొరవ దెబ్బతీసి, వారిని కకావికలం చేసే ఎత్తుగడలలో భాగంగా మావోయిస్టులు చేపట్టే వ్యూహాత్మక ఎదురుదాడి కార్యకలాపం(టీసీ ఓసీ- టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్)ను నిర్వీర్యం చేసేందుకు, ఒకే సెంట్రల్ కమాండ్ ద్వా రా వేలాది మంది సాయుధ బలగాల సమన్వయంతో కర్రిగుట్టల దండయాత్రను ప్రయోగాత్మకంగా చేపట్టింది. రాజ్య దాడిని తిప్పికొట్టేందుకు ఆదివాసులు మారణహెూమం పేరుతో మావోయిస్టులు శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తెచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆదివాసీ సమాజం తటస్థంగా, అమాయకంగా ఏమీ లేదు. దండకారణ్య ఆదివాసీల్లో మెజారిటీ ప్రజలు మావోయిస్టుల జనతన రాజ్యంలో ప్రత్యక్ష, పరోక్ష భాగస్వాములే. అటవీ ప్రాంతానికి పొలిమేరల్లో, మార్కెట్ ప్రాంతాలతో సన్నిహితంగా ఉండే కొందరు ఆదివాసీలు పాలకవర్గ రాజకీయాలు, ప్రభుత్వ పథకాలు, సాయుధ బలగాల్లో నియామకాల వల్ల ప్రభుత్వ అనుకూల వర్గాలుగా మారారు. అలాంటి ఆదివాసీలతో ఏర్పరచిన సాయుధ గార్డులను ముందుపెట్టుకొని ఈనాడు సాయుధ బలగాలు సెర్చ్ ఆపరేషన్లు, ఎన్ కౌంటర్ల మారణకాండను సాగిస్తున్నాయి.
మావోయిస్టు పార్టీలో దాదాపు మెజారిటీ సాధారణ సభ్యులు, వివిధ ఎ స్థాయిల్లోని కమిటీ సభ్యులుగా ఉండడం వలన, గైర్ ఆదివాసీ సభ్యులకు, ఆదివాసీలకు మధ్య పార్టీలో అంతర్గత వివాహాల వల్ల దండకారణ్య ఆదివాసీ ప్రజానీకానికి, మావోయిస్టు పార్టీకి మధ్య రక్తసంబంధీకుల కుటుంబ బంధాలు, జాతిపర సంబంధాలు బలంగా అలుముకొని ఉన్నాయి. రాజకీయ భావజాలం దండకారణ్య ప్రజల్లో, మావోయిస్టు శ్రేణుల్లో ఏ మాత్రం వేళ్లూనుకుందోగాని మావోయిస్టు శ్రేణుల్లో కార్మిక అంతర్జాతీయ దృక్పథం ఆవిరైపోయి, ఆధునికానంతరవాదం ప్రబలంగా వేళ్లూనుకుంది. ప్రపంచ పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదంగా దాని పరిణామం, సామ్రాజ్యవాద దశలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పొలిమేర ప్రాంతమైన దక్షిణార్ధగోళ వ్యవసాయక, జీవవైవిధ్య, సహజ వనరుల దేశాల్లో నెలకొన్న బ్యూరోక్రాటిక్ పెట్టుబడిదారీ విధానం, ఆసియాటిక్ ఉత్పత్తి విధాన పరిణామం, దండకారణ్య ఆదివాసీ ప్రాంతాల్లో ఉనికిలో ఉన్న బ్యూరోక్రాటిక్ పెట్టుబడిదారీ సంబంధాలు. దేశంలో అనేక ప్రాంతాల్లో పరివర్తనాత్మక రూపంలోని (ట్రాన్సిటరీ ఫార్మ్) పొలిమేర ప్రాంత పెట్టుబడిదారీ సంబంధాల ఉనికి ఇలా అనేక రాజకీయార్థిక విషయాల్లో మావోయిస్టుల్లో రాజకీయ తాత్విక అజీర్తి బలంగా ఉంది. దానికి తోడు ప్రపంచ ఆర్థిక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు భిన్నంగా భారత్లో ఫ్యూడలిజం, అర్థ ఫ్యూడలిజం ప్రబలంగా ఉందని, వక్ర పెట్టుబడిదారీ సంబంధాలు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయని తల్లకిందులుగా సూత్రీకరించారు.
ఈ క్రమంలో గతితార్కిక, చారిత్రక భౌతికవాద దృక్పథాన్ని గాలి ఒదిలేసి దేశంలోని వర్గ సమాజాన్ని హిందూ మత, దాని అంశీభూతమైన కుల వ్యవస్థ చట్రంలో అశాస్త్రీయంగా ఇరికించి బ్రాహ్మణిస్టు, హిందూ కార్పొరేట్ వర్గ వ్యవస్థగా సూత్రీకరించారు. మత వ్యతిరేక, అగ్రకుల వ్యతిరేక రాజకీయ ఎజెండాతో ఆయా జనసమూహాలను తమ నాయకత్వం కిందకు తీసుకురాగలమని విఫల ప్రయత్నం చేశారు. ఎన్నో విఫల సూత్రీకరణల మధ్య ప్రాణత్యాగాలకు సైతం వెరవక ఆదివాసులతో కొనసాగుతుండడం వల్ల క్రమంగా శాస్త్రీయ అంతర్జాతీయ దృక్పథాన్ని కోల్పోయి, శతాబ్దాలుగా హిస్టారికల్ మార్కింగ్ టైమ్లో(చారిత్రకంగా గిడసబారిన స్థితి) కొనసాగుతున్న దండకారుణ్య ఆదివాసుల్లో తరతరాలుగా పాదుకున్న గైర్ ఆదివాసీ వ్యతిరేక దృక్పథంలోకి మావోయిస్టులు ఒదిగిపోయారు. మార్మ్స్ ఏంగెల్స్, లెనిన్, మావో, సున్జూ ఇలా ఎందరెందరో ప్రపంచ మేధావుల సూక్తులను వల్లె వేస్తున్నప్పటికీ, మావోయిస్టు సమూహంలో సభ్యులైన మెజారిటీ ఆదివాసులకు చెందిన గైర్ ఆదివాసీ వ్యతిరేక దృక్పథమే ఆ పార్టీ కీలక భావజాలంగా, కార్యాచరణగా మారింది. దానికి విప్లవ, అభ్యుదయ, ప్రగతిశీల రచయితలుగా చలామణి అవుతున్న ఆధునికానంతరవాద మేధావుల రచనలు తోడ్పాటును అందించాయి.
సమాజంలోని కార్మిక వర్గం నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని దోపిడీ వ్యవస్థను నిర్మూలించే కార్యక్రమం స్థానంలో మత, కుల, ఆదివాసీ, జాతి కేంద్రిత ‘పేదప్రజల దృక్పథాన్ని’ మావో యిస్టు పార్టీ అందిపుచ్చుకోవడంలోనే దాని వైఫల్యం ఉంది. ఆ కోణంలోనే దండకారణ్య ఉద్యమం ఆదివాసీ ప్రజల సాయుధ అస్తిత్వ ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఆదివాసీ జాతి బంధాలు మాత్రమే బలంగా కొనసాగుతుండడం వల్ల మావోయిస్టు ఉద్యమాన్ని అక్కడి సాధారణ ప్రజల నుంచి దూరం చేయడం ప్రభుత్వానికి సాధ్యమయ్యే పనికాదు.
అదీకాక మావోయిస్టు ఉద్యమం కార్మికవర్గ ఉద్యమంగా కాక వారి డాక్యుమెంట్లు ఏం చెబుతున్నప్పటికీ, అదొక జాతి విముక్తి ఉద్యమ స్థాయికి చేరుకుంది. దండకారణ్య ఆదివాసీల విముక్తి గురించిన వారి అవగాహన, దేశవ్యాప్త విప్లవోద్యమం నిర్మాణానికి విడిగా జరిగే తంతుగా మారింది. దండకారణ్య ఉద్యమం అక్కడి సహజ వనరుల రక్షణ, ఆదివాసీల ఆస్తిత్వం, సంస్కృతి, జీవనాల విధ్వంసం, స్థానిక పర్యావరణ విధ్వంసం వరకే పరిమితమైన అంశంగా మావోయిస్టు పార్టీ పరిగణిస్తుండడం దురదృష్టకరం. మధ్య భారతంలోని సహజవనరులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి భారత ప్రభుత్వం ఈ యుద్ధానికి దిగిందని, ఆ ప్రాంతాల్లోని ఆదివాసీలను నిర్మూలించి, ఆదివాసీ రహిత భారత్గా మార్చడానికి చేస్తున్న ఈ యుద్ధాన్ని నిలువరించేందుకు అందరూ కృషి చేయాలని మావోయిస్టు పార్టీ ప్రకటించడంల దాని హ్రస్వ దృష్టి, ఆధునికానంతర వాద దృక్కోణాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్ల వైపు మావోయిస్టులు ఆదివాసీల పక్షాన నిలబడి యుద్ధం చేస్తున్నట్లున్నారేగాని, మొత్తం ఇండియా సమాజంలోని ఇతరత్రా ప్రజా సమూహల దృష్ట్యా ఈ యుద్ధానికి గల సంబంధం ఏంటో స్పష్టం చేయడంలో ఇరు పక్షాలు విఫలమయ్యాయి.
దండకారణ్యంలో జరిగే ఎన్కౌంటర్ హత్యలకు హైదరాబాద్లోనో, ఢిల్లీలోనో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి జీవితానికి మధ్య గల సంబంధాన్ని వివరించడంలో మావోయిస్టు పార్టీ పూర్తిగా విఫలమైంది. ఆదివాసీలపై జరిగే మారణహెూమాన్ని ఖండించాలనే సానుభూతికి మాత్ర వారి మధ్య సంబంధాన్ని కుదించివేసింది. అదే సమయంలో కార్పొరేట్ ప్రయోజనాలే, లాభాలే దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠికి, అశేష ప్రజానీకం జీవన వికాసానికి పూర్వావసరమని, సంపద మొదటగా కా ర్పొరేట్ల వద్దకు వేగంగా చేరితే, ఆ సంపద అక్కడి నుంచి బొట్టు బొట్టుగా, నెమ్మదిగా ప్రజలకు చేరుతుందని అవాస్తవాన్ని నిజమని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.
19వ శతాబ్దం చివర్లలోను, 20 శతాబ్దం నుంచి ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కూరుకుపోయిన శాశ్వత సంక్షోభం తొలి, మలి దశల్లో ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి అనుగుణంగా జ్వాలలుగా ఎగసిపడుతోంది. ఆ క్రమంలో 2008 నుంచి ఎగసిపడుతున్న శాశ్వత సంక్షోభ జ్వాలలు మరో తరం ఉ త్పత్తి శక్తుల గుణాత్మక అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే రోజురోజుకూ ముసురుకొస్తున్న(పపంచ ఆర్థిక సంక్షోభం ముంగిటలో ప్రపంచ మార్కెట్ పలు భౌగోళిక ప్రాంతాల్లో కుదేలవుతుండడం వల్ల మాన్యుఫాక్చరింగ్ రంగం గ్లోబల్ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయి, ప్రపంచ వాణిజ్యం గణనీయంగా క్షీణించింది. ఈ క్రమంలో ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పొలిమేర ప్రాంతాలైన దక్షిణార్ధగోళ జీవవైవిధ్యం, సహజ వనరులతో విలసిల్లే వ్యవసాయ ప్రధాన దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా కంపించిపోతున్నాయి. దాంతో పొలిమేర దేశాలు వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు, సహజ వనరుల వాణిజ్యం ద్వారా మనుగడ సాధించేందుకు ప్రయత్నిస్తుండడం ప్రపంచవ్యాప్త క్రమంగా అనివార్యంగా ఉనికిలోకి వచ్చింది. అదే కోవకు చెందిన భారత ఆర్థిక వ్యవస్థ కూడా పారిశ్రామిక సంక్షోభంలో విలవిలడుతూ, ప్రధానంగా సహజ వనరుల ఎగుమతులపై (సాఫ్ట్వేర్ వంటి సర్వీస్ రంగంపై కొంత ఆధారపడినప్పటికీ) ఆధారపడక తప్పని పరిస్థితిలోకి జారిపోయింది.
92,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని దండకారణ్యం ప్రాంతంలోని ఖనిజాల వంటి సహజవనరుల నిక్షేపాలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తాయి. అయితే దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ ప్రాయోజిత ఎజెండాగా సహజ వనరుల వాణిజ్యం కీలకంగా మారింది. అయితే యూరప్ ఖండం(ఈయూ)లోని మాల్టా, సైప్రస్ వంటి 10 చిన్న దేశాల భూభాగమంత ఉన్న దండకారణ్య ప్రాంతంలో 2011 గణాంకాల ప్రకారం రెండున్నర కోట్లకు పైగా (2,55,40,196) జనాభా నివసిస్తున్నారు. వారిలో 30 శాతం ఆదివాసీలు దట్టమైన అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ 55 రకాల ఆహార వనరులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇలా ఈ దేశ మూలవాసీ ప్రజలు(గోండ్వానా ప్రాంత ప్రజలు), పర్యావరణం ఎన్నో శతాబ్దాలుగా ఈ దక్కన్ పీఠభూమిలో ప్రకృతి- సమాజాల ఆదానప్రదాన సామరస్యతలో మనుగడ సాగిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు మాన్యుఫ్యాక్చర్, భారీ పారిశ్రామిక రంగ వ్యాల్యూ జోడింపు వాణిజ్యం ఉదాసీనంగా మారిన నేపథ్యంలో గ్లోబల్ కార్పొరేట్ శక్తుల ప్రోద్బలంతో సహజ వనరుల వాణిజ్యంపైనే దేశ కార్పొరేట్ శక్తుల దృష్టి కేంద్రీకరించాయి. పర్యవసానంగా కార్పొరేట్ ఎజెండాతో దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు గుడ్డిగా దూసుకెళుతున్న కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఖనిజ నిక్షేపాలు, సహజవనరుల మైనింగ్కు అవసరమైన పూర్వరంగాన్ని సృష్టించేందుకు మావోయిస్టుల నాయకత్వంలో ప్రతిఘటిస్తున్న దండకారణ్య ఆదివాసులపై ‘అంతిమ యుద్ధం’ (ఆపరేషన్ కగార్)కు తలపడింది. ప్రజలందరికీ ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించే ఎమ్ఎస్ఎమ్ఎస్ఈ (మైక్రో, స్మాల్ అం డ్ మీడియం ఎంటర్ప్రైజెస్)ల విస్తృత అభివృద్ధికి, పారిశ్రామిక రంగ అభివృద్ధి, విలువ జోడింపుతో కూడిన వ్యవసాయోత్పత్తుల తయారీ రంగ అభివృద్ధికి సంబంధించిన ఎజెండాను ప్రభుత్వాలు గాలికి వదిలేసి పర్యావరణ, ప్రజా విధ్వంసక మైనింగ్ కార్కలాపాలపై కేంద్రీకరించింది. రెండవ ప్రపంచ యుద్ధ౦లో ఆర్థికంగా కుప్పకూలిన జర్మనీ(స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్- చిన్నది అందమైనది) అనే బుద్ధిస్ట్ దార్శనిక దృష్టితో రూపొందిన ‘ఎస్ఎమ్ఎస్ఈ’ (స్మాల్ అండ్ మీడియమ్ సైజ్డ్ ఎంటర్ప్రైజెస్)ల (మిట్టెలాండ్ కంపెనీలు) పునాదిగా ఆధునిక పారిశ్రామిక విధానాన్ని జోడించి ఆర్థిక వ్యవస్థను అగ్రస్థానంలోకి తెచ్చుకుంది.
చరిత్రలో ఇలాంటి విధానం ఒకటి మనముందున్నప్పటికీ దాన్ని గుర్తించి దేశ ప్రగతికి అన్వంయించకుండా, దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థలు(గ్లోబల్ ద్రవ్యపెట్టుబడి) అత్యాశకు పీఠం వేసే ఆర్థిక విధానాలను చేపడుతున్నాయి. ఉపాధి కల్పనకు ఊతమిచ్చే మాన్యుఫాక్చరింగ్, విలువ జోడింపు వ్వసాయోత్పత్తి విధానాలను ప్రోత్సహించకుండా, అడ్డదారిలో దేశ సహజ వనరులను కార్పొరేట్ శక్తుల విధ్వంసకర వాణిజ్యానికి, దురాశాపూరిత లాభాపేక్షకు అప్పజెప్పడం దేశద్రోహం కంటే నీచమైనది. ఇప్పటికీ కార్పొరేట్ భారీ పారిశ్రామిక రంగం కంటే, ఉపాధి కల్పనలో కొడిగడుతున్న ఎమ్ఎస్ఎమ్ఎస్ఈలదే అగ్రస్థానం. ఎమ్ఎస్ఎమ్ఎస్ఈలను ప్రోత్సహిస్తున్న కారణంగానే తమిళనాడు తదితర దక్కన్ ప్రాంత రాష్ట్రాలు అభివృద్ధి చెందాయన్న విషయం ఈ పాలకులకు తెలియంది కాదు. అయినప్పటికీ, దేశ అభివృద్ధికి దోహదపడే దండకారణ్య ప్రాంత ఖనిజ, సహజ వనరుల మైనింగ్ను సాకారం చేయాలంటూ ఆ ప్రాంత ఆదివాసులను, వారికి మోటు నాయకత్వం(గతితార్కిక, చారిత్రక దార్శనికత కొరవడిన) అందిస్తున్న మావోయిస్టులను తుదముట్టించేందుకు రాజ్యం కగార్ మిషన్ను(తుది యుద్ధం) తలపెట్టింది. ఒకవేళ ఈ యుద్ధంలో ప్రభుత్వమే గెలిచి, సహజవనరులను మైనింగ్ను కొనసాగించడం వల్ల దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం పరిష్కారం సరికదా, ‘డచ్ డిసీజ్’ (డచ్ రోగం) అనే ఆర్థిక రుగ్మత తలెత్తి ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా మరింత దుర్బలంగా తయారవుతుంది.
ఖనిజ, సహజ వనరుల ఎగుమతుల వల్ల దేశంలోకి విదేశీ మారక ద్రవ్య ప్రవాహం ఊహించలేనంతగా వచ్చి తత్సంబంధిత రంగాల్లో సంపద ద్వీపాలు ఏర్పడడం ఖాయం. అయితే మాన్యుఫ్యాక్చర్ రంగం, వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురై అశేష ప్రజానీకం ఉపాధి లేక జీవన ప్రమాణాలు కోల్పోవడంతో స్థానిక, స్వదేశీ మార్కెట్లో తీవ్ర సంక్షోభం తలెత్తుతుంది. ఇలాంటి ఆర్థిక అస్తవ్యస్తతను ‘డచ్ డిసీజ్’ అని పిలుస్తారు. ఈ డచ్ డిసీజ్ ప్రభావం ఢిల్లీ నుంచి కన్యాకుమారి దాకా అన్ని వర్గాలు, సాఫ్ట్వేర్ సహా అన్ని రంగాల ప్రజల మీద తీవ్రంగా పడుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు దండకారణ్య పరిరక్షణ ఉద్యమాన్ని ఎందుకు కోరుకోవాలన్నది స్పష్టం. డచ్ డిసీజ్ (డచ్ రోగం) అనే ఆర్థిక వైపరీత్యం నుంచి దేశ ఆ ర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం అన్ని వర్గాల ప్రజలది. ఈ సందేశాన్ని దేశ ప్రజలందరికీ అ ర్థం చేయించే విధంగా మావోయస్టులు కృషి చేయకపోవడంతో, దండకారణ్య కలకలం అనేది ఆదివాసులకు మాత్రమే పరిమితమైనదిగా సమస్య కుదించబడింది. పై వివరణలో పాలకులు, మావోయిస్టుల మహాపరాధం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
మావోయిస్టులు తమ కార్యాచరణలో ఆదివాసుల ప్రయోజనాలకు పరిమితమైనట్లే, భారత ప్రభుత్వం మిగతా ప్రజల ప్రయోజనాలను, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను తుంగల్లోకి తొక్కి ‘డచ్ రోగం’ అనే ఆర్థిక వైపరీత్యంలోకి కూరుకుపోయే కార్పొరేట్ ప్రయోజనాలను దేశ ప్రజల ప్రయోజనాలుగా పరిగణించి ఎర్ర, తెల్ల బీభత్సాలను సృష్టించడం క్షమించరాని చారిత్రక ద్రోహం. దానికితోడు ఒకరిని మరొకరు నిర్మూలించడంలో భాగంగా శాంతి, శాంతి చర్చలను అడ్డం పెట్టుకోవడం, వాటి కోసం పౌర సమాజ ప్రముఖులు బట్టలు చించుకోవడం ఒక దౌర్భాగ్యకర హాస్యం. ప్రభుత్వ కార్పొరేట్ ప్రాయోజిత మిలటరీ వ్యూహాన్ని నిలువరించడంగాని, దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోకుండా రక్షించుకోవడం గాని ఆ రెండు వైరిపక్షాలకు పరిమితమైన సైనిక విజయంపై ఆధారపడి ఉండదు. ఇరు పక్షాలు యుగ్మ దృష్టి (బైనరీ విజన్)తో తలపడుతున్నాయి. అందువల్ల ప్రజలకు ఒరిగేదీమీ ఉండదు. ప్రభుత్వ బలగాలు పై చేయి అయి గెలిస్తే దేశం డచ్ రోగగ్రస్తమవుతుంది. మావోయిస్టులు గెలిస్తే స్థానిక ఆదివాసీల పరిధులకే పరిమితమై, విశాల భారత ప్రజారాశుల్ని సంఘటిత చేసి సంపూర్ణ, సమగ్ర సామాజిక విప్లవం వైపు నడిపించలేని హిస్టారికల్ మార్కింగ్ టైమ్ స్థితిలో దండకారణ్య ఉద్యమం, అక్కడి ఆదివాసీ సమాజం మరింత లోతుగా కూరుకుపోతుంది. సమాజాన్ని దోపిడి వర్గం, దోపిడికి గురయ్యే వర్గాలుగా మావోయిస్టులు విభజిస్తే, ‘కార్పొరేట్ ప్రాయోజిత ప్రభుత్వం రాజ్యం- ప్రజలు’ అనే రెండు విరుద్ధ అంశాలుగా ప్రభుత్వం, పాలకులు విభజిస్తున్నారు. విప్లవం వల్ల కార్మికవర్గమే కాదు, సంక్షోభాల ఊబిలో చిక్కుకుని విలవిలలాడే బూర్జువా వర్గం కూడా విముక్తి అవుతుందని మార్క్స్ భావన. అయితే ఆయన దృష్టిలో పీడకులు, పీడితులు అనే రెండు విరుద్ధ అంశాలతో కూడిన సమాజం మిగిలిన మధ్య తరగతి, వర్గేతర అంశాలన్నీ(అస్థిరమైనవి /చంచలమైనవే గాని వాటికి ప్రత్యేక ఉనికి ఉండదు) వేగంగా అణగారిన వర్గాలుగా మారుతాయి. అలా మారిన ద్వి(యుగ్మ దృష్టి) విరుద్ధాంశాల మధ్య వైషమ్యం యుద్ధంగా అవతరించి, అవి అంతరిస్తాయనీ వాటి స్థానంలో కొత్త విరుద్ధ అంశాలు ఏర్పడడమే విప్లవమని ఆయన భావన. ఆయనదీ యుగ్మ దృష్టే (బైనరీ విజన్). అయితే దోపిడీ వర్గం మధ్యతరగతి వర్గం అస్తిత్వంలో/ఉనికిలో లేకుండా చంచల వర్గంగా ఉంటే దోపిడీ గురయ్యే వర్గాల నుంచి దోపిడిని స్థిరంగా, నేరుగా కొనసాగించడం సాధ్యం కాదు. అందువల్ల మార్క్స్ యుగ్మ దృష్టికి భిన్నంగా మధ్యతరగతి వర్గం కూడా సామాజిక అస్తిత్వంలో ఒక స్థిరమైన అంశీభూతంగానే చూడాల్సి ఉంటుంది. దీనికి దోపిడీ వర్గ లక్షణాలు, దోపిడీకి గురయ్యే వర్గాల లక్షణాలు రెండూ ఉంటాయి. అంటే మధ్య తరగతి వర్గం సామాజిక అస్తిత్వంలో ఆ సమాజ స్వభావాన్ని వ్యక్తం చేసే ప్రధాన రెండు విరుద్ధ వర్గాల (దోపిడి చేసే/ దోపిడికి గురయ్యే) లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సామాజిక అస్తిత్వంలోని మూడవ విరుద్ధ అంశ౦. అదే సమయంలో ప్రతి సమాజంలో ఈ మూడు వర్గాలకు భిన్నంగా ప్రధాన విరుద్దాంశాల లక్షణాలేవీ లేకుండా కొనసాగే చిన్న ఉత్పత్తిదారులు, వ్యాపారులు, చిన్న కమతందారులు, గత వ్యవస్థల తాలూకు అవశేష సమూహాలు, ఆదివాసులు వగైరా రూపంలో ఉండే సామాజిక సమూహం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ప్రధాన విరుద్ధ వర్గాల స్వభావిక లక్షణాలు లేని ప్రజా సమూహం కూడా నాల్గవ విరుద్ధ అంశంగా ఉనికిలో ఉంటుంది.
మూడు, నాలుగు సామాజిక అస్తిత్వాలు లేదా వర్గాలుగా ఉనికిలో ఉన్నవి కూడా పాలకవర్గాల దోపిడికీ గురవుతూ ఉంటాయి. సామాజిక స్థితి(బీయింగ్-ఆధిపత్య పాలకవ ర్గం), సామాజిక అనస్థితి (సోషల్ నాన్ బీయింగ్-దోపిడికి గురయ్యే వర్గం), సామాజిక స్థితి, అనస్థితి రెండూనూ, (బోత్ బీయింగ్ అండ్ నాన్ బీయింగ్-ప్రధాన రెండు వర్గాల లక్షణాలను ఏకకాలంలో కలిగిన మధ్యతరగతి), సామాజిక స్థితి, అనస్థితి రెండూ కాదు(నైదర్ బీయింగ్ నార్ నాన్ బీయింగ్-ప్రధా నేతర వర్గాల లక్షణాలు లేని జనసమూహం). స్థితి, అనస్థితి, రెండూనూ, ఏది కాదు అనే విరుద్ధ అంశీ భూతాలు నాల్గింటితో కూడుకున్నదే పాదార్థిక అస్తిత్వం (ప్రకృతి పదార్థం, సామాజిక పదార్థం). ఈ తా త్విక అంశాన్నే చతుష్కోటి (చతుష్- నాలుగు; బౌద్ధం ప్రకారం కోటి-అస్తిత్వం) అంటే నాలుగు పర స్పర విరుద్ధాంశాలతో కూడిన పాదార్థిక వ్యవస్థ(ప్రకృతి+సామాజిక పదార్థం) అని అర్థం చేసుకోవాలి.
పాలకవర్గాలు మిగిలిన మూడు వర్గాలు/మూడు విరుద్ధాంశాలను దోపిడి చేస్తాయి, రాజ్యం ద్వారా అణచివేతకు, సామాజిక శాంతి రూపంలోని ఆధిపత్య సామరస్యతకు గురిచేస్తాయి. రాజ్యం అంటేనే సర్వసాధారణ బూర్జువా(పాలక) వర్గంగా సామాజిక శాంతిని, మరోమాటలో దోపిడికి అడ్డంకులు లేని మార్కెట్ శాంతిని నెలకొల్పడమే. ప్రభుత్వం ముందుకుతెస్తున్న శాంతి చర్చల ప్రతిపాదన వెనుక అంతకంటే గొప్ప ఉద్దేశమేమీ లేదన్నది విదితమే. అయితే పర్యావరణ విధ్వంసానికి, ఆదివాసీ అస్తిత్వ హననానికి, ఆర్థిక వ్యవస్థను డచ్ రోగానికి గురి చేసి, దేశ ప్రజలను బలి చేసే కార్పొరేట్ తరహా శాంతి ప్రతిపాదనను ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఆర్థిక సంక్షోభాన్ని సహజ వనరుల వాణిజ్యం ద్వారా పూడ్చుకోవాలన్న ప్రయత్నం ఆత్మహత్యాసదృశ్యమైనది. ‘చిన్నది దివ్యమైనది’ అనే బౌద్ధ దార్శనికతను (ప్రభుత్వం పుణికిపుచ్చుకోగలిగితే, భారత సమాజానికి మేలు చేసినట్లవుతుంది. అదే విధంగా చతుష్కోటి గతితర్కం రీత్యా సామాజిక స్థితిని మావోయిస్టులు అర్థం చేసుకోవాల్సిన చారిత్రక సందర్భమిది. నాలుగు సామాజిక విరుద్ధ అంశాల అభావంతో కూడిన రాజకీయ కార్యక్రమాన్ని రూపొందించుకోనంత వరకు వారు కోరుకుంటున్న విప్లవం సాధ్యం కాదు.
యుద్ధం-శాంతి అనే భావన యుగ్మ దృష్టితో చూస్తే రెండు వైరి పక్షాల మధ్య ఘర్షణగా మాత్రమే అర్థం చేసుకుంటే ఎన్ని యుద్ధ తంత్రాలను పుణికి పుచ్చుకున్నా ఫలితం ఉండదు. ప్రధాన సామాజిక విరుద్ధాంశాల మధ్య ఘర్షణ కేంద్రంగా, రెండు ప్రధాన విరుద్ధ వర్గాల లక్షణాలను ఏకకాలంగా కలిగిన మధ్యతరగతి, ప్రధాన విరుద్ధ వర్గాల లక్షణాలు ఏవీ లేని వర్గ సమూహాల ప్రత్యేక సమస్యలతో కూడిన ప్రజా ఉద్యమాలను నిర్మించడమనేది విప్లవానికి పూర్వావసరం. ప్రజా ఉద్యమాల పునాదిగా, పరాకాష్టగా, వైషమ్య స్థితిగా ప్రజాయుద్ధం ఉనికిలో ఉంటుంది. అంతేగానీ, ప్రజా ఉద్యమ పునాదిని, నాలుగు విరుద్ధాంశాల అభావాన్ని సుగమం చేసే ప్రజా ఉద్యమాల నిర్మాణ అవగాహన, నైపుణ్యం, చారిత్రక అవకాశం లేని కారణంగా నిర్జీంగా మారిన మావోయిస్టు ఉద్యమం చారిత్రక అనివార్యతకు గురికాకతప్పదు. ఈ నేపథ్యంలో చారిత్రక అర్థరాహిత్యంతో స్వీయాత్మక భావవాద బలహీనతలకు గురైన మావోయిస్టు పార్టీ, దాని పౌర సమాజ ప్రముఖుల సమూహం, ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న చొప్పదంటు చర్చలు జరిగినా, జరగకపోయినా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు.
వెన్నెలకంటి రామారావు
9550367536
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.