
మన దేశానికే కాకుండా ప్రపంచానికి తెలిసిన స్వరయోగి త్యాగయ్య. మన సంస్కృతికి పట్టుకొమ్మ. తెలుగు వారే అయినా తమిళనాడులో వెలిగిన మహానుభావుడు. మొత్తం దక్షిణ భారతదేశానికి తెలిసిన వెలుగు. కర్నాటక సంగీతాన్ని కూడా నిలిపి వెలిగిన ఒక ధృవతార. మన సంగీత ప్రపంచ నాదానికి యోగి. పాటకు రాజు, రాగానికి రారాజు, త్యాగరాజు. అంతేకాకుండా మహాయోగి, త్యాగ యోగి. త్యాగరాజు రచయిత అయిన స్వరార్ణవం త్యాగరాజు పుట్టిన రోజు భారతీయ సంగీత దినోత్సవం. నాదయోగి అయిన త్యాగరాజు 1767వ సంవత్సరం మే 5వ తేదీన జన్మించారు. అయితే, అంతగా దొరికే ప్రామాణిక వివరాలు లేవు.
1847 జనవరి 6న ఈ గాన బ్రహ్మ తన శరీరాన్ని వదిలిపెట్టారు. కళా ప్రక్రియ అనే కర్ణాటక భారతీయ స్వరకర్త ఆయన. కీర్తన, కృతి, రాగ స్రష్ట. అనేక బహుళ ప్రక్రియలో భక్తి పాటలకు పెట్టిన పేరు త్యాగరాజు. దక్షిణ భారత శాస్త్రీయ సంగీత చరిత్రలో మరచిపోవడం సాధ్యం కాదు, సమకాలీన కర్ణాటక సుప్రసిద్ధ గాయకులు సంగీతకారులచే సన్మానాలు సాధించిన వారు. త్యాగరాజు వేలాది కృతుల సంగీతాన్ని, పదాలను స్వరపరిచారు. పుష్య బహుళ పంచమి ముందు, తరువాత అంటే జనవరి, ఫిబ్రవరి నెలలలో కొన్ని వారాల పాటు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో త్యాగరాజు కీర్తనలు ప్రతిధ్వనిస్తుంటాయి. ఈ త్యాగరాజ కీర్తనలతో ఆరాధనోత్సవాల సంప్రదాయం 1907 నుంచి మొదలైంది. విశేషమేమంటే ఈ ఆరాధనోత్సవాలు పుట్టిన రోజు కాదు.
19వ శతాబ్దంలో కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ముఖ్యుడు ఈ త్యాగరాజ స్వామి. మరో ఇద్దరు శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు వారు. ఈ ఇద్దరూ సమకాలికుడీయన. వీరు ముగ్గురూ తమిళనాడులోని, తంజావూరు జిల్లా తిరువాయరుకు సంబంధించిన వారే. తమిళదేశంలో పుట్టి పెరిగినా వారి గానం ఎక్కువగా తెలుగు, సంస్కృతాల్లోనే సాగింది. త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించారు. ముఖ్యంగా తెలుగులో కీర్తనలు రచించి స్వర రచన చేసి పాడిన మహానుభావుడు. ఎక్కువ కాలం తంజావూరులో ఉన్నారు.
వారిలో పంచరత్న కృతులు త్యాగరాజు కర్ణాటక సంగీతానికి ఐదు రత్నాల వంటి కీర్తనలు ఉంటాయి. త్యాగరాజస్వామి స్వరపరచిన ఈ ఐదు కృతులను “త్యాగరాజ పంచ రత్నాలు” అని తెలియని వారుండరు. 19 వ శతాబ్దంలో శాస్త్రీయ సంగీతానికి ప్రాణం పోసిన త్రిమూర్తి వాగ్గేయకారులలో ఒకడైన త్యాగయ్య అందించిన వేలాది కీర్తనలలో రత్నాల వంటివి.
మహా సంగీతజ్ఞుడు మంగళంపల్లి బాలమురళి..
‘‘ఈ రోజు సంగీత విద్వాంసులంతా ఆయన సమాధి చుట్టూ కూర్చుని ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తారు. సంగీతాన్ని ఆలపించే విద్వాంసులే కాక భారతీయ శాస్త్రీయ సంగీతాభిమానులు ఆ సంగీతాన్ని వినడానికి అక్కడికి వస్తారు. అప్పట్లో బెంగుళూరు నాగరత్నమ్మ అప్పటి విద్వాంసులలో ఆమెకు ప్రముఖ స్థానం ఉండేది. త్యాగరాజుకు, సంగీతానికి వీరాభిమాని అయిన ఆమె అప్పట్లో మద్రాసులో నివసించేవారు. ఆమె ప్రదర్శనల్లో చాలావరకు ఆయన కృతులను ఆలపించేది. ఆయన అనుగ్రహం వల్లనే తనకు మంచి సంపద సమకూరిందని భావించేది. 1921లో ఆమెకు వయసు మీరింది. పిల్లలు కూడా లేరు. ఆమె తన యావదాస్తినీ త్యాగరాజు వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందేలా చేయడానికి ఆయన స్మృతులను భద్రపరచడానికి రాసిచ్చేశారు. ఆ స్థలం గ్రామ పంచాయితీకి సంబంధించినదనీ, ఆమె నిర్మాణం నిబంధనలకు విరుద్ధమైనదనీ, కానీ ఆమె ఉద్దేశం మంచిదవడంతో గ్రామపెద్దలు అందుకు అడ్డు చెప్పలేదనీ భావించారు. ఆ సమాధి దగ్గరే త్యాగరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసింది. 1926 మొదట్లో ఆ ఆలయానికి కుంభాభిషేకం జరిగింది’’ అంటూ మంగళంపల్లి బాలమురళి కృష్ణ తన చిన్నతనంలో ఆమె ఎదుట కచేరీ చేసారని ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.
1847 సిద్ధిపొందిన త్యాగరాజును తిరువయ్యూరుకు కావేరీ నదీ తీరాన సమాధిని నిర్మించి, దానిని తులసీ బృందావనంగా మార్చారు. ఆమె తన ఆస్తి మొత్తం అమ్మేసి ఆ డబ్బుతో త్యాగరాజ సమాధి చుట్టూ మందిరాన్ని నిర్మించారు. 13 సంవత్సరాలు ప్రతి ఏడాది సమాధి మందిరంలో నాగరత్నమ్మ కీర్తనలతో ప్రముఖ సంగీతజ్ఞులతో కార్యక్రమాలను నిర్వహించేవారు. 1937న త్యాగరాజు విగ్రహం నెలకొల్పారు. 1957లో గోడలమీద పాలరాతి ఫలకాలతో త్యాగరాజ కృతులను చెక్కించారు. త్యాగరాజు రామ కీర్తనలతో జీవనాన్ని సాగించారు. కాబట్టి రామాయణ రచయిత వాల్మీకి విగ్రహాన్ని నెలకొల్పారు. ఇదొక గొప్ప మనదేశ సంస్కృతిలో భాగమయింది. అదే యజ్ఞంగా సాగింది. అనేకానేక టీవీ ఛానెళ్లు తిరువయ్యూరి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
రామేతిమధురం..
‘రామేతి మధురం వాచం’ అని పెద్దలు చెప్పినందుకు 96 కోట్ల సార్లు రామనామాన్ని త్యాగరాజు జపించారు. ఎంత ఆశ్చర్యం. నాదోపాసన ద్వారా భగవంతుని చేరుకోవచ్చని నిరూపించిన వ్యక్తి త్యాగయ్య. ఆయన శ్రీరామభక్తి అజరామరమైనది.
రామకృష్ణానంద పరబ్రహ్మం రామ షడక్షరీ మంత్రాన్ని 18 ఏళ్ల వయసులోనే త్యాగరాజు ఔపోసన పట్టారు. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా కాకర్ల గ్రామం నుంచి తంజావూరు వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆస్థానంలో ఉండేవారు. త్యాగరాజు తాత గిరిరాజ కవి తెలుగు వాగ్గేయకారుడు.
కాకర్ల రామబ్రహ్మం, సీతమ్మ దంపతులకు నారదుడు స్వప్నంలో కనిపించి ఒక కుమారుడు జన్మిస్తాడన్నారనీ, దీంతో ఆయనకు త్యాగరాజు నామకరణం ఆదేశించారట. మూడవ కుమారుడు. ములకనాడు తెలుగు వాడు. భరద్వాజ గోత్రీకులు, త్రిలింగ వైదికులనీ, ఆపస్తంభ సూత్రులనీ వారన్నారు. త్యాగరాజు పూర్వీకులు ప్రకాశం జిల్లా, కంభం మండలం కనుక నారద ముని త్యాగరాజస్వామి మంత్రోపదేశంతో ‘స్వరార్ణవం’, ‘నారదీయం’ అనే రెండు సంగీత రహస్యార్ధ ‘శాస్త్ర గ్రంథాలు’, ‘ప్రహ్లాద భక్తి విజయం’, ‘నౌకా చరితం’ అనే నాట్యరూపకాలను కూడా రచించారు.
త్యాగయ్యను వ్యాసో నిగమ చర్చయా మృదుగిరా వల్మీక జన్మామునిః
వైరాగ్యేశుక ఏవ భక్తి విషయే ప్రహ్లాద ఏవ స్వయం
బ్రహ్మా నారద ఏవచా ప్రతియ యోః సాహిత్యా సంగీతయోః
యో రామామృత పాన నిర్జిత శివః తం త్యాగరాజం భజే
అని ఆయన ప్రియ శిష్యుడు వాలాఝాపేట వేంకటరమణయ్య భాగవతార్ ఈ శ్లోకాన్ని ప్రస్తుతించారు. ఒక అద్భుతంగా ఈ అర్థాన్ని వివరించారు. ‘‘వేదములను విప్పి చెప్పడంలో ఆయన వ్యాసుడు. మధురమైన వాక్యములు రచనలో వాల్మీకి కవి. వైరాగ్యములో శుకుని వంటి వాడు. భక్తిలో ప్రహ్లాదుని వంటి వాడు. సాహిత్యములో బ్రహ్మ వంటి వాడు. సంగీతములో నారదుని వంటి వాడు. రామ నామమనే అమృతానికి త్రాగడంలో పరమశివుని వాడు’’ అని రచయితలు అక్కిరాజు ప్రసాద్, రవిరాజు ఆదిరాజు కలిసి వ్యాసంలో వివరించారు.
తల్లి పాలు తాగుతున్న పసిపిల్లలు త్యాగరాజు సంగీతం వినబడితే చాలు పాలు తాగడం ఆపి తల తిప్పి సంగీతం వినేవారట. ‘ఒకసారి రామబ్రహం తన కుటుంబంతో కాశీ ప్రయణం అవుతుండగా ఆ త్యాగరాజస్వామి(శివుడు) మళ్లీ స్వప్నంలో కనబడి తిరువైయారు వెళ్లమని, అదే అతనికి కాశీతో సమానమని చెబుతాడు. రామబ్రహ్మం ఈ విషయం రాజావారికి తెలుపగా అయన తిరువైయారులో రామబ్రహ్మానికి ఒక ఇల్లుతో పాటు ఆరెకరాల పొలం ఇస్తారని వివరించారు. త్యాగరాజస్వామి కీర్తనల్ని ‘త్యాగరాజు ఆత్మ విచారం’ పేరిట గొప్ప వచనంగా భమిడిపాటి కామేశ్వరరావుగారు ప్రచురించారు. కాటూరి వెంకటేశ్వరరావు సాహిత్య అకాడెమీ కోసం ‘తెలుగు కావ్యమాల’ను కూడా ఒక సంకలనం చేశారు. ఎన్.విజయ శివ అనే మరో రచయిత త్యాగరాజ కీర్తనలకి స్ఫూర్తి రామాయణంలోనిసుందర కాండంలో ఉందని వివరించారు. ఆనాటి సుప్రసిద్ధ త్యాగరాయ కృతి, పంచరత్న కీర్తనల్లో ఒకటైన ‘ఎందరో మహానుభావుల’కు స్ఫూర్తి, సుందరకాండలో (26:50) సీతాదేవి పలికిన ఈ శ్లోకంలో ఉందంటాడాయన:
ప్రియాన్న సంభవేద్దుఃఖమప్రియాదధికమ్ భయమ్
తాభ్యామ్ హి యే వియుజ్యంతే నమస్తేషామ్ మహాత్మానామ్
(ప్రియమైనది దొరకలేదనే దుఃఖంగాని, అప్రియం నుంచి గొప్ప భయం కాని ఉండని ఆ మహాత్ములెవరో, ప్రియాప్రియాలు రెండింటికీ దూరంగా ఉండేవారెవరో ఆ మహాత్ములకు నమస్కారం అని అర్థం). గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ‘‘ఎందరో మహానుభావులు’’అనే కీర్తనను స్వరపరచి పాడారు. పదమూడేండ్ల చిరు ప్రాయంనాడే త్యాగరాజు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశిక తోడి రాగంలో స్వరపరచారు.
ఈ నాదయోగి కాకర్ల త్యాగరాజస్వామి, పుష్య బహుళ పంచమి 1847 సంవత్సరన సిద్ధి పొందిన రోజు. తిరువాయూరులో కావేరీ తీరాన శిష్యులందరూ చూస్తూ ఉండగా విదేహముక్తి పొందిన యోగి ఆయన. త్యాగరాజుస్వామి చరిత్ర రూపంలో ప్రధానంగా రచించిన వారు ఆయన శిష్యులు వేంకటరమణ భాగవతార్, కృష్ణస్వామి భాగవతార్. వీరిద్దరు తండ్రీ కొడుకులు. తండ్రి త్యాగయ్య జీవితంలోని మొదటి భాగం విశేషాలు ఇస్తే, కృష్ణస్వామి భాగవతార్ రెండవ భాగం విశేషాలు రచించారు. వీరు తాళపత్రాలలో, నోటుబుక్కుల రూపంలో ఉన్న త్యాగయ్య సాహిత్యాన్ని మధురైలోని సౌరాష్ట్ర సభలో పదిల పరచారట. అక్కడే త్యాగయ్య ఉపయోగించిన తంబుర మొదలైన అపురూపమైన వస్తువులు కూడా ఉన్నాయి. ఈ తండ్రీ కొడుకులిద్దరూ కూడా త్యాగరాజస్వామి వారి చరిత్రను తెలుగులోనే రచించారు. ప్రముఖ సంగీత పరిశోధకులు పీ సాంబమూర్తి కృష్ణస్వామిని స్వయంగా కలిసి, వారి జీవితశైలిని గమనించి కొన్ని సంభాషణలకు పుస్తక రూపం కూడా ఇచ్చారు. ఆ తండ్రీ కొడుకుల జీవితంపై త్యాగయ్య సాహిత్య ప్రభావం పరిపూర్ణంగా ఉందని సాంబమూర్తిని అక్కిరాజు ప్రసాద్ తెలిపారు. రవిప్రసాద్ ఆదిరాజు కూడా ఆయనకు సహాయం చేశారు. ఈ సందర్భంలో చెప్పవలసిన మరొక విషయం ఏమంటే సామవేదం షణ్ముఖ శర్మ త్యాగ రాజవైభవం అని ఏడు భాగాలలో ప్రవచనం తప్పకుండా విని తీరవలసినవి. ఇది ఏ పుస్తకంలోనూ దొరకవు, అవి ప్రవచన ప్రధానమని అర్థం చేయాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.