
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దుర్ఘటనను మతోన్మాదపు దృక్కోణంలో దేశం ముందుంచటంలో ప్రసార మాధ్యమాలు- దృశ్యమానమైనవీ, వృత్తాంత భరితమైనవీ- పోటీపడుతున్నాయి.
ఏప్రిల్ 29న నా రోజువారీ సైక్లింగ్ సమయంలో దేశంలో ముస్లిం వ్యతిరేకత ఎంతగా వేళ్లూనుకుందో అర్థమైంది. ఆరోజు ఇద్దరు బుర్ఖా వేసుకున్న మహిళలు నోయిడా సెక్టర్ 168 సమీపంలో ఉన్న చాప్రోలి గ్రామం కూడలి మీదుగా వెళ్తున్నారు. అందులో ఒకరు ఫోన్ ఎత్తిపెట్టి ఏదో రికార్డింగ్ చేస్తోందో లేక సెల్ఫీ తీసుకుంటుందో తెలీదు. దారిన పోయే వ్యక్తి ఒకరు జోక్యం చేసుకుంటూ రికార్డు చేసి పాకిస్తాన్ పంపుతావా ఏంటి అని కేకలేస్తున్నాడు. నిజానికి ఆ ఇద్దరు ముస్లిం మహిళలు వాళ్ల పనేదో వాళ్లు చేసుకుంటున్నారు. కానీ వాళ్లను చూసి వచ్చిన వ్యాఖ్యలు గమనిస్తే దేశంలో సాధారణ వ్యక్తుల్లో సైతం ముస్లింల పట్ల ద్వేషం, అపనమ్మకం ఏ స్థాయికి చేరాయో అర్థమవుతుంది. పహల్గాంలో హిందువులైన పర్యాటకులను మతం అడిగి మరీ కాల్చి చంపారన్న వార్తలు ఎలక్ట్రానిక్ మీడియాలోనే, డిజిటల్ మీడియాలోనూ పెద్దఎత్తున ప్రచారంలో ఉండటం వల్లనే సాధారణ భారతీయుల్లో కూడా ఈ రకమైన మనోభావాలు గడ్డకట్టుకునే స్థాయికి చేరి ఉండవచ్చు. పహల్గాంలో జరిగిన దాడి హేయమైనదనటంలో సందేహం లేదు. ఉగ్రవాదుల స్వైరవిహారంలో 26మంది పర్యాటకులు చనిపోయారు.
ఈ పరిస్థితుల్లో చనిపోయిన వారిలో హిందూ ముస్లింలు ఎందరు, చంపిన వారెవరు అన్న కోణంలో కాకుండా ఇంత తీవ్రమైన నిరంతర నిఘా నీడలో ఉన్నా కూడా కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు ఎలా జొరబడ్డారు, ఎలా ఆ ప్రాంతానికి చేరుకున్నారు, ఎలా అమాయకులను బలిగొన్నారు, ఉగ్రవాదులు ఈ ప్రాంతానికి సాయుధులై చేరుతున్న సమయంలో మన భద్రతా బలగాలు వీళ్ల కదలికలను పసిగట్టకుండా ఏమి చేస్తున్నాయనే కోణంలో చర్చలు జరిగితే మరింత లోతైన వివరాలు, విషయాలు పాఠకులు, వీక్షకుల దృష్టికి వచ్చేవి. ఎలక్ట్రానిక్ మీడియా అయినా ప్రింట్ మీడియా అయినా దృష్టి సారించాల్సిన కోణాలు ఇవి. ఇంతగా పర్యాటక రద్దీ ఉన్న ప్రాంతంలో భద్రతా బలగాలు కనీసం స్థానిక పోలీసులు ఒక్కరు కూడా ఎందుకు లేరు అన్నది మీడియా వేయాల్సిన మరో ప్రశ్న.
దీనికి భిన్నంగా మీడియా మాత్రం హిందువులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగాయి అన్న ఓ బాధిత కుటుంబ సభ్యుని వ్యాఖ్యలనే పదేపదే ప్రసారం చేస్తున్నాయి. అవసరమైన రీతిలో తనిఖీ, పున:పరిశీలన జరిగిన తర్వాతనే ఈ వీడియోలు ప్రసారం చేస్తున్నారా లేక వచ్చింది వచ్చినట్లు ప్రసారం చేస్తున్నారా అన్నది తెలీదు. హిందువులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగాయన్న వార్తలు పుంఖానుపుంఖాలుగా ప్రసారం అవుతుంటే ఎంతో మంది పర్యాటకులను కాపాడటంలో ప్రాణాలకు తెగించి కృషి చేసిన స్థానిక ముస్లింల గురించిన కథనాలు మాత్రం మీడియా దృష్టినాకర్షించలేకపోయాయి. మీడియా పాలకవర్గ దృక్కోణాన్ని నెత్తికెత్తుకొంటోందనీ, వాస్తవాలు చూడనిరాకరిస్తోందనీ చెప్పటానికి ఇది ఓ ఉదాహరణ.
గందరగోళంలో చిక్కుకున్న పర్యాటకులను సాదరంగా ఆహ్వానించి తమ ఇళ్లల్లో ఆశ్రయం ఇచ్చి చివరకు మసీదులు కూడా వారికి శిబిరాలుగా ఏర్పాటు చేసిన విషయాలు గురించి లోకానికి తెలియచేసేందుకు మీడియా పెద్దగా ఆసక్తి చూపటం లేదు. స్థానిక ముస్లింలు అందించిన సహాయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ప్రశంసిస్తున్న పర్యాటకుల సోషల్ మీడియా పోస్టులు మాత్రం పెద్దగా ఆదరణకు నోచుకోలేదు.
పర్యాటకులను గుర్రాలపై తీసుకెళ్లే స్థానిక పర్యాటక రంగ సహచరుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ ఉగ్రవాది నుంచి తుపాకి లాక్కోవడానికి చేసిన ప్రయత్నంలో తుటా గుండెల్లోంచి దూసుకెళ్లటంతో చనిపోయారు. ఈ విషయంగా ఒకటి రెండు టివి చర్చల్లో పాల్గొనే అవకాశం నాకు వచ్చింది. కానీ టివి స్టూడియోలో ఉన్న వ్యాఖ్యాతలు, యాంకర్లు పదేపదే నేను చెప్పదల్చుకున్నది పూర్తి చేసేంత వరకూ కూడా ఓపిక లేకుండా వ్యవహరించారు. మధ్యమధ్యలో అనేకసార్లు నన్ను వారించటానికి ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని పదేపదే ఛానెల్ వారి దృష్టికి తేవటంతోపాటు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ప్రధానంగా హిందువులే అన్న విషయాన్ని కూడా నొక్కి చెప్పాల్సి వచ్చింది.
హిందువులన్న వారిని ఎంపిక చేసుకుని కాల్చారన్న వార్తలో ఎంత నిజం ఉందో పర్యాటకుల స్వీయానుభవాలు నమోదు కానీయకుండా ఏకపక్షంగా పహల్గాం దాడి అంతా కేవలం హిందువులకు వ్యతిరేకంగా సాగిన దాడి అన్న వ్యాఖ్యానాలు ప్రసారం చేయటం ద్వారా సాధారణ ప్రజల్లో సైతం ఇరుగుపొరుగున నివసిస్తున్న ముస్లింల పట్ల ఏహ్యభావాన్ని నింపటానికి ప్రయత్నం జరుగుతోందన్న విషయం కూడా అంతే వాస్తవం. పహల్గాం ఉదంతాన్ని మతోన్మాద దృక్కోణంలో చూపించటం ద్వారా ఇప్పటికే దేశంలో పేట్రేగిపోతున్న ముస్లిం వ్యతిరేక భావోన్మాదాలకు ఆజ్యం పోస్తోంది మీడియా. ఈ పరిస్థితులు దేశవ్యాప్తంగా ఏదో ఒక వృత్తి కోసం పొట్ట చేతబట్టుకుని వచ్చిన కశ్మీరీలు, ముస్లింలకు వ్యతిరేంగా దాడులను ప్రేరేపిస్తున్నాయి.
ప్రతి రోజూ రాత్రి ఎనిమిది గంటలకు టివిల్లో జరిగే చర్చల్లో కేవలం ముస్లిం వ్యతిరేకతే ప్రధానంగా సాగటం దేశంలో సాధారణ ప్రజల్లో సైతం వేళ్లూనుకుంటున్న ముస్లిం వ్యతిరేకతకు నిదర్శనం. నా వ్యాసం మొదట్లో ప్రస్తావించిన సంఘటనలు కూడా అమాయకులైన సాధారణ ముస్లింలు తమ జీవనోపాధి కూడా గౌరవంగా పొందలేని పరిస్థితులు కల్పిస్తున్నాయి. పైన ప్రస్తావించిన సంఘటన ఏదో ఒకటో అరగా జరిగిన వ్యవహారం కాదు. అకస్మాత్తుగా జరిగింది కూడా కాదు. దశాబ్దానికి పైగా సాగుతున్న ముస్లిం వ్యతిరేక మతోన్మాద ప్రచారం ఫలితమే ముస్లింలపై వేళ్లూనుకుంటున్న ద్వేషభావన. దీనికి పోలీసు సిబ్బంది కూడా తమవంతు సహాయక పాత్ర పోషిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన దాడులు గురించి చూశాము. దాడులను నియంత్రించాల్సిన పోలీసు సిబ్బంది ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటే వారి కళ్ల ముందే ముస్లిం కుటుంబాలు నాశనం చేసే స్థాయికి చేరింది. మరికొన్ని చోట్ల పోలీసులు కూడా ముష్కరులతో కలిసి ముస్లింలపై దాడులకు తెగబడ్డారు.
డులు, ముస్లింలకు వ్యతిరేకంగా జాతి వ్యతిరేక కార్యకలాపాలు నుంచి ముస్లింలను చట్టాలు కూడా కాపాడలేకపోతున్నాయి. అనేక సందర్బాల్లో కోర్టులకెక్కటం అంటే జీవితాంతం శిక్ష అనుభవించటంగా మారిపోయింది. సుదీర్ఘమైన విచారణ తర్వాత నేరారోపితులైన ముస్లింలు గౌరవంగా నిర్దోషులుగా జైళ్ల నుండి బయటికి వస్తున్నా ఆపాటికి వారి కుటుంబాలు కకావికలై కుటుంబ సభ్యులు బతుకులు ఛిద్రమవుతున్నాయి. ముస్లిం వ్యతిరేక భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో భాగంగా మన రోజువారీ వ్యవహారాల్లో లవ్ జీహాద్, లాండ్ జీహాద్, ఓట్ జీహాద్, చివరకు యుపిఎస్సీ జీహాద్ వంటి పదాలు చొరబడుతున్నాయి.
మసీదుల ముందు సంఘవిద్రోహ శక్తులు వికృతకార్యకలాపాలకు పాల్పడటం ఈ మధ్యకాలంలో సాధారణమైపోయింది. పండలు, పర్వదినాల్లో జరిగే ప్రదర్శనల్లో భాగంగా కత్తులు, ఇతర మారణాయుధాలు ప్రదర్శిస్తూ మసీదుల ముందు వికృత చేష్టలకు పాల్పడటం అప్పుడప్పుడూ ఘర్షణలకు దారితీస్తోంది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చివరకు సుప్రీం కోర్టు ఆదేశాలు సైతం లెక్కచేయకుండా ముస్లింల నివాసాలను, వాణిజ్యకేంద్రాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నాయి. ముస్లింలు కనీసం నోరెత్తి తమ గోడు చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోతోంది.
ఈ మొత్తం వ్యవహారాలకు ప్రధాన కారణం మీడియానే అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే హిందూ ముస్లిం చీలికను పెంచే లక్ష్యంతో మీడియా సంస్థలు కశ్మీరీలను దోషులుగా చూపడానికి పదేపదే ప్రయత్నం చేయటం చూస్తున్నాము. ప్రాణాలు దక్కించుకున్న పర్యాటకులు మీడియా కథనాలకు భిన్నంగా తమ వాస్తవిక అనుభవాలు పంచుకోవటం కాస్తంత ఉపశమనంకలిగించే అంశం. సమాజంలో మరింత చీలికలు, విద్వేషాలు చెలరేగిపోకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నివారణోపాయాలు ఆలోచించాలి.
2008లో ముంబైపై దాడులు జరిగినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రకటనను, 2025లో పహాల్గాం దాడి తర్వాత ప్రధాని మోడీ ప్రకటనను పోల్చి చూడటం ఉపయుక్తంగా ఉంటుంది. ముంబై దాడుల నేపథ్యంలో అప్పటి ప్రధాని ‘‘ఈ దాడుల వెనకున్న శక్తులు లౌకిక ప్రజాతంత్ర దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు, సామాజిక ఆర్థిక అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ దాడులతో లౌకిక ప్రజాతంత్ర భారతం అన్న భావనే పెను సవాళ్లు ఎదుర్కొంటోంది సమైక్యంగా మనం ఈ సవాళ్లను అధిగమించాలి.’’ అని పిలుపునిచ్చారు. అప్పటి వరకూ మతోన్మాద ప్రవృత్తితో దేశ ప్రజలు రెండు శిబిరాలుగా చీలిపోలేదు కాబట్టి ప్రధాని మన్మోహన్సింగ్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో దేశాన్ని ఏకతాటిమీద నిలబెట్టగలిగారు.
ముంబైదాడుల నేపథ్యంలో పరిస్థితులు మతోన్మాద రాజకీయాలకు పెద్దపీట వేయలేకపోవటానికి మరో కారణం అప్పట్లో మీడియా మౌలిక లక్ష్యాలు, ఆదర్శాల విషయంలో రాజీ పడలేదు. స్వయంప్రతిపత్తిని నిబద్ధతను నిలుపుకుంటూనే వచ్చింది. విపత్కర పరిస్థితుల్లో మతోన్మాదపు ధోరణులకు అవకాశం ఇవ్వలేదు. దురదృష్టవశాత్తూ నేడు పరిస్థితులు ఎంతో మారిపోయాయి ప్రధాన స్రవంతి మీడియా, డిజిటల్ మీడియాలో ఓ భాగం నిరంతరం విచ్ఛిన్నకరవాదనలు సమాజం ముందుంచి ప్రజల మధ్య అగాధం పెంచేందుకు మాత్రమే పని చేస్తున్నాయి. విద్వేషపూరిత ప్రచార సాధానాలుగా మారిన మీడియా భారతదేశ వైఫల్యానికి కీలక కారణంగా మారుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో నాల్గో స్థంభంగా మీడియా తన విధినిర్వహణకు కట్టుబడి ఉండాలి.
సంజీవ్ కిశోర్ సూద్
అనువాదం: కొండూరి వీరయ్య
రచయిత సరిహద్దు భద్రతా దళాల అదనపు మాజీ డైరెక్టర్ జనరల్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.