
అది 2008 నవంబరు 28. ముంబైపై ఉగ్రవాదం పంజా విసిరిన రెండు రోజుల తర్వాత అప్పటికి నగరం భద్రతాదళాల పహారా కింద ఉన్నది. అప్పటికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ ముంబై పర్యటనకు వచ్చారు. ఉగ్రవాదుల దాడికి శిథిలమైన ఒబెరాయ్, తాజ్ హోటళ్లను పరిశీలించారు. అప్పటికే ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు జరుగుతున్న సైనిక చర్యల గురించి దేశానికి వివరించటానికి కాచుకుని ఉన్న మీడియా బృందాన్ని కలిసి మాట్లాడేందుకు సిద్ధమాయ్యరు.
అంతకు ముందు రోజే ప్రధాని మన్మోహన్సింగ్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగం విన్న మోడీ దేశ ప్రజల మనోభావాలకు ప్రధాని ప్రసంగం అద్దం పట్టేదిగా లేదనీ, పేలవంగా ఉందనీ విమర్శించారు.
అంతర్గత భద్రత గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాలని మోడీ డిమాండ్ చేశారు.
అంతకు ముందు రోజే ముంబైపై జరిగిన ఉగ్రవాదుల దాడి భారతదేశంపై ప్రకటించిన పూర్తి స్థాయి యుద్ధమేనని భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యానించింది. కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం తీసుకోబోయే అన్ని చర్యలకు పూర్తి మద్దతును ప్రకటించింది. మోడీ పర్యటన సమయానికి ఓవైపున పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు పోరాడుతూ ఉంటే మోడీ విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని ప్రసంగాన్ని తప్పు పట్టారు.
అప్పటికి నవంబరు చివరివారంలోనూ, డిసెంబరు మొదటి వారంలోనూ ఢిల్లీ, రాజస్థాన్ శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి మాట మార్చింది. ఉగ్రవాదులు ఇష్టం వచ్చినట్లు పేట్రేగిపోతున్నారనీ, యుపిఎ ప్రభుత్వం చేతకాని దద్దమ్మలా వ్యవహరిస్తోందనీ, బిజెపికే మీ ఓటు అంటూ ప్రధాన జాతీయ పత్రికల నిండా పూర్తి పేజీ ప్రకటనలు వచ్చాయి.
దీని అర్థం ఏమిటి? ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వాన్ని, పాలక కూటమికి నాయకత్వం వహిస్తున్న పార్టీని చవటాయగానూ, చేతకాని దద్దమ్మగానూ, దేశ భద్రత పట్ల చిత్తశుద్ధి లేనిదిగానూ, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపటానికి సిద్ధంకానిదిగానూ విమర్శించింది. ఓవైపు ఉగ్రవాదులో భద్రతా దళాలు హోరాహోరీ ఎదురుదాడిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టుబెట్టి కొద్ది రోజులు కూడా గడవక ముందే ప్రధాన ప్రతిపక్షం మాత్రం ఇది పోరాటమే కాదని తేల్చిపారేసింది.
దేశం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో ప్రభుత్వం నుండి జవాబుదారీతనం డిమాండ్ చేసిన మోడీపై అప్పటి యుపిఎ ప్రభుత్వం కేసులు నమోదు చేయలేదు. ఎఫ్ఐఆర్లు కట్టలేదు.
2008లో ముంబైలో సాధారణ ప్రజలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన 17 ఏళ్ల తర్వాత తిరిగి ఉగ్రవాదులు పహల్గాంలో అమాయకులైన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. అప్పట్లో ప్రధాని దద్దమ్మ అని వ్యాఖ్యానించిన మోడీయే స్వయంగా ప్రధాని కుర్చీలో కూర్చున్నారు. కనీసం ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని దేశానికి భరోసా ఇచ్చేందుకు కూడా మోడీకి తీరిక లేకపోయింది. కనీసం రెండు డజన్లమందికి పైగా చనిపోతే వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించేందుకు కానీ, జాతినుద్దేశించి ప్రసంగించేందుకు కానీ మోడీకి తీరిక లేదు. బీహార్ ఎన్నికల సన్నాహాల్లో తలమునకలై ఉన్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతర్గత భద్రత గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కానీ ప్రధాని కుర్చీ ఎక్కిన తర్వాత పహల్గాం నేపథ్యంలో జాతీయ భద్రత ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ డిమాండ్కు స్పందనలేదు.
ప్రస్తుతం పరిస్థితులు మారాయి. బళ్లు ఓడలు అయ్యాయి. కానీ గుర్తు పెట్టుకోవల్సిన విషయం ఏమిటంటే 2008లో కానీ ఇప్పుడు కానీ మోడీ పతాక శీర్షికల్లోనే ఉన్నారు. 2008 ముంబైపై దాడుల విషయంగా కానీ, 2019లో పుల్వామా దుర్ఘటన తర్వాత కానీ దేశంలో ప్రజాభిప్రాయాన్ని కాంగ్రెస్కు వ్యతిరేకంగా మలచటానికి మోడీ ప్రయత్నించారు. ఎన్నికల విజయానికి కావల్సిన కథనాన్ని రూపొందించారు.
అప్పట్లో ఆయన చేసిన మరో పని పెద్దగా జనం దృష్టిలో పడలేదు. తానొక్కడినే శక్తిశాలిననీ, పాకిస్తాన్ ప్రేరణతో చెలరేగుతున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కానీ జరిగే పోరాటంలో నిర్ణయాత్మక బాధ్యతలు తనకు అప్పగిస్తే పరిస్థితులు వేరేగా ఉండేవన్నది ఆయన నిర్మించుకున్న పర్సనాలిటీ కల్ట్. గుజరాత్కు చెందిన మత్యకారులు పాకిస్తాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించారని, వాళ్లను వెనక్కు పంపేటప్పుడు పడవలు వదిలేయాలని పాకిస్తాన్ షరతు విధించిందని ముఖ్యమంత్రుల సమావేశంలో తాను ప్రధాని దృష్టికి తెచ్చినట్లు మోడీ 2008లో ఒబెరాయ్ ట్రిడెంట్ హోటల్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అటువంటి పడవలను కొన్నింటిని ముంబయిపై దాడికి వచ్చిన ఉగ్రవాదులు ఉపయోగించినట్లు ఆధారాలున్నాయనీ, ముంబయిపై ఉగ్రవాదుల దాడికి సంబంధించిన పీటముడిని విప్పిన తొలి వ్యక్తిని నేనేనని ఆయన చెప్పుకున్నారు.
ఈ మాటల్లో మోడీ మనోభావాలను అర్థం చేసుకోవాలంటే ఉగ్రవాదులు ముంబైపై దాడి చేసేందుకు కారణం ప్రధాని మన్మోహన్సింగ్ ఏమరుపాటు నిర్లిప్తత, నిర్లక్ష్యమేనని, తనలాగా సమయస్పూర్తితో, చాకచక్యంగా ఆలోచిస్తే ఈ దాడి జరిగేదే కాదని మోడీ చెప్పదల్చుకున్నారు. కానీ ప్రభుత్వ దర్యాప్తులో ఉగ్రవాదులు ఉయోగించిన పడవలు జపాన్ నుంచి కొనుగోలు చేసిన ఆధునిక పడవలనీ, ఆ పడవల మీద ముంబయి సరిహద్దు జలాల వరకూ ప్రవేశించిన ఉగ్రవాదులు ఆ తర్వాతనే ముంబై నౌకాశ్రయం పరిసర ప్రాంతాల్లోని మర పడవలను తస్కరించి ఒడ్డుకు చేరినట్లు తేలింది.
ఈ చర్చలన్నింటిలోనూ మనం గుర్తించాల్సింది ఏమిటంటే అసలు మోడీ అనే వ్యక్తి దేశంలో అత్యున్నత పదవీ బాధ్యతల్లో ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవి, ఆయన ప్రధాని స్థానంలో లేడు కాబట్టి దేశం ఇంత దుర్గతి పాలవుతోందన్నది ఆయన ఇవ్వదల్చుకున్న సందేశం. ఈ సందేశమే ఇప్పుడు ప్రాసంగికత కలిగింది.
గత 12 ఏళ్లుగా మోడీ ప్రధానిగా ఉన్నారు. తనలాంటి శక్తివంతుడు ఉంటే దేశంలో ఏమేమి జరుగుతుందో నెమరు వేసుకోవడానికే ఈ పుష్కరకాలం గడిచిపోయింది. ఆయన భక్తమిత్ర సపరివారం, మీడియా మాయాలోకం కూడా ఈ అభిప్రాయాలనే దేశంపై రుద్దటానికి కంకణం కట్టుకుని పని చేసింది. రెండు దశాబ్దాలుగా నిర్మించుకున్న ఇమేజిని కాపాడుకోవడానికి వీలుగానే ఆయన ప్రకటనలు, వాటి ప్రచారాలు మనం చూస్తున్నాము.
ఈ కాలంలో ఆయన హిందూ హృదయ సామ్రాట్గా దేశాన్ని శాసించే ఉగ్రనాయకుడి రూపంతో పాటు దేశంలో మంచి రోజులు రావాలంటే మోడీ కావాలన్న నినాదాల మధ్య నలుగుతూ ఉంది ఆయన నిర్మించుకున్న కృత్రిమ వ్యక్తిత్వం. 56 అంగుళాల బలశాలిగా ఉన్న మోడీ ఒక్కడే దేశాన్ని, హిందువులను కాపాడగలడన్న అభిప్రాయాన్ని దేశ ప్రజలపై రుద్దటానికి కావల్సినంత ప్రచారం జరిగింది.
మోడీ ఓ పథకం ప్రకారం నిర్మించుకుంటూ వచ్చిన వ్యక్తిత్వం, కృత్రిమ సామర్ధ్యం గురించి పహల్గాం దాడి తర్వాత పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఉగ్రదాడిని ప్రత్యక్షంగా చూసిన వాళ్లతో పాటు దేశంలోని సాధారణ పౌరులు కూడా అంతర్గత భద్రతా వ్యవహారాలు, మోడీ ప్రభుత్వ వైఫల్యాలు గురించి బహిరంగంగానే చర్చ ప్రారంభించారు. అంతేకాదు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరై బాధ్యతను భుజాన వేసుకోవాల్సిన మోడీ బీహార్ ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నం కావడాన్ని కూడా జనం గమనిస్తూనే ఉన్నారు.
ఉగ్రవాద దాడికి సంబంధించిన ప్రభుత్వ అభిప్రాయాలనూ, అంచనాలనూ వెల్లడించటానికి ఎన్నికల ర్యాలీని వేదిక చేసుకోవడం, తన వైఫల్యాలను కప్పిప్చుచ్చుకునేందుకు ఎంచుకున్న మార్గం గురించి మాత్రం బీహార్లో ఇంగ్లీషులో మాట్లాడటం అంటే ప్రపంచానికి తన తప్పు లేదని చెప్పుకోవటం తప్ప మరేమీ కాదన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు.
ఈ సభలో జనం కోరుకుంటున్న భాషలోనే మాట్లాడారు మోడీ. ‘‘(దాడికి పాల్పడిన వారిని) భూమ్మీద లేకుండా చేస్తాం’’ అని ఫీుంకరిస్తూ మనసులో మాట కార్యక్రమంలో మాట్లాడుతూ ఉగ్రవాదులు చేసిన నమ్మక ద్రోహానికి ఎటువంటి ప్రాయశ్చిత్తమూ లేదని, తాను వాళ్లను ఏ విధంగానూ మన్నించేది లేదని ధర్మబోధనలకు దిగారు. బలశాలి అయిన రాజనీతిజ్ఞుడు, అంతులేని సామర్ధ్యం కలిగిన నేత దేశానికి అవసరం వచ్చినప్పుడు మాత్రం ఆ రాజనీతిని, సామర్ధ్యాన్ని ఉపయోగించలేకపోయాడు. దేశాన్ని కాపాడలేకపోయాడు. దేశం గుర్తిస్తోన్న వాస్తవం ఇది.
రాజ్యాంగంలో 370 ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత తమ ప్రభుత్వం ఇచ్చిన భరోసా కారణంగానే దేశంలో లక్షలాదిమంది పర్యాటకులు యధేఛ్చగా జమ్ముకశ్మీర్ ప్రాంతంలో పర్యటిస్తున్నారని, అంతటి భరోసా కల్పించింది తమ ప్రభుత్వమేనన్న వాదన ముందుకు తెస్తున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బందోబస్త్ ఎక్కడ అనీ, భద్రతాదళాలు అక్కడకు చేరుకోవడానికి ఆలస్యం ఎందుకైందనీ, కనీసం సరైన సమాయానికి చేరుకుంటే కొంతమంది ప్రాణాలైనా కాపాడబడేవనీ దేశం మోడీని, ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.
మణిపూర్ మంటల్లో మాడి మసైపోతుంటే చూస్తూ పల్లెత్తి మాట్లాడని, మోడీ, కనీసం ఒక్కసారి కూడా పర్యటించటానికి సిద్ధం కానీ మోడీ గత రెండు దశాబ్దాలుగా నిర్మించుకుంటూ వచ్చిన బలశాలి, ధీశాలి, ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు అన్న ముద్రలు నాటకంలో పాత్రధారులు ధరించే ఆభరణాలే తప్ప నిజమైనవి కావన్న అభిప్రాయం క్రమంగా వేళ్లూనుకొంటోంది.
2019లో పుల్వామా దాడి వెనక ప్రభుత్వంలోని పెద్దల హస్తంతో కూడిన కుట్ర దాగి ఉందని అప్పట్లో జమ్ముకశ్మీర్ గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్ చేసిన విమర్శలు, బయటపెట్టిన వివరాల నేపథ్యంలో పుల్వామా తర్వాత కూడా మోడీ నేరుగా ఎన్నికల బహిరంగ సభల్లో ఈ విషయాన్ని ప్రస్తావించట వెనక కూడా ఏమైనా కుట్ర కోణం ఉందా అన్న ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా ముందుకొస్తున్నాయి.
ఈ కుట్ర కోణం గురించి పుల్వామా దాడి సమయంలో ప్రధాని దృష్టికి తీసుకొస్తే ఆయన తనను మౌనంగా ఉండమని కోరారనీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ దృష్టికి తెచ్చినా ఇదే సమాధానం వచ్చిందన్నది సత్యపాల్ మాలిక్ వాదన. ఈ విమర్శల తర్వాత సిబిఐ మాలిక్ను ప్రశ్నించిందే తప్ప మాలిక్ లేవనెత్తిన ప్రశ్నలకు మాత్రం ప్రభుత్వం నుండి లేదా ప్రధాని నుండి సమాధానం రావటం లేదు.
అందువల్లనే ఈ ప్రశ్నలు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఫలితంగా తాజా దుర్ఘటన నేపథ్యంలో ప్రజల్లో అనేక అనుమానాలు గూడుకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో డిజిటల్ బుల్లెట్లై దూసుకొస్తున్నాయి. ప్రధాని తన కృత్రిమ సామార్ధ్యాలపై, తాపడపు శక్తియుక్తులపై ఆధారపడి తన ఇమేజి బిల్డ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టే ముఖాముఖీ ఇంటర్వూలకు ఎన్నడూ అవకాశం ఇవ్వలేదు. అటువంటి వ్యక్తి ఇమేజినే సవాలు చేస్తూ ప్రశ్నలు రావటం అంత ఆశాజనకమైన పరిస్థితి ఏమీ కాదు.
ఈ సోషల్ మీడియా వేదికగా వస్తున్న ప్రశ్నల నేపథ్యంలో బిజెపి పాలిత రాష్ట్రాల్లో సోషల్ మీడియా ఖాతాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయటం ఓ ఒరవడిగా కనిపించింది. ఇదంతా మోడీ తన ప్రతిష్టను, ఇమేజిని కాపాడుకునే ప్రయత్నంలో ఉద్దేశ్యపూర్వకంగా మానవ హక్కుల హననానికి పాల్పడటం అయితే మాత్రం ఆందోళనకరం. త్రిపురలో ఓ పోలీసు అధికారిది హిందూ పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ ప్రజల సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టాలని, పహల్గాం సంఘటన నేపథ్యంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలును నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు.
పహల్గాంలో జరిగిన దాడులకు భద్రతా సిబ్బంది లోపం కారణమంటూ పోస్ట్ చేసిన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఇలా అరెస్టయినవారిలో ఒకరు. స్థానిక కోర్టు అతనికి బెయిల్ ఇచ్చిందనుకోండి. ఈ పోస్ట్ను సమర్ధించిన మరో వ్యక్తి మాత్రం ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు. మరింత లోతైన వివరాల జోలికి వెళ్లకుండా కశ్మీర్ పరిణామాల నేపథ్యంలో ఏడుగురిని అరెస్ట్ చేశారు. మరికొందరికి హెచ్చరికలు జారీ చేశారని పత్రిక పేర్కొంది.
పొరుగునున్న అస్సాంలో ఈ పరిస్థితులు కొత్త మలుపు తీసుకున్నాయి. పహల్గాం ఘటనల నేపథ్యంలో భారత్ గడ్డమీద పాకిస్తాన్ను సమర్ధిస్తున్నారంటూ 27 మందిని అరెస్టులు చేశారు. ఈ వివాదంగా అరెస్టయిన మొదటి వ్యక్తి అఖిల భారత యునైడెట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఎంఎల్యే అమినుల్ ఇస్లాం. ఈ ఎంఎల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంతా బిశ్వాస్కు మధ్య ఉన్న వివాదాలు బహిరంగ రహస్యమే. పహల్గాం దాడివెనక పుల్వామా తరహా కుట్ర దాగి ఉందనీ, మతం పేరు అడిగి పర్యాటకులను చంపారు అన్న వాదనకు ఆధారాలు లేవనీ ఓ వీడియో పోస్ట్ చేశారు. దీంట్లో ఎక్కడా బిజెపి పేరు ప్రస్తావించలేదు. అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉగ్రవాద దాడి విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాడిగా ముద్రవేసి కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 152, 196, 197(1), 113(3), 352, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్థానిక న్యాయస్థానం అతన్ని ఐదు రోజులపాటు రిమాండ్కు పంపింది.
పహల్గాం సాకుతో అరెస్టయిన మరో ముఖ్యమైన వ్యక్తి స్థానిక జర్నలిస్టు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టును అరెస్టు చేసిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన ఆందోళనల్లో ఆమె ముందుపీఠిన ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడి నుండి ప్రాణాలతో బయటపడిన బెంగాల్ వాసి పోస్ట్ చేసిన ఫేస్బుక్ పోస్ట్ను ఉటంకిస్తూ తన ఫేస్బుక్లో ప్రస్తావించారు. ఈ జరల్నిస్టు పేరు దోధిసి డింపుల్. ఆనంద బజార్ పత్రిక కథనం ప్రకారం ఈ పర్యాటకుడి మాటల్లో కశ్మీర్లో ప్రతి 20 మీటర్లకు ఓ పారా మిలటరి సిబ్బంది నిలబడ్డప్పుడు ఉగ్రదాడి జరిగిన బైసరన్లో మాత్రం ఒక్క పారా మిలటరీ సిబ్బంది కూడా కనిపించకపోవటం గమనిస్తే ఇదేదో కుట్ర పూరితంగానే జరిగిందని అభిప్రాయపడ్డట్లు రాసింది. ఆనంద బజార్ పత్రికను ఉటంకిస్తూ ఇది పథకం ప్రకారం జరిగిన దాడి అని, ఈ విషయం అస్సాం ఓటర్లకు అర్థం కావటం లేదనీ వ్యాఖ్యానించారు. తర్వాత తన ఫేస్బుక్ పోస్టును తొలగించినా త్వరలో ఎన్నికలకు సిద్ధమవుతున్న అస్సాంలో ఓటర్లు హిమంత్ శర్మ మాటలకు ప్రలోభపడటంతో ఆమెకు ఇబ్బందులు తప్పలేదు. పోలీసులు ఆమె చేసిన జాతి వ్యతిరేక వ్యాఖ్యలకు ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం గోలాఘాట్ జైల్లో ఆమె ఖైదీగా ఉన్నారు. అస్సాంలో పహల్గాం దాడి నేపథ్యంలో జరుగుతున్న జాతి వ్యతిరేకుల అరెస్టుల గురించి ముఖ్యమంత్రి తన ట్విటర్ ఖాతా ద్వారా ఓటర్లకు సమాచారమిస్తున్నారు.
ఈ పరిణామాలు ఓ ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించటం దేశ ద్రోహం అవుతుందా? మోడీని ప్రశ్నించటం జాతివ్యతిరేక చర్య అవుతుందా? అన్నవే ఆ ప్రశ్నలు.
బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో కూడా ఇదే పరంపర కొనసాగుతోంది. నిరంతరం ప్రభుత్వాలను నిలదీసే మరో అస్సామీ మహిళపై కూడా పహల్గాం సాకుతో తప్పుడు కేసులు బనాయించారు. ఆరెస్సెస్ అనుబంధ విద్యార్ధి సంఘం అయిన ఎబివిపి కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు హసన్గంజ్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
సోషల్ మీడియాలో డాక్టర్ మెదుసా పేరుతో వ్యవహరించే మాద్రి కకోటి లక్నో విశ్వవిద్యాలయంలో ఫ్రొఫెసర్గా పని చేస్తున్నారు. పహల్గాం దాడి జరిగిన రోజు నుండీ ఆమె తన సోషల్ మీడియా వేదికల్లో ఈ ఘటనను ముస్లింలకు వ్యతిరేకంగా ఉపయోగించుకోకూడదని హెచ్చరిస్తూనే వచ్చారు. చనిపోయిన వారు చేసిన మంచి పనులు గుర్తు చేసుకుందామని, కష్టకాలంలో అందరం ఐక్యంగా ఉండాలని కోరారు. అటువంటి ఓ పోస్టులో మితవాద ఆందోళనకారులను ఉద్దేశించి చెప్తూ ఆమె తన సోషల్ మీడియా పోస్టులో ఏ మతమని అడిగి కాల్చి చంపేవాడు ఉగ్రవాదే. కానీ ఊచకోత కోసే ముందు, అద్దెకు ఇల్లు ఇవ్వటానికి తిరస్కరించేటప్పుడు, ఉద్యోగం నిరాకరించేటప్పుడు మతం పేరు అడిగేవారిని ఏమనాలని ప్రశ్నించారు.
మాద్రి మీద ఫిర్యాదు చేసిన జతిన్ శుక్లా న్యూస్ లాండ్రీ వార్తా సంస్థతో మాట్లాడుతూ ,‘‘వామపక్ష భావజాలం ఉన్న వాళ్లు దేశాన్ని, విద్యార్ధులను చీల్చడానికి పని చేస్తున్నారు. ఈ విషయాన్ని రాజకీయం ఎలా చేస్తారు? భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం ఉన్నపుడు దేశంలో పౌరుల మధ్య యుద్ధాన్ని రెచ్చగొడుతున్నారు. భవిష్యత్తులో ఏ విద్యార్థి, అధ్యాపకులు ఇటువంటి చర్యలకు పాల్పడకూడదని మేము ఎఫ్ఐఆర్ రిజిష్టరు చేశాము’’ అన్నారు.
ఆమె పదేపదే కాషాయ ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తోందనీ, ఆమె పోస్టులను పాకిస్తాన్లో ఉన్న ట్విట్టర్ ఖాతాల్లో పోస్టవుతున్నాయని జతిన్ ఆరోపించారు. ఏప్రిల్ 29న ఓ వివరణ జారీ చేస్తూ పహల్గాంలో నిరాయుధులైన సాధారణ పౌరులపై తుపాకులు ఎక్కుపెట్టిన వారిని మాత్రమే తాను ఉగ్రవాదులుగా పేర్కొన్నానని స్పష్టం చేశారు. ఫ్రొఫెసర్పై ఫిర్యాదు కంటే ముందే మోడీ, బిజెపి ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించే మరో మహిళపై కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 28న విడుదల చేసిన ఓ వీడియోలో జానపద గాయకి నేహా సింగ్ రాథోడ్ ప్రధాని పుల్వామా సంఘటనను పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఉపయోగించుకున్నారని, ఇప్పుడు పహల్గాం ఉదంతాన్ని కూడా అలా ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదని గుర్తు చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి విషయాలపై కూడా ఈమె మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈమెపై హసన్గంజ్ పోలీసులు దేశ ద్రోహం, జాతీయ సమత్రా సమైక్యతలకు విఘాతం కలిగించటం వంటి ఆరోపణల కింద కేసులు నమోదు చేశారు.
ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించటమే దేశ ద్రోహంగా మారింది. ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజలెదుర్కొంటున్న తక్షణ సమస్యలపై నిలదీయం దేశద్రోహంగా మారుతోంది. అస్సాంలో లాగానే మోడీకీ, బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తేవారిని ఎంచుకుని మరీ ప్రభుత్వం అరెస్టు చేస్తోంది.
అదేవిధంగా 4 పిఎం (సాయంత్రం నాలుగు గంటలు) అన్న యూట్యూబ్ ఛానెల్ కూడా అంతర్గత భద్రత గురించి ప్రశ్నలు లేవనెత్తిన యూట్యూబ్ ఛానెల్ను కూడా నిషేధించారు. కారణాలేమీ చెప్పలేదు. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మనం చూడాల్సిన విషయాలు చూస్తున్నామా, చెప్పాల్సిన విషయాలు చెప్తున్నామా అన్నది ప్రశ్నించుకోవాలి.
పై వివరణ నేపథ్యంలో ఒక్కసారి ఈ విశ్లేషణ ప్రారంభ వాక్యాలు గుర్తు చేసుకుందాం. 2008లో ముంబైపై ఉగ్రదాడి జరిగినప్పుడు మోడీతో సహా దేశంలో ఎంతోమంది అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏకంగా బిజెపి జాతీయ దినపత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు ఇచ్చింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని చేతకాని దద్దమ్మ అని విమర్శించే స్థాయిలో స్వేచ్ఛ ఉండేది. మరి పహల్గాం వెలుగులో వర్తమాన ప్రభుత్వంపై కూడా 2008లో మోడీ చేసిన తరహా విమర్శలనే చేసినప్పుడు యూట్యూబ్ ఛానెల్ గొంతునొక్కడం ఎందుకు? సోషల్ మీడియా ఖాతాదారులపై పోలీసు కేసులు ఎందుకు? 2008 ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పై వచ్చిన విమర్శలు జాతి వ్యతిరేకం కానప్పుడు 2025లో వచ్చిన విమర్శలు జాతి వ్యతిరేక విమర్శలు ఎలా అవుతున్నాయి?
ప్రశ్నించేవారి గొంతు నొక్కడం ద్వారా మోడీ ప్రభుత్వం సాధించదల్చుకున్నది ఏమిటి? తామెన్నుకున్న ప్రభుత్వం తమకు సరైన భద్రత కల్పించలేక పోతోందంటూ వస్తున్న విమర్శలు పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు ఎలా అవుతున్నాయి ? ఈ మాత్రం సహనం లేకపోతే ప్రజలకు, ప్రజల హక్కులకు ముందున్నది ముసళ్ల పండగే.
సంగీతా బారువా పిషారోటీ
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.