
ఆంధ్ర రాష్ట్రంలో మూడు శాసనమండలి స్థానాలకు ఎన్నికలు ఫిబ్రవరి 27న జరిగి, మార్చి మూడున ఫలితాలు వెలువడ్డాయి.
ఈ ఎన్నికలు ఓ ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ కూటమి కొంతమంది అభ్యర్థులను నిలపగా, వారికి ప్రత్యర్థులుగా రాజకీయాలకు అతీతంగా ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) అభ్యర్థులకు మధ్య పోటీ జరిగింది. టిడిపి వర్సెస్ పిడిఎఫ్ అన్నట్టుగా ఎన్నికలు జరిగాయి. ఇది ఒక రకంగా చూస్తే శుభ పరిణామమే. ఎందువల్లంటే ఎటువంటి విలువలు పాటించని అభ్యర్థుల మధ్య పోటీ జరిగితే అందరూ ఒక్కటే, ఎవరు గెలిచినా ప్రజలకు న్యాయం జరగదు అనుకోవడం సహజంగానే చూస్తున్నాం. అలాగే అటువంటి ఎన్నికలలో ప్రజా సమస్యలు ఏమి చర్చకు కూడా రావు. కానీ ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ దారులుగా టిడిపిని డైరెక్ట్ గా ఢీకొన్న పిడిఎఫ్ అభ్యర్థులు నిలబడడంతో ప్రధాన అంశాలు ఎన్నికలలో చర్చకు వచ్చాయి. ఇది ఆహ్వానించవలసిన పరిణామం.
సాధారణంగా రాజకీయ రహితంగా జరగవలసిన ఈ ఎన్నికలలో తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలు ఎన్నికల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నాయి. గుంటూరు – కృష్ణ పట్ట భద్రుల స్థానానికి, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానానికి కూటమి అభ్యర్థులుగా రంగంలోకి దింపారు. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో ఒక అభ్యర్థికి తెలుగుదేశం, జనసేన పార్టీలు, మరో అభ్యర్థికి కొంత మంది ప్రముఖ బిజెపి నాయకులు మద్దతు తెలిపారు.
గుంటూరు, కృష్ణ స్థానానికి, గోదావరి జిల్లాల స్థానానికి తెలుగుదేశం అభ్యర్థులు గెలవగా, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. బిజెపి బలపరిచిన అభ్యర్థి గెలిచారు. మూడు నియోజకవర్గాల్లోనూ సమీప ప్రత్యర్థులుగా పిడిఎఫ్ అభ్యర్థులు నిలిచారు.
వాస్తవంగా పెద్దల సభకు ఎన్నుకోవాల్సిన ఈ స్థానాలలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకొని, మరో సాధారణ ఎన్నికలలా వీటిని జరపడం సమంజసం కాదు. అయితే అధికారమే పరమావధిగా భావించే నేటి రాజకీయ పార్టీలు అంత సభ్యత, సంస్కారం చూపిస్తాయని భావించలేం. దీనికి అనుగుణంగానే రాష్ట్ర అధికార పార్టీ, ముఖ్యమంత్రితో సహా నేరుగా రంగంలోకి దిగారు. మూడు స్థానాల్లోనూ తామ బలపరిచిన అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని వారి అధ్యక్షులు హుకుం జారీ చేశారు. దీంతో పట్టుదలగా వారి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రులు ప్రచారంలో పాల్గొనడమే కాకుండా అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడ్డారు. ఓటర్లను అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేశారు. గతంలో అమలు చేయని అనేక హామీలతో భ్రమలకు గురి చేశారు.
ఇది సరిపోక, హుందాగా జరగవలసిన ఎన్నికల్లో చైతన్యం ప్రదర్శించవలసిన ఓటర్లకు నిస్సిగ్గుగా డబ్బులు పంచారు. కానుకలు అందజేశారు. సిగ్గు, బిడియం లేకుండా కులం పేరు చెప్పి కూడా ఓట్లు దండుకున్నారు. ఈ రకంగా పెద్దల సభకు కళంకం తెచ్చేలా కూటమి పార్టీలు దిగజారాయి.
ఎన్నికల్లో అందరూ గెలవరు కదా..! అందువల్ల పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు, ఓటములు సహజమే. ఎన్నికలలో గెలవడం కూడా అంత పెద్ద గొప్ప ఏమీ కాదు. ఎందుకంటే గెలవడానికి ఎన్ని అడ్డదారులైన తొక్కి గెలిస్తే, అలాంటి గెలుపు నైతికంగా సరైనదేనా అన్నది ఒకసారి పరిశీలించవలసిన విషయమే. దీనికి భిన్నంగా గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ప్రజలను చైతన్య పరుస్తూ, ప్రజా సమస్యల మీద నిరంతరం కృషి చేసే అభ్యర్థులు ఎన్నికల్లో ప్రచారానికి ఏ అడ్డదారులు తొక్కకుండా, ఆయా తరగతుల ప్రజల సమస్యలే ఎజెండాగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పోటీ చేసిన అభ్యర్థులు ఓడిపోతే అప్పుడు గెలుపు ఓటములను ఎలా చూడాలి అన్నది ప్రధానమైన అంశం.
అడ్డదారులు తొక్కి గెలిచిన గెలుపూ ఓ గెలుపేనా..!
వాస్తవంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఆలోచిస్తే, మన రాజ్యాంగంలో ఓటు పరమ పవిత్రమైన హక్కు. దీనిని బజార్లో సరుకుగా మార్చేసి నోటుతోనో, మందుతోనో, కులం పేరుతోనో ప్రభావితం చేసి ఓట్లు వేయించుకుంటే అంతకంటే నీచం మరొకటి ఉండదు. అందులోనూ విద్యావంతులు ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికలలో ఇంకా నీచం. ఓటర్లను వాస్తవాలను ఆలోచించేలా, వారిని ఏ రకమైన ప్రలోభాలకు గురి చేయకుండా వదిలేసి, ఒక స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపితే అప్పుడు అసలైన ప్రజాస్వామ్య ఎన్నికలని భావించవచ్చు. కానీ అధికారం, పదవుల రుచి మరిగిన మన రాజకీయ పార్టీలు అలా చేస్తాయనుకోవడః అవివేకమే. అయితే అందరూ అలాగే ఉంటారని భావించలేం.
ఎన్నికలలో ఓడిన ముగ్గురు పిడిఎఫ్ అభ్యర్థులు నీతి, నిజాయితీ, విలువలకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రత్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారని తెలిసినా, వీరు మాత్రం అడ్డదారులు కాదు కదా కనీసం ఒక్క తప్పటడుగు కూడా వేయలేదు. ఇటువంటి విలువలకు కట్టుబడి పోటీ చేయడం నేటి కలుషిత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా అరుదు. కానీ ఇది సాధ్యమేనని పిడిఎఫ్ అభ్యర్థులు నిరూపించారు. ప్రత్యర్థులకు దడ పుట్టించారు. ఇది చాలా గొప్ప విషయం. ఈ వాస్తవాన్ని ప్రత్యర్థులు బయటకు చెప్పే సంస్కారం ప్రదర్శించ లేకపోయినా, వీరికి మనసంటూ ఉంటే, మనసులోనైనా అభినందించి తీరాల్సిందే.
కృష్ణ, గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ అన్ని అఘాయిత్యాలకు పాల్పడింది. డబ్బులు, ముందు, బిర్యానీ వంటివి పంచడమే కాకుండా, అవి కూడా తమను గెలిపించలేవనే అనుమానంతో నేరుగా ఎన్నికల బూతులనే స్వాధీనం చేసుకుంది. అనేక బూతుల్లో పోలీసుల సహకారంతో పిడిఎఫ్ ఎన్నికల ఏజెంట్లను బయటకు తరిమేసింది. ఎన్నికల సిబ్బందిని లొంగదీసుకుని, కొన్ని ప్రాంతాలలో బూత్ లను స్వాధీనం చేసుకుంది. ఓట్లు గుద్దుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు అంతమంది రంగంలోకి దిగినా ఓటమి తప్పదనే భయంతోనే డైరెక్ట్ గా దిగబడి, ఇటువంటి దిగజారుడు చర్యలకు పాల్పడింది.
గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో అధికార కూటమి పూర్తిగా కులం కార్డును వాడుకుంది. దానితోపాటు డబ్బు, అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అయినా ఓడిపోతామనే భయంతో ఎన్నికల రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నేరుగా ఎన్నికల బూతుల్లోకే ప్రవేశించారు. ఎన్నికల సిబ్బందిపై ఒత్తిడి తీసుకొచ్చి జిరాక్స్ ఐడి కార్డులు చూపించి దొంగ ఓట్లను యథేచ్ఛగా వేయించుకున్నారు.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. వీరి కేంద్ర మంత్రి, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు ఏకంగా వీడియో ద్వారానే ప్రచారానికి దిగారు. ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధిగా పోటీ చేస్తున్న ఒక స్వతంత్ర అభ్యర్థిని బెదిరించి, ప్రలోభ పెట్టి, వివిధ రకాలైన ఆశలు చూపించి, వీరి అభ్యర్థికి మద్దతుగా ఉపసంహరించుకునేలా చేశారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీ ఉపాధ్యాయుల మీటింగులు పెట్టి బెదిరిస్తూ మాట్లాడారు. ఎమ్మెల్యే అయిన మాజీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఒక హైస్కూల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని, కనీసమైన సభ్యత కూడా లేకుండా హెడ్ మాస్టారు సీట్లో కూర్చుని ప్రచారం చేశారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అనేకమంది ఓటర్లకు దగ్గరుండి డబ్బులు, కానుకలు పంపిణీ చేయడం వంటి బ్రోకర్ పనులకు కూడా దిగజారారు. అయినా ఓటర్లు వీరిని తిరస్కరించి ఓడించారు.
కానీ, విచిత్రం ఏంటంటే క్రింద పడినా తామే గెలిచామని చెప్పుకోవడం ఈ తెలుగుదేశం నాయకులకే చెల్లింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం బహిరంగంగా బలపరిచి, ప్రచారం చేసిన అభ్యర్థి ఓడిపోయారు. అయినా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి, మాజీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు గెలిచిన వారు కూడా తమ మద్దతుతోనే గెలిచారని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఏ రకమైన సభ్యతో వారికే తెలియాలి. ఇంకా విచిత్రంగా పిడిఎఫ్ అభ్యర్థి వైసిపి మద్దతుతో పోటీ చేశారని అసత్యాలను, అవాస్తవాలను పేర్కొన్నారు. ఇది ఏ రకమైన సంస్కారమో వారికే తెలియాలి. అయితే ఇటువంటి సభ్యత, ఉన్నత సంస్కారం తెలుగుదేశం పార్టీ నాయకుల నుండి, ముఖ్యంగా ఈ అవాస్తవాలు చెప్పిన ఆయననుండి ఆశించడం దురాశే అవుతుంది.
నిజాయతీ గల ఒక సాధారణ పౌరుడుగా చూస్తే ఇటువంటి గెలుపు కూడా ఒక గెలుపేనా అనే సందేహం కలగక మానదు. దీని కంటే నిజాయితీగా పోరాడి, ఓడిపోయిన వారే గొప్పవారు కదా అనేది కూడా అనిపించక మానదు.
అందుకే ఈ ఎన్నికలలో ‘గెలిచినవారు ఓడారు – ఓడిన వారు గెలిచారు‘ అని చెప్పడం చాలా సముచితంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలలో ఓడిన పిడిఎఫ్ అభ్యర్థుల ముగ్గురూ ఒక్క దొంగ ఓటు వేయించలేదు. ఒక్క రూపాయి కూడా పంచలేదు. ఒక్క మందు చుక్క పోయించలేదు. ఒక్క బిర్యానీ పెట్టించలేదు. ఒక్కరినీ కూడా ప్రలోభ పెట్టలేదు. ఒక్క ఉత్తుత్తి హామీకూడా ఇవ్వలేదు. ఇంకా విశేషమేమిటంటే వీరి ఎన్నికల ఖర్చే తక్కువ కాగా ఆ ఖర్చును కూడా వీరి సంఘ సభ్యులే భరించడం. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలుండడం పిడిఎఫ్ కు గర్వకారణం.
ఎన్నికలలో పోటీ చేసిన వారు గెలవడానికి అన్ని శక్తులు వడ్డడం సహజమే. అయితే అడ్డదారులు తొక్కి గెలవాలి అనుకోవడం మాత్రం రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిగా విరుద్ధంగా తెలుగుదేశం కూటమి నాయకులు వ్యవహరించారు. దీనికి భిన్నంగా పిడిఎఫ్ అభ్యర్థులు ముగ్గురూ ఓడిన వెంటనే వారు ఇచ్చిన సందేశంలో పోరాటాల్లోనూ, సమస్యలు పరిష్కారాల్లోనూ మీతోనే ఉంటామని. మీ మధ్యనే ఉంటామని, పోరాటాల్లో ముందు వరసనే ఉంటామని ఓటర్లకు తెలియజేయడం వారి హుందాతనానికి నిదర్శనం. అటువంటి ఉన్నత విలువలను కలిగిన వారిని ఆదరించడం సమాజ ఉన్నతికి అత్యవసరం.
– ఎ. అజ శర్మ,
ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.