
ఒకానొక సందర్భంలో ‘తిరువళ్లిలో ఒక దళిత మహిలతో శాస్త్రార్థ చర్చ జరిపిన తరువాత సంత్ శ్రీరామానుజాచార్య ఆమెతో ‘‘అమ్మా, నా కంటే మీరే మహాజ్ఞాని’’అంటారు. ఆ తరువాత ఆ మహిళకు వైష్ణవ దీక్షను ఇచ్చి ఆమె విగ్రహాన్ని మందిరంలో స్థాపించారు. మరొక అస్పృశ్య యువకుడు ధనుర్దాసుకు కూడా తన శిష్యత్వ దీక్షనిచ్చి గౌరవించారు. నదిలో స్నానం చేసి వచ్చేటపుడు ధనుర్దాసు భుజం సహాయం తీసుకుని తిరిగి వచ్చేవారు. ఏ వ్యక్తి ఇంట్లో దళిత గురువు వచ్చి భుజించినందుకు ఇల్లంతా శుద్ధిచేసిన సంఘటన జరిగిందో ఆవ్యక్తి నదీ స్నానం తరువాత ఆ వ్యక్తి భుజం మీద చేయిమోపి శ్రీరంగం ఆలయం వరకు వెళ్లడం, ఏ సమాజంలో మహిళలు నోరు విప్పి మాట్లాడే సాహసం కూడా చేయలేని స్థితి ఉండిందో ఆ సమాజంలోనే తనను శాస్త్ర వివాదంలో ఓడించిన మహిళా విగ్రహాన్ని మందిరంలో నెలకొల్పడం అనే సంఘటనలు వినమ్రత, విప్లవాత్మక ప్రవృత్తి అద్భుత కలయికను సూచిస్తుంది’ అని అంబేడ్కర్ అన్నారు.
అంతేకాకుండా, మరో సందర్భంలో కూడా అనేక అంశాలను ప్రస్తావించారు. ‘అంబేడ్కర్ సంపాదకత్వంలో వెలువడే తన పత్రిక బహిష్కృత భారత్లో 1927 జూన్ 3న ఓ వ్యాసంలో రామానుజాచార్య గురించి ప్రస్తావించి, ఆయనను ప్రశంసించారు. 90 ఏళ్లకిందట రాసిన ఈ సంపాదకీయం చదివితే రామానుజాచార్య జీవితం అందించిన ప్రేరణ, ఆయన చెప్పిన మాటల మన మనః మందిరంలో స్థిరంగా ఉండిపోతాయి.
హిందూధర్మంలో ఎవరైనా సమతా దిశలో మహత్వ పూర్ణమైన కార్యక్రమాలు సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించారంటే, వారు రామానుజాచార్యులే. ఆయన కాంచీ పూర్ణులనే బ్రాహ్మణేతరుడిని తన గురువుగా స్వీకరించారు. తన ఇంటికి భోజనానికి రావాలని రామానుజులు గురువును పిలిచినపుడు ఆయనకు భోజనం వడ్డించిన ప్రదేశాన్ని ఆ తరువాత తన భార్య శుద్ధి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వేరే కులానికి చెందిన గురువు ఇంటికి వచ్చి వెళ్లిన తరువాత తన ఇంటిని శుద్ధి చేయడాన్ని చూసి రామానుజాచార్య చాలా బాధ పడతారు, ఆగ్రహిస్తారు. తాను ఏ వివక్షకు వ్యతిరేకంగా సమతావాదాన్ని స్థాపించడానికి కృషి చేస్తున్నాడో అదే సంఘటన తన ఇంట్లోనే జరగడం ఆయన భరించలేకపోయారు. ఈ సంఘటన తరువాత ఆయన తన వివాహ జీవితాన్ని ముగించుకుని సన్యాసం స్వీకరించారు. తన జీవితం మొత్తం సమాజ హితానికి అంకితం చేశారు. ఆయన కేవలం ఉపదేశాలతోనే సరిపెట్టలేదు. తన కార్యక్రమాల ద్వారా ఆ సిద్దాంతాలను నిజజీవితంలో అమలు చేసి చూపించారు’.
అయితే, 2017 మే 1న రామానుజ సహస్రాబ్ది జయంతి సందర్భంగా రామానుజ చిత్రంతో తపాలా బిళ్లను విడుదల చేసిన ప్రధానమంత్రి ఈ వాక్యాలను చెప్పడం, ప్రసంగంలో రికార్డ్ చేయడం యూట్యూబ్లో కూడా చూడవచ్చు. అంతేకాదు, ఈ అంశాలు ప్రస్తుత సమాజంలో ప్రస్తావించడం చాలా ముఖ్యం. ‘‘ఆనాటి సామాజిక ధోరణులు ఏ విధంగా ఉన్నప్పటికీ రామానుజాచార్య మహిళల సాధికారికత గురించి చేసిన ప్రయత్నాలను, బాబా సాహెబ్ తన సంపాదకీయంలో వివరించారు” అని ప్రధాని మోడీ తన ప్రసంగంలో గుర్తుచేశారు.
1008 ఏళ్ల కిందట జగద్గురువు రామానుజాచార్యుల(1017-1137) వైష్ణవోజ్జీవన ప్రయాణం మొదలైంది. అది భక్తి జ్ఞాన మార్గం. అందరిదైన జ్ఞానం అందరికీ అందించి భక్తిని ప్రేరేపించి భక్తి ద్వారా ముక్తి సాధించవచ్చనే జ్ఞాన యజ్ఞాన్ని కొనసాగింపజేయడమే రామానుజుని జీవిత లక్ష్యం. ఒక వేదాంత తత్వవేత్త స్ఫూర్తిదాయక జీవనం వేయేళ్లుగా భాసిస్తున్నదంటే అదే గొప్ప విశేషం.
రామానుజాచార్యుల బాల్యం- సామాజిక కృషి..
రామానుజాచార్యులు తమిళనాడులోని చెన్నైనగర సమీపంలో శ్రీపెరుంబుదూర్లో జన్మించారు. కాంతిమతి, ఆది కేశవ సోమయాజి ఆయన తల్లిదండ్రులు. రామానుజాచార్యుల జీవనకాలం క్రీశ 1017-1137 వరకు ఉంటుంది. నాథముని, యమునా చార్యుల తరువాత శ్రీవైష్ణవ విశిష్ఠాద్వైతాన్ని ప్రసిద్ధం చేసిన సిద్ధాంత కర్త, భక్తి ఉద్యమకారుడు రామానుజాచార్యులు. అంతేకాకుండా బ్రహ్మసూత్రాలపైన వ్యాఖ్యానం రాశారు. ఇంకా శ్రీభాష్యం, భగవద్గీతాభాష్యం, వేదాంత సంగ్రహం అనేవి రామానుజుని ప్రధాన ప్రామాణిక సైద్ధాంతిక గ్రంధాలు. శరణాతి, శ్రీరంగ, శ్రీ వైకుంఠ గద్యాలు(గద్యత్రయం), రామానుజుని ఇతర రచనలు. రామానుజుని రచనలపై హారోల్డ్ కోవార్డ్, థామస్ అక్వినాస్, ఎబివాన్ బ్యూటెనెన్ పరిశోధనలు జరిపి ఇవి చాలా ప్రభావం కలిగించిన గ్రంధాలని తమ పరిశోధనా సైద్ధాంతిక గ్రంధాలలో నిరూపించారు.
జగద్గురువు రామానుజ జీవనయాన సారాంశాన్ని పరిశీలిస్తే అందరిని కలుపుకునే సమానమైన సమాజాన్ని, మతాన్ని, తత్వాన్ని చాటి చెప్పారని గ్రహించాలి. ఈ విశ్వంలో ఇంతకాలం మనకు కనిపించినదేదైనా సరే, కనిపించబోయేదేదైనా సరే భగవానుని వ్యక్తీకరణే అని రామానుజులు దృఢంగా నమ్మారు. మనుషులలో భగవంతుడిని ఆయన దర్శించారు, భగవంతుడిలో మనుషులను చూశారు. భగవంతుడికి భక్తులందరూ ఒకటేనని మనస్పూర్తిగా నమ్మారు. కుల భేదాలు, హెచ్చుతగ్గులను పాటించే సమాజాన్ని ఎదిరించిన యోగి రామానుజుడు. ఆయన జీవన బోధనలు సమానతను చాటిచెప్పాయి.
సమాజంలో భేదాలు సృష్టించి మనుషులను వేరుచేసే ఏ మతాన్నైనా, సంప్రదాయాన్నైనా , పరంపరనైనా సరే రామానుజులు వ్యతిరేకించే వారు. అటువంటి వ్యవస్థలను ధ్వంసం చేయడానికి, అందులో మార్పు తేవడానికి తన పూర్తి శక్తిని వెచ్చించే వారు. మోక్షాన్ని ఇచ్చే మహామంత్రాన్ని అందరితో పంచుకోవడానికి ఆయన అందరినీ సమావేశ పరిచారు. ప్రతి వర్గాన్ని, విభిన్నస్థాయిల్లో ఉన్న వారిని రప్పించి వారిచేత ఈ మంత్రాన్ని ఉచ్ఛరింపచేశారు.

స్వామి వివేకానంద కూడా శ్రీమద్రామానుజాచార్య విశాల హృదయాన్ని వివరిస్తారు. వెనుకబడి ఉండడం వారి కర్మ అని భావించే ధోరణిని అంగీకరించలేదు. వారికోసం రామానుజులు ఆవేదన చెందారు. వారిని ఉద్ధరించడానికి ప్రయత్నాలు చేశారు. కొన్ని వర్గాల పట్ల ద్వేషాలను రామానుజులు ఖండించారు. తాను ఉన్న కాలాని కంటే ముందు చూపుతో వ్యవహరించిన మహారుషి రామానుజుడు. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాల ఆశలను, ఆశయాలను వేయేళ్ల కిందటే చూసిన క్రాంతదర్శి. సమాజంనుంచి కొందరిని వేరు చేయడం, కుల-మత బహిష్కారణ చేయడం, దివ్యాంగులను దూరం పెట్టడం మాని అందరినీ కలుపుకోకపోతే మతమే కాదు, సమాజం కూడా సంపూర్ణం కాబోదు.
ఎన్నో రకాలుగా రామానుజాచార్య వేయేళ్ల రుషి. భగవంతుని ఆలయాన్ని ప్రజల సంక్షేమ కేంద్రంగా, జన సేవా కేంద్రంగా మార్చారు. పేదలకు భోజనం, మందులు, వస్త్రాలు, నివసించేందుకు చోటు దొరికే వ్యవస్థగా ఆలయాన్ని మార్చారు. ఆయన ఉదార విధానాలు ఈనాటికి కూడా అనేక దేవాలయాల్లో రామానుజ కూటమి పేరుతో అమలవుతున్నాయి. ఈ విధంగా అనేక ఉదాహరణలు ఆయన జీవనంలో లభిస్తాయి. కుల వ్యవస్థను ఆయన ఎదిరించారు. తన కులం కారణంగా అందరికీ గురువు కాజాలనని భావిస్తూ ఉంటే అది కాదని, ఆయన తన గురువని ఆయనకు రామానుజుడు శిష్యుడు అయ్యారు. ఆదివాసులకు ఆశ్రయం కల్పించి వారి సామాజిక జీవనాన్ని సముద్ధరించడానికి కృషి చేశారు.
ప్రధానమంత్రి ప్రసంగంలో ‘సమాజంలోని అన్నివర్గాల వారికి కులాల వారికి సంత్ శ్రీ రామానుజాచార్య జీవితం, కథ వారికి ప్రేరణ కలిగించేవిగా ఉన్నాయి. మేల్కోటే మందిరంలో మూలస్వామి వారి పాదాల దగ్గర ప్రతిష్టింపబడి పూజలందుకునే ముస్లిం సుల్తాన్ కూతురు రాజకుమారి బీబీ నాంచారి విగ్రహం ఇందుకు ప్రతీకగా చూడవచ్చు. తిరునారాయణ పురంలోని ఆలయంలో సంత్ శ్రీరామానుజాచార్య బీబీ నాంచారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేశారు’’ అని వివరించారు. .
రామానుజాచార్య ఈ సంఘటన ద్వారా ఆనాటి సమాజాన్ని మత సామరస్యం, సమసద్భావన దిశలో ఏ విధంగా నడిపారో అర్థం అవుతుంది. ఈ రోజు కూడా బీబీ నాంచియార్ విగ్రహం పూజలు అందుకుంటూ ఉంది. నారాయణుని మందిరంలో బీబీ నాంచారి విగ్రహంలానే సంత్ శ్రీరామానుజాచార్య సందేశం కూడా ఈనాటికీ ఎంతో అవసరమైన సందేశం అని ప్రధాని వివరించారు.
రామానుజునిపై గద్దర్ పాట, ఆట..
విప్లవ ఆధునిక ప్రజా వాగ్గేయకారుడు అమరుడు గద్దర్ రామానుజునిపై పాట రాశారు. ఆ పాటకు గజ్జెకట్టి ఆట ఆడారు. పట్టుజరీ ఉత్తరీయాలు కాదు, మామూలు గొంగడి భుజాన వేసుకొని గద్దర్ సామాన్యుడి జీవనగీతాలను సృష్టించారు. గద్దర్ లేకపోయినా గద్దర్ కవిత్వ గానం ఉండిపోతుంది.
ఆ గద్దర్ను ఎవరో బుల్లెట్తో కొట్టినా, నోటికి వచ్చినట్టు తిట్టినా గద్దర్కు ఏం జరగదు. బిజెపిలో మంత్రులు, ఎంపీలైన వారు పద్మాలు విసిరినా, రత్నాలు ఇచ్చినా, రాళ్లిచ్చినా, కులం ఆధారంగా రిపబ్లిక్ డే నాడు పురస్కారాలు ఇవ్వకపోయినా ఫరవాలేదు. వాళ్లు ఇవ్వకపోవడమే మంచిది. పద్మం కంటే, రత్నంకంటే ఉత్తముడు ఉన్నతుడు ప్రజల మనసులలో ఉన్నటువంటి ప్రజాగాయకుడు గద్దర్. రాజులు పుట్టి, గిట్టినవారు బోలెడు మంది చరిత్రలో ఉన్నారు. రాజులకే దిక్కులేదంటే ప్రజాస్వామ్యంలో మంత్రులను అడిగేవారెవరు.
ఎట్టిపరిస్థితిలోనైనా గద్దర్కు పద్మశ్రీ చచ్చినా ఇవ్వమని ప్రకటించారు. హైదరాబాద్ సమతామూర్తి రామానుజుని ఆవిష్కరించిన ముఖ్య అతిథుల్లో ఒక ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి వచ్చారు. ప్రధానమంత్రి మోడీ శ్రీమద్ జగద్గురువు రామానుజాచార్యులు అందరూ సమానమనీ గోపురం మీద ఎక్కి సమానత్వం గురించి, సమాన మంత్రాన్ని చెప్పారనే విషయం చాలామందికి తెలియదు. మోడీ ప్రసంగంలో రామానుజుని గొప్పదనం వివరించారు. అధికార పార్టీవాళ్లకు, పాపం తెలియదు. చదవరు. అది పోనీయండి. ఎవరినైతే తిడుతున్నారో ఆ శ్రీరామానుజుని మీద గద్దర్ అద్భుతమైన పాట కట్టారు, సమతామూర్తి ఎదురుగా ఆట ఆడారు. ఆధ్యాత్మికత ఒక మార్గం, మనసుకు సంబంధించిన మరో మార్గం కూడా ఉన్నదనీ, చిన్న జీయర్ స్వామితో చర్చించినవాడు గద్దర్.
‘‘అంకెలలో ఒకటి సున్నా అంటున్నరు. దాని పేరు పూర్ణం అంటం. కాని ఇంకో పేరు సంపూర్ణం. ఇటు అంటం అటు ఎటమటం, సమంగమైతే కల్యాణం ఇదే విశిష్టాద్వైతం’’అని తపన పడి, సంఘర్షణ పడినప్పుడే ఈ పాట పుట్టింది అని గద్దర్ ఇంటర్వ్యూలో చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్లో చూడవచ్చు. అయితే, రామానుజుని విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని చిన్న చిన్న పదాలతో గద్దర్ వివరించారు.
జై రామానుజం జైజై రామానుజమని సమతామూర్తి పాట పాడారు. దేవుడి ప్రసాదం పాతదని పాడేస్తారు కాని పది మందికి ఇవ్వడం మంచిదని రామానుజులు వెయ్యేళ్ల క్రితమే చెప్పారు. దేవుడిని మోసిన, పల్లకి బోయీలకు మోక్షం ఎందుకు రాదని రామానుజుడు అడిగారని గద్దర్ తెలియజేశారు. రామానుజుని గురువు గోష్టీపూర్ణ అది అతి రహస్యం అంటూ 18 సార్లు శ్రీరంగం నుంచి తిరుగోష్టీయూరుకు నడిచి, అక్కడి గుడి గోపురం ఎక్కి రామానుజాచార్యులు నారాయణ మంత్రాన్ని అందరికీ చెప్పారు. అందుకే ఆయన జగద్గురువు అయ్యారు.
జంతువులకు ఆహారం ఇస్తె చాలు. మనిషికి అలా కాదు కదా జ్ఞానం కావాలి. దాని కోసం సాధన చేయాలి. అంతేకాకుండా తాత్విక ఉద్యమం కూడా అవసరం. సిద్ధాంత ఘర్షణ అవసరమని రామానుజుడు ఆ విషయం జ్ఞాపకం చేస్తాడు. ప్రజలకు మానవత్వ ఆవశ్యకతను తెలియజేచేస్తాడు. అందుకే “విశిష్ట వ్యక్తి, సమతామూర్తి శిల్పంలో మహామనిషి రామానుజాచార్యుడు” అని గద్దర్ వివరించారు.
‘‘రండిరో రండిరో
రామానుజా జాతరకు
రండిరో పరమాత్ముని
చూడడానికి రండిరో,
సమత మమత విశిష్టాద్వైతం
చూసుకొండిరో వినండిరో’’ అని గొంగడి కట్టి ఆకట్టుకున్నారు గద్దర్. సమాజంలో ఎందుకీ గోడలు, గొడవలు, అంటరానివారిని మానవత్వంతో ఆదరించిన వాడు, అందరూ సహపంక్తి భోజనం చేస్తే తప్పేంటి అని రామానుజుడికి గద్దర్ వివరించారు.
మాడభూషి శ్రీధర్
(వ్యాస రచయిత మాడభూషి శ్రీధర్ ‘‘రామానుజ మార్గం’’అనే పుస్తకాన్ని రచించారు. అందులో ఏ మతమైన ద్వేషాన్ని బోధించలేదని వివరంగా పేర్కొన్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.