
నిమ్నకులాలు, దళితులు, ఆదివాసీల జీవితాల్లో కులం పోషించే పాత్ర గురించి ప్రత్యేకంగానో, కొత్తగానో చర్చించాల్సిన అవసరం లేదు. సామాజిక జీవితంలో కులం తెచ్చే తలనొప్పి కూడా అస్తిత్వాల స్థాయిని అధిగమించి శాంతిభద్రతల స్థాయికి చేరుతోంది. విభజించు పాలించు అన్న సూత్రాన్ని వలస పాలకులు కనిపెట్టారని, దాని ఆధారంగానే ప్రజలను ముక్కలు చెక్కలుగా చీల్చి మూడు వందల ఏళ్ల పాటు దేశంపై పెత్తనం చేశారన్నది ఆధునిక భారత చరిత్ర సారం. కానీ ప్రాచీన యుగం నుంచి వలస పాలన వచ్చే వరకూ ప్రజలు కులాలుగా విభజించి నిట్టనిలువు సామాజిక నిర్మాణాలు రూపొందించి ఏ కులం ఏ కులం పైన ఉండాలి, ఏ కులం ఏ కులం కింద ఉండాలి, కిందా పైనా ఉండేవాళ్ల మధ్య సామాజిక, ఆర్థిక, లైంగిక సంబంధాలు ఎలా ఉండాలి అన్నది నిర్ధారించటానికి ఏకంగా ధర్మ శాస్త్రాలే పుట్టుకొచ్చాయి. కానీ నాలుగువేల ఏళ్లు ఈ విధంగా జనాన్ని కులాలుగా విభజించి తమ పబ్బం గడుపుకున్న పాలకవర్గానికి ఆ కులమే ఇప్పుడు శిరోభారంగా మారుతున్న పరిణామాన్ని మనం గమనిస్తున్నాము.
గత ఏడాది కాలంగా జనగణనతో పాటు కులగణన కూడా చేయాలనే డిమాండ్ ముందుకొచ్చింది. సామాజిక న్యాయ నినాదాన్ని బలపర్చే పార్టీలు, రిజర్వేషన్ల ప్రాతిపదికను బలపర్చే పార్టీలన్నీ ఈ నినాదాన్ని బలపర్చాయి. కాంగ్రెస్ తన వైఖరిని మరింత విపులీకరించటానికి ఏకంగా మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ నాయకత్వంలో ఓ అధ్యయన బృందాన్నే నియమించింది. ఈలోగా సామాజిక న్యాయమంత్రిత్వశాఖ తరఫున సుప్రీం కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలైంది. కులగణన డిమాండ్ను తిరస్కరించేందుకు కారణాలు వెతుక్కునే ప్రయత్నంలోనే కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. డిమాండ్ను తిరస్కరించటానికి చెప్పిన కారణాలు సమంజసమైనవీ కాదు. హేతుబద్దమైనవీ కాదు. 1951 నుంచీ కులగణనను ప్రోత్సహించరాదన్న వైఖరిని కొనసాగించాలని భావిస్తున్నామన్నది కులగణన డిమాండ్ను తిరస్కరించటానికి కేంద్రం ముందుకు తెచ్చిన మొదటి వాదన. ఆచరణలో కుప్పలు తెప్పలుగా సమస్యలు వస్తాయన్న భయం రెండో కారణం. జనం చెప్పే సమాచారం తప్పుల తడకగా ఉంటుందన్నది మూడో వాదన. కుల గోత్రా పేర్లు సర్వవ్యాపితంగా ఉన్నందున ఏ గోత్రం ఏ కులం ప్రామాణికమైనవో చెప్పలేమన్నది మరో వాదన. చివరిగా దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో ఇదమిద్దంగా చెప్పలేమన్నది మరో వాదన. ఇవన్నీ కుంటిసాకులేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
1951 నాటికి కులగణన వద్దనుకోవటానికి 2021లో కులగణన వద్దనుకోవటాన్నీ ఒకే గాటన కట్టలేము. కేంద్ర గణాంక విభాగం వెబ్సైట్లో ఉన్న ఓ వివరణ ప్రకారం, జనగణన చట్టం 1948లోనే వచ్చినా నాటికి జనగణన విభాగానికి నేటివలే నిర్దిష్ట రూపం, నిర్మాణం సమకూరలేదు. పైగా రెండు మూడేళ్ల తర్వాత ఈ విభాగం రద్దవుతుందన్న అంచనాతో పాలక యంత్రాంగం ఉంది. విస్తృతమైన వివరాలు సేకరించేందుకు కావల్సిన పాలనా యంత్రాంగం సమకూరకపోవటం కులగణన చేపట్టకపోవటానికి ప్రధాన ఆచరణాత్మక కారణంగా భావింవచ్చు. కానీ నేటి పరిస్థితి దీనికి పూర్తి భిన్నమైనది. జనగణన విభాగం కేంద్ర హెూంశాఖ ఆధీనంలో పని చేస్తున్న సంపూర్ణ, శాశ్వత విభాగం. తొలి జనగణన కోసం ప్రధానంగా రెవిన్యూ యంత్రాంగంపై ఆధారపడితే నేడు కోట్ల సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయులు, పలు ప్రభుత్వ విభాగాల సిబ్బంది భాగస్వాములు. నాడు జనగణ పట్టికలు రూపొందించటానికి నేడున్న ఆధునిక సాంకేతిక సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత సేవలు అందుబాటులో లేవు. రిజర్వు బ్యాంకు పరపతి నివేదికల సందర్భంగా వడ్డీ రేట్లు నిర్ణయించేటప్పుడు ఒక పాయింట్ వడ్డీ రేటును ఎన్నో బేసిస్ పాయింట్లుగా విడగొట్టగలిగిన కలన గణిత సామర్ధ్యం నేడు ప్రపంచం సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా జనాభా ఆర్థిక సామాజిక సాంస్కృతికాభివృద్ధిని కొలవటానికి వీలైన కొలమానాలు ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది. నాడు ఆచణాత్మక సమస్యల కారణంగా వద్దనుకుంటే అటువంటి ఆచరణాత్మక సమస్యలు నేడు లేవు.
మరోవైపున అప్పుడే రాజ్యాంగం రూపొందించుకున్న ఉత్సాహంతో కుల పీడన, మధ్యయుగాల సాంప్రదాయాలకు సామాజిక జీవితంలో పెద్ద పీట వేసిన దేశాన్ని ఆధునిక బూర్జువా ప్రజాతంత్ర భారతంగా తీర్చిదిద్దటానికి వీలుగా కావల్సినంత పకడ్బందీగా రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామన్న ఆత్మ విశ్వాసం కూడా ఈ నిర్ణయానికి తోడై ఉండొచ్చు. అంటరానితనం నేరమనీ, కుల, మత, ప్రాంత, భాషా వ్యత్యాసాలకతీతంగా సమానత్వపు హక్కును చట్టబద్ధం చేశామని నాటి ఏలికలు భావించారు. అటువంటి పరిస్థితుల్లో కులగణన ప్రాసంగికత నాటికి పాలకులకు కనిపించకపోయి ఉండొచ్చు. కానీ నాటి నుండి గత ఏడున్నర దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికలు యావత్తూ అభ్యర్ధుల ఎంపిక మొదలు ఓట్ల సమీకరణ వరకూ అన్ని స్థాయిల్లోనూ కులం కీలకమైన పాత్ర పోషిస్తోంది. కనీసం కులాతీత సమాజాన్ని నిర్మించాలన్న అంబేడ్కర్ కలలు కల్లలయ్యాయి. అంటరానితనం మనలను సాయంకాలపు నీడలా వెంటాడుతూనే ఉంది. కులవివక్ష, అగ్రకులాలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవటం ఎదిగివస్తున్న, ఎదిరిస్తున్న కులాల కుటుంబాలపై పాశవిక దాడుల విష వలయం నుంచి దేశం విముక్తి పొందలేదు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ నిర్మాతలు కలలు గన్న ఆధునిక ప్రజాతంత్ర భారతం పాక్షికంగానే సిద్ధించింది.
ఇక కుల గోత్రాలకు సంబంధించిన వాదన. ఈ వాదనను ముందుకు తేవటం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఓ మంచి పని చేసిందనిపిస్తోంది. కుల వ్యవస్థ దైవాధీనమనీ, కుల వృత్తిని దాటి బయటకు రాకూడదనీ, అలా బయటికి వచ్చిన వాళ్లను వెలివేయాలన్న కట్టుబాట్లు రూపొందించింది ఎవరు? భారతీయ సమాజ నిర్మాణం కులం ఆధారితమతా? గోత్రం ఆధారితమా? కులం ఆధారితమే అయినప్పుడు గోత్రం గురించిన పట్టింపులెందుకు? గోత్రమే ప్రామాణికమైనప్పుడు ఒకే గోత్రం వేర్వేరు కులాల్లో ఎందుకు విస్తరించి ఉంది? ఆఖరికి జాతీయ దురంహకారులు ముందుకు తెస్తున్నట్లు ఒకే జాతి ఒకేరకమైన జన్యు నిర్మాణాన్ని కలిగి ఉంటుందన్న వాదనే నిజమైతే ఒకే జన్యు నిర్మాణం ఆసియా మొదలు ఆఫ్రికా వరకూ కొన్ని కోట్ల కుటుంబాల్లోకి ఎలా ప్రవేశించింది? ఇటువంటి ప్రశ్నలన్నీ సుప్రీం కోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్తో తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలన్నా కులగణన జరగాలి. కుల పొందికల గురించిన సమాచారం మానవ సమాజ శాస్త్ర నిర్మాణం గురించి మరింత లోతైన పరిశోధనలకు దారితీస్తుంది. అంతిమంగా కులాల పుట్టుక గురించి వేల ఏళ్లుగా మన మెదళ్లలో నూరిపోస్తున్న సిద్ధాంతాలు తప్పుడు సిద్ధాంతాలని, కుల వ్యవస్థ ఆధిపత్య వర్గాలచే నిర్మితమైనదనీ రుజువవుతుంది.
సమసమాజ స్థాపనకు సమన్యాయ సాధన తొలి మెట్టు అవుతుంది. సమన్యాయ సాధన అన్నది రూళ్ల కర్ర సిద్ధాంతం కాదు. ఆయా సామాజిక తరగతుల వెనకబాటునాన్ని కొలిచి, ఏ మోతాదులో వారికి చేయూతనిస్తే ఇతర కులాలు, వర్గాలు, తరగతులతో సమానంగా అభివృద్ధి స్రవంతిలోకి ప్రవేశించి సమానమైన పాత్ర పోషించగలుగుతారో ఆ విధమైన వెసులుబాటు కల్పించటమే సమన్యాయ సాధన సూత్రానికి పునాది. ఈ పునాది ప్రాతిపదికన ముందుకొచ్చిందే అఫర్మేటివ్ యాక్షన్. రిజర్వేషన్లు సమాజంలో వెనకబడిన తరగతులు, కులాలకు చేయూతనిచ్చే సాధనాలు అని భావించినప్పుడు వాటి ఫలాలు ఆయా తరగతులు, కులాలకు సమానంగా అందాలని ఆశించటం చట్టవిరుద్ధం కాదు.
కేంద్రంలో బిజెపి అధికారానికి వచ్చిన నాటి నుంచీ రిజర్వేషన్ల సాఫల్యతను ప్రశ్నించటం కూడా పెరిగింది. విలువైన జాతీయ సంపద సంక్షేమాలు, రిజర్వేషన్ల పేరిట వృధా అవుతుందని గుండెలు బాదుకునే కుహనా మేధావులు కూడా పెరిగారు. వాళ్ల ఆరోపణ నిజమేనని రుజువు చేయటానికైనా కులగణన చేయాల్సిన అవసరం ఉంది. అఫర్మేటివ్ యాక్షన్ను సమర్ధవంతంగా అమలు చేయటానికి కులగణన, జనగణన సమాంతరంగా జరగాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రిమండిలో బిసి కులాలకు స్థానం కల్పించినంత మాత్రాన దేశంలోని బిసి కులాలు వెనకబాటుతనాన్ని అధిగమించటానికి ఏ మాత్రం ఉపయోగపడని చర్య. మనమంటే ఎవరో కూడా తెలీని సో కాల్డ్ మనవాడు అక్కడెక్కడో అందలమెక్కాడని సంతృప్తికి తప్ప ఈ చర్య దేనికీ పనికిరాదు. రాజకీయపార్టీలు కులగణన దిశగా సాగిస్తున్న ప్రయత్నాలతో ప్రగతిశీల ప్రజాతంత్ర శక్తులు, సామాజిక న్యాయం కాపాడబడాలనుకునేవాళ్లతో పాటు నిజంగా దేశంలో వెనకబాటుతనాన్ని నిర్మూలించాలని ఆలోచిస్తున్న వాళ్లు, పాటుపడుతున్నామని చెప్పుకుంటున్న వాళ్లూ గొంతు కలపాల్సిన అవసరం ఉంది. అలాంటి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. తద్వారానే కులాన్ని పాలకవర్గాల శిరోభారంగా మార్చగలం. లేనిపక్షంలో కులపీడన, అంటరానితనం, కుల అణివేత ఎదుర్కొనే వారికే ఇది శిరోభారంగా కొనసాగే ప్రమాదం ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.