
వేదకాలంలో సమాజంలో నాలుగు వర్ణాలు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులుగా ఉండేవి. వర్ణాల నుంచే కులాల ఏర్పడ్డాయనే వాదన ఉంది. క్రీ.పూ 1500లో ఆర్యులు భారతదేశానికి వచ్చారు. సామాజిక చారిత్రక సిద్ధాంతం ప్రకారం భారతదేశంలో కుల వ్యవస్థ ఆర్యుల రాకతో ప్రారంభమైంది.
కులం సమాజాన్ని, సామాజిక దొంతరలుగా విభజించే వ్యవస్థ. భారతీయ సమాజంలో కులం అంతర్భాగం. కులవ్యవస్థ, వ్యక్తి పుట్టుకతో నిర్ణయించబడిన వర్గ నిర్మాణం. వ్యక్తిగత జీవనశైలితో సాధించే సామాజిక గౌరవం ద్వారా కులం ప్రాథమికంగా నిర్వచించబడుతుంది. భారత ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించినట్లు దేశంలో 3000 కులాలు, 25,000 ఉపకులాలు ఉన్నాయి. నిజానికి భారతదేశంలో మనం చూస్తున్న కుల వ్యవస్థను జాతి అంటారు.
భారతీయ సమాజం సమగ్ర చిత్రాన్ని రూపొందించాలన్న సమాజంలోని సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని నిర్మూలించి అసమానతలు తగ్గించాలన్న, దేశంలో కుల నిర్మూలన చేయాలన్న వనరుల సమాన పంపిణీ కోసం, పథకాల రూపకల్పనకు కులాల సమగ్ర సమాచారం అవసరం.
1949 నవంబర్ 25న నవ భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన చివరి ఉపన్యాసంలో “ప్రతి మనిషికి ఒక ఓటు ప్రతి ఓటుకు సమాన విలువ ఇవ్వడం ద్వారా రాజకీయ రంగంలో సమానత్వాన్ని సాధించాం. సాంఘిక ఆర్థిక రంగాల్లో సమానత్వం సాధించాలి, భవిష్యత్తు పాలకులు అందుకు కృషి చేయాలి” అని అన్నారు. సాంఘిక ఆర్థిక సమానత్వ కోసం కులగణన అవశ్యకం.
భారత రాజ్యాంగం కులగణనను చేయడాన్ని సమర్థిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితులను పరిశోధించడానికి, ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యలకు సంబంధించి సిఫార్సులు చేయడానికి ఒక కమిషన్ను నియమించాలని ఆదేశించింది.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1872లో జనాభా లెక్కలు ప్రారంభం అయ్యాయి. సామాజిక- ఆర్థిక, కులగణన- (SECC) మొట్టమొదట 1931లో నిర్వహించారు. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భారతీయ కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై సమాచారాన్ని సేకరించడం, లేమి సూచికలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. 1941లో కూడా కులగణన చేయాలనే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించి సమాచారం సేకరించింది. కానీ రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఆ సమాచారాన్ని బయటపెట్టలేకపోయింది. 1951 తర్వాత జాతీయ ఐక్యతను పెంపొందించడానికి కులగణన సేకరణను నిలిపివేయాలనీ అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 1951 నుంచి 2011 వరకు స్వతంత్ర భారతదేశంలోని ప్రతీ జనాభా గణనలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన సమాచారం సేకరించి ప్రచురించారు. దేశవ్యాప్తంగా బీసీలు 52 శాతం ఉన్నారన్న మండల్ కమిషన్ రిపోర్ట్ కూడా 1931 కులగణన ఆధారంగా చేసుకుని చెప్పినవే. రిజర్వేషన్లు 50% దాటకూడదనే నిబంధనను దృష్టిలో ఉంచుకొని ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను మండల్ కమిషన్ సిఫారసు చేసింది.
సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం..
నేషనల్ శాంపిల్ సర్వే 2011-12 లెక్కల ప్రకారం అగ్రకులాలతో పోల్చినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలు చాలా వెనుకబడి ఉన్నారని తెలుస్తుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2016-17 ప్రకారం దేశంలో 28 శాతం ప్రజలు మల్టీ డైమెన్షనల్ పార్టీ పరిధిలో ఉన్నారు. ఎస్టీలు 50%, ఎస్సీలు 33%, ఓబీసీలు 27% పేదరికంలో ఉన్నారు. నేషనల్ శాంపిల్ సర్వే 2017-18 ప్రకారం విద్యారంగంలో ఎస్టీలు 3%, ఎస్సీలు 4%, ఓబీసీలు 6%, జనరల్ క్యాటగిరి 12% గ్రాడ్యుయేట్స్గా ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్లో జనరల్ కేటగిరీలో 3% ఓబీసీలో 1% మాత్రమే ఉన్నారు. ఉపాధిరంగం జనరల్ కేటగిరిలో 30%, ఓబీసీలో 20%, ఎస్టీలు 12 శాతం మాత్రమే స్థిరమైన ఉద్యోగాలు పొందుతున్నారు. రోజువారి కూలీలు ఎస్టీలు 29%, ఎస్సీలు 38%, ఓబీసీలు 20%, జనరల్ కేటగిరీలో 11% మాత్రమే ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 2021 లెక్కల ప్రకారం 52.7% మంది జనరల్ కేటగిరి చెందిన వారే ఉన్నారు. అందులో కూడా అధిక వేతనం అందుకునే ఉన్నత ఉద్యోగాల్లో 64% పైగా జనరల్ కేటగిరీ వారు ఉన్నారు. ఈ గణాంకాలన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు అధికారికంగా వెల్లడించినవే వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అన్ని రంగాల్లో జనరల్ కేటగిరి వారితో పోల్చితే ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా సామాజికంగా చాలా వెనుకబడ్డారని మనకు అర్థమవుతుంది.
దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని బీసీల రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. 2011లో నాటి UPA హయంలో కులగణన కోసం ప్రణాళికలు తయారు చేసే నిధులు కూడా కేటాయించింది. కానీ కులగణనకు బదులుగా సామాజిక ఆర్థిక సర్వే- 2011 నిర్వహించారు. ఇప్పటివరకు ఆ నివేదికను కూడా బహిర్గతపరచలేదు. అయితే, వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎంలు కులగణనకు మద్దతుగా తీర్మానాలు చేశాయి.
కులగణన వల్ల సమాజంలో కుల వ్యవస్థ బలోపేతం అవుతుందని, కులాల వారిగా ప్రజలను వర్గీకరించడం అంటే వ్యక్తిగత హక్కులు హరించడమే అని, కులాలను నిర్వచించడం కష్టమని ఇది సమాజంలో గందరగోళం, వివాదాలకు దారి తీసి దేశ సమగ్రతకు భంగం కలిగిస్తుందనే వాదన కూడా ఉంది.
కులగణనకు అనుకూలంగా, వ్యతిరేకంగా వాదనలు ఉన్నప్పటికీ, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి, వనరుల సమాన పంపిణీని నిర్ధారించడానికి వెనుకబడిన కులాల జనాభా సమాచారం అవసరం. సమగ్ర కులాల సమాచారం సామాజిక అసమానతలను పరిష్కరించడంలో, సమానత్వ సమాజాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది.
దేశంలో కులగణనకు బీహార్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఆదర్శంగా నిలిచాయని చెప్పవచ్చు. సామాజిక న్యాయం కోసం కులగణన జరిగి తీరాల్సిందేనని దేశవ్యాప్తంగా డిమాండ్లు ఉన్నా కేంద్ర ప్రభుత్వం గతంలో చర్యలు తీసుకోలేదు. ఆలస్యం అయిన కూడా ఈసారి కేంద్ర ప్రభుత్వం రాబోయే జనగణనతో పాటు కులగణన చేయాలనే నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకం, హర్షణీయం.
బీహార్లో 2023లో ఎన్డీఏ ప్రభుత్వం కులగణన చేసి 63.14% ఓబిసిలు ఉన్నట్లు తెలిపింది. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు కర్ణాటకలో కులగణన చేసి ఈ బీసీలు 69.6% ఉన్నారని లెక్క తేల్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల వాటా 46.25%, ముస్లిం మైనారిటీలను బీసీలను కలుపుకుంటే ఈ బీసీల వాటా 56.33% ఉందని లెక్కలు తేల్చాయి. ఈ కులగణన ఫలితాల తర్వాత
జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీలకు కేవలం 27% రిజర్వేషన్ ఇవ్వడం ఏ సామాజిక న్యాయమనే చర్చ దేశవ్యాప్తంగా తీవ్రంగా జరుగుతుంది.
2018లో పార్లమెంట్ సాక్షిగా అప్పటి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారతదేశంలో రాబోయే జనగణనలో కులగణన తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా త్వరలో మొదలయ్యే జనాభా లెక్కలతో పాటు కులగణను చేపట్టాలని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్కడ పర్యటించిన ప్రధానంగా కులగణన గురించి మాట్లాడుతున్నారు. జనాభా ప్రాతిపదికన ప్రజలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అన్నివైపుల నుంచి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీ సంఘాలు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాయి. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్ణయం తీసుకునీ ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందనే విమర్శ కూడా ఉంది. శాస్త్రీయ పద్ధతిలో కులగణన సమాచారాన్ని సేకరించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఈ కులగణన ఎంతో ఉపయుక్తం కానుంది.
పాకాల శంకర్ గౌడ్
9848377734
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.