
మావోయిస్టు పార్టీ ‘శాంతి చర్చల’కు మరోసారి తన సంసిద్ధతని ప్రకటించింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ తరపున అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మార్చి 28 తేదీన జారీ చేసిన ఒక ప్రకటన ఏప్రిల్ 2న పత్రికలలో వచ్చింది. అమిత్ షా ఛత్తీస్ఘడ్ పర్యటనకి రెండురోజుల ముందు ఈ ప్రకటన రావడం గమనార్హం.
గత కొంతకాలంగా ప్రభుత్వ బలగాల ముట్టడిలో తీవ్రమైన నష్టాలని ఎదుర్కొంటూ, కీలకమైన నాయకత్వాన్ని కోల్పోతూ వస్తున్న పరిస్థితులలో, మావోయిస్టు పార్టీ తరఫున చర్చలకు సిద్ధమంటూ ప్రకటనలు వస్తూ ఉన్నాయి. అంతకు ముందు రెండు సార్లు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో చర్చలకు సిద్దమనే ప్రకటనలు వచ్చాయి. అందులో చర్చలకు సంబంధించి మావోయిస్టుల తరఫున కొన్ని షరతులు ఉన్నాయి. వివిధ ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు, కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలను రద్దు చేయడం వంటి డిమాండ్లు, భద్రతా బలగాల క్యాంపులని ఎత్తివేయాలి వంటి షరతులు వికల్ప్ ప్రకటనలో 2024 మార్చి 15న కోరారు. కాగా, ఏడాది తర్వాత వాటికి కొనసాగింపుగా, తాజాగా 2025 మార్చి 28 నాటి అభయ్ ప్రకటనలో, అటువంటి షరతులు, డిమాండ్లని పేర్కొనకుండా, ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ పేరుతో ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర (గడ్చిరోలి), ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చేస్తున్న హత్యాకాండలను, నరసంహారాన్ని(జెనోసైడ్) నిలిపివేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటుని ఆపివేయాలని ప్రతిపాదిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తే, మేం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు. మునుపటి ప్రకటనలతో పోలిస్తే, ఇది సూటియైన, స్పష్టమైన, నిర్దిష్టమైన ప్రతిపాదన. మావోయిస్టు పార్టీ వాయువ్య సబ్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి రూపేష్ పేరుతో ప్రకటనలు, తాజాగా ఏప్రిల్ 22 న బస్తర్ టాకీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంటర్వ్యూలు ప్రసారం అయ్యాయి. వీటిలో తమ వైపు నుంచి షరతుల వంటివేమీ లేవని, చర్చలకు అనుకూలమైన వాతావరణం ఉంటే చాలనీ, కనీసం ఒక నెల పాటైనా కాల్పుల విరమణ అమలు జరపాలనీ రూపేష్ కోరారు.
ఈ ప్రతిపాదనల ఫలితంగా ‘శాంతియుత’ వాతావరణం నెలకొని తీవ్ర నిర్బంధం, హత్యాకాండ నిరాఘాటంగా కొనసాగుతున్న విషమ పరిస్థితులలో ఏ మేరకైనా కొంత విరామం లభిస్తే, అది ఆహ్వానించాల్సిన విషయం. అయితే, మావోయిస్టు పార్టీ వరుస ఎదురు దెబ్బలకు గురవుతూ, తీవ్ర నష్టాలతో సతమతమౌతూ, పూర్తి స్థాయి ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితులలో 2026 మార్చి నాటికి మావోయిస్టులని ఏరివేస్తామని అమిత్ షా ప్రకటనలు, హెచ్చరికలు జారీ చేస్తున్న సమయంలో శాంతి చర్చలు, కాల్పుల విరమణ దిశలో ప్రయత్నాలు ముందుకు సాగుతాయా అన్నది ఒక ప్రశ్న.
మావోయిస్టులు బలహీనపడ లేదనీ, కేవలం సివిల్ సొసైటీ ప్రతినిధుల వత్తిడికి లోబడే శాంతి చర్చలకు అంగీకరించారని బయట వున్న కొందరు మావోయిస్టు సమర్ధకులు ఇంకా వాదిస్తున్నారు. సాయుధ పోరాటం వల్లనే గాక అనేక ఇతర ప్రక్రియల వల్ల ప్రజా ప్రయోజనాలు నెరవేరుతాయనే? ప్రజాస్వామిక దృక్పథం! ఉండడం వల్లనే మావోయిస్టులు శాంతి చర్చలకు అంగీకరించి పరిణతి ప్రదర్శించారని అంటున్నారు. 2004 నాటి చర్చల సందర్భంగా ఒప్పందంపైన షరతుల వాదవివాదాలని, ఆనాటి పరిణామాలు అందరికీ తెలిసినవే. ఆ తర్వాత 2010లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీతో సంబంధం లేకుండా కిషన్ జీ కాల్పుల విరమణకై ప్రతిపాదించిన నేపథ్యంలో 2010 , ఏప్రిల్ 18న ‘ది హిందూ’ పత్రికకు ఆనాటి పార్టీ అధికార ప్రతినిధి ఆజాద్ ఇచ్చిన వివరమైన ఇంటర్వ్యూ కూడా ఉంది. గత ప్రకటనలు, వైఖరులనీ, ప్రస్తుత మావోయిస్టుల ప్రకటనలు, ప్రతిపాదనలనీ పోల్చిచూస్తే, భౌతిక పరిస్థితులు వారిని ‘శాంతి’చర్చల వైపు ఎంతగా నెడుతున్నాయో అర్థమవుతుంది. బయట ఉన్న భద్రలోక మావోయిస్టు సమర్ధకుల మాటలు, వాదనలు ఎలా వున్నా, మావోయిస్టు పార్టీ వరుస నష్టాలతో అత్యంత ప్రతికూలమైన పరిస్థితులని ఎదుర్కొంటున్నదనేది యదార్థం. ఉదాహరణకు ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా చెప్పుకునే తమ ‘జనతన సర్కార్’ ప్రస్తావన అభయ్ ప్రకటనలో లేనే లేకపోవడాన్ని యాధృచ్ఛికం అనుకోలేము. మావోయిస్టులు ఎంత తీవ్రమైన దిగ్బంధంలో ఉన్నారో, వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో రూపేష్ ఇంటర్వ్యూ తెలియజేస్తుంది. పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట వచ్చిన ప్రకటన పార్టీదేనని ఒక సబ్ జోనల్ కమిటీ ప్రతినిధి రూపేష్ ఇంటర్వ్యూలో ధృవీకరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. యుద్ధంలో పూర్తి చొరవను కోల్పోయిన ఈ పరిస్థితులకు కారణాలను, వైఫల్యాలను స్థూలంగానైనా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మావోయిస్టు పార్టీ తాజా అధికారిక డాక్యుమెంట్లు అందుబాటులో లేకపోవడం వల్ల, అందుబాటులో ఉన్న వివరాలు, వార్తల మీద ఆధారపడిన పరిమితులతోనే మనం కొన్ని అంచనాలకు రావచ్చు.
స్థూలంగా చెప్పాలంటే ఈ దాడి తీవ్రతని ముందుగా వూహించడంలో, అంచనాలలో, దాడి నుంచి కాపాడుకోవడానికి అవసరమైన ప్రయత్నాలలో, శక్తుల మొహరింపులోనూ, కేంద్రీకరణలోనూ, క్రమపద్ధతిలో తిరోగమించడంలోనూ స్వీయ శక్తుల సంరక్షణ ఎత్తుగడల వైఫల్యాలు ఉన్నాయి. అవగాహన రీత్యా అంచనాలు సరిగానే ఉండి ఉండవచ్చు అనుకున్నా, వైఫల్యాలు, బలహీనతలని ఆచరణలో అధిగమించలేకపోవడానికి పునాదులు ఎక్కడ ఉన్నాయనేది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం.
గత అనుభవాల రీత్యా కీలక నాయకత్వాన్ని పూర్తిగా దండకారణ్య ప్రాంతంలోనే కేంద్రీకరించాలనే అవగాహన మావోయిస్టు పార్టీలో ఉండింది. శ్రేణులని ప్రధానంగా దండకారణ్యంలోనే కేంద్రీకరించి మొహరించారు. అంతకుముందు వరుస నష్టాల నుంచి నాయకత్వాన్ని కాపాడుకోవడంలో ఇది ఒక మేరకు బాగానే ఉపయోగపడింది. కానీ, దీంతో రెండు సమస్యలు తలెత్తాయి. ఒకటి, ఉద్యమానికి వెలుపల ఉన్న విశాల ప్రాంతాలలో ప్రజలతో, పరిస్థితులతో కీలక నాయకత్వానికి ఉండవలసినంత పరిచయమూ, అవగాహనా లేకుండా పోవడానికి, పరిమితులకు దారితీసింది. రెండవది, ప్రభుత్వ బలగాల ముట్టడి తీవ్రమై, ప్రాబల్య ప్రాంతాలు కుంచించుకు పోవడంతో, నాయకత్వానికి రక్షణ లేకుండా పోతుంది. వయసు మీదపడి, భౌతిక పరిమితులు ఏర్పడిన నాయకత్వాన్ని పరిరక్షించుకోవడం భారమైన పరిస్థితులలో, వారు తమ నాయకత్వ స్థానాలలో నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని చాలా కాలం క్రితమే తీర్మానించుకున్నారు. అయినా, కనీసం కదలలేని అవే పరిమితులతో కొనసాగుతూ కీలక నాయకత్వం నేలకొరుగుతున్న ఘటనలని ఇటీవల చూస్తున్నాం. ఈ పరిస్థితులను నాయకత్వం ఊహించిందా? ఊహించినా దీనినుంచి బయట పడడానికి ప్రయత్నాలని ఆలస్యంగా ప్రారంభించారా అన్నది తెలియదు. ఏదేమైనా, శక్తులని కాపాడుకోవడంలో పథకబద్ధమైన తిరోగమనం (రిట్రీట్)లో లోపాలు, వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పీపుల్స్ వార్, ఎంసిసిఐల ఐక్యతతో మావోయిస్టు పార్టీగా ఏర్పడి, ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన, పెద్ద ‘అంతర్గత శత్రువుగా’ (2005) అంచనా వేసిన నాటి నుంచి చూస్తే, పరిస్థితులలో గణనీయమైన మార్పులే వచ్చాయి. సామాజిక, ఆర్ధిక పరిణామాలను అటుంచితే, ప్రభుత్వం అంచనాలలోనే దీనిని గమనించవచ్చు. ప్రభుత్వ వివరాల ప్రకారం, 2013 నాటికి దేశ వ్యాపితంగా 128 జిల్లాలు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా ఉంటే, అవి 2024 నాటికి 38 జిల్లాలకు తగ్గిపోయింది. అంటే, దాదాపు మూడవ వంతుకు కుదించుకుపోయింది. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో 60 జిల్లాలని వామపక్ష తీవ్రవాద ప్రభావం నుంచి బయట పడవేశామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ వివరాల విశ్వసనీయత, రాజకీయ స్వభావం వీటిని గమనంలో ఉంచుకుంటూనే, భౌగోళికంగా చూస్తే ఉద్యమ ప్రభావం, ప్రాబల్యం క్రమంగా కుదించుకుపోతుందనే అంచనాకి మనం స్పష్టంగా రావచ్చు. ఉద్యమంలో ఆటుపోట్లు, విస్తరణ, తిరోగమనం ఉంటాయని గుర్తుంచుకుంటూనే, ఒకవైపు ఉద్యమం కేంద్రీకృతమైన ప్రాంతాలు కుంచించుకుపోతూ ఉన్న సమయంలో, మరోవైపు ఇతర ప్రాంతాలలో విస్తరించలేని వైఫల్యం పరిస్థితిని మరింత జటిలం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తిరోగమనం, తిరిగి అక్కడ పట్టు సంపాదించుకోలేక పోవడం, కేరళ, కర్ణాటక ట్రై జంక్షన్ ప్రాంత విస్తరణలో వైఫల్యం, బీహార్, ఝార్ఖండ్, బెంగాల్లలో నష్టాలు, ఈశాన్య రాష్ట్రాలలో పట్టు సంపాదించే ప్రయత్నాలలో వైఫల్యం ఇవన్నీ కలిసి ఈ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. దీనికి తోడు పట్టణ ప్రాంతాలలో పని గురించి అర్బన్ పర్స్పెక్టివ్ డాక్యుమెంట్లు, సమీక్షలు ఎన్ని ఉన్నా ఆచరణలో అది మెరుగు పడలేదు. ఇది ఉద్యమం మరింత ఏకాకి కావడానికి దారితీసింది.
సైద్ధాంతికంగా, రాజకీయంగా చూస్తే, ఒక విధంగా ఎంసిసిఐతో ఐక్యత తదనంతర కాలంలో పరిమితి ఏర్పడడానికి దోహదం చేసింది. ఐక్యతతో శక్తులు, సాయుధ బలగాల పెరుగుదల, రాజకీయ ప్రతిష్ట సంపాదించినప్పటికీ, ఎంసిసిఐ రాజకీయ అవగాహనలలో ఉన్న పరిమితి మావోయిస్టు ఉద్యమానికి పరిమితులు కల్పించింది. ఉదాహరణకు, 2004లో ఐక్యత సాధించడం కోసం వైరుధ్యాల సమస్యపైన ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ తన అభిప్రాయాన్ని రిజర్వేషన్లో ఉంచుకున్నది. దళారీ బూర్జువా వర్గం గురించి పార్టీ కార్యక్రమంలో చెప్పుకున్నప్పటికీ, విప్లవానికి అది ఒక లక్ష్యమని పేర్కొన్నది. అయినప్పటికీ బూర్జువా వర్గానికీ, కార్మిక వర్గానికీ మధ్యనున్న వైరుధ్యాన్ని సూటిగా పేర్కొనకుండా, నాలుగు ముఖ్య వైరుధ్యాలలో పెట్టుబడికీ, శ్రమకీ మధ్య వైరుధ్యం ఒకటి అని జనరల్గా ప్రకటించారు. మునుపటి పీపుల్స్ వార్ తరపున ఈ అంశాన్ని రిజర్వేషన్లో ఉంచుకుంటున్నామని చెప్పుకుంటూనే, ఐక్యత కోసం దీనిపై మహాసభలలో అంతర్గత చర్చలని కూడా మినహాయించుకున్నారు.
భౌతిక పరిస్థితులలో వస్తున్న మార్పులని గుర్తించ నిరాకరిస్తూ, భూస్వామ్య విధానానికీ, మొత్తం ప్రజానీకానికి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం మాత్రమే ప్రధాన వైరుధ్యమనే అంశంపై ఎంసిసిఐకి ఉన్న యాంత్రిక అవగాహనయే ఐక్యతకు కీలకమైన షరతు, ప్రాతిపదిక అయింది. దీంతో అది ఇతర వైరుధ్యాలనీ, మార్పులనీ గుర్తించకుండా పరిమితులు విధించింది. ఇది వట్టి సిద్ధాంత చర్చ కాదు. మావోయిస్టు పార్టీ కొనసాగిస్తున్న యుద్ధం స్వభావం, యుద్ధం ఎందుకు జరుగుతున్నదనే అంశాలపై అవగాహనకి సంబంధించిన ముఖ్యమైన విషయం. మావోయిస్టు పార్టీ అవగాహన ప్రకారం, భూస్వామ్య విధానానికీ, మొత్తం ప్రజానీకానికి మధ్యనున్న వైరుధ్యమే ప్రధాన వైరుధ్యం. కాగా, అక్కడి వనరులని సామ్రాజ్యవాదులకీ, విదేశీ కార్పొరేట్లకీ, దళారీ బూర్జువాలకీ కట్టబెట్టడం కోసం, ఆదివాసులని ఆ ప్రాంతాల నుంచి నిర్మూలించడం కోసం ప్రభుత్వం చేస్తున్న దాడియే ఇప్పుడు కొనసాగుతున్న కగార్ యుద్ధం అని మావోయిస్టు పార్టీ అంచనా వేస్తుంది. మావోయిస్టు పార్టీ మునుపటి గ్రీన్ హంట్ దాడుల సందర్బంగా కూడా ఇదే అంచనాని ప్రకటించింది. కాగా, ఈ అంచనాకీ, భూస్వామ్య విధానానికీ, మొత్తం ప్రజానీకానికి మధ్య ఉన్నటువంటి వైరుధ్యమే ప్రధాన వైరుధ్యమని వ్యూహం, ఎత్తుగడలు డాక్యుమెంట్లో పేర్కొన్న అవగాహనకీ మధ్య స్పష్టమైన వైరుధ్యం ఉందని మనం గమనించవచ్చు. ఒక అర్ధంలో మావోయిస్టు పార్టీ సైద్ధాంతిక అవగాహనకీ, రాజకీయ అంచనాలకీ మధ్య వ్యక్తమౌతున్న ఈ వైరుధ్యమే మావోయిస్టుల ఆచరణకు పరిమితిని విధిస్తున్నది.
కారణాలు ఏమైతేనేమి, మావోయిస్టు నిర్మాణంలో సాయుధ శక్తుల ప్రాబల్యాన్ని స్థిర పరిచిన పార్టీ ‘సైనికీకరణ’, రాజకీయ నాయకత్వ కేంద్రీకరణకి పరిమితులు విధించింది. వివిధ స్థాయిలలో రాజకీయ, సైనిక విభాగాల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నది.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ‘తాత్కాలికమైన ఎదురుదెబ్బ’గా గుర్తించి, ఉద్యమ ప్రాంతాలు కుంచించుకు పోయి, యుద్ధంలో ప్రజల క్రియాశీల పాత్ర క్రమంగా తగ్గిపోయిందని 2007 నాటికి గుర్తించి, పాఠాలు తీసుకున్నా ఉభయ రాష్ట్రాల ఉద్యమంలో గుణాత్మకమైన మార్పు ఈ నాటికీ రాలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. బయటవున్న భద్రలోక సమర్ధకులు లోపలి నాయకత్వానికి సరైన సమాచారం అందకుండా నష్టం చేశారు. వస్తుగత పరిస్థితులలో, ప్రజలతో సంబంధాలలో వచ్చిన మార్పులను గుర్తించ నిరాకరించడంలో, స్వీయాత్మక పని విధానంలో, ఇతరు లెవ్వరూ పనికిరారనే చులకనగా తిరస్కరించే ధోరణిలో, అందరినీ నిందించే సెక్టేరియన్ పోకడలలో, విమర్శని కనీసం గుర్తించకుండా తూలనాడుతూ, మిత్రులని సైతం దూరం చేసుకునే అపరిపక్వ వైఖరులలో వీటికి పునాదులు ఉన్నాయి.
అనుభవాల రీత్యా చూసినా, పరిస్థితులని బట్టి చూసినా, చర్చలకు నేపథ్యం పరస్పరం తలపడుతున్న శక్తుల బలాబలాల పొందిక మీద ఆధారపడి ఉంటుంది.
ఇరుపక్షాలూ ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని సంపాదించలేని సమతుల్యతా స్థితి(stalemate), రెండు పక్షాలనీ చర్చలవైపుకు నెడుతుంది. చర్చల ద్వారా పైచేయి సంపాదించాలని ఇరు పక్షాలూ ప్రయత్నిస్తాయి.
ఏదో ఒక పక్షం స్పష్టమైన పైచేయి సాధించినప్పుడు, పైచేయి సాధించిన పక్షం చర్చలకు షరతులు విధిస్తుంది. షరతులకు లోబడిన బలహీనమైన పక్షం, చర్చల ద్వారా తిరిగి చొరవను సంపాదించే ప్రయత్నం సాగిస్తుంది. కాగా, పైచేయి సాధించిన పక్షం తన విజయం కోసం ప్రయత్నిస్తుంది. చర్చలు తమ విజయాన్ని కుంటు పరుస్తాయని పైచేయి సాధించిన పక్షం భావిస్తే, అది చర్చలకు అంగీకరించక పోవచ్చు. చర్చలపట్ల ఆయా పక్షాల వైఖరులను వారి వారి రాజకీయ అంచనాలు, ఇరుపక్షాల బలాబలాలపై అంచనాలు నిర్దేశిస్తాయి.
ఇది కేవలం మావోయిస్టు పార్టీ సమస్య కాదు. విశాలమైన అటవీ ప్రాంతంలో ఆదివాసీ ప్రజల జీవించే హక్కుకు సంబంధించిన సమస్య. ఇందులో ప్రత్యామ్నాయ రాజకీయాలని కాలరాసే రాజ్యం అణచివేతని చూడకుండా, మావోయిస్టులు దెబ్బతినడం అంటే దానిని కేవలం ఆ పార్టీ పంథా వైఫల్యంగా చూపి ఎవరైనా సంబర పడితే, వారిని చూసి జాలిపడాలి. ఇంత క్రూరంగా వ్యవహరించే పాలకపక్షం ‘శాంతియుతంగా’ అధికారాన్ని, ఆధిపత్యాన్ని వదులుకుంటారని మనం ఊహించ వచ్చా? ఇంత బలమైన, శక్తివంతమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే ఎటువంటి సన్నద్ధత అవసరమో అర్ధం చేసుకోవాల్సిన అవసరం లేదా? వెనుకడుగు, తాత్కాలికమైన ఓటములు మనకు పాఠాలు నేర్పాలి, పరిహాసాన్ని కాదు.
పార్లమెంటరీ ప్రతిపక్షాలని బలహీనపరుస్తూ, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను నిరంకుశంగా కాలరాస్తూ, పాలకపక్షం పూర్తి పైచేయి సాధించినట్టు కనిపించే రాజకీయ పరిస్థితి శాశ్వతంగా కొనసాగబోదు. అది ఖచ్చితంగా మారుతుంది. కానీ, అది దానంతట అదిగా మారదు . రాజకీయ కార్యాచరణ ద్వారా మాత్రమే మారుతుంది. వాస్తవ పరిస్థితుల గుర్తించి, వాటిని మార్చాలనే కార్యాచరణ సృజనాత్మక పునరాలోచనకూ, ప్రస్తుత ఆచరణ పట్ల నిర్దాక్షిణ్యమైన ఆత్మవిమర్శ, పునర్విమర్శలకూ చోటివ్వాలి. ఎమర్జెన్సీ పాలన, అనంతర కాలంలో అటువంటి సృజనాత్మక పునరాలోచనలకూ, పునర్విమర్శకూ సిద్ధపడడం ద్వారానే కొండపల్లి సీతారామయ్య, చండ్ర పుల్లారెడ్డి, కెజి సత్యమూర్తి వంటి విప్లవ నాయకులు తమ, తమ సంస్థలను నష్టాల నుంచి బయటపడవేసే గుణాత్మక మార్పులని సాధించగలిగారు. అందుకు సైద్ధాంతిక స్థైర్యమూ, ధైర్యమూ ఉండాలి.
ఏదేమైనా, శాంతి చర్చలకు ప్రతిపాదనలు ముందడుగు వేసి, ప్రజలకు ఒక ఊరట కల్పించే వాతావరణానికీ, పరిస్థితులను మరోసారి కూలంకషంగా అంచనా వేసుకోవడానికీ దారి తీయాలని ఆశిద్దాం. నష్ట నివారణ కోసం, ఆదివాసీ హననాన్ని నిరోధించడం కోసం ప్రయత్నిద్దాం.
కే రమణ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.