
ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయి. అయినా ఫలితాలు చూశాక అలర్ట్ కావాల్సిన పరిస్థితి మాత్రం ఎదురైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఫలితంలో చోటుచేసుకున్న ట్విస్ట్ తెలుగుదేశం, జనసేనకు షాక్ ఇచ్చింది. దాంతో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అయితే రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పట్టభద్రుల స్థానాలకు జరిగిన రెండు సీట్లు కూటమి మద్దతునిచ్చిన అభ్యర్థులే గెలిచారు. అనూహ్యంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ సీటు మాత్రం పీఆర్టీయూ గెలుచుకుంది. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో తెలుగుదేశం, జనసేన బలపర్చిన రఘువర్మ కాకుండా పీఆర్టీయు అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గెలుపొందడం కొంత కలవరపరిచినా, శ్రీనివాసులు నాయుడికి అంతకుముందు బీజేపీ మద్దతు ప్రకటించడంతో అదికూడా కూటమి కోటాలోకే వచ్చినట్లయ్యింది. ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంది.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పుడు ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంకేతాలను ఇచ్చింది. ఈ ఫలితాల సందేశం ఏంటన్నది పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఫలితాలు ఎలా వచ్చాయి..
ఏపీలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపు వంద అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగాయి. 2024లో కూటమి రెండు అసెంబ్లీల మినహా ఈ సీట్లలో విజయం సాధించింది. అప్పట్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు ఉమ్మడిగా కూటమికి జై కొట్టారు. ఇప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూస్తే ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. ఆలపాటి రాజాకి 82 వేల 320 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొత్తం 9 రౌండ్లలో లక్షా 45 వేల 57 ఓట్లు ఆలపాటి రాజా సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు 62 వేల 737 ఓట్లు సాధించారు.
ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 71,063 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఏడో రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి విజయానికి కావాల్సిన 51 శాతం ఓట్లను ఆయన సాధించారు. గతంలో కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులు విజయం సాధించినా, ఈ సారి ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి దృష్టి సారించారు. ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు పలుమార్లు కూటమి నేతలతో సమీక్షలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఈ ఫలితాల పైన కూటమి నేతలు విశ్లేషణలు చేస్తున్నారు. వైసీపీ పోటీలో లేకున్నా, రెండు గ్రాడ్యుయేట్ స్థానాలలో పీడీఎఫ్ అభ్యర్థులకు వేల సంఖ్యలో ఓట్లు రావడాన్ని టీడీపీ నేతలు ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఫలితం టీడీపీని కలవరపరిచింది. మేము కూడా పీఆర్టీయు అభ్యర్ధినే బలపరిచామని తెలుగుదేశం, జనసేన నేతలు ఇప్పుడు చెప్పుకుంటున్నా, ఇది కూటమి ఓటమిగా వైసీపీ విమర్శిస్తోంది.
ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమా..?
ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకుండా వైసీపీ ఎలాంటి టెన్షన్ లేకుండా బైటపడితే, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి కూటమి నేతలలో మాత్రం టెన్షన్ కనిపించింది. కూటమి ప్రభుత్వం 8 నెలల పాలనను పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎలా చూశారన్నది ఫలితాలు తేల్చాయి. అయితే టీచర్లలో అప్పుడే అసంతృప్తి చోటుచేసుకుందా అనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని , కూటమి నేతలకు తెలుసు, అయినా హామీలు గుప్పించారు. సూపర్ సిక్స్ హామీలను ఒకటిరెండు మినహా మిగిలిన వాటిని అమలు చేయలేక పోస్ట్ పోన్ చేస్తూవచ్చారు. దీని ప్రభావం గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కనిపించింది. సంవత్సరంలోపే ఈ టెన్షన్ పరిస్థితి ఉంటే, తరువాత పరిస్థితి ఏంటన్నది సందేహంగా మారింది.
వైసీపీ నేతలపై కేసుల ప్రభావం..
గత ప్రభుత్వంలో చెలరేగి పోయిన వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సరిగా వ్యవహరించడం లేదని తొలుత తెలుగుదేశం క్రిందిస్థాయి కేడర్ లో అసంతృప్తి చోటుచేసుకుంది. అయినా ఓపికగా ఎదురు చూశారు. ఇటీవల కొన్ని రోజులుగా వైసీపీ నేతలను టార్గెట్ చేసినట్టుగా వరుసగా కేసులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ చర్య టీడీపీ శ్రేణులకు రుచిస్తున్నా, ఒక వర్గం నుంచి వ్యతిరేకత ఎదుర్కోంటోంది. ముందు అభివృద్ధి పై దృష్టి పెట్టాలన్న వాదనే వినిపిస్తోంది. ప్రతి పని విషయంలో ముందూ వెనుకా ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న పాట పాటుతుండటంతో ఈ విషయం ముందు తెలియదాన్న వ్యంగ్య ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇవన్నీ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం టెన్షన్ కు గురవడానికి కారణం అయింది. అందుకే ఎన్నికల్లో ఓటుకు లెక్కకట్టి మరీ డబ్బులు పంచాల్సి వచ్చింది. అటు వైసీపీ కూడా అధికార పార్టీ సూపర్ సిక్స్ కు ఇప్పటినుంచే మంగళం పాడుతోందన్న విమర్శలు చేస్తూ ప్రజలలోకి వెళ్ళేందుకు సిద్ధమవుతోంది.
జీవీ రెడ్డి ఎపిసోడ్ టీడీపీకి షాక్
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలకు తమ పార్టీ అధికార ప్రతినిధి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేయడం సంకటంగా మారింది. పార్టీలో చర్చకు దారితీసింది. ఫైబర్ నెట్ లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను ఎత్తిచూపీ దోషులపై చర్యల దిశగా జీవీ రెడ్డి వేస్తున్న అడుగులకు ప్రభుత్వమే సహకరించక పోవడం, ఫైబర్ నెట్ ఎండీకి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు కూడా మద్దతుగా నిలిచారన్న భావన పార్టీ శ్రేణులలో చోటుచేసుకుంది. పార్టీ అధినేత వైఖరి వల్లే ఒకనేత పార్టీకి దూరమయ్యాడన్న అభిప్రాయం నెలకొంది. ఈ ఎపిసోడ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే చోటుచేసుకుంది. ఏదిఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా మారాయి.
బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.