
తదేక పుస్తకానికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చక్కటి విలువైన ముందుమాట రాశారు. ఈ పుస్తకంలో మొత్తం 21 వ్యాసాలు ఉన్నాయి. భానుశ్రీ కొత్వాల్ సంపాదకత్వంలో వచ్చిన “నాన్న” కవితా సంకలనంపై రాసిన వ్యాసం బాగుంది. కవిత్వంలో ఒకనాడు ఆత్మాశ్రయం ఎక్కువే కానీ నేటి కవిత్వంలో సామాజిక చైతన్యమే ఎక్కువని వ్యాస రచయిత హసేన అంటారు. అలాగే నవల గురించి రాస్తూ “బౌద్ధిక ధర్మాన్ని కూడా పెంచుకోవడం వల్లనే మనస్తత్వ చిత్రణలకు అస్తిత్వవాదానికీ చైతన్య స్రవంతికి అవకాశం ఏర్పడింది” అంటూ తనదైన అభిప్రాయాన్ని వెల్లడించడం ద్వారా విమర్శకు చక్కటి “బాట” వేశారు.
తొలి తెలుగు నవలగా గోపాల కృష్ణమశెట్టి రాసిన “శ్రీరంగరాజ చరిత్ర”అని ఫోర్ట్ సెయింట్ జాడ్జి గెజిట్ పేర్కొన్న అంశాన్ని రాశారు. ఇది వెలువడ్డ 6 సంవత్సరాల తర్వాత వీరేశలింగం నవల రాజశేఖర చరిత్ర వివేక వర్థినిలో ప్రచురితం అయ్యింది. ఇది ఆంగ్లంలోకి అనువాదమైన తొలి నవలగా చెప్పారు. శ్రీపాద కథలు “నవలికలు” అనే విధంగా ఉంటాయన్నారు. ఇలా విశ్లేషణతో పాటు విమర్శ చేయడం చాలా కష్టం. నవలా రచనకు కథ/వస్తువు/పాత్రలు/నేపథ్యం అనే నాలుగు భాగాలు చాలా అవసరమని రచయిత అంటారు.
52 కవితలున్న ఏనుగు నరసింహారెడ్డి “కొత్త పలక” గురించి సమీక్ష బాగుంది. ఫ్రీజోన్, 610 జీవోలపై కవిత్వంలో చెప్పడం “కొత్త పలక” విశేషమని చెప్పుకోవచ్చు. తెలంగాణ సాహిత్య చరిత్రను మదింపు చేసి దానికి ఒక రూపం తెచ్చిన ఘనత సుంకిరెడ్డి నారాయణ రెడ్డికి దక్కుతుంది. వారి “తావు” కావ్యాన్ని వ్యాస రచయిత హసేన చక్కగా విశ్లేషించారు.
“సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని- నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని/ అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని” అంటూ మనిషులను మేల్కొలిపే పాటల వెనుక వచ్చే వాళ్లకు దారి చూపినట్టు రాసిన విప్లవ అంకురం సిరి వెన్నెలపై వ్యాసం చాలా బాగుంది. 1792లోనే స్త్రీల హక్కుల గురించి మేరీ వోల్స్టోన్క్రాఫ్ట్ రాసిన ఎ విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ఉమెన్: విత్ స్ట్రిక్ట్చర్స్ ఆన్ పొలిటికల్ అండ్ మోరల్ సబ్జెక్ట్స్ గురించి, 1980లో ప్రారంభమైన స్త్రీవాద తెలుగు కవిత్వం గురించి, 93 మంది కవయిత్రులచే రాసిన “నీలి మేఘం” గురించి విశ్లేషణ బాగుంది.
దళిత- మైనార్టీ, స్త్రీవాద సాహిత్యంపై వ్యాస రచయిత తులనాత్మక పరిశీలన చేశారు. అంతేకాకుండా పొత్తి నవలలోని ప్రధాన అంశాన్ని విశ్లేషిస్తూనే, అలనాటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సమయంలో వచ్చిన సాహిత్యాన్ని సోదాహరణలతో చెప్పడం బాగుంది. కొండి మల్లారెడ్డి కవితా సంపుటి “భిన్న ఋతువు”పై సమీక్షలో సాహిత్యంలో మానవతా విలువలు కలిగి ఉండాలని చెపుతూ “కంచెలు” కేవలం మానవ నిర్మితాలని, కృత్రిమంగా నిర్మించుకున్నవని అన్నారు.
“సామాజిక వైరుధ్యాల ధిక్కార స్వరం జవేరియా కవిత్వం” అనే వ్యాసంలో కవయిత్రి జవేరియా కవితలో “మాట్లాడలేని పూలు ధీనంగా చూస్తూ/ మౌనంగా రోదిస్తుంటాయి” అనడాన్ని జంధ్యాల పాపయ్యశాస్త్రి పుష్పవిలాపం కావ్యంలోని పద్యాలతో పోల్చి చెప్పారు. “బిల్కిస్ బానో”పై బిళ్ల మహేందర్ సంపాదకత్వంలోని సంఘీభావ కవితా సంకలనాన్ని అద్భుతంగా విశ్లేషించారు. వేటూరి పాటతో నిర్గుణ్ కవితలను పోల్చి చెప్పడం బాగుంది.
తిలక్ అమృతం కురిసిన రాత్రి/ దేవులపల్లి కృష్ణశాస్త్రి కృష్ణపక్షం/ సినారె విశ్వంభర కావ్యాలపై రాసిన వ్యాసాలు, వాటి విశ్లేషణ రేపటి తరం సమీక్షకులకు- విమర్శకులకు చక్కటి మార్గదర్శకత్వంగా ఉంటాయి. తెలుగు ప్రభలో ప్రచురితమైన “తెలుగు సాహిత్యంపై అభ్యుదయ కవితోద్యమ ప్రభావం” వ్యాసం చాలా విలువైనది. 1936 ఏప్రిల్ 9, 10 తేదీలలో లక్నోలో మున్షీ ప్రేంచంద్ అధ్యక్షతన అఖిల భారత అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభలు జరిగాయి. అరసం ప్రభావంతో ఎందరో కవులు, కథకులు, నాటక కర్తలు, నవలాకారులు, కళాకారులు ఎలా ముందుకొచ్చారో వ్యాసంలో విశ్లేషించారు. శేషేంద్ర- గద్దర్లపై వ్యాసాలలో మరికాస్త విశ్లేషణ జోడించి రెండు పార్శ్వాలు(రెండు కోణాలు) రాస్తే సమగ్రత వచ్చి ఉండేది.
అంతర్జాతీయ దృక్పథంలో, మానవాభ్యుదయాన్ని కాంక్షించే కవిత్వం రావాలి. అనే అంశం అందరూ ఆమోదించే అభిప్రాయమే. వెల్చేరు నారాయణరావు, లక్ష్మీ నర్సయ్య, జీవీ సుబ్రహ్మణ్యం, రోమిల్లాథాపర్, బిపిన్చంద్ర, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ఎస్వీ రామారావులాంటి పెద్దలు రాసిన ప్రామాణిక గ్రంథాలే రేపటి తరం కలం యోధులకు పెద్దబాల శిక్షలు. మొత్తంమీద డా మహమ్మద్ హసేన రాసిన పరిశోధనాత్మక “తదేక” వ్యాసాలు ఎంతో విశ్లేషణాత్మకంగా ఉన్నాయి. సాహితీకారులకు, పరిశోధక విద్యార్థులకు ఉపయోగపడతాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.