
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంలో ‘‘సమాన పనికి – సమాన వేతనం’’అనే సూత్రం ఇంకా అమలు జరగడంలేదు. దీంతో దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల పేర్లతో అనేక సౌకర్యాలు తగ్గించి, తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకొని శ్రమ దోపిడీ చేస్తున్నాయి. ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడంతో పాటుగా ఆర్ధిక, సామాజిక భద్రత లేకుండా చేస్తూ బహిరంగంగా శ్రమ దోపిడికి దారితీసింది.
రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే ఆర్టికల్ 14ఏ పౌరుడికి చట్టం ముందు సమాన హక్కును రాజ్యం నిరాకరించకూడదని, ప్రతి ఒక్కరికీ చట్టాల నుంచి సమానమైన రక్షణను రాజ్యం కల్పించాలని హామీ ఇస్తుంది. కానీ ఒకే పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు- రెగ్యులర్ ఉద్యోగుల మధ్య వేతన భేదాలు ఈ హక్కుకు విరుద్ధంగా ఉన్నాయి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన రక్షణను ప్రభుత్వాలు కల్పించటం లేదు. ఫలితంగా రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను భక్షిస్తూ వారి జీవితాలను పేదరికంలోకి, నిరంతర అభద్రతలోకి నెడుతున్నాయి.
రాజ్యాంగ విరుద్ధ నియామకాలు..
ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగ నియామకాలలో ఎటువంటి వివక్ష ఉండకూడదు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నియామకాల పేరుతో రిజర్వేషన్స్ అమలు చేయకుండా రాజ్యాంగ విరుద్ధ నియామకాలు చేస్తూ సామాజిక న్యాయాన్ని గాలికి వదిలేశాయి. ఔట్ సోర్సింగ్ నియామకాల్లో రాజకీయ సిఫార్సులు, లంచాలు రాజ్యమేలుతూ నిరుపేద నిరుద్యోగులను నిస్సహాయ స్థితికి నెడుతున్నాయి. తెల్లవారి లేచింది మొదలు పేద ప్రజల కోసం సామాజిక న్యాయం కోసం పాలకులు మాట్లాడుతుంటారు. కానీ అమానవీయమైన ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయకుండా తమ రాజకీయ ఆర్థిక అవసరాల కోసం రాజ్యాంగాన్ని పాలకులు అపహాస్యం చేస్తున్నారు.
జీవించేందుకు, వ్యక్తిగత స్వేచ్ఛకుగల ప్రాథమిక హక్కుని ప్రతీ పౌరునికీ ఆర్టికల్ 21 గ్యారంటీ చేసింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో తక్కువ వేతనానికి పనిచేయించుకుని రిటైర్మెంట్ తరువాత పెన్షన్, గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు నిరాకరించడం వలన వారి జీవించే హక్కును ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి.
గాలి మాటగా సమాన పనికి సమాన వేతనం..
ఆర్టికల్ 39లో ఉన్న సమాన పనికి – సమాన వేతనం నిర్దేశిక సూత్రం ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తుంది. సంపద కేంద్రీకృతం కాకుండా వనరులను సామూహిక ప్రయోజనాలకు వినియోగించాలని నిర్దేశిస్తున్నది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు రెగ్యులర్ ఉద్యోగులు వేతనాల కంటే తక్కువగా ఇవ్వడంతో రాజ్యాంగం నిర్దేశించిన సమాన పనికి సమాన వేతనం గాలి మాటగా నిలిచిపోతున్నది.
నిరుద్యోగుల కోసం పని అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆర్టికల్ 41 ఉపాధి హక్కు నిర్దేశిస్తుంది. ప్రభుత్వ శాఖల్లో సంవత్సరాల తరబడి ఏర్పడిన ఖాళీలు నింపకుండా శాశ్వత స్వభావం కలిగిన ఉద్యోగాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ నియామకాలు చేయడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య. దీర్ఘకాలిక భద్రత లేని ఉద్యోగాలు భర్తీ చేసి భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలిస్తున్నాయి.
అనిశ్చితిలో ఉద్యోగుల భవిష్యత్తు..
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల వల్ల వారి భవిష్యత్తు అనిశ్చితిలో ఉంటుంది. రెగ్యులర్ ఉద్యోగులతో పోల్చితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చేది తక్కువ వేతనం. పెరిగే ధరల నుంచి రక్షణ లేదు. ఎన్ని సంవత్సరాలు పని చేసినా అట్టడుగు స్థాయి వేతనమే. ఇది సమాన పనికి సమాన వేతనం అనే రాజ్యాంగ హక్కుకు వ్యతిరేకంగా ఉంది. సామాజిక భద్రతా లేమి, పింఛన్, వైద్య ఖర్చుల ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ, వీడ్కోలు ప్యాకేజీ వంటి ప్రయోజనాలు లేకపోవడం, ఔట్సోర్సింగ్ సంస్థల దోపిడీ వలన మధ్యవర్తులకే లాభం ఎక్కువగా ఉండి ఉద్యోగులకు నష్టమవుతుంది.
కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రోత్సాహకాలు, ప్రమోషన్లకు దూరంగా ఉంచడం వల్ల అభివృద్ధి అవకాశాలు లేకుండా పోతున్నాయి. ప్రభుత్వాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ పనిని చేయించుకోవడం కోసం, ఔట్సోర్సింగ్ కంపెనీలు లేదా మధ్యవర్తుల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి.
మన రాజ్యాంగం ప్రకారం ఆదర్శ యజమానిగా ఉండవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో అసమానతను ప్రోత్సహించే విధానం అవలంబిస్తున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యోగంలో ఉన్నప్పుడు, ఉద్యోగ విరమణ అయినా లేదా ఇంకా ఏ కారణం చేతనైనా ఉద్యోగాలు కోల్పోయినా ఆరోగ్య బీమా లేదా చికిత్స సదుపాయాలు అందడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం లేదా భరోసా లేకుండా ఉంటున్నారు.
కీలక తీర్పుల పరిశీలన..
ముఖ్యమైన న్యాయ తీర్పులను పరిశీలిస్తే రణధీర్ సింగ్ కేసు (1978) తీర్పు ‘‘సమాన పనికి సమాన వేతనం’’ పౌరుల హక్కు మాత్రమే కాకుండా రాజ్యాంగంలో ప్రాథమిక విధానమని పేర్కొంది. ఉమాదేవి కేసులో (2006) సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు విధానాలను రూపొందించాలని సూచించింది. జగ్జిత్ సింగ్ కేసు (2016)లో సుప్రీం కోర్టు, సమాన పనికి సమాన వేతనం అనే హక్కును మరింత బలపరిచింది. తాత్కాలికంగా పనిచేసే ఉద్యోగులకు కూడా రెగ్యులర్ ఉద్యోగులకిచ్చే వేతనాలు ఇవ్వాల్సి ఉందని తీర్పు ఇచ్చింది. కార్మికులకు వారి ప్రయోజనాలు అందకుండా చేసేందుకు కృత్రిమ ప్రాతిపదికలు సృష్టించడం తప్పు అని చెప్పింది.
‘‘ఒకే విధమైన బాధ్యతలు నిర్వహిస్తూ, ఒకే రకమైన పనిచేస్తున్న వ్యక్తికి (కాంట్రాక్టు పేరిట) మరొకరి (పర్మినెంట్ ఉద్యోగి) కంటే తక్కువ జీతం ఇవ్వడం సరికాదు. మరీ ముఖ్యంగా సంక్షేమ రాజ్యంలో అస్సలు కుదరదు’’ అని ధర్మాసనం పేర్కొన్నది. ‘‘ఎవరూ తమ ఇష్ట ప్రకారం తక్కువ వేతనం తీసుకుని పని చేయరు, తమ కుటుంబాన్ని పోషించుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తన ఆత్మగౌరవాన్ని, హుందాను, స్వీయ విలువను తగ్గించుకుని మరీ తక్కువ జీతానికి పనిచేస్తారు. అలా చేయకపోతే తమపై ఆధారపడిన వారికి ఇబ్బందులు తలెత్తుతాయని తెలుసు’’ అని తీర్పు చెప్పిన జస్టిస్ ఖేహర్ పేర్కొన్నారు. ‘‘ఒకే రకమైన పరిస్థితుల్లో, ఒకే రకమైన పనిచేసే వారి మధ్య వేతనాల్లో తేడా ఉండటమంటే శ్రమను దోచుకోవడమే. ఇది ఖచ్చితంగా అణిచివేత చర్యే’’ అని స్పష్టం చేశారు. మోహనలాల్ కేసు (2021)లో తాత్కాలిక ఉద్యోగులను పునరుద్ధరించడంలో ప్రభుత్వాలకు నిబంధనల మీద స్పష్టత అవసరమని సుప్రీం కోర్టు చెప్పింది.
ఆర్థిక సంక్షోభానాకి దారితీసేలా విధానాలు
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాలు భారతదేశ రాజ్యాంగం కల్పించిన హక్కులకు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నాయి. మన రాజ్యంలో ఆదేశిక సూత్రాల్లో పౌరులకు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా నిర్ధారించబడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాలు సామాజిక అసమానతను పెంచి ఆర్థిక సంక్షోభాలకు దారితీస్తాయి. ఉద్యోగభద్రత లేకపోవడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతున్నాయి. అంతేకాకుండా గౌరవప్రదమైన కుటుంబ జీవనం నాశనం అవుతుంది. ఒకే రకమైన పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల్లాగే వేతనం ఇవ్వడం అనివార్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడిని తక్షణమే ఆపి, ఉద్యోగులకు సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన వేతనాలు, భద్రత కల్పించడానికి 75 సంవత్సరాల రాజ్యాంగ అమలు కోసం చర్చ జరుగుతున్న ఈసందర్భంలో సమగ్రమైన చట్టాలు, పాలసీలను అమలు చేయాలి.
రాజ్యాంగంలో పొందుపరిచిన గౌరవప్రదమైన జీవితం కోసం ఒక నిర్దిష్ట కాలం పూర్తిచేసిన తర్వాత, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనే విధానం రూపొందించాలి. సంస్థల పాత్రను పర్యవేక్షించడానికి ప్రత్యేక నియంత్రణ మండళ్లు ఏర్పాటు చేయాలి. కరువు భత్యం, ఇంటి అద్దె, పింఛన్, గ్రాట్యుటీ, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు అమలు చేయాలి. కనీస వేతనం, వర్క్ అవర్స్ నియంత్రణ పర్యవేక్షణలో కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఉద్యోగ విరమణ చేసిన కాంట్రాక్టు, ఔట్ సోర్స్ ఉద్యోగుల సంక్షేమానికి చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలి. కోర్టుల ద్వారా వచ్చిన తీర్పులు, ముఖ్యంగా సమాన వేతనం తీర్పులను త్వరగా అమలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇవ్వడంలో, వారి అప్పులు మాఫీ చేయడంలో ఉండే ఆసక్తి పేద కుటుంబాల నుండి వచ్చిన ఉద్యోగుల, కార్మికుల సంక్షేమం పైన ప్రభుత్వాలు పెట్టడం లేదు.
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.2
ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ నెల 6వ తేదిన జీవో నెం.2ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంలో నడుస్తున్న పథకాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమమ్ ఆఫ్ టైం స్కేల్ వర్తింప చేయకూడదని జీవో ద్వారా ఆదేశాలను జారీ చేసింది. ఈ జీవో రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధం. కృత్రిమ ప్రాతిపదికలను సృష్టించి, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకుండా ఉండడమే ఈ జీవో ఉద్దేశం. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం, సమానత్వం కోసం ఉద్యోగులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగులు తమ పోరాటాల ద్వారా కొన్ని హక్కులు, సౌకర్యాలు సాధించుకున్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం పర్మినెంట్ ఉద్యోగుల సహాయ సహకారాలతో తాత్కాలిక ఉద్యోగులందరూ ఒక్కటై విశాల ఐక్య ఉద్యమాలు చేయడంతో భారత రాజ్యాంగం నిర్దేశించిన గౌరవప్రదమైన జీవితం ఏర్పడుతుంది.
– బీ కాంతారావు
(రాష్ట్ర కో-చైర్మన్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.