
మీ అందరికీ సలాం. నేను బస్తర్ నుంచి వచ్చాను. మా బస్తర్ ప్రజల తరఫున మీ అందరికి సలాం. సుబ్బారావుకి సలాం. ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను. సుబ్బారావు మానవత్వం ఉన్న సమాజం రావాలని కృషి చేశాడు. ప్రస్తుతం మన మధ్య లేరు. కానీ మా మనసులో ఉన్నాడు. మీ అందరి మనసుల్లో ఉన్నాడు. మన జ్ఞాపకాల్లో సజీవంగా ఉన్నాడు. బస్తర్లో ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. చాలా విషయాలు మీ అందరికీ తెలుసు. నన్ను పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు నేను చర్చలు జరగాలి అని చెప్పడానికి వచ్చాను. శాంతి చర్చలు జరగాలి. ఎందుకు జరగాలి? ఇంతకు ముందు సల్వాజుడుమ్ సమయంలో మా ఆదివాసీ ప్రజలను చంపేశారు. మహిళలపైన బలాత్కారాలు చేశారు. చంపేసి నదుల్లో పడేశారు. మా ఆదివాసీల ఇళ్ళు తగులబెడుతున్నారు.
జైళ్లకు పంపుతున్నారు. బస్తర్లో అనేక రకాల సహజ సంపద ఉన్నది. ఇనుము ఉన్నది. అందుకని ప్రభుత్వం బస్తర్పైన దృష్టి పెట్టింది. అందుకని బస్తర్లో ఉన్న ఆదివాసులపై మానవహననం జరుగుతోంది.
2026 మార్చి 31 వరకు నక్సల్స్ని తూడిచిపెడతామని అంటున్నారు. నక్సల్స్ను అంతం చేస్తామనే పేరుతో ఎవరిని అంతం చేస్తున్నారు? అమిత్ షాకు తెలుసు మేం నక్సలైట్లను కాదు వారి పేరుతో ఆదివాసులను అంతం చేస్తున్నామని. బస్తర్లో ఎవరిని చంపాలనుకుంటున్నారో తెలిసిపోయింది. మాకు అర్థమైపోయింది. ఎన్నో ఘటనలు జరిగాయి. పీడియా దగ్గర చంపేశారు. 15-20 మందిని ఒక్కసారిగా చంపేస్తున్నారు. ఒక మావోయిస్టును చంపడానికి పది మంది ఆదివాసులను చంపుతున్నారు.
తుపాకి పట్టుకున్న ఇద్దరి మధ్యలో నిరాయుధులను చంపుతున్నారు. పెద్ద రోడ్లు వేస్తున్నారు. దాని కోసం పెద్ద వృక్షాలను నరికివేస్తున్నారు. అది ఆపడానికి, దానికి వ్యతిరేకంగా చంకలో చిన్నబిడ్డతో ఉన్న తల్లి ఇది మా భూమి, మా చెట్లు నరక వద్దని చెప్పడానికి వెళ్ళింది. ఈ చెట్ల వల్ల మహువాను అమ్మి వచ్చే ఆదాయంతో నా పిల్లలకి తిండి పెడ్తాను. నేను ఈ చెట్టును నరకనివ్వను. నరకొద్దు అని చెప్పడానికి వెళ్లింది. వాళ్ళు కాల్పులు జరిపారు. అక్కడ ఏ నక్సలైటూ లేడు. అందరూ మామూలు ప్రజలు. అక్కడికి మంగ్లీ తల్లి కూడా వెళ్లింది. పాప గుండెకి తూటా తగిలింది. ఇప్పుడు ఆ పాప లేదు. మంగ్లి పాపను చంపేశారు. ఆరు నెలల పసికందు. తల్లి బతికిపోయింది. కానీ ఆమెకు కూడా తూటా తగిలి ఉండేది.
అట్లా మా పిల్లలు ఎంతోమంది ఐఇడి పేలుళ్ళ వల్ల చనిపోతున్నారు. ముసలివాళ్ళు చనిపోతున్నారు. యువత అందరూ బస్తర్ ప్రమాదంలో ఉంది. నేలలో మైన్లు పెట్టారు. మేం రాత్రిపూట నృత్యాలు చేసేవాళ్లం. ఇప్పుడు ఏదీ లేదు. రోడ్డు మీద వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామనే నమ్మకం లేదు. ఎక్కడ బాంబు పేలుతుందో తెలియదు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే నక్సలైట్ల పేరుతో ఆదివాసుల మీద దాడి చేస్తున్నారు. ఇళ్ళలో ఉన్నవాళ్లని ఎత్తుకెళ్లి చంపేస్తున్నారు.
పిడియాలో తెల్లవారు జామున లేచి వండుకుని తెందు ఆకులు కోయడానికి వెళ్లారు. నాలుగువైపుల నుంచి వచ్చి చుట్టుముట్టారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరు గుంటలలో దాక్కున్నారు. కొందరు చెట్లు ఎక్కారు. సైన్యం వాళ్లందరిని వెతికి బయటకు లాగింది. వాళ్ళ తల్లులు తమ పిల్లల్ని చంపవద్దు అని వేడుకున్నారు, అరిచారు. కానీ ఆగలేదు. కాల్పులు జరిపారు. చెట్టు మీదకు కాల్పులు జరిపారు. మనం రాళ్ళు కొట్టి మామిడిపండు కింద పడేసినట్టు కిందకి పడిపోయారు. చెట్టు మీంచి శవాలు కింద పడ్డాయి. బస్తర్లో పరిస్థితి అలా ఉంది. ఇటీవల 2025లో వచ్చారు, చుట్టుముట్టారు. అందరినీ తీసుకెళ్లిపోయారు.
40 మందికి పైగా అరెస్టు చేశారు. మిగిలిన ఆరుగురిని తూటాలు పేల్చి చంపేశారు. చంపే ముందు మా అక్క చెల్లెళ్లను, తల్లి తండ్రులను ఇంత చిత్రహింసలు పెట్టి ఎందుకు చంపుతావు? కానీ వాళ్ళు ఏం చేశారంటే. పురుషుల పురుషాంగాన్ని కోసేశారు..
మీకు తెలుసు మేం అడవిలోకి వెళ్ళేటప్పుడు విల్లు, బాణం తీసుకెళ్తాం. చెట్ల మీద ఉన్న పక్షుల్ని కొట్టడానికి, ఏవైనా అడవి జంతువులు కనిపిస్తే వేటాడటానికి. వాళ్ల దగ్గర ఆయుధం ఉందని చంపేసి వారి మీద రెండు లక్షలు, మూడు లక్షలు వెల కట్టిన మావోయిస్టు చనిపోయాడు అని ప్రకటిస్తారు. తరువాత తెలుస్తుంది వారు ఆదివాసీని చంపేశారు అని. మహిళల మీద మరింత ఎక్కువగా అత్యాచారాలు చేస్తున్నారు. మా శరీరం వారికి ఒక ఆటవస్తువు. తూటా పేల్చి చంపే ముందు వారి శరీరాన్ని ఛిద్రం చేస్తున్నారు. చిత్రహింసలపాలు చేస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరిగాయంటే, ఇంట్లో ఉన్న మహిళను ఎత్తుకెళ్లిపోతారు. తుపాకి మొనతో పొడుస్తున్నారు. కొడుతున్నారు. అలా ఒక మహిళను ఎత్తుకెళ్లారు. ఇంటికి 500 మీటర్ల దూరంలోనే మహిళ అరుస్తోంది. ఇటువైపు ఉన్న మహిళలకు ఆ అరుపులు వినిపిస్తున్నాయి. ఆమె ఊపిరి ఆగిపోయేదాకా బలాత్కారం చేస్తారు. ఆ తరువాత తూటా పేల్చి చంపేస్తారు. లేదా ఆమె చనిపోతే తీసుకువెళ్లి మావోయిస్టును చంపేశామని ప్రకటిస్తారు. ఆ తరువాత మాకు తెలుస్తుంది ఆమె ఎవరో. బలాత్కారం మాకు అన్నిటికంటే భయంకరంగా, ప్రమాదకరమైనదిగా అనిపిస్తుంది.
మహిళల పట్ల అంత క్రూరంగా ఎట్లా ప్రవర్తిస్తారు? స్థనాలు కోసేస్తారు. తొడల మీద కోస్తారు. కళ్ళు పీకేస్తారు. మర్మాంగాలను కోస్తారు. మా మహిళల పరిస్థితి ఇది. ఇలా బస్తర్లో ఎన్ని హత్యలు జరిగాయో ఎన్నని చెప్పను? మాకు అనిపిస్తుంది. మేం భారతదేశ నాగరికులం కాదా? భారతదేశంలో బస్తర్ భాగం కాదా? ఇప్పుడు శాంతి చర్చలు జరగాలంటున్నారు. ప్రభుత్వమూ అదే అంటోంది. మావోయిస్టులు కూడా అదే అంటున్నారు. లేదు. మావోయిస్టులు పెట్టిన షరతులను ప్రభుత్వం ఒప్పుకోవడం మొన్ననే ముగ్గురుని చంపేశారు. వీళ్ళు శాంతి చర్చల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు తుపాకులు పేలుస్తున్నారు. అందుకని ప్రభుత్వం ఉద్దేశం నిజాయితీగా ఉందా అని చెప్పడం కష్టమవుతోంది.
వారు శాంతి చర్చల గురించి మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకని ఒప్పుకోవడం లేదు. ఒక ప్రజాస్వామిక పద్ధతిలో పోవడం అంటే ఏంటి? అందరికీ అవసరం. అందుకే నేను మీ అందరితో చెప్పడానికి వచ్చాను. శాంతి చర్చల కోసం కేవలం బస్తర్లో ఎత్తే స్వరం సరిపోదు. మీ అందరి అవసరం ఉంది. హైదరాబాదు నుంచి, విశాఖపట్నం నుంచి పదిచోట్ల నుంచి స్వరాన్నెత్తాలి. అప్పుడే వినబడుతుంది. కేవలం బస్తర్లో పర్యావరణం రక్షణ గురించి కాదు కదా పూర్తి దేశంలో పర్యావరణాన్ని రక్షించడానికి కదా. అన్నిచోట్ల నుంచి స్వరాన్నెత్తితే శాంతి చర్చలు జరుగుతాయి. పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు యివ్వడానికి నక్సలైట్ల పేరుతో ఆదివాసులను హత్య చెయ్యడం, జైలుకు పంపాలి, అత్యాచారాలు చెయ్యాలి ఇదంతా పథకం ప్రకారం జరుగుతున్నది. అందువల్ల మా అందరికి ఆందోళనగా ఉంది. బైలదిల్లా కొండల్లో ఇనుప ఖనిజం ఉంది.
ఆదాని, జిందాల్ అందరు ప్రయత్నం చేశారు కానీ అరవై రోజుల వరకు మేం ఆందోళన చేశాం. పోరాటం చేశాం. వాళ్ళు అబద్ధపు గ్రామసభ జరిపి గనులు తవ్వకం జరపాలని చూశారు. కానీ మేం జరగనివ్వలేదు. ఆదివాసీల నిరసన వల్ల ఆపగలిగాం. కానీ ఆ కొండను ఆక్రమించడానికి బిజెపి వచ్చాక మళ్ళీ ప్రయత్నాలు మొదలయ్యాయి. అక్కడ ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామ ప్రజలను లోబరచుకుంటున్నారు. ఆ గ్రామాల్లో ప్రజలను ఒకసారి 20 మందిని 30 మందిని లేదా 40 మందిని సరెండర్ చేయిస్తున్నారు. 2 లక్షలు, 3 లక్షలు రివార్డులు ప్రకటిస్తున్నారు. నేను వారికి చెబుతున్నాను. మీరు ఎందుకు సరెండర్ కావాలి. మీరు మావోయిస్టులు కాదు. వారి ఆలోచనా విధానం అది కాదు. తుపాకులు పట్టుకోలేదు. ఎందుకు సరెండర్ అవుతారని అంటే వారు అక్కా బతికి ఉండాలంటే సరెండర్ కావాలి అని అంటున్నారు. ఒకవేళ అవకపోతే వాళ్ళు చంపేస్తారు. మహిళలైతే బలాత్కారం చేస్తారు. బలాత్కారాన్ని తప్పించుకోవాలంటే సరెండర్ కావాలి. కొండ కింద ప్రజలను అధిక సంఖ్యలో సరెండర్ చేయిస్తున్నారు. మీకు తెలుసు ఆదివాసీలు తమ ప్రాణం ఉన్నంతవరకు అడవిని, భూమిని, కొండలను ఎవరికీ ఇవ్వరు. చివరి వరకు పోరాడతారు. వారు ఆదివాసులు. వారిని సరెండర్ చేయించాక ప్రభుత్వం ఒక లిస్టు తయారు చేస్తుంది.
మేం మళ్ళీ ఏదైనా విషయంపై నిరసన చేసినప్పుడు వీళ్ళు మావోయిస్టులతో ఉన్నారు. అందుకే ధర్నాలు చేస్తున్నారు అంటారు. అందరూ అడుగుతారు ఆదివాసులను ఎందుకు అరెస్టు చేస్తారు అని అప్పుడు చెబుతారు వారు స్వయంగా సరెండర్ అయ్యారు. వెనుక జరిగేది ఎవరు చెబుతారు? బతికి ఉండడానికి, అత్యాచారాలను తప్పించుకోవడానికి, జైలుకు వెళ్లకుండా ఉండడానికి అలా చేస్తున్నారు. అవును వాళ్ళు అంతకుముందు సరెండర్ అయిన మావోయిస్టులని కోర్టు జైలుకు పంపిస్తుంది.
పోలీసులే అన్నీ చేస్తున్నారు. వాళ్ళు చంపుతున్నారు. డబ్బులు తీసుకుంటున్నారు. సరెండర్ చేయించేది వాళ్ళే, బలాత్కారం చేసేది వాళ్ళే, పూర్తి సాధనాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. క్రూరంగా కొడుతున్నారు. విచారణ జరిపించమని అడిగినా ఎవరు వింటున్నారు? సిపిఐ, మానవ హక్కుల సంఘాల వాళ్ళు పోరాడుతున్నారు కానీ ప్రభుత్వం వినడం లేదు. పాలకులం.. కోర్టులు మావి, ప్రభుత్వం మాది అంటున్నారు. బస్తర్ ప్రజలకు కోర్టుకు వెళ్లాలని అనిపించడం లేదు. ఐఇడి పేలుళ్లలో చాలామంది చనిపోతున్నారు. 2024లో పేలని ఐఇడిని అలానే ఉంచారు. పిల్లలు ఆట వస్తువు అనుకుని తీసి రాయితో కొడితే అది పేలి చనిపోయారు. ముక్కలు ముక్కలైపోయారు. ఇంతకు ముందు ఇలా జరగలేదు. అప్పుడూ మావోయిస్టులు ఉన్నారు.
2024-25లో ఎందుకు ఇలా జరుగుతోంది? నదుల్లో, పొలాల్లో ఐఇడి పేలితే మావోయిస్టులు చేశారు అంటున్నారు. ఎక్కడ ఏం జరిగినా మావోయిస్టులు కారణం అంటున్నారు. ఆదివాసీలు అంటే వారికి క్రిమికీటకాలలాంటివారు. వారు మనుషులే కాదు. వారిని ఏమైనా చేయవచ్చు. ప్రతి శరీరానికి 2 లేదా 3 లక్షలు ప్రకటిస్తారు. వాళ్ళు ఎప్పుడు పని చేశారు. మీరు ఎప్పుడు ప్రకటించారు అని మేం అడిగితే మీరు మావోయిస్టులను సమర్థిస్తారు అంటారు. ఈ విషయాలన్నీ గ్రామానికి తెలియాలి. కుటుంబానికి తెలియాలి. ఆ డబ్బులను కుటుంబాలకు ఇవ్వండి అని అడిగాం. చెట్ల మీద తూటాలు పేలుస్తారు. అడవి నాశనమైపోతోంది. ప్రకృతి మా శక్తి, మా దేవత. ఆదివాసులు తమ భద్రత కంటే ఎక్కువగా వాటి కోసం ఎదురుచూస్తారు.
2025లో నలుగురు పిల్లలకు తూటాలు తగిలాయి. వాళ్ళకు బహుమానాలు ప్రకటించారు. 20-25 సంవత్సరాల పిల్లలపైన తూటాలు కాలుస్తారు. ఎందుకంటే బహుమానాలు ప్రకటించాలి కదా. 12, 13 సంవత్సరాల అమ్మాయికి వెనుక మెడ మీద తూటా తగిలింది.
పిల్లలు క్షేమంగా లేరు. వృద్ధులు క్షేమంగా లేరు. బస్తర్ కోసం మీరందరూ స్వరాన్నెత్తాలి. బస్తర్లోకి ఎవరినీ రానీయడం లేదు డీఆర్జీ బస్తర్ ఫైటర్స్ సీఆర్పీఎఫ్ ఉన్నది. ప్రతిరోజూ ఏదో ఒకటి జరుగుతున్నది. చింతల్నార్లో ఒక అమ్మాయి ఇంట్లో పడుకుని ఉన్నది. తీసుకెళ్లి అత్యాచారం చేశారు. చాలా ఘోరాలు జరుగుతున్నాయి. రేణుకను పగలు పట్టుకున్నారు.
రెండువైపులా సాయుధుల మధ్య చర్చలు జరగాలి. మావోయిస్టుల షరతులు ఒప్పుకున్నా లేకున్నా మా ఆదివాసుల డిమాండ్లను నెరవేర్చాలి. పెసా చట్టాన్ని అమలు చేయాలి బీ 5వ షెడ్యూలును అమలు చేయాలి. మా హక్కులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. మన దేశంలో చట్టాలు ఉన్నాయి కానీ వాటిని అమలుచెయ్యరు. నేను ఒక టీచర్ని పిల్లలకు చదువు చెప్పి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఉంటుంది. కానీ నన్ను మావోయిస్టు అని జైలులో పెట్టారు. జైలుకు వెళ్ళేముందు చిత్రహింసలు పెట్టారు. నాకు ఎంత కరెంట్ షాక్ యిచ్చారంటే ఈనాటికీ నాకు కరెంట్ అంటే భయం వేస్తుంది. లైట్ స్విచ్ వెయ్యను. అందులోంచి కరెంట్ వస్తుందేమోనని భయం వేస్తుంది. నన్ను పురుషుల మధ్య వివస్త్రను చేసి నా యోనిలో రాళ్ళు
దూర్చారు. అరుస్తున్నాను, కేకలు పెడుతున్నాను. నా భర్తని విపరీతంగా కొట్టారు. అతన్ని కూడా జైలులో పెట్టారు. అతని ఆరోగ్యం పాడైపోయింది. జైలు నుంచి బయటికి వచ్చాక నెల రోజుల్లో మరణించాడు. జైలులో కూడా నన్ను ఇబ్బందిపెట్టారు. పిచ్చిది అయిపోయింది అన్నారు. నా శరీరాన్ని ఛిద్రం చేశారు. నన్ను విపరీతంగా యిబ్బంది పెట్టారు. అయితే ఇప్పుడు నాకు అనిపిస్తుంది.. నేను మునుపటి సోనీ సోరీని కాను. ఈ సోనీ సోరీ వేరే అని. గృహ మంత్రి బస్తర్లో మావోయిస్టులను అంతం చేస్తానంటున్నాడు కానీ ఎలా చేస్తాడు? వారి వెనుక ఆదివాసులు వున్నారు.
నా భర్తను కూడా చంపేశారు. నేటికీ నా స్వప్నం బస్తర్. బస్తరు ఎలా కాపాడాలి అనేదే నా వేదన. అక్కడి జల్ జంగల్ జమీన్ను కాపాడాలి.. రక్తంతో తడిసిపోయింది బస్తర్. పూర్తి భారతదేశంలో మీ అందరూ స్వరాన్నెత్తాలని బస్తర్ను కాపాడాలని కోరుతున్నా. బస్తర్లో అడవి, పక్షులు అన్నీ బతకాలి. బస్తర్ భారతదేశంలో భాగమే. బస్తర్ అందరిదీ. రాష్ట్రపతి ఆదివాసీ. ఛత్తీస్గడ్ ఉప ముఖ్యమంత్రి ఆదివాసీ. మమ్మల్ని నిర్దయగా చంపేస్తున్నారు. నిద్రపోలేకపోతున్నాం. చెట్లు ఎక్కి పడుకుంటారు.
నేను ఒక ఊరికి వెళ్ళినప్పుడు కాల్పులు జరుగుతున్నాయి. ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి సొరంగంలోకి వెళ్ళి దాక్కున్నారు. నీళ్ళు, తిండిలేక అలా ఉండిపోయారు. ఒకతని షర్టు బయటికి కనపడితే బయటకు లాగి చంపేశారు.
అందుకని శాంతి చర్చల కోసం ప్రయత్నం జరగాలి.
ఖనిజ సంపదను పెద్ద కంపెనీలకు ఇవ్వడానికి ప్రభుత్వం ఇదంతా చేస్తోంది. హత్యలు చేసి అభివృద్ధి సాధించలేం. మా పెసా చట్టాన్ని అమలు చేయాలి. ఆ సంపద మాది. మా అనుమతి తీసుకోవాలి. ఇది మా హక్కు అందుకోసం పోరాడాలి. కడుపులో ఉన్న బిడ్డ కూడా తుపాకీకి ఎదురు నిలుస్తుంది. మేం ఓడిపోం. పోరాడతాం. అంతం వరకు పోరాడుతాం.
మూలం: ఆదివాసీ హక్కుల నేత సోని సోరి హిందీ ప్రసంగం
అనువాదం : పద్మ కొండిపర్తి, న్యాయవాది
(విశాఖపట్నంలో ఏప్రిల్ 19న జరిగిన ప్రొఫెసర్ కెపి సుబ్బారావు సంస్మర సభ)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.