
జాతీయ భద్రత ముసుగులో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలు నిర్దిష్ట పరిమితులకు లోబడి ఉండాలి. చట్టబద్ధమైనవిగా ఉండాలే తప్ప అండర్ వరల్డ్ కుట్రల్లా ఉండకూడదు. సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ ప్రశ్న ప్రభుత్వం భద్రతా అవసరాల కోసం నిఘా సాఫ్ట్వేర్ను ఉపయోగించవచ్చా లేదా అన్నది కాదు. ఎవరి మీద ప్రయోగిస్తున్నారు అన్నది సమస్య. రాజకీయనాయకులు, న్యాయమూర్తులు, మతాధిపతులు, ఉన్నత స్థాయి అధికారులు, జర్నలిస్టులపై ఈ నిఘా సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆరాలు తీసిన విషయంపై నమోదైన కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ నిఘా అధికారాలను అదుపులో పెట్టేందుకు ప్రయత్నించిన విషయం కనిపిస్తోంది.
పెగసస్ నిఘా సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్ సైనిక పరిశోధన సంస్థ రూపొందించింది. ఈ సాఫ్ట్వేర్ను ప్రధానంగా ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తుంది. ఈ విధంగా కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ను భారతదేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, జాతీయ పార్టీల ప్రతినిధుల ఫోన్లలో చొప్పించి వారి కదలికలపై నిఘా ఉంచింది. ఈ విధంగా నిఘా సాఫ్ట్వేర్ను సాధారణ వ్యక్తులు, పౌర మేధావులపై కూడా ప్రయోగించారా లేదా అన్న ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం అవునని కానీ కాదని కానీ సమాధానం ఇవ్వలేదు. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా బహిర్గతం కావటంతో మన దేశంలో కూడా కొందరు పౌర మేధావులు సుప్రీంకోర్టును ఆశ్రియించారు. దీనిపై సుప్రీం కోర్టు ఓ సాంకేతిక నిపుణుల కమిటీని నియమించింది. ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ ప్రయోగానికి లక్ష్యంగా ఉన్నారో వారి నుంచి పూర్తి సహాయ సహకారాలు రాకపోవటంతో ఈ నిపుణుల కమిటీ పని పడకన పడింది.
దేశంలో వివిధ రంగాల్లో అగ్రగాములుగా ఉన్న ఐ ఫోన్ వాడుతున్న పలువురికి ఇప్పటికీ పెగసస్ తయారీదారుల నుంచి మెసేజులు వస్తున్నాయి. మీ నంబరు లేదా మీ ఫోన్ మా నిఘా పరికరాల పడగనీడలో ఉన్నదన్నది ఆ మెసేజులు సారాంశం. విషయం న్యాయస్థానం పరిశీలనలో ఉన్నప్పటికీ ఆ నిఘా దాడి మాత్రం కొనసాగుతూనే ఉంది. కొంతమంది తమతమ రోజువారీ వ్యవహారాలు ఆలోచలు విషయాలు లోకానికి తెలీకుండా ఉండేందుకు గాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ప్రభుత్వాలు ఇజ్రాయెల్లో తయారైన నిఘా సాఫ్ట్వేర్ ద్వారా వారి లోగుట్లు తెలుసుకునేందుకు తహతహలాడుతున్నాయి.
ఉగ్రవాదులు, రాజ్యాంగేతర శక్తులు, సమాజంలో హానికర పోకడలకు ప్రాతినిధ్యం వహించే వారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తమ వ్యవహారాలు చక్కబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారాలు కొన్నికొన్ని సార్లు విస్తృత సమాజానికి హాని కలిగించేవిగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులను అడ్డుకోవడానికి ప్రభుత్వాలు తగిన విధంగా సన్నద్ధం కాకపోతే దేశాలు నష్టపోతాయి. జాతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించటంలో విఫలమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి పహల్గాం దాడి ముందుకు తెచ్చిన తక్షణ నేపథ్యంలో ఉగ్రచర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి సరైన ప్రశ్నలే లేవనెత్తింది.
జాతీయ భద్రత పేరుతో విచ్చలవిడిగా రాజ్యాంగ ప్రమాణాలు, పరిపాలనా పద్ధతులు అధిగమించి వ్యవహరిస్తున్న తీరును కూడా సుప్రీం కోర్టు గతంలో తప్పు పట్టింది, ప్రశ్నించింది. రాజకీయ ప్రత్యర్ధులను జాతి వ్యతిరేకులుగానూ, దేశ ద్రోహులుగానూ పదేపదే ప్రభుత్వాలు విమర్శించటం ఆనవాయితీ అయిపోయింది. ఇది ఆందోళనకరం. ప్రభుత్వం చేతిలో అదుపులేని నిఘా అధికారాలు పోగుపడే సమయంలో ఖచ్చితంగా వాటి వినియోగానికి సంబంధించిన విషయాల్లో కూడా పౌరుల వ్యక్తిగత గోప్యతకు నష్టం లేని రీతిలో జాగ్రత్తలు అవసరం. వ్యక్తిగత ప్రాధమిక హక్కులు విచ్చలవిడిగా ఉల్లంఘించేందుకు జాతీయ భద్రత ఓ ముసుగుగా మారకూడదు. జాతీయ అవసరాల కోసం ఏర్పాటు చేస్తున్న నిఘా అమలు విషయంలో రాజ్యాంగ ప్రమాణాలు, పద్ధతులు, ప్రాథమిక హక్కుల పరిరక్షణ వంటి వాటి అమలు కోసం నిర్దిష్ట విధి విధానాలు, జవాబుదారీతనం ఉండేలా రూపొందించాలి. ఏ భద్రతాపరమైన సమస్యల నివారణ కోసం ఈ చర్యలు తీసుకుంటున్నారో, ఈ విశేషాధికారాలు కట్టబెడుతున్నారో ఆ పరిస్థితులు అధిగమించి సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఈ నిఘా వ్యవస్థలన్నింటినీ సాధారణ పరిపాలన పరమైన పర్యవేక్షణ పరిధిలోకి తీసుకురావాలి. దేశీయ ప్రజాతంత్ర జీవితంలో చొరబడటానికి ప్రభుత్వాలకు విశేషాధికారాలు ఏమీ కట్టబెట్టకూడదు. నిరసనలు, ప్రతిఘటన, ప్రశ్నలను గొంతు నొక్కటానికి ఈ నిఘా వ్యవస్థలు పావులుగా మారకూడదు. అనూహ్యంగా ఎదురయ్యే భద్రతా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం పేరుతో భారత రాజ్యాంగం, పౌర హక్కులు, ప్రజాస్వామిక ప్రమాణాలను తుంగలో తొక్కకూడదు.
ది హిందూ సంపాదయకీయం
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.