
బీహార్ ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలోని దళితులు, అత్యంత వెనుకబడిన తరగతుల ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓవైపు రాహుల్ గాంధీ పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు పాలక ఎన్డీఏ కూటమిలోని భాగస్వాములయిన లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థాని ఆవాం మోర్చాలు కీచులాడుకుంటున్నారు. పార్టీ నేతల్లో ఈ కీచులాట ఆందోళన కలగచేస్తోంది.
బీహార్ రాజకీయాల్లో దళిత నాయకులను ఒకరి మీద మరొకరిని ఎగదోసి బీజేపీ పబ్బం గడుపుకుంది. ఇప్పుడు ఆ పన్నాగాలకు కాలం చెల్లినట్లు కనిపిస్తోంది. వివిధ రాష్ట్రాలలో బీజేపీ అనుసరించిన ఈ వ్యూహం వెర్రి తలలు వెయ్యనారంభించింది. బీహార్లో దళిత పార్టీల శ్రేణుల మధ్య హింసాత్మక పరిణామాలకు కూడా దారితీస్తోంది.
కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా- కేంద్ర మంత్రులుగా జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్, హిందుస్తానీ అవాం మోర్చా పార్టీ నేత జితన్ రామ్ మాంఝీలు ఉన్నారు. వీరిద్దరు ఒకరి రాజకీయ భవిష్యత్తుకు స్వస్తిపలకడానికి మరొకరు పావులు కదుపుతున్నారు.
పొరుగునున్న ఉత్తరప్రదేశ్లో ఎస్సీ ఉపకులం జాటవ్ యేతర ఓట్లను సంఘటిత పర్చుకునేందుకు బీజేపీ చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో 21 శాతంగా ఉన్న దళిత ఓటు బ్యాంక్లో ఈ చర్యలు చీలికలకు కారణమవుతున్నాయి. ఈ రాష్ట్రంలోని దళితుల్లో అత్యధికులు జాటవ్ కులానికి చెందినవారు. వారిలో కూడా అత్యధికులు నేటికీ బీఎస్పీ నీడన ఉన్నారు. వీరి పలుకుబడి తగ్గించటానికి బీజేపీ జాటవ్ యేతరులని సమీకరించేందుకు చేయని ప్రయత్నం లేదు.
చిరాగ్ పాశ్వాన్ ఆకాంక్షలు..
బీహార్లో రెండు దళిత పార్టీల మధ్య కుమ్ములాటలు జూన్ మొదటి వారంలో మొదలయ్యాయి. జూన్ రెండో తేదీన ఆర్రా జిల్లాలో లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్ర రాజధాని పాట్నాకు 70 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంటుంది. చిరాగ్ పాశ్వాన్ను లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) భావి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రచారం చేస్తోంది.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం చిరాగ్ పాశ్వాన్ స్వతంత్రంగా పోటీ చేసి జేడీయూ ఓటుబ్యాంకును చీల్చారు. దీని వల్ల తాము నష్టపోయామన్న అభిప్రాయం జేడీయూ శ్రేణుల్లో బలంగా ఉంది. చిరాగ్ పాశ్వాన్ బహిరంగ సభ జరిపిన ఆర్రా జిల్లా ఈ ప్రాంతంలోనే ఉంది. పాశ్వాన్ తానే ముఖ్యమంత్రి కావాలనుకోవడం పాలక ఎన్డీయే కూటమిలో రాజకీయ దుమారానికి తెరతీస్తోంది అనడంలో సందేహం లేదు. ఇదే ప్రాంతంలోని విక్రమ్ గంజ్లో ప్రధాని మోడీ మే 30న ఎన్డీయే అభ్యర్థులను గెలిపించమంటూ బహిరంగ సభ జరిపారు.
భారతీయ జనతా పార్టీ తిరుగుబాటు అభ్యర్థులకు, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ టిక్కెట్లు ఇచ్చింది. అలా ఎల్జేపీ నుంచి టికెట్లు పొందిన వారిలో సీనియర్ ఆర్ఎస్ఎస్ నేత రాజేంద్ర సింగ్, మాజీ ఎమ్మెల్యేలు రామేశ్వర్ చౌరాసియా, ఉషా విద్యార్థి వంటి వారున్నారు.
పాశ్వాన్ స్వయంగా పశ్చిమ బీహార్లోని షహాబాద్ ప్రాంతం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని ఆశిస్తున్నారు.
నితీష్ కుమార్ ఆరోగ్యం అంతగా సహకరించకడం లేదు. దీంతో బీహార్లో ఎన్డీయే కూటమికి తానే ప్రత్యామ్నాయ నేత అని పాశ్వాన్ అనుకుంటున్నారు. బీజేపీలో కూడా సుశీల్ మోడీ మరణం తర్వాత ప్రజాదరణ కలిగిన స్థానిక నేత ఎవరూ లేరు.
ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆర్రా బహిరంగ సభ ద్వారా తన ప్రజాధరణను నిరూపించుకోవడానికి చిరాగ్ పాశ్వాన్ సిద్ధం కావడంతో, తానేమి వెనుకబడలేదని మాజీ ముఖ్యమంత్రి మాంఝీ సవాలు విసిరారు. తను కూడా గతంలో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించానని, బలం లేని వాళ్లే గావు కేకలు పెడతారని పాశ్వాన్ను ఉద్దేశించి విమర్శించారు.
అంతటితో ఆగకుండా బహిరంగ సభలకు తక్కువ మంది హాజరైన ఎక్కువమంది హాజరైనట్లు చిత్రీకరించుకోవడం ద్వారా, పాశ్వాన్ తన బలాన్ని ఎక్కువ చేసి చూపించుకుంటున్నారని మాంజీ ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఎన్డీఏ భాగస్వామి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ప్రారంభం కావడానికి ముందు, పాశ్వాన్ ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నారని మాంఝీ ఆరోపించారు.
అస్తిత్వ సమస్యలు ఎదుర్కొంటున్న జనతా దళ్ యునైటెడ్ తరఫున మాంఝీ ఈ విషయాలు పెడుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
చిరాగ్ పాశ్వాన్ తండ్రి, మాజీ కేంద్ర మంత్రి 2020 అక్టోబర్ 8న ఆకస్మిక మరణంపై న్యాయవిచారణ జరిపించాలని మాంఝీ ప్రధానమంత్రికి లేక కూడా రాశారు. అసెంబ్లీ ఎన్నికలు మరో మూడు వారాల్లో ఉన్నాయనగా రాం విలాస్ పాశ్వాన్ మరణించారు.
దీని మీద స్పందించిన చిరాగ్ పాశ్వాన్ , ఈ డిమాండ్ లేవనెత్తినందుకు మాంఝీ సిగ్గుతో తలవంచుకోవాలని విమర్శించారు. మా నాన్న ఆరోగ్యం పట్ల మాంఝీకి అంత ఆందోళన ఉంటే ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో కనీసం మర్యాద కోసమైనా వచ్చి ఉండాల్సిందని చిరాగ్ ధ్వజమెత్తారు.
వివాదానికి మూలం..
ఎన్డీఏ కూటమిలోని ఇరువురు దళిత నేతల మధ్య వివాదం కేవలం సీట్ల సర్దుబాటుకే పరిమితం కాలేదు. ప్రస్తుతం హింసాత్మక రూపం తీసుకుంటోంది.
గత సంవత్సరం సెప్టెంబర్ 18న నవాడ పట్టణ శివారులలో 34 దళిత నివాసాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన వారు పాశ్వాన్ కులస్తులు కావడం గమనార్హం. నష్టపోయిన వాళ్ళు ఎక్కువమంది మాంఝీ సొంత కులమైన ముషహరలు. మరి కొంతమంది రవిదాసులు.
ఈ సంఘటనలో దాడి చేసిన వారు, దాడిలో నష్టపోయిన వారు ఇరువురు దళితులే. భూముల దురాక్రమణకు ఆ గుడిసెవాసులు ఆటంకంగా ఉన్నారన్న కారణంగానే గృహ దహనాలు జరిగాయని భావిస్తున్నారు.
మరి కొన్ని ప్రాంతాలలో జరిగిన ఘర్షణలలో కూడా కేవలం అగ్రకులాలకు చెందినవారే దళితులపై దాడి చేయడం లేదు. దళితుల్లో కూడా కాస్తంత అధికంగా పైచేయి సాధించినవారు దళితుల్లో ఉన్న బలహీనులపై దాడికి దిగుతున్నారు.
దళితుల మధ్య మొదలైన ఈ ఘర్షణలకు మూలాలు, నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే ఉన్నాయి. 2005లో అధికరానికి వచ్చిన కొద్దిరోజులకే నితీష్ కుమార్ మహా దళిత్ కమిషన్ను నియమించారు. ఆరోజుల్లో ఏ జర్నలిస్టు ఆయనను ప్రశ్నించలేదు.
ఈ కమిషన్ ద్వారా మొదట 18 దళిత ఉపకులాలను మహా దళితులుగా గుర్తించారు. అంటే వీరు దళితుల్లోనే అత్యంత వెనకబడిన పేదలు. కేవలం పాశ్వాన్లు, రవిదాసులు, రజకులు, కల్లుగీత కార్మికులను మాత్రమే ఈ మహా దళితుల జాబితాలో చేర్చలేదు.
ఈ నిర్ణయం దళితుల్లో అంతర్గత విభేదాలకు పునాదులు వేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన తర్వాత మాత్రమే పాశ్వాన్లు మినహా మిగిలిన మూడు దళిత ఉపకులాలను మహాదళితులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాశ్వాన్లను మాత్రం ఈ క్యాటగిరిలోకి తీసుకోలేదు.
దీనికి తోడు 2014 లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలైన జేడీయూ ముఖ్యమంత్రిగా పెద్దగా సామాజిక, ఆర్థిక బలం లేని మాంఝీని ఎంపిక చేశారు. ఇది కూడా ఈ రెండు కులాల మధ్య అగ్గిరాజేయటానికి కారణమైంది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని 40 లోక్సభ స్థానాలకుగాను జనతాదళ్ యునైటెడ్ నేతృత్వంలోని కూటమి కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుపొందింది. 2014లో ప్రధాని అభ్యర్థిగా మోడీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నితీష్ కుమార్ భారత కమ్యూనిస్టు పార్టీతో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మాంఝీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
దళితుల్లో చీలికలు తెచ్చి తమకులాన్ని ఒంటరిపాటు చేసినప్పటికీ నితీష్ కుమార్ను అప్పటి లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ మన్నించి వదిలేశారు. రాష్ట్రంలోని దుసాద్ దళిత కులంలో జన్మించి, దాదాపు 30 సంవత్సరాల పాటు జాతీయస్థాయి నేతగా చలామణి అయిన వ్యక్తిగా బీహార్లో రామ్ విలాస్ పాశ్వాన్కు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది.
2022లో జరిగిన కులగణన ప్రకారం రాష్ట్ర జనాభాలో పాశ్వాన్ ప్రాతినిధ్యం వహించే కులం దుసాద్లు 5.31 శాతం ఉంటే రవిదాసులు 5.25% ఉన్నారు. రాష్ట్ర జనాభాలో మొత్తం దళితుల జనాభా 19.65%గా ఉంది.
దుసాద్ కులానికి రామ్విలాస్ పాశ్వాన్ లాంటి నాయకులు ఉంటే, మరోవైపు బహుజన సమాజ్ పార్టీ ఉత్తర ప్రదేశ్కు సరిహద్దుల్లో ఉన్న జిల్లాలలో రవిదాసు కులానికి చెందిన ఓటర్లను పునాదిగా చేసుకొని కొన్ని అసెంబ్లీ స్థానాలలో బలపరీక్షకు సిద్ధమవుతూ వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో మాయావతి ప్రాబల్యం పలుకుబడి తగ్గిపోతూ రావడంతో రవిదాసు ఓటు బ్యాంకు కూడా చెల్లాచెదరయింది.
మాజీ ముఖ్యమంత్రి మాంఝీ ప్రాతినిధ్యం వహిస్తున్న కులం ముషహరా దళితుల్లోనే ఆర్థికంగా, సామాజికంగా, విద్యా విషయకంగా అత్యంత వెనుకబడిన కులంగా ఉన్నది. ఈ కులంలో సాధారణ ప్రాంతాలలో నివసించే కొందరు ఇప్పటికీ ఎలుకలు తిని బ్రతుకుతుంటారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో ఈ కులానికి చెందిన జనాభా గణనీయంగా ఉన్నది. అయితే బీహార్లో మాత్రం సంఖ్య రీత్యా చూసినప్పుడు దుసాద్లు, రవిదాసుల కంటే తక్కువ.
అసమ్మతి బీజాలు ..
రెండు దశాబ్దాల క్రితం మొదలైన అసమ్మతి బీజాలు నేడు వృక్షాల స్థాయికి చేరుకున్నాయి. చిరాగ్ పాశ్వాన్, మాంఝీలు ఆయా కులాలకు చెందిన జనాభా అత్యధికంగా ఉన్న అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలలో, కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేనంత స్థాయికి వీరి మధ్య విభేదాలు, కుమ్ములాటలు పెరిగిపోయాయి.
దురదృష్టం ఏమిటంటే అటు బీజేపీ, ఇటు జేడీయూలు కూడా తమతమ రాజకీయ ప్రయోజనాలు ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ కులాల కుంపట్లను రాజేస్తూనే ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్లో సైతం తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవటానికి ఒక నేత అంటూ లేకపోవడంతో దళితుల పరిస్థితి కుడిఎడంగా ఇలాగే ఉన్నది. బీహార్లో నితీష్ కుమార్ అనుసరించిన వ్యూహాన్ని అరువు తెచ్చుకున్న బీజేపీ, ఉత్తరప్రదేశ్లో రాజకీయంగా బలం కలిగిన దళిత కులం జాటవ్లను ఒంటరి పాటు చేయటానికి వీలైన అన్ని ప్రయత్నాలు చేసింది.
2024 లోక్సభ ఎన్నికల వరకు ఉత్తరప్రదేశ్లోని జాటవ్ దళిత ఓటర్లలో ఎక్కువ మందిని బీజేపీ తనవైపు లాగేసుకున్నది. తాజాగా సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ల సంకీర్ణం ఎంతో కొంతమేర దళిత ఓటు బ్యాంకును ప్రభావితం చేసే స్థితిలో ఉన్నది. ఫైజాబాద్ వంటి లోక్సభ స్థానం నుంచి అవదేశ్ ప్రసాద్లాంటి దళితనేత భారీ మెజారిటీతో పాలక బీజేపీ కూటమి నేతపై విజయం సాధించటం రాష్ట్ర రాజకీయాలలో దళిత ఓటు బ్యాంకులో కాంగ్రెస్, సమాజ్వాదీ సంకీర్ణం పట్ల పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనం.
నేర్చుకోని పాఠాలు..
2024 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ పరాజయం నుంచి బీహార్లో పాలక కూటమి పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. ఓ వైపున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇండియా కూటమి ఐక్యతను ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా ఆర్జేడీ నాయకత్వంలో పోటీ చేయనున్న అభ్యర్థుల విజయం కోసం పర్యటిస్తున్నారు. మరో వైపున రాష్టంలో పాలక కూటమిలో రెండు ప్రధాన దళిత పార్టీలు ఇలా రోడ్డున పడుతున్నాయి.
అంతే కాదు, నితీష్ ప్రభుత్వం మద్యపాన నిషేధం విధించడంతో కల్లుగీత ప్రధాన వృత్తిగా ఉన్న పాసికులస్తులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఆర్జేడీని బలపర్చటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మద్యపాన నిషేధం విధించడంతో ఎక్కువగా పాసీలు, ముషాహరాలే నష్టపోయింది. అక్రమ మధ్య వ్యాపారంలో కీలకపాత్ర పోషించే అగ్రకులస్తులు ఎప్పుడు పోలీసు దాడుల్లో దొరికేవారు కాదు. మద్యం కేంద్రాలు నిర్వహించే ఈ కులస్తులే ఎక్కువగా పోలీసు వేధింపులకు గురయ్యేవారు.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో భాగస్వామిగా 12 అసెంబ్లీ స్థానాలు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్టు – లెనినిస్ట్)లిబరేషన్ గెలుచుకుంది. ఈ పార్టీని దళిత ఓటు బ్యాంకుపై పట్టు కలిగి పార్టీ అనే విషయాన్ని ఎక్కువమంది రాజకీయ పరిశీలకులు విస్మరిస్తున్నారు.
దేశంలో దళిత రాజకీయాలు అస్తిరతతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో దళిత వర్గీకరణ సమస్య ముందుకు వచ్చింది. దళితుల ఐక్యతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పథకం ప్రకారం తీసుకున్న నిర్ణయం అని ఉత్తర భారత రాష్ట్రాల్లో దళితుల్లో పలుకుబడి కలిగిన పాశ్వాన్, జాటవ్లు, పశ్చిమ భారతంలో మహర్లు, దక్షిణ భారతంలో మాలలు భావిస్తున్నారు. రిజర్వేషన్ల స్ఫూర్తిని దెబ్బతీసి మొత్తంగా రిజర్వేషన్లను అటకెక్కించేందుకు ఈ వర్గీకరణ చేపడుతున్నారనే అభిప్రాయం ఉన్నది.
(వ్యాస రచయిత పాట్నా కేంద్రంగా పని చేస్తున్న ఫ్రీలాన్స్ జర్నలిస్టు)
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.