
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరోసారి శంకుస్థాపనకు సిద్దమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దశాబ్దం తరువాత అమరావతికి రెండో సారి శంకుస్థాపన చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం హై-ప్రొఫైల్లో ఏర్పాట్లు చేసింది. దేశంలోనే అమరావతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని ఒకప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రచారం చేసింది. అందులో భాగంగా నగర అభివృద్ధికి కోసం 65 వేల కోట్ల నిధులను కేటాయించింది. దీంతో అమరావతి వంటి మెగా ప్రాజెక్టులకు పదేపదే అడ్డంకులు ఎందుకు ఎదురవుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మే 2న ప్రధాని మోదీ అమరావతి రాజధాని ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినప్పుడు, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఎరాజధానిగా హైదరాబాద్ను వదిలిపెట్టారు. మిగిలిన రాష్ట్రానికి కొత్త రాజధాని కోసం కృష్ణా నది ఒడ్డున ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన అమరావతి ప్రాంతాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. 2015 అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్టహాసంగా అమరావతికి శంకుస్థాపన చేశారు. అప్పుడు దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. అభివృద్ధి చెందిన సింగపూర్ ఆదర్శంగా అక్కడి నగరాలకు ధీటుగా అమరావతిని నిర్మించాలనే స్ఫూర్తితో, పనులకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అయితే, తరువాత టీడీపీ అధికారం కోల్పోవడంతో ఈ ప్రాజెక్ట్కు బ్రేకులు పడ్డాయి.
రెండవసారి శంకుస్థాపనలు మోడీకి కొత్తేమికాదు..
అమరావతికే ప్రధాని మోడీ రెండవసారి శంకుస్థాపన చేస్తున్నారంటే పొరబాటే, ఇలాంటి శంకుస్థాపనలు దేశంలో మోడీ చేతులు మీదిగా పదేపదే ఇతర ప్రధాన ప్రాజెక్టుల విషయంలోనూ జరిగాయి. 2015లో ఢిల్లీ ఎన్సీఆర్లోని తూర్పు ఎక్స్ప్రెస్వేను మొదట శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నిర్మాణ జాప్యాలు, భూసేకరణ సమస్యల కారణంగా 2017లో తిరిగి మళ్లీ అదే ప్రాజెక్ట్కు మోడీ శంకుస్థాపన చేశారు. చివరకు ఈ ప్రాజెక్ట్ 2018లో పూర్తీ చేసుకొని ప్రారంభించబడింది. 2020లో ప్రారంభించబడిన ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే కూడా రెండు సార్లు శంకుస్థాపనలు చేయబడ్డాయి.
2021లో మొదట ప్రారంభించబడిన సూరత్ మెట్రో ప్రాజెక్ట్కు 2023లో తిరిగి పునాదిరాయి వేశారు. ఇప్పుడు దానిని 2027కు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇదీకాక 2017లో ప్రారంభమైన గుజరాత్లోని సుదర్శన్ సేతు వంతెన, సుదీర్ఘ కాలం తర్వాత 2024లో మళ్లీ ప్రారంభించారు. 2018లో శంకుస్థాపన చేసిన ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్ కూడా 2023లో పాక్షికంగా మాత్రమే పూర్తయింది. ఇలా పలు ప్రాజెక్ట్లకు మోడీ పదేపదే శంకుస్థాపనలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే, ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాజెక్టు పనులు మరోసారి పునఃప్రారంభం కానుండటంతో, ఈసారైనా ఈ ప్రాజెక్ట్ పూర్తిచేస్తారా, లేదా? కేవలం పునాది రాళ్లు వేసి మమా అనిపిస్తారా అనేది చూడాలి.
రాజధాని ప్రాజెక్టుపై వివాదాలు..
అమరావతి అభివృద్ధి మొదటి దశలో, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అనేక ఆరోపణలు వచ్చాయి. రాజధాని ప్రాంతానికి సంబంధించి అధికారిక ప్రకటనకు ముందే కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు అవుతుందో అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మంత్రులకు కూడా సమాచారం అందిందని ఆరోపణలు వచ్చాయి. దాంతో అమరావతి దగ్గరలో తక్కువ ధరలకు పెద్ద ఎత్తున వ్యవసాయ భూములను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని అమరావతిలో భూసేకరణకు సంబంధించిన ఇన్సైడర్ ట్రేడింగ్ వివాదంలో చిక్కుకుంది. రాజధాని అధికారికంగా ప్రకటించిన తర్వాత భూ ధరలు విపరీతంగా పెరిగిన భూములలో ముందస్తు పెట్టుబడుల ద్వారా చంద్రబాబు నాయుడు కుటుంబం, సన్నిహితులు ప్రయోజనం పొంది ఉండవచ్చనే కోణంలో పలు సంస్థల దర్యాప్తులు కొనసాగాయి. చంద్రబాబు కుమారుడు, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా రాజధాని అధికారిక ప్రకటనకు ముందే కీలక ప్రాంతాలలో భూమిని కొనుగోలు చేశారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో, పార్టీ సీనియర్లు అప్పటి మంత్రులు, తదితరులు కూడా ఉన్నారు. ఈ కుంభకోణ ఆరోపణలతో అమరావతి అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే భూసేకరణ ప్రక్రియలో అవకతవకలను పేర్కొంటూ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును నిలిపివేయడానికి దారితీసింది.
తెరపైకి మూడు రాజధానుల నినాదం..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అమరావతిని రాజధానిని సమర్ధించారు. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ రెడ్డి ప్రభుత్వం నాటకీయంగా మాటమార్చి రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలనే కొత్త నినాదం అందుకున్నారు. జగన్ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల ఫార్మాల ప్రకారం విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసనసభ రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా పేర్కొంది. అయితే, అప్పటి ప్రభుత్వం కేవలం అమరావతిలో అభివృద్ధిని కేంద్రీకరించడం వల్ల ప్రాంతీయ అసమతుల్యతలు తీవ్రమవుతాయని వాదనను తెరపైకి తీసుకొచ్చింది. అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి అప్పటి జగన్ ప్రభుత్వం ఆర్థిక పరిమితులు, పరిష్కారం కాని భూవివాదాలు కారణంగా చూపింది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయం తీవ్రవ్యతిరేకతను మూటగట్టుకుంది. ముఖ్యంగా రాజధాని కోసం తమ భూములను అప్పగించిన అమరావతి రైతుల నుంచి భారీ నిరసనలు, చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో 2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మూడు రాజధానుల ప్రతిపాదనను కొట్టివేసి, అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు జగన్ రెడ్డి పరిపాలనకు రాజకీయంగా గణనీయమైన ఎదురుదెబ్బగా నిలిచింది.
మూడు పంటలపై వివాదాలు..
అమరావతి విమానాశ్రయం, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం కొత్తగా భూసేకరణ చేయడం వల్ల సారవంతమైన వ్యవసాయ భూమి మరింత నాశనం కావచ్చు అనే ఆరోపణలు ఈ ప్రాజెక్ట్ను చుట్టుముట్టాయి. నివేదికల ప్రకారం ఈ ప్రాంతంలోని 10,000 ఎకరాలకు పైగా భూమి ప్రధానంగా వరి, వేరుశనగ , చెరకు వంటి పంటలను పండించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ భూమి పట్టణ ప్రాంతంగా మారితే ఈ నష్టం ఆహార భద్రత ,స్థానిక వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుందన్న వాదనలు తెరపైకి వచ్చాయి. వ్యవసాయ ఉత్పాదకతకు ప్రసిద్ధి చెందిన అమరావతి చుట్టూ ఉన్న సారవంతమైన భూములు ఏటా మూడు నుంచి నాలుగు పంటలకు అనుకూలంగా వుంటాయి. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఆహార సరఫరాలో కీలక భూమిక పోషిస్తుంది. ఇక్కడి రైతులు వరి(సంవత్సరానికి 2 మిలియన్ మెట్రిక్ టన్నులు), వేరుశనగ(500,000 మెట్రిక్ టన్నులకు పైగా), చెరకు(300,000 మెట్రిక్ టన్నులు)పండిస్తారు. వీటితో పాటు ఏటా 1,000 కోట్ల విలువైన కూరగాయలు, పండ్లు పండిస్తారు. అయితే, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ పంతం పంట ఉత్పత్తిలో గణనీయమైన తగ్గుదలకు దారితీస్తోంది. స్థానిక జీవనోపాధి ప్రాంతీయ ఆహార భద్రతను ప్రమాదంలోకి పడేస్తాయనే వాదనలు ఈ ప్రాజెక్ట్కు ప్రతిబంధకాలుగా ఉన్నాయి.
అమరావతి కి పెద్ద ఎదురుదెబ్బ..
ప్రపంచ బ్యాంకు 2019లో తన ప్రతిపాదిత 300 మిలియన్ల డాలర్ల నిధులను ఉపసంహరించుకోవడం, అమరావతి రాజధాని ప్రాజెక్టును పూర్తిగా దెబ్బతీసింది. “అమరావతి సస్టైనబుల్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్” కింద అమరావతికి మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ మొదట అంగీకరించింది. అయితే, భూసేకరణ ప్రక్రియలలో అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు, రైతు సంఘాలు లేవనెత్తిన ఆందోళనలు, ప్రపంచ బ్యాంకుకు అందిన ఫిర్యాదులు నిధుల ఉపసంహరణకు దారితీశాయి. పర్యావరణ, సామాజిక ఆందోళనలను మరింత వివరంగా సమీక్షించాల్సిన అవసరాన్ని ప్రపంచ బ్యాంకు ఉదహరించింది. చివరికి ప్రాజెక్ట్ నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఈ పరిణామం నిధుల కొరతకు కారణమవ్వడమే కాకుండా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కూడా దెబ్బతీసింది. అయితే మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే 800 మిలియన్ల డాలర్ల నిధులు అందించడానికి ప్రపంచ బ్యాంక్ ఎగ్జ్ క్యూటీవ్ బోర్డు ఆమోదం తెలిపింది.
విమానాశ్రయ విస్తరణకు మరో 40 వేల ఎకరాలా?
ఇదిలా ఉంటే తాజాగా అమరావతి సమీపంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం రాష్ట్రం అదనంగా 40,000 ఎకరాలను సేకరించాలని ప్రతిపాదించింది. ఈ ప్రాంతాన్ని లాజిస్టిక్స్ హబ్గా మార్చడమే తమ లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పథకం(LPS)ద్వారా రైతుల నుంచి 33,000 ఎకరాలను సేకరించింది. ఈ కొత్త భూసేకరణకు ప్రభుత్వం “పారదర్శక పరిహారం” హామీ ఇస్తున్నప్పటికీ, ఈ ప్రణాళిక వ్యవసాయ భూమి మార్పిడిపై ఆందోళనలను మళ్ళీ రేకెత్తించింది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
2015లో శంకుస్థాపన వేడుకకు భారీ ఖర్చు..
2015లో అమరావతి శంకుస్థాపన కార్యక్రమం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకకు దాదాపు 9 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించింది. ఇందులో లాజిస్టిక్స్, ఆతిథ్యం, భద్రత, రవాణా ఉన్నాయి. అయితే, నిజమైన ఖర్చు 400 కోట్ల రూపాయల వరకూ ఉందని ప్రజల సొమ్ము దుబారా చేశారని అప్పటి ప్రతిపక్ష వైసీపీ ఆరోపించింది. ఇదిలా ఉంటే తాజాగా మోడీ టూర్ కోసం వీఐపీ రూట్లో లైటింగ్ కోసమే ప్రభుత్వం దాదాపు 2 కోట్లులకు పైగా ఖర్చు చేస్తుండడం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది. దీంతో పాటు అమరావతి త్రీడీ డిజైన్ కోసం మరో 80 లక్షలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. వీటితోపాటు ఇతర ఏర్పాట్లు కలుపుకుని ఈ ఖర్చులు భారీగానే ఉంటాయనే ఆరోణలు వస్తున్నాయి.
కీలకంగా రాజధాని పనుల పునఃప్రారంభం..
కొత్తగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిచిపోయిన అమరావతి రాజధాని ప్రాజెక్టు పునరుద్ధరణను ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం 65,000 కోట్ల పెట్టుబడి ప్యాకేజీని ఆమోదించింది. 2026 నాటికి రోడ్లు, మౌళిక వసతులు, ప్రభుత్వ సముదాయాలు పట్టణ సౌకర్యాలతో సహా కీలకమైన మౌలిక సదుపాయాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. గత ప్రభుత్వం మూడు రాజధానుల విధానంలో సంవత్సరాల తరబడి జాప్యం జరిపిన తర్వాత మళ్లీ రాజధాని పనులు జోరందుకున్నాయి. ప్రభుత్వం తక్షణ పనుల కోసం 11,467 కోట్లు కేటాయించింది. అభివృద్ధిని వేగవంతం చేయడానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలతో ఒప్పందల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తమ హయాంలో రాజధాని అమరావతిని దేశంలో ఇతర ప్రధాన నగరాలకు ధీటుగా రూపొందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరుతున్నారు. ఇందులో భాగంగానే రెండో సారి అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోదీ వస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
బాలకృష్ణ ఎమ్, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.