
పోప్ ఫ్రాన్సిస్ మరణంతో ప్రపంచం ఓ అద్భుతమైన నాయకుడిని కోల్పోయింది. ఆయన బోధనలను పాటించే వారితో పాటు న్యాయబద్ధమైన, మానవీయమైన, మన్నికైన ప్రపంచ ఆర్థిక అభివృద్ధి సాధన దిశగా ఆయన తీసుకున్న చర్యల రూపంలో కూడా ఆయన వారసత్వం సజీవంగా ఉంటుంది.
అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్కు ఆర్థిక అంతరాలు మనిషి జీవితాన్ని ఎంత ఘోరంగా ప్రభావితం చేస్తాయో స్వయంగా అనుభవించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉత్థాన పతనాలను చూస్తూ పెరిగారు. ఈ సంక్షోభాల నడుమ నిరంతరం విదేశీ సహాయ సంక్షోభంలో చిక్కుకున్న అర్జెంటీనాలో మూడు తరాలకు చెందిన పిల్లలు, కుటుంబాలను ఎలా ప్రభావితం చేసిందో గమనించారు. ఆర్థిక వ్యవస్థ మొత్తం సమాజ ప్రయోజనాల కోసం పని చేయటానికి బదులుగా కొంతమంది కులీనుల కోసం పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చూశారు. అంతులేని ఆర్థిక అసమానతలు, చితికిపోతున్న సామాజిక తరగతులు, అలుముకుంటున్న అభద్రతా వాతావరణం, పెరుగుతున్న అసాంఘిక చర్యలు, నేరాలు, ఘోరాలకు కారణం సమాజాన్ని ఉద్ధరించటానికి పని చేయాల్సిన ఆర్థిక వ్యవస్థ కొంతమంది అభ్యున్నతి కోసం మాత్రమే పని చేయటం అని గుర్తించారు.
తన అనుభవాలను పోప్గా అంతర్జాతీయ వేదికల్లో చర్చనీయాంశాలుగా ఫ్రాన్సిస్ మార్చారు. అతని ప్రతిపాదనలు అదుపులేకుండా పరుగులు తీస్తున్న ప్రపంచంలో ఓ నైతిక హెచ్చరికలుగా పని చేశాయి. మానవాళి ఉమ్మడి భవిష్యత్తుతో పాటు కోట్లాది మందికి కనీస గౌరవాన్ని దూరం చేస్తున్న సంస్థాగత అసమానతల గురించి పదేపదే ఆయన హెచ్చరించారు. వాటికన్లో పోప్ అకాడమి ఆఫ్ సోషల్ సైన్సెస్ సభ్యులుగా తరచూ ఆయనతో సంభాషించేందుకు మాకు అవకాశం దొరికింది.
ఆయన లేవనెత్తిన విషయాలన్నీ ఎప్పుడో సుదూర భవిష్యత్తుకు సంబంధించినవి కాదు. తక్షణ ప్రపంచం ఎదుర్కొంటున్న కఠోర వాస్తవాలే. వాస్తవాన్ని మార్చాలంటే క్షేత్రస్థాయిలో కృషి చేయాలి తప్ప ప్రయోగశాలల్లో కాదని పదేపదే గుర్తు చేసేవారు.
ప్రజలకంటే లాభాలకు, పరస్పర సహకారం కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్న ఆర్థిక వ్యవస్థను చూశారు. నియంత్రణలో ఉన్న మార్కెట్లు సమాజాభివృద్ధిలో ఎంత కీలకమైనవో అడ్డు అదుపులేక విచ్చలవిడిగా అమలు జరిగే మార్కెట్ చలనసూత్రాలు అంతే నష్టదాయకమైనవని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్. చివరకు మనందరి ఉమ్మడి ఇల్లులాంటి పర్యావరణం కూడా లాభాల దాహార్తికి కరిగిపోతున్న విషయాన్ని, దాంతో తలెత్తే ప్రమాదాలను పదేపదే గుర్తు చేసేవారు. నైతిక దృక్ఫథం, సామాజిక సంఫీుభావం లేని మార్కెట్ వ్యవస్థ సంపద సృష్టికి సహకరించటానికి బదులు ముందు తరాలు సృష్టించిన ఉమ్మడి సంపద ఆవిరవ్వటానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఫలితంగా ప్రపంచ సంపద పిడికెడుమంది చేతుల్లో కేంద్రకృతమవుతుందని గుర్తు చేశారు.
ఫ్రాన్సిస్ ఎప్పుడూ తన మనసులో భావాలు వ్యక్తం చేయటానికి వెనకాడేవాడు కాదు. ప్రపంచ వ్యాప్తంగా గుత్తసంస్థలు ఏర్పడుతున్న తీరు ప్రత్యేకించి మేధో సంపత్తి హక్కుల రూపంలో సామూహిక జ్ఞానం, మేధస్సుపై వ్యక్తిగత పెత్తనం గురించి, ప్రజలందరికీ సేవలందించాల్సిన జ్ఞానం, ఆధునిక ఆవిష్కరణలు చివరకు ప్రజల ప్రాణాలు కాపాడలేకపోతున్న విషయాన్ని, దాని వెనక ఉన్న గుత్త కంపెనీల లాభాపేక్షను బాహాటంగా విమర్శించేవారు. కోవిడ్ విపత్తు కాలంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అమలు చేస్తున్న మేధోసంపత్తి హక్కుల చట్టం పరిధి నుంచి కీలకమైన ఔషధాలను మినహాయించాలని, తద్వారా మానవాళికి ప్రాణం పోసేందుకు చొరవ చూపించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను అర్థించిన మనసున్న మతప్రవక్త. కంపెనీల లాభాల కంటే మనుషుల ప్రాణాలకే పెద్ద పీట వేయాలన్నది ఆయన దృక్ఫధం.
నిరంతరం అప్పుల ఊబిలో కూరుకుపోయి విద్య, వైద్యం, నివాసం వంటి మౌలిక సదుపాయాలపై ఖర్చుపెట్టలేని స్థితికి చేరుతున్న వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేసేవారు. ఈ దేశాలు ఎదుర్కొంటున్నది కేవలం అప్పుల సంక్షోభం మాత్రమే కాదనీ, అభివృద్ధి దక్ఫథంలో సంక్షోభమనీ ఆయన స్పష్టం చేశారు. నైతిక ప్రమాణాలు బాధ్యతలు వదిలేసిన ఆర్థిక వ్యవస్థ తెచ్చిపెడుతున్న వినాశనమే ఈ సంక్షోభాలని వ్యాఖ్యానించారు. దీనికి అప్పు ఇచ్చే దేశాలు, తీసుకునే దేశాలు, వాటి ప్రభుత్వాలూ ఎంత కారణమో ఆ పరపతి మార్కెట్ను నియంత్రించే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు, సంస్థలు, అవి రూపొందించే విధివిధానాలు కూడా అంతే కారణమని స్పష్టం చేశారు. రుణభరిత దేశాల ఆర్థిక వ్యవస్థలను సమూలంగా మార్చటానికి కావవల్సిన చర్యలు చేపట్టకుండా ఈ సూత్రధారులందరూ అడ్డుకున్నారని ఆయన విమర్శించారు.
ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు రుణభారం నుంచి విముక్తి కావడానికి అవసరమైన విధానాలు, వ్యూహాలు చర్చించేందుకు ప్రపంచ ఆర్థిక మేధావులతో ఓ జూబిలీ కమిషన్ ఏర్పాటు చేయాలని గత సంవత్సరం పిలుపునిచ్చారు. 2000 సంవత్సరంలో అటువంటి కమిషన్ ఏర్పాటు అయినా అభివృద్ధి సవాళ్లు ఎదుర్కొంటున్న దేశాలను ఆయా సమస్యల నుంచి విముక్తి చేయటంలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. పాతికేళ్ల తర్వాత మరిన్ని దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోవటంతో వాటిని రుణ విముక్తులను చేసేందుకు ప్రపంచ మేధావులు ఒక వేదిక మీదికి రావాలని ఆయన పిలుపునిచ్చారు. పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన పిలుపు బైబిల్లో కనిపించే జూబిలీని పోలి ఉంటుంది. ప్రతి పాతికేళ్లకొకసారి రాజ్యాలు ప్రజల అప్పులను మాఫీ చేయటం ద్వారా వారికి కొత్త ఆర్థిక జీవితాన్ని ప్రసాదించేవి.
ఆయన చివరి రోజుల వరకూ జూబిలీ కమిషన్ పనిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ప్రపంచ ఆర్థిక సామాజిక రాజకీయ వ్యవస్థల సంతులత కోసం ఏర్పాటు చేసిన బహుళ జాతీయ సంస్థలు నేడు నిస్తేజానికి గురవటం ఆయన్ను విస్మయపరిచింది. ప్రపంచ శాంతి సౌభాగ్యాలకోసం అవసరమైన సంఫీుభావ దృక్ఫథాన్ని ఏర్పాటు చేయటంలో ఈ సంస్థలు విఫలమయ్యాయని విమర్శించారు.
పోప్ ఫ్రాన్సిస్ ఏర్పాటు చేసిన జూబిలీ కమిషన్ ఈ వేసవిలో తన నివేదికను సమర్పించనున్నది. పలు ప్రపంచ దేశాలను అప్పుల ఊబిలోకి నెట్టేసిన విధానాలు, నిర్ణయాలు, చర్యలను ఈ నివేదిక సమీక్షించి సిఫార్సులు చేయనున్నది. అప్పుల భారం కింద నలిగిపోతున్న దేశాలు ఎటువంటి జాప్యానికి తావివ్వకుండా తమ ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేయాల్సి ఉంది. అప్పులిచ్చిన దేశాలు కూడా సంఫీుభావం, సహృదయంతో వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంది. తప్పుడు నిర్ణయాల భారాన్ని కప్పిపుచ్చుకునేందుకు బహుళజాతీయ సంస్థలు ప్రపంచ సంపదను వృధా చేయకూడదని ఆయన నమ్మేవారు. ఈ సంస్థలు వసూలు చేస్తున్న అధిక వడ్డీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతున్నాయని, ఈ సంక్షోభకాలంలో ప్రపంచ కుబేరులను కాపాడటానికి ప్రజలను, వారి భవిష్యత్తును బలివ్వటం న్యాయం కాదని అనేవారు.
ప్రపంచ కుబేరులకు ఊడిగం చేస్తున్న ఆర్థిక వ్యవస్థలు, విధి విధానాలు స్థానంలో విశ్వమానవాళి అవసరాలు తీర్చే ఆర్థిక వ్యవస్థలు, విధి విధానాలు రూపొందించగలమా లేదాని మనకు పోప్ ఫ్రాన్సిస్ సవాలు విసురుతున్నారు. ఆర్థికరంగం అంటే కేవలం ఆదాయ, వ్యయ పట్టికలు కాదనీ, సంపద సృష్టి, కేంద్రీకరణ కాదనీ, ఆర్థిక రంగం అంటే ప్రజలు, వారి జీవితాలు, వారి గుర్తింపు, గౌరవాలు, అస్తిత్వాలు, ఆశలు, ఆశయాలూ, సమాజ ఉమ్మడి భవితవ్యమని నమ్మే వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్. జూబిలీ కమిషన్ పోప్ ఫ్రాన్సిస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తుందన్న విశ్వాసం మాకుంది. మరింత మెరుగైన న్యాయబద్ధమైన సమాజాన్ని నిర్మించే ప్రయత్నంలో ఈ కమిషన్ తన తోడ్పాటునందిస్తుంది. ఈ లక్ష్యం దిశగా అంతర్జాతీయ నూతన ఆర్థిక ద్రవ్య చట్రాన్ని నిర్మించటం కంటే పోప్ ఫ్రాన్సిస్కు మనం అందించే గొప్ప నివాళి ఏముంటుంది?
మార్టిన్ గుజ్మాన్, జోసెఫ్ స్టిగ్లిట్జ్
(మార్టిన్ గూజ్మెన్ అర్జెంటీనా మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుతం కొలంబియా విశ్వవిద్యాలయంలో ఫ్రొఫెసర్గా పని చేస్తున్నారు. జోసెఫ్ స్టిగ్లిట్జ్ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. కొలంబియా విశ్వవిద్యాలయంలో ఫ్రొఫెసర్. బహు గ్రంధ రచయిత.)
(ప్రాజెక్ట్ సిండికేట్ సౌజన్యంతో)
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.