
ప్రపంచంలోని అనేక పెట్టుబడిదారీ దేశాల్లో సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. ఆ సంక్షోభ భారాలను శ్రామికులపై వేయడం, వాటికి వ్యతిరేకంగా పెరుగుతున్న కార్మికవర్గ పోరాటాలు, ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి మూలంగా అమెరికాతో సహా అనేక దేశాల్లో అధికార పార్టీలు ఎన్నికలలో ఓటమి చెందాయి. అంతేకాకుండా, భారత దేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, తీవ్రమవుతున్న శ్రామికవర్గ పోరాటాల నేపథ్యంలో శ్రామికవర్గం మేడే జరుపుకుంటోంది.
సామ్రాజ్యవాదం ముఖ్యంగా అమెరికా కుతంత్రాలు, సోషలిస్టు క్యూబాపై కొనసాగుతున్న ఆర్థిక ఆంక్షలు, మాతృభూమి రక్షణకోసం రక్తం ఓడుతున్న పాలస్తీనా, ఉత్తరకొరియా- చైనా దేశాలపై హూంకరింపులు, అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలిచిన తరువాత అనేక దేశాలతో చేస్తున్న సుంకాల యుద్ధాలు ఇవన్నీ అమెరికా, మిగిలిన సామ్రాజ్యవాద దేశాలు తమతమ దేశాలలోని ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కడానికేనని చెప్పవచ్చు. “సామ్రాజ్యవాదం ఉన్నన్నాళ్లూ యుద్ధాలు అనివార్యం” అన్న లెనిన్ నిర్ధారణ అక్షర సత్యాలని ప్రపంచ పరిణామాలు సూచిస్తున్నాయి. నేడు ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నా అవి సామ్రాజ్యవాదం, ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యవాదం జోక్యంతోనే అనేది వాస్తవం. గాజాపై అమెరికా అండతో ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమం అత్యంత అమానవీయం. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోంది. అంతేకాకుండా యుద్ధాన్ని వ్యాప్తి చేయడానికి సిరియా, యెమెన్, ఇరాన్, లెబనాన్, ఇరాక్ దేశాలను కవ్విస్తూ బాంబు దాడులు చేస్తోంది.
ప్రత్యామ్నాయం వైపు చూపు..
ప్రపంచం అపరిమిత రుణ భారంలోకి ప్రవేశిస్తోంది. సామ్రాజ్యవాద శక్తులు సంక్షోభానికి చెందిన మొత్తం భారాన్ని ప్రపంచ దక్షిణాది దేశాల కార్మికులు, ప్రజలపై నెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సంక్షోభం శ్రామిక ప్రజల కష్టాలను పెంచుతూనే, నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ దివాళా కోరుతనాన్ని సమిష్టిగా ఎదుర్కోవడానికి ఒక అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఈ దాడులకు వ్యతిరేకంగా శ్రామిక ప్రజల్లోని వివిధ వర్గాల నుంచి ప్రతిఘటన కూడా పెరిగింది. రెండు నెలల్లోనే కార్మికవర్గం రెండు భారీ సమ్మెలు చేయడంతో గ్రీస్ దేశం స్తంభించిపోయింది. గాజాలో ఇజ్రాయెల్ చేసిన మారణహోమానికి వ్యతిరేకంగా, పాలస్తీనా ప్రజల హక్కుల కోసం నిలబడటానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ముందుకు రావడం కూడా ధైర్యాన్నిస్తుంది. తాజాగా శ్రీలంక ఎన్నికలలో వామపక్ష అభ్యర్థి గెలుపు ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారన్న దానికి తార్కాణం.
మేడే స్పూర్తి..
1886 మే 4న అమెరికా దేశంలోని చికాగో నగరంలోని హే మార్కెట్లో ఎనిమిది గంటల పనిదినం సాధనకై జరిగిన ప్రదర్శన, దానిపై ప్రభుత్వం నిర్బంధం, ఆ నిర్బంధంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం వంటి వీరోచిత ఘటన స్ఫూర్తితో హక్కుల సాధనకై పోరాటం, పునరంకితం కావడానికి మేడే కార్మిక వర్గం ప్రపంచ వ్యాపితంగా వివిధ దేశాలలో జరుపుకోవడం ప్రారంభించింది. 1889లో పారిస్లో జరిగిన ఒక అంతర్జాతీయ కార్మిక సదస్సులో, అంతర్జాతీయ కార్మిక సంఘం మే 1వ తేదీన కార్మిక దినోత్సవంగా జరుపుకునే విధంగా నిర్ణయించింది. ఈ సమావేశంలో ఫ్రెడరిక్ ఎంగెల్స్, కార్ల్ మార్క్స్ వంటి ప్రముఖ నేతలు పాల్గొన్నారు. సదస్సులో మేడేని కార్మిక వర్గ ఐక్యత, పోరాటం ఇంకా హక్కుల సాధన కోసం ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. భారత దేశంలో మొదటగా 1923 మే 1న మద్రాస్ నగరంలో సింగారు వేలు చెట్టియార్ ఎర్ర జెండా ఎగరేసి మేడే జరిపారు.
భారత కార్మిక వర్గ ఘనమైన పోరాట వారసత్వం..
మనదేశంలో బ్రిటిష్ కాలంలోనే ఎటువంటి చట్టాలు లేని సమయంలోనే కార్మికులు ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లోని పోస్టల్, రైల్వే కార్మికులు, ప్రవేట్ సంస్థల్లోని టెక్స్ టైల్, జూట్, టీ తోటల కార్మికులు 8 గంటల పని, వేతనాలు, ఇతర సౌకర్యాలకై పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. ఆ పోరాటాలను అణచి వేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా నిర్బంధాన్ని ప్రయోగించింది. అయితే వాటిని తట్టుకుని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి, అప్పుడు వరకు లేని కార్మిక చట్టాలను కూడా సాధించుకున్న ఘనమైన చరిత్ర భారతదేశ కార్మిక వర్గానికి ఉంది. ఈ పోరాట ఫలితంగానే కార్మికులు సంఘాలు పెట్టుకునే హక్కుగా ట్రేడ్ యూనియన్ చట్టం 1926, కార్మికులు సమ్మె చేసే హక్కుతో సహా పారిశ్రామిక వివాదాలను పరిష్కరించుకునేలా పారిశ్రామిక వివాదాల చట్టం 1947, 8 గంటల పనిదినంతో ఫ్యాక్టరీ చట్టం 1948 వంటివి చేయబడ్డాయి.
మోదీ ప్రభుత్వ ప్రాధాన్యతలు..
మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల ఐక్యతను చీల్చడం, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడమనేవే నేడు మోదీ ప్రభుత్వ ప్రాధాన్యతలుగా కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వ అన్ని నిర్ణయాలూ ఉంటున్నాయి.
ప్రస్తుతం దేశంలోని సహజ వనరులను, ప్రభుత్వ ఆస్తులను ఒక పథకం ప్రకారం బడా పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయడానికి తోడ్పడేలా ప్రభుత్వ విధానాలను రూపొందించి, మొత్తంగా ఆర్ధిక యాజమాన్య వ్యవస్థ స్వరూపాన్నే మోదీ ప్రభుత్వం మార్చేసింది. అయితే, సామాన్యులను దోచుకుని, కార్పొరేట్లు లాభపడేలా చేయడమే ఈ విధానాల సారం.
ఉద్యోగాలలో కోత, సైన్యంతో సహా అన్ని ప్రభుత్వ సంస్థలలో కాంట్రాక్టు పద్దతి, పెన్షన్ సంస్కరణలు, ఈ విధానాలలో భాగమే. ఎన్పీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం(ఓపిఎస్) పునరుద్ధరించాలని దేశవ్యాపితంగా ఉద్యోగులు పోరాడుతుంటే, ఆ పని చేయకపోగా యూపీఎస్ అనే మరో మోసపూరిత పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. దీనికి తోడు ఓపిఎస్ను కూడా బలహీనపరిచేలా నూతన పీఆర్సీ పెరుగుదలలు పాత పెన్షనర్లకు వర్తించవని దొడ్డిదారి చట్టం చేసింది. ఈపిఎస్లో కనీస పెన్షన్ పెంచడానికి ససేమిరా నిరాకరిస్తోంది. మొత్తం అన్ని రకాల పెన్షన్ నిధులన్నీ షేర్ మారెక్ట్లో పెడుతూ, కార్పొరేట్లకు సిరులు కురిపిస్తోంది.
శ్రామికవర్గం ముందున్న సవాళ్ళు..
భారత కార్మిక వర్గ ఉద్యమం క్లిష్టతరమైన సవాళ్లతో కూడిన పరిస్థితిని నేడు ఎదుర్కొంటోంది. పాలకవర్గం ప్రతిస్పందన మరింత దూకుడుగాను, నిరంకుశంగానూ మారింది. ప్రజాస్వామ్య హక్కులను ప్రజలు క్రమంగా కోల్పోతున్నారు. రాజ్యాంగంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. ఈ దాడి, నయా ఫాసిస్ట్ లక్షణాలను ప్రదర్శించే బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ పాలన ముఖ్య లక్షణంగా మారింది.
హక్కులు హరించే లేబర్ కోడ్లు ..
కార్మిక చట్టాలను సమూలంగా మార్చేసి మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు చేసింది. కార్మికుల ప్రాథమిక హక్కులైన సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు కూడా కష్టతరం చేసేలా యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలను మార్చేసింది. 8 గంటల పని దినం స్థానంలో 12 గంటల పని, రాత్రి వేళల్లో కూడా మహిళలు పనిచేయడాన్ని చట్టబద్దం చేసింది. ఎటువంటి యాజమాన్య- కార్మిక సంబంధాలు లేకుండా పని చేస్తున్న గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించవలసింది పోయి, వారి శ్రమను మరింత దోచుకోవడానికి ఊబర్, ఓలా, స్విగ్గీ వంటి సంస్థలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది.
ప్రభుత్వానికి తగ్గిన బలం..
ఈసారి 400 సీట్లు పైమాటే అని దేశ ప్రధానితో సహా పాలక పార్టీ నేతలు ఎంత ఊదరగొట్టినా, 18వ లోక్సభ ఎన్నికలలో మోదీ ప్రభుత్వం పూర్తి మెజారిటీని కూడా కోల్పోయింది. దీనికి ప్రధాన కారణం రైతులు, ముఖ్యంగా కార్మికవర్గ స్థిరమైన ప్రతిఘటనా ఉద్యమాలే.
తగ్గని దూకుడు..
పార్లమెంటులో బలం చాలా తగ్గిపోయినప్పటికీ, కార్పొరేట్ మతతత్వ సంబంధానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాలలో తీవ్రమైన నిరంకుశ చర్యల ద్వారా నయా ఉదారవాద విధానాలను ముందుకు తీసుకుపోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మొత్తం ఉపాధి రంగంలో అనిశ్చితిని ప్రోత్సహించడానికి సంఘటిత, అసంఘటిత రంగాలలోని ఉపాధి సంబంధాలు నిరంతరం పునర్నిర్మించబడుతున్నాయి. దీని ఉద్దేశ్యం కేవలం కార్మిక వ్యయాలను తగ్గించడం మాత్రమే కాదు, మరింత ముఖ్యంగా కార్మికుల హక్కుల కోసం పోరాడే ట్రేడ్ యూనియన్లను నిర్మూలించడానికి, వారిపై వాస్తవిక బానిసత్వ పరిస్థితిని విధించడం. తాజాగా చేసిన లేబర్ కోడ్లు ఈ ప్రక్రియను సులభతరం చేస్తాయి. శాశ్వత ఉపాధి అనేది పెద్ద ఎత్తున ఔట్ సోర్సింగ్, అప్రెంటీస్లు, ట్రైనీలు, ఇంటర్నిషిప్లు మొదలైన వాటి ద్వారా భర్తీ చేయబడి, కార్మికులను కార్మికచట్టాల పరిధికి వెలుపల ఉంచడానికి వినూత్న పరిభాషను ఉపయోగిస్తున్నారు.
దేశ సంపద, ప్రకృతి వనరుల లూటీ..
విద్యుత్, బొగ్గు, ఖనిజాలు, పోర్టు, డాక్, బ్యాంకింగ్, బీమా రంగాలలో పాలకులు ముఖ్యంగా ప్రైవేటీకరణను దూకుడుగా కొనసాగిస్తున్నారు. అయితే, ప్రభుత్వ రంగాన్ని, భారతదేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి సర్వశక్తితో కార్మికులు కూడా పోరాడుతున్నారు. దేశంలోని రైతు ఉద్యమం చారిత్రాత్మక రైతు పోరాటం ద్వారా రద్దు చేసిన నల్ల చట్టాలను, దొడ్డిదారుల ద్వారా క్రూరమైన వ్యవసాయ చట్టాలను తిరిగి ప్రవేశపెట్టడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్త వ్యవసాయ మార్కెటింగ్ విధానం అటువంటి మోసపూరిత చర్యలకు నిదర్శనం. మనదేశ వ్యవసాయ మార్కెట్ను తమ ఉత్పత్తులకు బార్లా తెరవాలన్న అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోతోంది. ప్రభుత్వ చర్యలన్నీ అడవులు, భూమి, సముద్రం వంటి మన సహజ వనరులను దోచుకుని, దాని సన్నిహితులకు, గుత్తాధిపత్య పెట్టుబడికి ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశించబడ్డాయి. ఇవన్నీ పర్యావరణంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతూ, వినాశకరమైన వాతావరణ మార్పులకు తోడ్పడుతున్నాయి.
కార్పొరేట్లకు కానుకలు..
బహుముఖ ప్రోత్సాహక పథకాల ముసుగులో జాతీయ ఖజానా నుంచి పెట్టుబడిదారీ వర్గాలకు నేరుగా సబ్సిడీ ఇవ్వడానికి వివిధ చర్యలు ప్రవేశపెట్టబడుతున్నాయి. గత పదేళ్ళలో బడా కార్పొరేట్ సంస్థల 25 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందని ఫ్రీ ప్రెస్ జర్నల్ పేర్కొంది. ప్రజల ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కులను అణచివేయడం ద్వారా నయా ఉదారవాదానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని వ్యతిరేకతలను అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఉపా, పిఎంఎల్ఎ మొదలైన వాటితో పాటు భారతీయ న్యాయ సంహిత వంటి కొత్త చట్టాల ద్వారా ప్రజల సమిష్టి నిరసనలను నేరంగా పరిగణించేంతవరకు వెళ్తోంది. అదే సమయంలో మోడీ ప్రభుత్వం “జన్ విశ్వాస్” చట్టం అని పిలవబడే నిబంధనల ప్రకారం బాయిలర్ చట్టం, అటవీ చట్టం, టీ చట్టం, రబ్బరు చట్టం, ఔషధ రంగానికి సంబంధించిన 41 చట్టాల కింద కార్పొరేట్ల 180 నేరాలను నేరరహితం చేసింది. తాజా కేంద్ర బడ్జెట్లో యాజమాన్యాల మరో 100 నేరాలను నేరాల నుంచి తొలగించారు. ఇది కార్మిక చట్టాలతో సహా చట్టాలను శిక్షార్హత లేకుండా ఉల్లంఘించడానికి ఒక లైసెన్స్ తప్ప మరొకటి కాదు.
కార్మికులకు కడగండ్లు..
మరోవైపు కార్మికులు పొరాడి సాధించుకున్న హక్కులను నిలబెట్టుకోవడానికి చేసే సమిష్టి చర్యలను సైతం నేరంగా పరిగణిస్తున్నారు. కార్మికులు, వారి సంఘాలు సమిష్టిగా ఫిర్యాదు చేయడాన్ని బిఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 111 కింద ‘వ్యవస్థీకృత నేరం’గా పరిగణించి, బెయిల్ లేని జైలు శిక్షతో సహా పోలీసు చర్యలకు దారితీస్తుంది. ఇప్పటికే అనేక బిజెపి పాలిత రాష్ట్రాల్లో కార్మిక సంఘాల నాయకులు, కార్మికుల ఫిర్యాదులను యాజమాన్యానికి లేదా కార్మికశాఖకు సమర్పించినందుకు తప్పుడు క్రిమినల్ కేసుల్లో ఇరికించబడ్డారు. కార్మిక నియమావళి అమలుకు ముందే, ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలు/ విభాగాలలో గేట్ మీటింగులు, డిపార్ట్మెంటల్ సమావేశాలు, కరపత్రాల పంపిణీ, మెమోరాండం సమర్పించడం వంటి సాధారణ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి. ఇవి కార్మికులలో భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశించినవి.
ఆదాయ అసమానతలు..
ప్రభుత్వ విధానాల మూలంగా దేశంలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. 2022-23 ప్రపంచ అసమానతల నివేదిక దేశంలో కేవలం ఒక్క శాతం సంపన్నులు 22.6 శాతం ఆదాయాలను, 40.1 శాతం దేశ సంపదను స్వంతం చేసుకుంటున్నారని వెల్లడించింది. బ్రిటిష్ కాలం కంటే కూడా ఇది భారతదేశ చరిత్రలో అత్యధికంగా ఉంది. ఇదే సందర్భంలో దేశంలోని అట్టడుగు 50 శాతం మంది చేతుల్లో కేవలం మూడు శాతం సంపద మాత్రమే ఉంది.
దేశం రికార్డు స్థాయి గరిష్ట నిరుద్యోగాన్ని, నిజ వేతనాలలో నిరంతర క్షీణతను చూస్తోంది. నికర విలువ జోడించిన దానిలో వేతనాల వాటా 2020లో 18.9 శాతం నుంచి 2023లో 15.9 శాతానికి తగ్గింది. అదే కాలంలో లాభాల వాటా నికర విలువ జోడించిన దానిలో 38.7 శాతం నుంచి 51.9 శాతానికి పెరిగింది. తీవ్ర పేదరికం, పోషకాహార లోపం దేశంలో పెరుగుతున్నాయి. ప్రైవేట్ మైక్రోఫైనాన్స్ సంస్థలు సూపర్ లాభాలను ఆర్జించడం ద్వారా పేద వర్గాలలో రుణభారం ఆందోళనకరంగా పెరుగుతోంది. ఇది చాలా మంది రుణగ్రస్తులను చేస్తూ ముఖ్యంగా అన్నదాతలను ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది.
పెరుగుతున్న ప్రతిఘటన..
దేశంలో ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా జరుగుతున్న విద్వేషపూరితమైన పరిస్థితులను శ్రామికవర్గం ధైర్యంగా ప్రతిఘటిస్తోంది. ప్రాథమిక హక్కుల కోసం, ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికసంఘాలు అసంఖ్యాక పోరాటాలు నిర్వహించాయి. తమిళనాడులో శాంసంగ్ కార్మికుల సమ్మె ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గానికి స్ఫూర్తిని ఇవ్వడమే కాకుండా, భారతదేశ కార్మికవర్గానికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. విద్యుత్ ఉద్యోగుల పోరాటాలు, సమ్మెలు ఆయా తరగతిని సమీకరించడంలోను, ప్రైవేటీకరణ బాధితులైన ప్రజల మద్దతును కూడగట్టడంలోనూ కొత్త ప్రమాణాలను ఏర్పరుస్తున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత నాలుగేళ్లకు పైగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని నిలవరించారు. ఈ మధ్యకాలంలో అనేక సంస్థలలో కాంట్రాక్ట్ కార్మికులు చేసిన కొన్ని విజయవంతమైన పోరాటాలు, సరైన దిశలో పోరాడుతూ ఉంటే ప్రభుత్వ దుర్మార్గాలను ఎదుర్కోవడం సాధ్యమేనని నిరూపించాయి. కార్మికశక్తిని బలహీనపరచడం వంటి పాలకవర్గం కుట్రలు చివరికి విజయవంతం కాలేదనే విశ్వాసాన్ని సృష్టిస్తున్నాయి. వివిధ విభాగాల స్కీం వర్కర్లు, ముఖ్యంగా అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నభోజన పథకం కార్మికులు రాష్ట్ర, అఖిల భారత స్థాయిలో నిరంతరం దృఢమైన పోరాటాలు చేస్తూ అనేక విజయాలు సాధించారు.
శ్రామిక మహిళల సాధికారత..
మనదేశంలో శ్రామిక మహిళల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. కానీ మొత్తం శ్రామిక మహిళల శక్తి పాల్గొనే రేటు సుమారుగా 25 – 30 శాతం మధ్యే ఉంటుంది. ఇది ప్రపంచ సగటుతో పోల్చితే తక్కువే. వ్యవసాయ రంగంలో 55- 60 శాతం, ఉద్యోగ, సేవా రంగాలలో సుమారు 20 శాతం, తయారీ పరిశ్రమలలో 10 శాతం వరకు పనిచేస్తున్నారు. ఒకే పనికి పురుషులతో పోలిస్తే తక్కువ వేతనాలను మహిళలు పొందుతున్నారు. అంతేకాకుండా పని ప్రదేశంలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. అసురక్షిత పని ప్రదేశాలు, అత్యధిక పని గంటలు, విశ్రాంతి లేకపోవడం లాంటి సమస్యలను కూడా మహిళా కార్మికులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా నైపుణ్య శిక్షణ లేకపోవడం, అవిద్య వంటి సమస్యలు అదనంగా ఉన్నాయి. ఇంటిచాకిరి ఊడా మహిళల మీదే ఎక్కువ ఉంటుంది. వెరసి ఇవన్నీ వారి పని సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి.
అయితే, శ్రామిక మహిళలకు ప్రత్యేకంగా ఉన్న చట్టాలే తక్కువ కాగా ప్రసూతి చట్టం, సమాన పనికి సమాన వేతన చట్టం, లైంగిక వేధింపుల నిరోధక చట్టం వంటివి ప్రభుత్వ సంస్థలతో సహా అనేకచోట్ల అమలుకావడం లేదు. దీనికి తోడు రాత్రి వేళల్లో కూడా పనిచేసేలా చట్ట సవరణలు కూడా ప్రభుత్వం చేసింది. వ్యవసాయం, స్వయం ఉపాధి రంగాలలో పనిచేస్తున్న మహిళలకు అసలు ఏ చట్టాలూ వర్తిచడం లేదు. అంతేకాకుండా మన దేశంలో సామాజిక వివక్షత, లింగ అసమానతలు ఎలాగూ ఉన్నాయి.
గౌరవ వేతనం పేరుతో కోటి మందికి పైగా ఉన్న స్కీం వర్కర్ల నిలువు దోపిడీ కొనసాగుతూనే ఉంది. దేశ సంపద సృష్టిలో ప్రత్యక్ష పాత్ర నిర్వహిస్తున్న శ్రామిక మహిళల పట్ల వివక్షత దేశానికే అనర్ధం. వీరి సమస్యల పరిష్కారం, సమానత్వం సాధించకుండా సాధికారత పేరుతో ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా నిరుపయోగమే అవుతుంది. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహంతో పని ప్రదేశాల్లో సురక్షిత వాతావరణం, సమాన వేతనాలు, ప్రత్యేక సెలవులు, చట్టాల వర్తింపు, వాటి పటిష్ట అమలు, సామాజిక అవగాహన వంటివి కల్పించాలి.
తెలుగు రాష్ట్రాలలో ..
ఆంధ్ర రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం- జనసేన- బిజెపి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ వినాశకర విధానాలనే కొనసాగిస్తోంది. రాష్ట్రంలో సోదర భావంతో ఉండే వివిధ తరగతుల ప్రజల మధ్య చిచ్చులు పెట్టడానికి గోతికాడ నక్కలా కాచుకుని కూర్చున్న మతతత్వ శక్తులకు ఊతం ఇచ్చేలా టిడిపి, జనసేన వ్యవహరించడం అత్యంత ఆందోళనకరం. అంతేగాక, ఆంధ్ర రాష్ట్రానికే ప్రమాదకరంగా మారనున్నాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన రాష్ట్రంలో శ్రామిక ప్రజల ఐక్యతను కాపాడుకోవడం ప్రథమ కర్తవ్యంగా ఉండాలి.
డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందనే భ్రమలను కాస్తా పటాపంచలు చేస్తూ, కూటమి పార్టీలు పూర్తిగా మోదీ ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. మరో అడుగు ముందుకు వేసి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంటుకు అతి సమీపంలోనే అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ప్రైవేట్ ఆర్సలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చకచకా సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా దానికి అవసరమైన ఇనుప ఖనిజం, పోర్టు వంటివి కూడా కల్పిస్తోంది. మరోపక్క కార్మిక పోరాటాలపై నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు, కేసులు వంటివి హామీకి భిన్నంగా గత ప్రభుత్వంలో లాగానే కొనసాగుతున్నాయి. కనీస వేతనాల సవరణ లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో బడా సంస్థలకు భూమితో సహా వనరులను దోచి పెడుతున్నారు.
తెలంగాణాలో మతతత్వ శక్తులు ప్రతి సందర్భంలో నిత్యం విద్వేషాలు రెచ్చగొడుతూ, శ్రామిక వర్గ ఐక్యతకు పెద్ద అవరోధాలు సృష్టిస్తున్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మికులు వేతనాల పెంపు, ప్రభుత్వంలో విలీనం వంటి సమస్యలపై సుదీర్ఘ పోరాటంలో ఉన్నారు. స్కీం వర్కర్లు, పవర్ లూమ్, మున్సిపల్ వంటి వివిధ తరగతుల కార్మికులు సమస్యల పరిష్కారానికై సుదీర్ఘకాలంగా పోరాటాలు నిర్వస్తున్నారు.
ఐక్య పోరాట దిశలో మేడే ప్రతిజ్ఞ..
విచ్ఛినకర శక్తులు చేస్తున్న విద్వేష చర్యల పట్ల అప్రమత్తంగా ఉంటూ శ్రామిక వర్గ ఐక్యతను కంటికి రెప్పలా కాపాడుకోవడం నేటి ప్రథమ కర్తవ్యం.
“ శ్రామికవర్గ పోరాటాల విజయం, అది సాధించే తక్షణ కోర్కెలలో లేదు. ఆ పోరాటాల సందర్భంగా ఏర్పడే ఐక్యతే అది సాధించే అసలైన విజయం” అన్న కార్ల్మార్క్స్ మాటలు అక్షర సత్యాలు. అటువంటి శ్రామికవర్గ ఐక్య పోరాటాలు సాగించే దిశలో ముందుకు కదలాలి. అయితే సంపదను కొద్దిమందికి దోచిపెట్టే మోదీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిస్తూనే, ముప్పేట దాడి నుంచి తమని తాము రక్షించుకుంటూ, హక్కుల సాధనకై శ్రామిక వర్గం ఉద్యమించాలి.
శ్రామికవర్గ రోజువారీ సమస్యలపై పోరాటం కొనసాగిస్తూనే, పెట్టుబడిదారీ వ్యవస్థ డొల్లతనాన్ని బహిర్గతం చేయాలి. బలమైన కార్మిక, కర్షక ఐక్యతను నిర్మించడం ద్వారా ప్రభుత్వ విధానాలను మార్చేలా, ప్రత్యామ్నాయ విధానాల కోసం శ్రామికవర్గం పునరంకితం కావాలి. ఇందులో భాగంగా ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని కాపాడుకోవడంలో విస్తృత ఐక్య ఉద్యమాలను నిర్మించాలి. దోపిడీ లేని ప్రత్యామ్నాయ సమాజాన్ని స్థాపించడంలో కార్మికవర్గం పాత్ర గురించి విస్తృత స్థాయిలో అవగాహన, చైతన్యం కల్పించాలి.
సామ్రాజ్యవాదాన్ని అంతమొందించడం, శ్రామికవర్గ అంతర్జాతీయవాదం పెంపొందించడం వంటి లక్ష్యాలతో మన దేశంలో మెరుగైన సమాజం కోసం శ్రామికవర్గం ముందుకు కదలాలి. హక్కులు, ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు మున్ముందుకు సాగుదాం, మేడే వర్ధిల్లాలి.
ఎ అజ శర్మ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.