
బీఆర్ అంబేడ్కర్ జన్మించిన భారతదేశంలో మహర్లకు ఎంతో చారిత్రకమైన నేపథ్యం ఉంది. అంబేడ్కర్ తండ్రి రాంజీ సత్పల్ ఆత్మ గౌరవానికి చిహ్నంగా జీవించారు. ఆయన మహర్ల భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
ఒకప్పుడు మహర్లు ఎక్కువ కబీర్ అనుయాయులుగా ఉన్నారు. వీరి చరిత్ర వీరోచితమైనది. సామాజిక, సాంస్కృతిక, తాత్విక రంగాలలో విస్తారమైన ప్రజ్వలనం కలిగినట్టిది. మహారాష్ట్రలోని ప్రతి జిల్లాలోను మహర్లు వున్నారంటేనే వారి ప్రత్యేకత మనకు అర్థమవుతోంది. మహర్లతోపాటు మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో ఇతర అస్పృశ్య కులాలు 12% వరకు వున్నాయి. ఇటువంటి మహర్ జాతిలో అంబేడ్కర్ పుట్టి ప్రపంచ మేధావిగా ఎదిగారు.
మహర్లు మొదట కబీర్ అనుయాయులయిగా ఉన్నారు. ఆ తర్వాత బౌద్ధ జీవన వికాసంలోకి అంబేడ్కర్ వల్ల వెళ్లారు. వీరికి ఆత్మ గౌరవం ఎక్కువ. వీరికి అసమానమైన పోరాట శక్తి ఉంది. సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, విద్య, వ్యవస్థల్లో వీరు అసమానమైన కీర్తిని గడించారు.
ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక..
1956 డిసెంబర్ 6న అంబేడ్కర్ తన అనుయాయులకు బౌద్ధ ధర్మ దీక్షను ఇచ్చారు. అనుయాయులలో ఒకరైన రామకృష్ణ సూర్య భాను గవాయి కుమార్ బౌద్ధ దీక్షను తీసుకున్నారు. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి భారత ప్రధాన న్యాయమూర్తి(సిజేఐ) పదవికి పూర్తి అర్హుడని చెప్పుకోవాలి. తండ్రి వారసత్వంలో బౌద్ధ మతంలో జస్టిస్ గవాయి కొనసాగుతున్నారు. బౌద్ధ జీవన వికాసానికి, ఆత్మ గౌరవ స్వరానికి, అవమానాన్ని ఎదరించగలిగే తత్వానికి మరొకసారి నిదర్శనంగా జస్టిస్ గవాయి నిలిచారు. వీరికి ముందు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కేరళ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదివిని అధిష్టించారు. ఈ పదవిని అధిష్టించిన తొలి దళిత వ్యక్తిగా బాలకృష్ణన్ రికార్డు సృష్టించారు. తను అనేక అవమానాలను ఎదర్కొన్నట్లు తను రిటైర్ అయ్యాక చెప్పారు.
అంతేకాకుండా, భారతదేశానికి మొదటి దళిత రాష్ట్రపతిగా సేవలు అందించిన కేఆర్ నారాయణ్ కూడా కేరళీయుడే. ఆయన ఫ్రాన్స్లో ఉన్నప్పుడు ఒక విలేకరి వేసిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ‘ఇండియన్ అన్టచ్బుల్’ అన్న విషయాన్ని కేఆర్ నారాయణ్ ఆ సందర్భంలో పేర్కొన్నారు. దీంతో ఆ విషయం అనేక పత్రికల్లో ప్రచురితమై సంచలనంగా మారింది.
అయితే, సీజేఐగా బీఆర్ గవాయి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మహారాష్ట్ర బార్ కౌన్సిల్ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం జరిగిన తీరు సరిగా లేదు. సన్మాన కార్యక్రమానికి మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ముంబై పోలీస్ కమీషనర్ వంటి ఉన్నతాధికారులే హాజరు కాలేదు. మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి సీజేఐ వంటి ఉన్నత పదవికి ఎంపికైన తరువాత, రాష్ట్రానికి తొలిసారి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వారు ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కావాలి. కానీ అలా అసలు జరగలేదు.
ఆ సందర్భంలో జస్టిస్ గవాయి స్పందించారు, “నేను నాకు లభించాల్సిన గౌరవం గురించి మాట్లాడడంలేదు. ఒక రాజ్యాంగ వ్యవస్థ మరో రాజ్యాంగ వ్యవస్థకు ఇవ్వాల్సిన గౌరవం గురించి మాట్లాడుతున్నాను” అని ఆయన స్పష్టంగా చెప్పాల్సి రావడం విషాదకరం.
గొప్ప సందేశకులే కాదు, ధైర్యశాలి, నిక్కచ్చిగా మాట్లాడటం గవాయి నైజంగా ఉంటుంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, సందేశాత్మక ప్రసంగంతో భారతదేశం మొత్తం ఆలోచింపజేసేలా చేశారు. న్యాయ వ్యవస్థకు, రాజకీయ వ్యవస్థకు, పార్లమెంటుకు వున్న సమతుల్యతను నిక్కచ్చిగా ఆయన ప్రస్థావించారు.
సర్వోన్నతమైన భారత రాజ్యాంగం..
ప్రమాణ స్వీకారం సమయంలో “దేశంలో ఏ వ్యవస్థా గొప్పది కాదు. భారత రాజ్యాంగం మాత్రమే సర్వోన్నతమైనది” అని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో కీలక స్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు మూడు సమానమేనని అన్నారు. ఇవి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని, పరస్పరం గౌరవించుకోవాలని తెలియజేశారు. న్యాయవ్యవస్థ తన పరిధిని అతిక్రమిస్తోందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడిన ఈ మాటలకు ప్రాధాన్యత ఏర్పడింది.
భారత దేశ 52వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణం చేసి తర్వాత తొలిసారి తన సొంత రాష్ట్రంలోని ముంబైకు వచ్చిన ఆయనను మహరాష్ట్ర- గోవా బార్ కౌన్సిల్ సత్కరించాయి. రాష్ట్ర న్యాయవాదులు సదస్సును కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ ప్రసంగించారు, “చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపం జోలికి అది వెళ్లడానికి వీల్లేదు. రాజ్యాంగం సర్వోన్నత అధికారం. చట్టపాలన, న్యాయ వ్యవస్థకున్న స్వేచ్ఛ వంటివాటిని రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు సవరించడం, రద్దు చేయడం కానీ చేయజాలదు. రాజ్యాంగ మౌలిక నిర్మాణం దృఢమైనది. దాని మూల స్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు మూడు సమానమైనవే. అవి కలిసిమెలిసి పనిచేయాలి” అని తెలిపారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సమయంలో ప్రధాన న్యాయమూర్తిని కావడం సంతోషకరమని తెలిపారు. “రాజ్యాంగంలోని మూడు స్తంభాలు తమతమ పరిధులకు లోబడి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. శాసన, న్యాయవ్యవస్థలు చేసిన పలు చట్టాల కారణంగానే సామాజిక, ఆర్థిక, న్యాయ భావన నెరవేరుతుంది” అని పేర్కొన్నారు.
ఆయన ఇచ్చిన 50 కీలక తీర్పుల సంకలనాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. వాటిలో కొన్నిటిని జస్టిస్ గవాయి ప్రస్తావించారు. బుల్డోజర్ న్యాయానికి వ్యతిరేకంగా తానిచ్చిన తీర్పు గురించి వివరించారు. “నివాస హక్కు ప్రాథమిక హక్కు. ఏ వ్యక్తి అయినా ఏదైనా కేసులో నిందితుడైనా, దోషిగా నిర్ధారణ అయినా అతడి కుటుంబ నివాసం చట్టబద్ధమైనదైతే దానిని తొలగించడానికి, కూల్చడానికి వీల్లేదు. చట్ట పాలనను అనుసరించి వ్యవహరించాల్సిందే” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ దత్తా, బాంబే హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే తదితరులు పాల్గొన్నారు.
మనసులలో నుంచి పోని మనుస్మృతి భావజాలం..
రాజ్యాంగకర్త డా బీఆర్ అంబేడ్కర్లా ఒక బుద్ధిస్టు దళిత వ్యక్తి మొదటి సారి చీఫ్ జస్టిస్ అయ్యారు. రాజ్యాంగ మౌలిక సూత్రాల మీద ఆయనకు మంచి అవగాహన ఉంది. నిజానికి బుద్ధిజానికి రాజ్యాంగానికి వున్న అవినాభావ సంబంధం చాలా ముఖ్యమైనది. రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలకు, జాతులకు అధికరణ 340 నుంచి చాలా రక్షణలను అందించింది. రాజ్యాంగం 17వ ఆర్టికల్ ద్వారాను 1989 ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ అఫ్ ఆక్ట్ ద్వారా దళితులను ఏ సందర్భంలో కూడా అవమానించరాదు.
అయితే మనుస్మృతి భావజాలం వల్ల చాలామందిలో కులాధిపత్య భావం ఇంకాను పోవడంలేదు. రాజ్యాంగం ఉపరితలంలో ఉంది. కానీ వీరి మనస్సుల్లోకి మెదడుల్లోకి చేరలేదు. దీంతో అనేకమంది ఉన్నత స్థానాల్లో వున్న రాజకీయ నాయకులు, ఉన్నత స్థానంలో వున్న అధికారులు కూడా రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నారు. ఇది రాజ్యాంగ ప్రతిపత్తికి అవరోధం.
అంబేడ్కర్ హిందూమతంలోని కుల వ్యవస్థ ఆధిపత్యాన్ని, దౌష్ట్యాన్ని గురించి వివరించారు. కులవ్యవస్థలో ఉన్నటువంటి అమానుషమైన వాటిని ఎత్తి చూపారు. పై మూడు వర్ణాల వారు(త్రయ వర్ణికులు) శూద్రుల, అతిశూద్రుల పట్ల అనుసరించిన విధానం ఇదీ అని చెప్పటానికి మనుధర్మశాస్త్రం ప్రబల సాక్ష్యం. సాంఘిక హక్కుల విషయంలో మనుధర్మశాసనాలను మించిన ఆఘాయిత్యపు దుష్ట శాసనాలు ప్రపంచంలో మరెక్కడా లేవు. ప్రపంచంలో సాంఘిక దురన్యాయాలు ఎక్కడైనా జరిగి ఉంటే, అట్టి ఉదంతాలు ఈ మనుధర్మ శాసనం ముందు గడ్డిపరకలు, అంతటి అప్రతిష్టాకరమైనట్టిది మనుస్మృతి.
ఇంతటి దుష్టమైన సంఘ పీడను, అన్యాయాన్ని ప్రజానీకం ఎందుకు భరించినట్టు? ప్రపంచంలో అన్ని దేశాలలోను సాంఘిక విప్లవాలు జరిగాయి. భారతదేశంలో సాంఘిక విప్లవాలు ఎందుకు జరగలేదన్నది నిరంతరం నన్ను వేధించే ప్రశ్న. బహుశా అందుకు ఒకే ఒకటి కారణమై ఉండవచ్చు. అది హిందువులలోని దిగువ తరగతి ప్రజలు పనికిమాలిన చాతుర్వర్ణ వ్యవస్థ కారణంగా అణచపెట్టబడి, ప్రత్యక్ష చర్యకు పూర్తిగా పనికిరాకుండా చేయబడటం. వారు ఆయుధాలు ధరించకూడదు. ఆయుధాలు లేకుండా తిరుగుబాటు సాధ్యం కాదు. వాళ్ళు సేద్యగాళ్ళుగా నిర్ణయించబడ్డారు. కానీ తమ నాగళ్ళ కరుకోలలనైనా ఖడ్గాలుగా చేసుకోవడానికి వీలులేకుండా చేయబడ్డారు. ఏ రకమైన ఆయుధాలు వారికి లేవు. అందువల్లనే ప్రతివాడు వాళ్ళ తలపై ఎక్కి కూర్చున్నాడు.
డా బీఆర్ అంబేడ్కర్యే భారత రాజ్యాంగకర్తగా ఉండి అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. అయితే ఆయన సానుకూల దృక్పథంతో ప్రత్యామ్నాయాలు సృష్టిస్తు వెళ్ళారు. ఇపుడు భారత రాజ్యాంగ అనుసరణ అనేది ఒక ప్రధాన భూమికగా మారింది. ఈ దశాబ్దంలో హిందూ మతోన్మాదశక్తులు, కార్పోరేట్ ఆధిపత్య శక్తులు జమిలిగా మనుస్మృతి భావాజాల ఆధిక్యతను ప్రకటించాలని చూస్తున్నాయి. ఈ సందర్భంగా జస్టిస్ గవాయి ఇచ్చిన ఆత్మ గౌరవ భావన అందరికీ ఆదర్శం అయింది.
కులం పునాదుల మీద ఒక జాతిని, నీతిని నిర్మించలేరని అంబేడ్కర్ చెప్పారు. ఈ సూత్రం మనకు ఆధారం ఇది కుల నిర్మూలన పోరాటాల యుగం.
రాజ్యాంగ ప్రాధాన్యత గురించి..
భారత ప్రజలమైన మనం భారతదేశాన్ని సర్వసత్తాక, ప్రజాస్వామిక లౌకిక, సామ్యవాద గణతంత్ర రాజ్యంగా నెలకొల్పడానికి దానిలోని పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, నమ్మకం, ఆరాధన విషయాలలో స్వేచ్ఛను, సమానావకాశాలను, ప్రతిపత్తులను చేకూర్చేటందుకు అందరిలో వ్యక్తి హోదా, జాతీయ ఐక్యతను పెంపొందించే సౌభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరచేందుకు, భక్తితో పరస్పరం తీర్మానించుకొని, 1949 నవంబరు 26న రాజ్యాంగ నిర్మాణ సభలో రాజ్యాంగాన్ని అంగీకరించి, అధినియమంచేసి మనకు మనం సమర్పించుకొన్నాము.
భారత రాజ్యాంగ ఆచరణ సాధ్యమైనది. ఇది శాంతి సమయంలోనూ, యుద్ధ కాలంలోనూ దేశాన్ని సమైక్యంగా, సమగ్రంగా ఉంచగల దృఢ- అదృఢ రాజ్యాంగం. ఈ నూతన రాజ్యాంగపు అమలు సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే, అందుకు కారణం మనది తప్పా రాజ్యాంగానిది కాదు. పాలకులు అవినీతిపరులు కావడమే. రాజ్యాంగం మంచిదైనా, చెడ్డదైనా దాని మంచి చెడ్డలు అమలు చేసే స్థానంలో ఉన్నవారిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రాజ్యాంగమే దిక్సూచిగా ఉంది, అది చూపించే దిశగా సాగిపోదాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.