
జూన్ 13వ తేదీ ఇజ్రాయిల్ సేనలు ఇరాన్పై దాడి చేసినప్పుడు ఇరాన్ రాజధాని టెహరాన్లో హత్యాకాండ స్వైర విహారం చేసింది. ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సైనిక దళాల ప్రధాన అధికారి, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్, ఇరాన్ సైన్యంలో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్న జనరల్స్, అరడజను మందికి పైగా అణు విజ్ఞాన శాస్త్రవేత్తలు చనిపోయారు. ఇజ్రాయిల్ దాడుల ప్రకటిత లక్ష్యం ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని ధ్వంసం చేయటం. కానీ ఈ దాడుల అసలైన లక్ష్యం ఇరాన్ను నిస్సహాయతలోకి నెట్టటం. అయితే, ఎదురుదాడి చేసే వీలు కూడా లేకుండా ఇరాన్ను నిస్సత్తువగా మార్చడం ఇజ్రాయెల్కు సాధ్యం కాదని గుర్తించలేక పోయింది.
జూన్ 13 దాడుల నుంచి ఇరాన్ వెంటనే కోలుకున్నది. ఇజ్రాయిల్ దాడుల్లో చనిపోయిన సైనిక అధికారుల స్థానంలో కొత్త అధికారులను నియమించింది. అదేరోజు ఇజ్రాయిల్పై ఎదురుదాడులను ప్రారంభించింది. ఇజ్రాయిల్ మీదకు వందల సంఖ్యలో ఖండాంతర క్షిపణులను ప్రయోగించింది. రోజులు గడిచేకొద్దీ ఇరాన్ సైన్యం ఇజ్రాయిల్లో పలు కేంద్రాలపై దాడులు చేసింది. హైఫాలో ఉన్న చమరు శుద్ధి కర్మాగారం పైన, టెల్అవీవ్ కేంద్రంగా పనిచేస్తున్న వీజ్మాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెర్ష కేంద్రంగా పనిచేస్తున్న సరోకా హాస్పిటల్ వంటి కేంద్రాలపై ఇరాన్ సైన్యం దాడులు చేసింది.
యుద్ధం మూడో రోజుకు చేరేసరికి ఇరాన్ గగన తలంపై సంపూర్ణాధిపత్యం సాధించామని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణి ప్రయోగ సాధనాలలో మూడో వంతు ధ్వంసం చేశామని ఇజ్రాయిల్ ప్రకటించింది. కానీ, ఇరాన్ ప్రతీరోజు డజన్ల సంఖ్యలో ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తుంది. ఇరాన్ నుంచి దూసుకు వస్తోన్న క్షిపణులు ఇజ్రాయిల్ సేనలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశం పైకి దూసుకు వచ్చే ఖండాంతర క్షిపణులను పసిగట్టడానికి ఉపయోగించే వ్యవస్థలు ఇజ్రాయిల్ వద్ద తగినన్ని లేవని ఓ అమెరికన్ అధికారి వాల్ స్ట్రీట్ జర్నల్కు తెలిపారు. ఇరాన్ ప్రయోగించే క్షిపణులను ముందుగానే గుర్తించేందుకు అమెరికా సైతం తన వనరులు, సాంకేతిక సామర్థ్యం వెచ్చిస్తోందని సదరు అధికారి జూన్ 18న తెలిపారు. జూన్ 19న సరోక ఆసుపత్రితో సహా ఇజ్రాయిల్లోని అనేక కీలకమైన స్థావరాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది.
ఆకాశాన్ని కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు..
రెండు దేశాల గగన తలంలో ప్రదర్శించబడుతోన్న సామర్థ్యం అంతిమంగా ఏ పరిణామాలకు దారి తీస్తోందనేది ప్రపంచం ముందు ఉన్న ప్రశ్న. ఈ దాడుల్లో ఇరాన్ భారీగా నష్టపోయిందనే విషయంలో సందేహం లేదు. అయినా ఇరాన్ ప్రభుత్వం ఈ దాడులను ఎదుర్కొని నిలదొక్కుకుంది. నిన్నా మొన్నటి వరకు ఇరాన్లో ప్రభుత్వం, మతాధిపతులను విమర్శించే ప్రముఖులు, పౌరసమాజం నేడు ప్రభుత్వానికి దన్నుగా నిలిచారు.
ఇరాన్ గగనతలంలో విచ్చలవిడిగా వ్యవహరించే స్వేచ్ఛ ఇజ్రాయిల్కు ఉండవచ్చు. కానీ, ఇరాన్ ఇజ్రాయిల్ కంటే ఇరాన్ 75 రెట్లు ఎక్కువ విస్తీర్ణం కలిగిన దేశం. అంతేకాకుండా, వేల సంఖ్యలో ఖండాంతర క్షిపణులను కలిగి ఉంది. ఇరాన్కు ఉందనుకుంటున్న అణ్వస్త్ర తయారీ కార్యక్రమానికి సంబంధించిన వ్యవస్థలను ధ్వంసం చేయాలన్నది ఇజ్రాయిల్ ప్రకటిత లక్ష్యం. కానీ, ఆ అణ్వాయుధ ప్రయోగాలు జరుగుతున్న బంకర్లను(సురక్షిత భూగర్భ స్థావరాలను) ధ్వంసం చేసేంత సైనిక సామర్థ్యం ఇజ్రాయిల్ వద్ద లేదు. ప్రస్తుతం ఉన్న విధంగానే గగన తలంలో ఉధృతిగా యుద్ధం కొనసాగితే ఇజ్రాయిల్ వాయుసేన పెద్ద ఎత్తున ఒత్తిడికి లోనవుతుంది.
అమెరికా తమ తరఫున యుద్ధానికి దిగాలని ఇజ్రాయిల్ ఒత్తిడి చేస్తున్నదని అమెరికా మీడియా వెల్లడించింది. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేశారు. అటువంటి మాటకు అవకాశం లేదని చెప్తూనే, అయతుల్లా ఖమేనీ ఒకవేళ యుద్ధంలో ఇజ్రాయిల్ పక్షాన అమెరికా కదనరంగంలోకి దిగితే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
అంటే ఈ యుద్ధం ముందు ముందు ఏ దిశ తీసుకుంటుందనేది అమెరికా తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ట్రంప్ ముందున్న మార్గమేంటంటే, యుద్ధాన్ని ప్రారంభించిన నేతన్యాహును కట్టడి చేయటం. యుద్ధాన్ని నిలుపుదల చేయించడం. ఇజ్రాయిల్ దాడులు ఆపేస్తే తాము కూడా ఆపేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఇజ్రాయిల్ దాడులు నిలిపివేయడం అంటే ఇరాన్ ప్రభుత్వం, వారి అణ్వస్త్ర కార్యక్రమం యధాతధంగా కొనసాగటమే. అలా జరిగితే అది నెతన్యాహుకు ఓటమి కిందనే లెక్క. అలాకాదని ఇజ్రాయిల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులు కొనసాగితే నెతన్యాహు దేశీయంగా పెద్ద ఎత్తున రాజకీయ ప్రతిఘటనకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో అమెరికా ఏ వైఖరి తీసుకుంటుందన్నది ముఖ్యమైన అంశంగా మారింది.
ఇరాన్కున్న ప్రత్యామ్నాయాలు..
యుద్ధంలో ఇజ్రాయిల్తో అమెరికా జత కడితే అది ఇరాన్కు పెద్ద నష్టం. ఇజ్రాయిల్ చుట్టూ ఉన్న అమెరికా స్థావరాల మీదకు ఇరాన్ క్షిపణులు దూసుకెళ్ళకుండా ఇరాన్ ఇప్పటి వరకు సంయమనం పాటించింది. జాగ్రత్తలు తీసుకుంది. ఒక వేళ ఇజ్రాయిల్ విజ్ఞప్తిని మన్నించి అమెరికా రంగంలోకి దిగితే ఇరాన్ కూడా తన ఎదురుదాడులను తీవ్రతరం చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. పశ్చిమాసియా ప్రాంతంలో 40 వేలమంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలు ఇరాన్ దాడుల తొలి లక్ష్యం కావచ్చు. ఇరాక్లో షియా తెగకు చెందిన సాయుధ శక్తులతో ఇరాన్ సత్సంబంధాలు కలిగి ఉంది. గల్ఫ్ కేంద్రంగా అమెరికా దాడులకు దిగితే పర్షియన్ గల్ఫ్ కేంద్రంగానున్న అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతం యావత్తు యుద్ధమేఘాలలో మునిగిపోయే ప్రమాదం ఉన్నది.
జాతీయ భద్రతా వ్యవహారాలకు సంబంధించిన ఇరానియన్ పార్లమెంట్ కమిటీ అధ్యక్షవర్గ సభ్యుడిగా ఉన్న బెహ్నాం సయీది మాటల్లో ఇరాన్ ముందు మరో మార్గం కూడా ఉన్నది. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ను కలిపే జలమార్గం హార్ముజ్ గల్ఫ్ను మూసేయటం. అరేబియన్ సముద్రంలోకి ప్రవేశించే వాణిజ్య నౌకలన్నీ దూరం తగ్గించుకోవడం కోసం హార్ముజ్ గల్ఫ్ గుండా ప్రయాణం చేయాల్సిందే. దాదాపు చమురు వాణిజ్యానికి ఉపయోగించే నౌకల్లో 20 శాతం నౌకలు ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే ప్రయాణిస్తాయి. ఈ జలసంధిని మూసేయాలని ఇరాన్ నావికాదళం నిర్ణయించుకుంటే అంతర్జాతీయ వాణిజ్యం ప్రధానంగా చమురు ఉత్పత్తుల ఆధారిత వాణిజ్యం కకావికలవుతుంది. ఎర్ర సముద్రం మీదుగా వెళ్లే వాణిజ్య నౌకలపై దాడి చేయటానికి యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థకు చెందిన హౌతీలు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ వాణిజ్య నౌకలు ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించాల్సిన అవసరం లేదు. యెమెన్ రాజధాని సానాతో సహా ఈ దేశంలో ఎక్కువ ప్రాంతంపై హౌతీల పట్టు బిగింపు ఉంది.
ఇక ఇరాన్ ముందున్న మూడో మార్గం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలగి, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో సంబంధాలు తెగతెంపులు చేసుకోవడం. ఒకవేళ ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంటే అణ్వస్త్ర తయారీకి సంబంధించి అంతర్జాతీయ ఆంక్షల విషయంలో ఇరాన్ భయపడిల్సినది ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ సంస్థల్లో భాగస్వామ్యం అంటే అణ్వస్త్ర పరిశోధనల విషయంలో కొంత మేరకు అయినా అంతర్జాతీయ షరతులకు లోబడి పని చేయటం. ఈ సంస్థల నుంచి వైదొలగటమంటే ఆ దేశంపై మరెవ్వరూ ఆంక్షలను సాకుగా చూపించి చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. ఉత్తర కొరియా కూడా 2003లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి బయటకు వచ్చిన తర్వాత 2006లో అణ్వస్త్ర ప్రయోగం పూర్తి చేసుకుంది.
అయితే, ఇక్కడున్న సమస్య ఏంటంటే పై మూడు మార్గాల్లో ఏ మార్గాన్ని ఇరాన్ ఎన్నుకున్నా అది ప్రస్తుతం జరుగుతున్న దాడులను మరింత ఉధృతం చేయటానికే దారి తీస్తుంది. అమెరికా నుంచి పెద్ద ఎత్తున సైనిక దాడిని ఎదుర్కునే పరిస్థితికి ఇరాన్ను ఈ నిర్ణయాలు నెడతాయి. ప్రస్తుతానికి ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ మెట్టు దిగటానికి సిద్ధంగా లేవు.
అనువాదం: కొండూరి వీరయ్య
(ది హిందూ సౌజన్యంతో ప్రచురితం)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.