
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు సుమారు 5 లక్షల మందిలో 3లక్షల మంది అదివాసులే! ప్రాజెక్టు రాకముందు వరకూ వారికి ఇదేమిటో ఏమాత్రం తెలియదు. తమ తమ గ్రామాలు, అడవులు, నదులు, వాగులు, అసలు తమ జీవన ప్రపంచంలో నుంచి వారు హఠాత్తుగా గెంటివేయబడినారు.
ప్రాజెక్టు ప్రారంభమై 20 సంవత్సరాలు గడిచాయి. ఒక లక్ష ఆరువేల కుటుంబాలలో కేవలం 13 వేల కుటుంబాలకే కాగితాలపై పునరావాసం కల్పించబడింది. వీరిలో కూడా కొందరికి ఆర్ అండ్ ఆర్ (రీ హబిలిటేషన్ & రీ సెటిల్మెంట్ ) పరిహారాలు అందితే, కొందరికి వాళ్ళ ఇళ్ళ నష్ట పరిహారాలు కూడా అందలేదు. కత్తెనపల్లి అనే గ్రామంలో 70 కుటుంబాలలో ఏ ఒక్కరికీ ఇళ్ళకు నష్టపరిహారం కానీ, ఆర్ అండ్ ఆర్ పరిహారం కానీ ఏదీ ఈ రోజుకూ అందలేదు. కొండమొదలు పంచాయితికి చెందిన నేలదోనెలపాడు ఆర్ అండ్ ఆర్ కాలనీలోని మొత్తం 500 కుటుంబాలలో 87 మందికి అన్ని అర్హతలు ఉన్నా నష్టపరిహారాలు, ఆర్ అండ్ ఆర్ పరిహారాలు అందలేదు. వారి వారి గ్రామాల నుంచి ఖాళీ చేయిoచడానికి అధికారులు ఎన్నో మాయమాటలు చెప్పారు. మీరు ముందు ఖాళీ చేయండి, మీ డబ్బులు మీకు పడతాయని చెప్పారు. బలవంతంగా ప్రజలను తరలించారు. గ్రామాలకు కరెంటు సరఫరా నిలిపివేసారు. రేషన్ ఆపివేసారు, వైద్య సహాయకులను గ్రామాలకు వెళ్ళకుండా ఆపివేసారు. ఆదివాసులు ఖాళీచేసి వచ్చాక ఇప్పుడు పోర్టల్ ఓపెన్ కావడంలేదు. అది ఓపెన్ అయినప్పుడు మీకు డబ్బులు పడతాయని చెప్పుతున్నారు.
చివరకు తమ భూములు, అడవి కోల్పోయిన ఆదివాసులు ఈ కాలనీలలోకి వచ్చారు. దున్ను కోవడానికి భూమిలేదు. అడవి లేదు, కూలిపనులు తప్ప మార్గం లేదు. వీరంతా ఇప్పుడు తీవ్రమైన శ్రమదోపిడికి గురౌతున్నారు. మహిళలు అర్థరాత్రి పనుల కోసం చాలా దూరాలు ప్రయాణించి మరల సాయంత్రాలకు ఇళ్ళకు చేరుతున్నారు. అక్కడా కూలీ ఎగవేతలు జరుగుతున్నాయి. నిరాశ, నిస్పృహలతో యవకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆదివాసీ సమాజాలలో ఎన్నడూ లేని ఆత్మహత్యల ధోరణి యువకులలో పెరుగుతున్నది. ఈ నిరాశే మనుషులను తాగుడుకు బానిసలు చేస్తున్నది.
భూమి, అటవీ వనరులే ఆదివాసీల మనుగడకు కీలకం! పునరావాస కాలనీలలోకి తరలించే వరకూ ప్రతి ఆదివాసి కుటుంబమూ రైతు కుటుంబమే, రైతు జీవితం నుండి చౌక కూలీలుగా ఆదివాసులను మార్చడమే ఇప్పుడు పునరావాసంలో కనపడుతున్న అసలు నీతి!
భుమి కోసం కొండమొదలు ఆదివాసులు చాలా కాలంగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. 1982 నవంబర్ 29వ తేదీన భూస్వాములు పోలీసులు కుమ్మక్కై సాగించిన కాల్పుల్లో కుంజం రాజులు, మడెం లక్ష్మయ్య అమరులయ్యారు . అమరుల త్యాగాలతో భూములను పోరాడి సాధించుకొన్నాక వారి జీవితాలలో వచ్చిన గొప్ప మార్పులను వారు గుర్తించారు. భూమే వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
వారి భూమి హక్కులు కాలరాచే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, 2015 లో హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొన్నారు. అధికారులు మీరు కేసులు వెనక్కి తీసుకొంటే మీ భూములు 426 ఎకరాలు కొనుగోలు చేసి అప్పగించుతామని చెప్పారు. దీనికోసం ఒక అవగాహనపూర్వక ఒప్పందం (ఎం.ఓ.యూ) చేసుకొందామని చెప్పారు. మీరు ఇదే విషయంగా, హైకోర్టులో చెపితే మేము అంగీకరిస్తామని ఆదివాసులు చెప్పారు. 22-6-2017 లో ప్రభుత్వం వారితో ఒక ఎం.ఓ.యు.ను కుదుర్చుకొన్నారు. చెప్పిన విధంగానే ఆదివాసులు హైకోర్టు లోని 4 కేసులను ఉపసంహరించుకొన్నారు. ఇది జరిగి 8 ఏళ్ళు అవుతున్నా, భూములలో ఒక్క సెంటు ఈరోజుకూ ఆదివాసులకు ఇవ్వలేదు. అయినా అదివాసులు వారి నాయకులు నిరంతరం గిరిజన సంఘ నాయకత్వాన పోరాడుతూనే వస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం భూములకు నోటిఫికేషన్లు ఇచ్చింది. భూముల కొనుగోలు కోసం 43 కోట్ల రూపాయిలు కేటాయించింది. 426 ఎకరాలలో 167 ఎకరాలు ఇప్పటికే సేకరించింది. కానీ ఈ తొలకరి నాటికి మొదటి విడతగా ఈ భూములనైనా ఇమ్మని ఆదివాసులు కోరుతున్నారు. తొలకరి వస్తున్నది. వాటిని వెంటనే అధికారులు ఆదివాసులకు అప్పగించాలని, మిగిలిన వాటికి నిధులు విడుదల చేసి భూములు సేకరించి అప్పగించాలని ఆదివాసులు కోరుతున్నారు. కత్తనపల్లి గ్రామానికి 70 కుటుంబాలకు, ఇంకా మిగిలిన గ్రామాల 87 మందికీ ఇళ్ళ సష్టపరిహారాలు ఆర్ అండ్ ఆర్ పరిహారాలు అందచేయాలి.
పంచాయితీ కేంద్రానికి 2 కి.మీ లో దూరంలో ఉండి, 500 పైబడిన ఓటర్లు ఉన్న ఆదివాసి గూడాలను ప్రత్యేక పంచాయితీలుగా గుర్తించాలన్న జి.ఓ. ఎం.ఎస్. 63 ప్రకారం కొండమొదలు పెదకాలని (నేలదోనెలపాడు), పెదభీంపల్లి – 3 కాలనీ తదితర కాలనీలను ప్రత్యేక అదివాసి పంచాయితీలుగా వెంటనే నోటిఫీకేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక పంచాయితీలోని గ్రామాలు దూరంగా విడిపోయాయి. వాటికి నిధులను ప్రభుత్వం కేటాయించనందున తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఆ విధంగా ప్రత్యేక పంచాయితీలు ఏర్పరచాలని అక్టోబరు 2024 లోనే గ్రామసభలు తీర్మానాలు చేసి పంపాయి. కనుక జోవో 63 ను అమలు చేయాలి.
పోలవరం నిర్వాసితుల కష్టాలు బాధలు లోతైనవి. ఆదివాసీలలో ఒక తెగ దాని ఉనికిని కోల్పోయిన తీవ్రమైన పరిస్థితి ఇది. విలీన మండలాల పరిస్థితి ఇలాగే దారుణంగా ఉంది. నిరంతరం ముంపులోనే వారుంటున్నారు. నిర్వాసితులందరి అసలైన జీవితం మాత్రం నాశనమౌతున్నది. భూమి, వనరులపై జీవించే అవకాశం ఇవే ఆదివాసులకు అవసరం. కనుక పోలవరం నిర్వాసితుల ఆసలు మౌలిక జీవిత సమస్యను అర్ధంచేసుకొని, వారి మౌలిక సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకోవాలి.
సింహాద్రి ఝాన్సీ
అధ్యక్షులు, రైతు కూలీ సంఘం, ఆంధ్ర ప్రదేశ్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.