
ఇటీవల ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం(తెలుగు)కు గాను ప్రసాద్ సూరాడ రాసిన “మైరావణ” ఎన్నికైంది. తెలుగులో వాడ బలిజల నేపథ్యంలో వచ్చిన మొదటి నవల ఇది. మ్యాజికల్ రియలిజాన్నీ జానపదంతో అల్లి చెప్పిన విషయమే ఈ నవల.
ఎవ్వరి కథ వారే చెప్పుకోవాలి. ఆ చెప్పడంలో నిజాయితీ, నిర్భీతి ఉండాలి. కానీ అందరికీ ఈ ఆలోచన రాదు. కొన్ని సమూహాలకైతే ఇప్పటివరకూ కూడా తమ గొంతు వినిపించే అవకాశమైనా రాలేదు. దీని వలన సోకాల్డ్ సాహిత్యం పేరిట జరిగిన ప్రమాదం ఏంటంటే ఒకరి గురించి వేరెవరో తమకు తోచినట్టుగా రాసుకుపోతేనూ, చెప్పుకుపోతేనూ అదే నిజమకొనింది సమాజం.
చింతా దీక్షితులు 1924లో రాసిన ‘చెంచురాణి’ లోనిది అసలైన చెంచు జీవితం కాదని, చెంచు రచయిత తోకల గురవయ్య ‘చెంచు కథలు’ రాసే వరకూ లోకానికి తెలియదు. రచనల మాటున ‘ప్రమాదం’ ఎటువంటిదో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. తెలుగు సాహిత్యం నుంచి ఇటువంటి ఉదాహరణలు ఎన్నైనా ఇవ్వొచ్చు.
కాబట్టి, దీనికి విరుగుడుగా ప్రతి కులం(అందమైన, సౌఖ్యమైన ‘సామాజిక వర్గం’ అనే ముసుగు పదబంధం వాడనందుకు జడుసుకోకండి) నుంచి ఓ రచయిత రావాలి. తాను ఏ ప్రభావాలకు లోనుకాకుండా తననూ, తనవారినీ, తాను మాత్రమే చెప్పగల తన కుదురుకు సంబంధించిన అన్నిటినీ నమోదు చేయగలగాలి.
అలాగ రచయిత తాను చెప్పాలనుకున్నదానితో అనుభవపూర్వకంగా మమేకమై ఉన్నప్పుడు లేదా అది తన జీవితంతో ముడిపడిందైనప్పుడు, ఏం రాశాడు? ఎలా రాశాడు? దానితో సామాజిక ప్రయోజనం ఏముంది? ఏం సందేశం ఇచ్చాడు వగైరా బూజు పట్టిన పాత చింత తొక్కు విమర్శక కొలమానాల్లోంచి కాకుండా ఎంత ప్రేమతో, తపనతో, పారదర్శకతతో, ఎంతగా గుండె చీల్చుకుని రాశాడన్న దృక్కోణం నుంచి చూడాల్సి ఉంటుంది.
జానపద వీరుడి వంటి బెస్త మైరావణుడు ప్రధాన పాత్రగా, భారతదేశ గత ఎనభై ఏళ్ళ సామాజిక చరిత్రకు వర్తమాన రాజకీయ అంశాలను చేర్చి బలమైన తర్కంతో సాగింది ఈ నవల. జానపద వీరుడు అంటేనే ‘అధికార మదానికి, పీడనకీ’ లొంగనివాడు, తల తెగిపడుతున్నా చెదరనివాడు కనుక రచయిత దీని ద్వారా ఏమి చెప్పదల్చారో పాఠకులు సులభంగానే గ్రహించగలరు.
మరొక విశేషం ఏంటంటే బెస్తవారి నిజజీవితాన్ని తెలుగులో ఈ నవలే తొలిసారిగా స్పష్టంగా చిత్రిస్తోంది. సమూహాన్ని బట్టి ఏవో అపోహలు స్థిరపడి ఉన్న సమాజంలో చావుకి తెగించే బెస్తల వేట వైనాన్నీ, కడుపు చేతపట్టుకొని తరలిపోయే వారి వలస జీవనాన్నీ బైట ప్రపంచానికి తెలియని కోణాల నుంచి దగ్గరగా చూపుతోంది.
ఇలాగ తన నేపథ్యాన్ని మరచిపోకుండా ప్రయోగాత్మకంగా రచన చేయడంలో ప్రసాద్ సూరి సఫలమైయ్యారు. రెండవ రచనకే అతను ఈ ఒడుపు, నేర్పు సాధించడంలో ఆశ్చర్యమేమీ లేదు. తనదైన కథ చెప్పుకోవడంలో అతని తపన, ప్రేమ వంక పెట్టలేనివి కనుకనే ఇలా సాధ్యమై ఉంటుంది. లోతుగా వల వేయండి అంటూ మనుషులని పట్టే జాలరి గురించి బైబిల్ చెప్పినట్టు, ఇతను తన మూలాల లోతుల్లో వలవేసి కథలు తెచ్చే జాలరి. ఈ పుస్తకాన్ని ప్రచురించినట్టే ముప్పై ఐదేళ్లలోపు వయసున్న రచయితలను ప్రోత్సహించేందుకు ఛాయా పబ్లికేషన్స్ ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.