
హైదరాబాద్, ఏప్రిల్, 16: తెలంగాణాలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అతి పెద్దదైన వర్ధమాన మహావీరుని శిల్పాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేష్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన బుధవారంనాడు సిద్దిపేట జిల్లా, మండల కేంద్రం నంగునూరులోని చిన్న కొండపైన ఉన్న జైన శిల్పాన్ని పరిశీలించారు.
9 అడుగుల ఎత్తు మూడున్నర అడుగుల వెడల్పుగల, కాయోత్సర్గాసనంలో నిలబడి, మోకాళ్ల వరకూ కూరుకుపోయిన మహావీర శిల్పం, తలపై ఉష్ణీష చిహ్నంతో రాష్ట్రకూటుల కాలపు (క్రీ.శ.9వ శతాబ్ద) జైన తీర్థంకర ప్రతిమాలక్షణానికి అద్దం పడుతుందని ఆయన అన్నారు. కొండకు దిగువన చుట్టూ ఉన్న ఇటుకరాతి శకలాలు, తుప్పల్లో ఒకరాతి స్థంభంపై పద్మాసనంలో కూర్చొని ఉన్న మహావీరుని శిల్పం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న జైన తీర్థంకరుల శిల్పాలు, నంగునూరు 1100 సం॥ల నాటి జైన కేంద్రమని, అక్కడొక జైనబసది ఉండేదని తెలియజేస్తున్నాయన్నారు.
అరుదైన ఈ అపురూప జైన విగ్రహం చుట్టూ గల రాతిని తొలగిస్తున్నారని తద్వారా 11 శతాబ్దాల నాటి చారిత్రక ప్రాముఖ్యతగల శిల్పానికి ప్రమాదమేర్పడిరదని, ఇప్పటి నుంచైనా క్వారీ పనులను ఆపి, ఆ విగ్రహాన్ని కాపాడుకోవాలని నంగునూరు గ్రామ ప్రజలకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అహోబిలం కరుణాకర్, పవన్, ప్రముఖ శిల్పి బి. సుధాకర్ సింగ్ పాల్గొన్నారని ఆయన చెప్పారు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.