
ద వైర్ పరిశోధనాత్మక కథనం
పేరుకి మాత్రమే కంపెనీ, నామమాత్రపు అడ్రస్..! ఫోన్ నెంబర్, ఈ-మెయిల్, వెబ్ సైట్ లేని కంపెనీకి కోట్ల రూపాయిల భూములు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు. 10 లక్షల క్యాపిటల్తో రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 వేల కోట్ల పెట్టుబడికి కంపెనీ రెడీ. ఊరు పేరు లేని కంపెనీతో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందం.
బాలకృష్ణ ఎమ్, సీనియర్ జర్నలిస్ట్
“విశాఖలో పెట్టుబడుల కోసం టీసీఎస్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూకేటాయింపు” ఈ వార్త ఇటీవల క్యాబినెట్ సమావేశం తర్వాత వార్తా పత్రికలు, మీడియా హైలెట్ చేసి పతాక శీర్షికలు ఎక్కించిన అంశం. అయితే క్యాబినెట్లో వివిధ కంపెనీలకు ప్రభుత్వ భూకేటాయింపులను లోతుగా పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. టీసీఎస్ దేశంలోనే ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఒకటి. 2024- 25 ఆర్థిక సంవత్సరానికి 48,554 కోట్ల లాభాలు సంపాదించింది. దేశ విదేశాల్లో దగ్గర దగ్గరగా లక్ష మందికి పైగా సాఫ్ట్వేర్ రంగంలోనే ఉపాధి అవకాశాలు కల్పించింది. హైదరాబాద్ గ్లోబల్ సాఫ్ట్వేర్ మ్యాప్లోకి చేరటానికి టిసిఎస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కంపెనీలు కూడా కారణం. అటువంటి కంపెనీలకు ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వటం షరా మామూలే. జనం కూడా అర్థం చేసుకునే విషయమే.
4.62 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఏపి ప్రభుత్వం అనుమతులు..
స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా 4.62 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ఇప్పటి వరకు అమోదం లభించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం పెట్టుబడిదారులు చేసిన ప్రతిపాదనలకు ఆధారంగా ఏప్రిల్ 10వ తేదీన జరిగిన బోర్డులో చేసిన తీర్మానాలకు అనుగుణంగా పలు సంస్థలకు భూ కేటాయింపులకు క్యాబినెట్ అమోదం తెలిపింది. పెట్టుబడులు, సమగ్ర ప్రాజెక్టులతో ముందుకు వచ్చే సంస్థలకు వాటికి అవసరమైన భూముల కేటాయింపు, సక్రమంగా ఆమోదించడం, మౌలిక వసతులను కల్పించడం ,సంబంధిత విధి విధానాల ప్రకారం ప్రోత్సాహకాల అమలుకు ప్రత్యేక ప్యాకేజీని విస్తరించడం వంటి అంశాలకు లోబడి టాటా కన్సల్టెన్సీకు భూములు కేటాయించారు.
అదే రోజున మరో కంపెనీకి కూడా 59 ఎకరాలు కేటాయించిన విషయం మాత్రం పెద్దగా మీడియా దృష్టినాకర్షించలేదు. కారణమేంటంటే, ఆ లబ్దిదారు కంపెనీ ఒకటి ఉందనే విషయమే పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు తెలియకపోవటమే. ఇక జనానికి ఏం తెలుస్తుంది? ఈ విషయాన్ని గుర్తించిన ద వైర్ తెలుగు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం నిర్ణయాల ఆధారంగా కూపీలాగితే నమ్మలేని నిజాలు ఎన్నో బయటపడ్డాయి. ఈ నమ్మలేని నిజాలు పాఠకుల దృష్టికి తీసుకురావడానికే ఈ పరిశోధనాత్మక కథనం.
ప్రతిష్టాత్మక టిసిఎస్కు భూములు చౌకగా కేటాయిస్తే హైటెక్ సిటీ, మాదాపూర్లా విశాఖలోని రిషికొండ కూడా అంతర్జాతీయ ఐటి చిత్రపటం మీదకు వస్తుందన్న అభిప్రాయాన్ని కలుగచేస్తూ పనిలో పనిగా ఉర్సా అనే ఊరూ పేరూలేని రెండు నెలలు కూడ నిండని కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 59 ఎకరాలు కేటాయించింది. ఈ రెండు నెలల వయసు ఉన్న కంపెనీకి టీసీఎస్కు భూమిచ్చిన చోటే 3.6 ఎకరాలు, ఐపి కాపులుప్పాడలో 56 ఎకరాలు మొత్తం 59 ఎకరాలు ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం ఇంత భారీ మొత్తంలో ఈ కంపెనీకి భూములు ఎందుకు కేటాయించింది అనే అంశంపై ద వైర్ పరిశోధన చెయగా విస్మయానికి గురి చేసే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐటి రంగంలో ఊరూ పేరూ తెలీని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉదారత చూపించింది. అసలు ఈ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏంటి? దాని యజమానులు ఎవరు? సాఫ్ట్వేర్ మార్కెట్లో దానికున్న గుర్తింపు, ఇప్పటి వరకూ ఆ కంపెనీ సాధించుకున్న గొప్ప విజయాలు, కాంట్రాక్టులు, కల్పించిన ఉపాధి వివరాలు గురించి పాఠకుల ముందుపెట్టేందుకే ఈ ప్రయత్నం.
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామంటూ దూసుకెళుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బడా పరిశ్రమలను ఆహ్వానిస్తోంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ జులై 2024 నుండి ఐదుసార్లు సమావేశమై రాష్ట్రంలో వ్యాపారానుకూల వాతావరణాన్ని కల్పించేందుకు పలు చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏప్రిల్ 10న జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశంలో 17 సంస్ధలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఆయా పరిశ్రమల స్థాపనకు వివిధ జిల్లాల్లో భూముల కేటాయింపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖలో టీసీఎస్ లాంటి దిగ్గజ సంస్థలకు భూమిని తక్కువ ధరకు కేటాయించింది. టిసిఎస్తోపాటు రాయితీ ధరలకు భూములు పొందిన మరికొన్ని సంస్దల ఎంపిక మాత్రం విమర్శలకు తావిస్తోంది. దానిలో ప్రముఖంగా ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి విశాఖలో ఏకంగా 59 ఎకరాలు కేటాయించడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. రెండు నెలల క్రితం పుట్టించిన కంపెనీపై ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి.
విశాఖపట్నంలోని ఐటి హిల్ నం 3లో 1,370 కోట్ల పెట్టుబడితో ఐటి క్యాంపస్ ఏర్పాటు కోసం 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్కి మొత్తం 21.16 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అదే టిసిఎస్ క్యాంపస్ పక్కన ఐటి పార్క్లో 3.5 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి కేటాయించారు. దాంతోపాటు ఐపి కాపులుప్పాడలో 56.36 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి కేటాయించారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ(ఎఐ) డేటా సెంటర్ ఏర్పాటుకు 5,728 కోట్ల పెట్టుబడితో ఉర్సా క్టస్టర్స్ కంపెనీ ముందుకొచ్చిందన్నది ప్రభుత్వం వాదన. ఆ సెంటర్ ఏర్పాటుకోసం ఈ భూమిని కేటాయించింది. అయితే భూమి కేటాయింపు వివరాలూ, అనుబంధ షరతులూ, పెనాల్టీ క్లాజులు గురించిన పూర్తి నోటిఫికేషన్ ఇంకా జారీ కాలేదు. రావల్సిన వివరాలు ఎలా ఉన్నా రెండు నెలల ముందు పెట్టిన ఈ కంపెనీకి అంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టే సత్తా ఉందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం ఎక్కడ, ఎవరితో మదింపు చేయించింది, ఈ మదింపు నివేదిక సారాంశం ఏంటి, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన అనుభవం, సామర్ద్ధ్యం విషయంలో ప్రభుత్వాన్ని నమ్మించటానికి, ఒప్పించటానికి ఉర్సా కంపెనీ చేసిన ప్రయత్నాలు ఏమిటనే విషయాల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
అసలేంటీ ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్? ఎప్పుడు పుట్టింది?

కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెబ్సైట్ వివరాల ప్రకారం ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా సరిగ్గా రెండు నెలల క్రితం 2025 ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. 10 లక్షల రూపాయల ఆథరైజుడు క్యాపిటల్, లక్ష రూపాయల పెయిడప్తో ఇద్దరు డైరెక్టర్లతో ఈ కంపెనీ రిజిస్టరు చేశారు. ఇందులో డైరెకర్ట్స్గా కౌశిక్ పెందుర్తి, సతీష్ అబ్బూరి ఉన్నారు. కౌశిక్ పెందుర్తి ప్రస్తుతం టాలస్ పే అనే కంపెనీలో సీపీటీవోగా విధులు నిర్వహిస్తుట్లు ఆయన లింక్డెన్ అకౌంట్ తెలియచేస్తోంది. అంటే కౌశిక్ అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఓ స్థాయిలో పని చేస్తున్న ప్రైవేటు ఉద్యోగి. సతీష్ అబ్బూరి ఎలిసియం అనలిటిక్స్ కు వ్యవస్థాపకుడు, ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా వ్యవహారిస్తోన్నారు. దీంతో పాటు యూఎస్లో రిజిస్ట్రర్ చేసిన ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. ఇందులో కూడా ఈ ఇద్దరే డైరెక్టర్స్గా వ్యవహారిస్తోన్నారు. అయితే ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిటీ కంపెనీకి కూడా ఏపీలో కూటమీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల తరువాత 2024 సెప్టెంబర్ 27న రిజిస్టర్ చేశారు. ఈ కంపెనీకి అనుబంధ సంస్థగా చెప్పుకుంటూ ఇండియా ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను 2025 పిబ్రవరి 19న రిజిస్టర్ చేశారు. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అడ్రస్గా “ప్లాట్ నెంబర్ 705 ఏక్తా బాసిల్ హైట్స్ కొత్తగూడ, హైదరాబాద్, తెలంగాణ 500084” ఒక రెసిడెషియల్ అపార్ట్మెంట్లో ప్లాట్ను చూపించారు. అయితే ద వైర్ సదరు అడ్రస్కు వెళ్లీ విచారించగా అక్కడ ఎటువంటి కార్యాలయమూ లేదు.

ఆ ప్లాట్లో ఒక ఫ్యామిలి నివాసముంటున్నారు. ఈ అపార్ట్మెంట్ పూర్తిగా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్, ఇందులో 28 ఫ్లాట్లు(ఒక్కో అంతస్తుకు మూడు బెడ్ రూంల వసతి కలిగిన నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి. కేవలం రెండు నెలల వయసున్న, కనీసం ఒక ఆఫీస్, ఫోన్ నెంబర్, వెబ్సైట్ కూడా లేని కంపెనీకి కొన్ని వందల కోట్లు విలువ చేసే భూములు, వేలకోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఇవ్వడం ఇప్పుడు పలు సందేహాలకు దారితీస్తోంది. ఇదీలా ఉంటే 5,728 కోట్ల పెట్టుబడి పెడతామని ముందుకొచ్చిన ఈ కంపెనీ కేవలం10 లక్షల రూపాయల ఆథరైజుడు క్యాపిటల్ను, లక్ష రూపాయిల పెయిడప్ క్యాపిటల్ను మాత్రమే కలిగి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంత తక్కువ పెట్టుబడితో ఎటువంటి అనుభవం లేకుండా కంపెనీ రిటర్న్ గిఫ్ట్గా విశాఖలో వెయ్యి కోట్ల దాకా విలువైన భూములను కొట్టేసింది. ఇలాంటి కంపెనీని ఏపీ ప్రభుత్వం ఎందుకు నమ్మింది. దీని వెనుక ఇంకెవరైనా వున్నారా అన్నది తెలియాల్సివుంది.
కనీసం ఫోన్ నెంబర్స్ లేని కంపెనీలు..
ద వైర్ చేసిన ఇన్వెస్టిగేషన్ లో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉర్సా ఎల్ఎల్సీ అండ్ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయని, ఉర్సా క్లస్టర్సు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ మధ్యనే ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన బోర్డు సమావేశంలో ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ షేర్లు బదలాయించినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఈ షేర్ల ద్వారా ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ రాష్ట్రంలో సుమారు పది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నది. ఆశ్యర్యకరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 10 వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన ఈ రెండు కంపెనీలకు కనీసం ఒక ఫోన్ నెంబర్ కాని, ఈ మెయిల్ ఐడీలు కాని లేవు. దీంతో పాటు ఈ రెండు కంపెనీలు ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేసిన దాఖలాలు కూడా లేవు. ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కనీసం సరైన ఆఫీస్లు కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వంతోనూ ఎంవోయూ..
ఇదిలా ఉంటే దావోస్లో జనవరిలో జరిగిన ప్రపంచ ఎకనమిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీతో తెలంగాణలో 100 మెగావాట్ ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు 5,000 కోట్ల పెట్టుబడి కుదుర్చుకునే నాటికి ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు కూడా కాలేదు. అయితే ఈ ఒప్పందం కుదిరిన నాటికి ఉర్సా ఎల్ఎల్ కంపెనీ యూఎస్లో రిజిస్టరయి మూడు నెలలు మాత్రమే అయ్యింది. కేవలం మూడు నెలల క్రితం పెట్టిన కంపెనీతో 5,000 కోట్ల పెట్టుబడుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం అనుమానాలను కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో 2025 జనవరి 24న ఒప్పందం కుదుర్చుకుంటే ఈ కంపెనీ యూస్లో 2024 సెప్టెంబర్ 27న అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తరువాత రిజిస్ట్రర్ చేశారు. ద వైర్ యూఎస్లో ఉన్న కంపెనీ అడ్రస్కు వెళ్లినప్పుడు ఈ యూఎస్లో ఈ కంపెనీకి సంబంధించి ఎటువంటి ఫోన్ నెంబర్స్ కాని, ఈ మెయిల్ ఐడీలు కాని లేకపోవడం విశేషం.

సింగిల్ ట్రీ సిటి ప్లెసాంటన్, సిఎఫ్ 94588 యూఎస్ఏ అడ్రస్లో ఉన్న ఈ కంపెనీ కూడా కేవలం 1560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక సింగిల్ ఫ్యామిలీ నివసించడానికి సరిపోయే మూడు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లుతో కూడిన ఒక సాధారణ ఇల్లు. అయితే ఇంత చిన్న ఇంట్లో ఉండే కంపెనీ, కనీసం పట్టుమని పదిమంది సిబ్బంది కూడా లేని కంపెనీ అటు తెలంగాణలో ఇటు ఆంద్రప్రదేశ్లో భారీ పెట్టుడులు ఎలా పెట్టగలదనే సందేహాలు వస్తోన్నాయి.
ఉర్సా వెనుక ఎవరున్నారు?
కొత్తగా ఏర్పాటైన కంపెనీ అదీ 10 లక్షల క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్తో మొదలైన కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలలో వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎలా ఒప్పందం కుదుర్చుకోగలిగిందన్నది అందరికీ ఆశ్చర్యంగా వుంటే, దీని వెనుక ఎవరున్నారన్నది కూడా ఆలోచింపజేస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనూ 5,728 కోట్ల ప్రాజెక్టు విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకోగా, ప్రభుత్వం 59 ఎకరాల భూమిని కేటాయించింది. మార్కెట్ ధరల ప్రకారం ఆ భూమి విలువ వెయ్యి కోట్లు వుంటుందంటున్నారు. దీనిద్వారా 2,500 మందికి ఉపాధి లభిస్తుందని మాత్రం ప్రభుత్వం ప్రకటించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.