
మందగించిన ఎగుమతులు ఆర్థికవ్యవస్థ పేలవమైన పనితీరుకు నిదర్శనమని, కొత్తగా ఉపాధి అవకాశాలు రాకపోవడానికి ఆర్థికవ్యవస్థ పతనమే కారణమని ఆర్థికవేత్తలు అంటున్నారు.
న్యూఢిల్లీ: 2025 ఆర్థిక సంవత్సరానికి భారత కార్పొరేట్ కంపెనీల లాభాలు 9.9% పడిపోయాయి. వివిధ కంపెనీలు రోజువారి ఖర్చులు తగ్గించుకోవడానికి ఎంతలా ప్రయత్నించిన లాభాల రేటు పతనాన్ని నిలువరించలేకపోయాయి. ఈ సంవత్సరం(2025- ఆర్థిక సంవత్సరం)పతనమైనట్టుగా గత నాలుగేళ్లలో కార్పొరేట్ రంగం లాభాలు పడిపోలేదు.
కార్పొరేట్ రంగంలో దిగ్గజాలని చెప్పుకుంటున్న ఒక శాతం కంపెనీలు కూడా తమ సాలుసరి అమ్మకాల వృద్ధిరేటు 6.2 శాతానికి మించి ముందుకు సాగలేకపోయాయని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కథనం వెల్లడించింది.
దేశంలో మూడువేల ముప్ఫై ఐదు కంపెనీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల సగటు వృద్ధిరేటు 2024- 25 ఆర్థిక సంవత్సరంలో 4.9% మాత్రమే నమోదు అయ్యింది. మరోవైపు వేతనాలపై పెట్టే ఖర్చు కేవలం 7శాతం మాత్రమే పెరిగింది. గత నాలుగేళ్లలో ఇది అధమస్థాయి పెరుగుదలగా చెప్పుకోవచ్చు. వివిధ కంపెనీలు వెల్లడించిన వివరాల ప్రకారం, తమ సిబ్బందిపై సాధ్యమైనంతగా ఆయా కంపెనీలు వేటు వేస్తున్నాయి. ఐటీ రంగంలో నియామకాలు అంతా ఆశాజనకంగా లేవు.
ఆసియా దేశాలలో వేగంగా విలువ కోల్పోతున్న ఏకైక కరెన్సీ రూపాయి..
ఇదిలా ఉండగా, గత మూడు నెలల్లో రూపాయి విలువ అత్యంత వేగంగా పతనమైంది. మరే దేశపు కరెన్సీ ఇంత వేగంగా పతనం కాలేదు. రిజర్వ్ బ్యాంక్ విదేశీ నిలువల తరగుదలను నివారించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభావం రూపాయి విలువను నిలబెట్టడానికి ఉపయోగపడడం లేదు. లూంబర్గ్ కథనం ప్రకారం ఆర్బీఐ మరిన్ని డాలర్లను కొనుగోలు చేయడానికి సిద్ధపడింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నివేదిక ప్రకారం, ఆర్బీఐ ఇదే స్థాయిలో డాలర్లు కొనుగోలు చేస్తూ పోతే 2025 డిసెంబర్ నాటికి ఒక డాలర్కు 86.5 రూపాయలు సమానం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
2024 సెప్టెంబర్లో 705 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారకం విలువ 2025 మే 23 నాటికి 693 బిలియన్ డాలర్లకు పడిపోయింది. భవిష్యత్తులో డెరివేటివ్స్ రూపంలో దఫదఫాలుగా డాలర్లు అమ్మడానికి సిద్దమవుతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి అనుగుణంగా డాలర్ విలువ పెంచుకొనే ప్రయత్నంలో ఉంది.
ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి 73 బిలియన్ డాలర్ల మేర ఆర్బీఐ చెల్లింపులు చేయాల్సి ఉంది. ఫిబ్రవరి 2025లో 88.8 బిలియన్ డాలర్లు చెల్లింపులు చేసింది. దానికంటే ఏప్రిల్లో చేసిన డాలర్ చెల్లింపులు తక్కువ. ఇవన్నీ మూలుగుతున్న ఆర్థికవ్యవస్థకు చిహ్నాలు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.