
నాకు గుర్తున్నంతవరకు జమ్మూ కశ్మీర్ ప్రకృతి దృశ్యంలోనే సైనిక ఉనికి అంతర్భాగంగా ఉంది. 1990 తిరుగుబాటు తర్వాత, ముఖ్యంగా కశ్మీర్ ప్రాంతంలో, ప్రతి అంగుళము భద్రతా దళాల కనుసన్నల్లో ఉంది. నా బాల్యంలో కంటే ప్రస్తుతం ఈ ప్రాంతంలో సైనిక ఉనికి ఎక్కువ అయ్యింది.
సాధారణ జనజీవన స్రవంతిలో సైన్యం అంతర్భాగం అయింది. మీరు పర్యాటకుడిగా చుట్టూ ఉన్న ప్రదేశాలు చూడటానికే వెళ్తేనే లేదా మారుమూల గ్రామాలకు ట్రెక్కింగ్ కోసం వెళ్తేనో, గత మూడున్నర దశాబ్దాలుగా సైన్యం, పారామిలిటరీలు లేదా పోలీసులు ప్రతిచోటా బలీయమైన ఉనికిని కలిగి ఉన్నారనే వాస్తవం తెలుస్తుంది. వారి సిబ్బంది, బంకర్లు లేదా కంటోన్మెంటులు తప్పక కనిపిస్తాయి.
ఇటువంటి పరిస్థితుల్లో పర్యాటకులను ఆకర్షించడానికి మినీ స్విట్జర్లాండ్గా ప్రభుత్వం ప్రచారం చేస్తున్న పర్యాటక ప్రదేశాన్ని పూర్తిగా అసురక్షితంగా ఎందుకు వదిలివేశారన్న వాస్తవం దిగ్భ్రాంతికరంగా ఉంది.
25 మంది పర్యాటకులు, స్థానిక పోనీ ఆపరేటర్ను దారుణంగా కాల్చి చంపిన రోజున బైసరన్ గడ్డి మైదానం చుట్టూ ఉన్న కొండల వద్ద ఎటువంటి భద్రత లేదు. పచ్చిక బయలుకు దారితీసే ట్రాక్ వెంట ఎవరూ లేరు. అంతే కాదు, భద్రతాదళాలు ఆ ప్రదేశానికి చేరుకోవడానికి ఒక గంటకు పైగా పట్టింది, అంతకు ముందే స్థానికులు ప్రాణాలతో బయటపడిన వారిలో ఎక్కువ మందిని రక్షించారు.
డెక్కన్ క్రానికల్ నివేదిక ప్రకారం, బైసరన్కు కేటాయించిన రెండు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కంపెనీలలో ఒకదాన్ని ఈ సంవత్సరం ప్రారంభంలో వేరే చోటికి మార్చారు. ఏవో సాకులు చెబుతూ ప్రభుత్వం భద్రతా లోపాలను అంగీకరించకపోవడం ఆమోదయోగ్యం కాదు. భద్రతా పర్యవేక్షణ తారాస్థాయిలో ఉంది. ఇది హత్యాకాండను నిలువరించడంలో ప్రభుత్వ అసమర్థతను వెల్లడిస్తుంది.
ఇది అసమర్థత ఫలితమా లేదా ప్రభుత్వం కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చేస్తున్న ప్రచారంతో ప్రభుత్వం కూడా కళ్ళు మూసుకున్నాదా అన్నది దేశాన్ని వేధిస్తున్న ప్రశ్న. పర్యాటక హత్యలకు ముందు భద్రతా లోపాల గురించిన కథనాలు సమస్య తీవ్రతను వెల్లడిస్తున్నాయి. ఈ రకమైన భద్రతా లోపాలు పదేపదే పునరావృతం అవుతున్నాయి.
ఈ సంఘటనకు రెండు వారాల ముందు శ్రీనగర్లో భద్రతను భౌతికంగా సమీక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం పూర్తిగా నిర్మూలించబడిందని పదేపదే చెప్పారు. అయినప్పటికీ, భద్రతా అధికారులు ఉగ్రవాద చర్యలు బాగా నియంత్రణలో ఉన్నాయని జాగ్రత్తగానే చెప్పారు.
సాధారణ పరిస్థితులు ఉన్నాయనీ ఎంతగా జబ్బలు చర్చుకున్నా కశ్మీర్ ప్రపంచంలోనే అత్యంత సైనికీకరించబడిన ప్రాంతాలలో ఒకటిగా కొనసాగుతోంది. 2019 తర్వాత కూడా భద్రతా దళాలు నిజమైన భద్రతా ముప్పులను పరిష్కరించడం కంటే ప్రధానంగా పౌర జీవనంపై నిఘా, నియంత్రణకే ప్రాధాన్యత ఇచ్చాయి.
ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఉన్న పొరపాట్లు ఇటువంటి దుష్కృత్యానికి దారితీసిందా? ఉగ్రవాదుల కదలికలపై పహారా కాయాల్సిన సైన్యం ప్రజా జీవితంపై పహారా కాయడానికి తన శక్తి యుక్తులను వెచ్చించిందా? ఇటువంటి తప్పుడు ప్రాధాన్యతలు జాతీయ వ్యూహాత్మక ప్రయోజనాలను ఫణంగా పెట్టాయా? ఈ కారణాలన్నీ లేదా ఇక్కడ ప్రస్తావించిన కొన్నింటి వల్లే భద్రతా ఏర్పాట్లలో లోపాలు ఏర్పడుతున్నాయా? వాస్తవిక, సమగ్రమైన అంచనా లేకుండా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవడం అసాధ్యం అవుతుంది.
ఏప్రిల్ 22 నాటి హత్యలకు సంబంధించిన ప్రభుత్వ స్పందన ద్విముఖ వ్యూహాన్ని పాటించి ఉండాలి. హేతుబద్ధమైన పరిశీలన, లోపాలు సక్రమంగా గుర్తించడం, వ్యవస్థాగత వైఫల్యాన్ని అంచనా వేయడం, లోపాలు పూడ్చడం ఒకవైపు, మరోవైపు దోషులను పట్టుకోవడం లక్ష్యంగా ఉండాలి.
భారతదేశ ప్రతిస్పందన బాగా ఆలోచించి, మూల్యాంకనం చేసి, వాస్తవాల ఆధారంగా దృష్టి సారించి, శస్త్రచికిత్సలాంటి ఖచ్చితత్వంతో అడుగులు వేయాలి. దానికి బదులుగా, ప్రభుత్వ ప్రతిస్పందన ఈ విషయాలపై దేశానికి భరోసా ఇవ్వడానికి బదులు ఏదేదో చెప్తోంది.
ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలనే హడావుడిని గమనిస్తే కీలకమైన భద్రతా లోపాలను దాటవేయడమే కాకుండా, ఆధారాలు లేని అంచనాలపై ఆధారపడి నిర్ణయాలు చేస్తోందా అనే అనుమానం కలుగుతోంది. సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే, భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకోకముందే, పాకిస్తాన్పై నిందారోపణలు వెల్లువెత్తాయి. ఇది తప్పుడు ఆపరేషన్గా అభివర్ణించడం ద్వారా సంక్షోభాన్ని మరింత పెంచింది.
భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు అన్ని సమయాలలో చాలా సున్నితంగా ఉన్నప్పటికీ, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భయంకరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బలూచిస్తాన్ రైలు హైజాక్ గురించి పాక్ ఆర్మీ చీఫ్ చేస్తున్న ఆరోపణలు ఏవీ దర్యాప్తులో నిగ్గు తేలినవి కాదు. ఈ ఆరోపణలను ధృవీకరించే ఆధారాలు లేవు. పాకిస్తాన్ కశ్మీర్లో నిరంతరం జోక్యం చేసుకుంటుందనేది వాస్తవం. గత సంవత్సరం పిర్ పంజాల్లో జరిగిన దాడులు పాకిస్తాన్ సైన్యం, దాని నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పాత్ర గురించిన ఆధారాలు ఉన్నాయన్నది అందరికీ తెలిసిందే.
పాకిస్తాన్కు చెందిన లష్కరే తయ్యబా, దాని అనుబంధ సంస్థలతో సంబంధాలున్న స్థానిక తిరుగుబాటు సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పాత్ర గురించి ఇంకా ప్రభుత్వం, నిఘా వర్గాలు ధృవీకరించలేదు. కానీ వీరిపై అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు ఎంత బలంగా ఉన్నాయంటే వీటిగురించిన వార్తలు చదువుతుంటే ఈ అనుమానాలు వాస్తవాలే అని మనం కూడా నమ్మెంత బలంగా ఉన్నాయి. అయితే, ఈ అనుమానాలు నిష్పాక్షిక విశ్లేషణలో రుజువులకు నిలబడవు.
ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత, టెలివిజన్ ఛానెల్లు పేరులేని భద్రతా అధికారులను ఉటంకిస్తూ, నిందితుల ఫోటోలను ప్రసారం చేశాయి. వాళ్ళ పేర్లతో సహా. అందులో ఇద్దరు స్థానికులు మరో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. భద్రతా దళాలు రాకముందే, దాడి చేసిన వారందరూ జాడ లేకుండా పారిపోగలిగిన తర్వాతా మీడియా వాళ్ళకు వాళ్ళ ఫోటోలు పేర్లు చేరిపోయాయి. ఇటువంటి పరిణామాలు వాస్తవాలను కల్పిత కథనాల నుంచి వేరు చేయడం మరింత కష్టతరం చేస్తున్నాయి. భారతదేశం, పాకిస్తాన్ సైన్యాలు సై అంటే సై అనే స్థితికి చేరుకోవడమే కాక సింధు జల ఒప్పందాన్ని సస్పెండ్ చేయటంతో పాటు సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి అనేక చర్యలను ప్రకటించడంతో సంక్షోభం మరింత తీవ్రమైంది. అయితే, ఈ చర్యల ఆచరణాత్మకత ప్రశ్నార్థకంగానే ఉంది.
వ్యూహాత్మక నిపుణులు ఈ ఘర్షణ అంతంత మాత్రమే కావచ్చు. ఇంకా రెండు అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధంగా మారకపోవచ్చని అభిప్రాయపడుతున్నప్పటికీ, ఏదైనా ముదురుతున్న వైరం పర్యవసానాలను, పరిణామాలను జమ్మూ కశ్మీర్లో నివసించే ప్రజలు, ముఖ్యంగా సరిహద్దుల వద్ద ఉన్నవారు భరించక తప్పదు. గత అనుభవాలు, రెండు దేశాల పరిమితుల నిష్పాక్షిక విశ్లేషణతో నిపుణులు ఈ అంచనాలకు వస్తున్నారు. మారుతున్న భౌగోళిక రాజకీయ ప్రపంచంలో, రెండు అణ్వాయుధ శక్తుల దుందుడుకు చర్యలను అదుపులో పెట్టే పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. అమెరికా ఈ విషయం నుంచి దూరంగా ఉంది. అయితే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం- పాకిస్తాన్ వివాదం 1,000 సంవత్సరాల నాటిదని, పాకిస్తాన్ ఆవిర్భావానికి పది శతాబ్దాల ముందు నాటిదని వర్ణించడం ద్వారా కొంత హాస్యాస్పదమైన ఉపశమనం కలిగించారు.
సరిహద్దులు పెళుసుగా ఉన్నప్పటికీ, కాశ్మీర్లో అడ్డు అదుపు లేకుండా సాగుతున్న సైనిక చర్యలు, అణచివేత కూడా అంతే ఆందోళన కలిగిస్తుంది. భారతదేశం భావిస్తున్నట్టు దాడి చేసినవారు పాకిస్తాన్కు చెందినవారైనప్పటికీ ఏదో ఒక స్థాయిలో వారికి ఉన్న స్థానిక మద్దతును తోసిపుచ్చలేము. కానీ దాదాపు డజను ఇళ్లను కూల్చివేసి, ధ్వంసం చేయడంలో కనిపించే ప్రతీకార చర్య స్థాయి, ఉగ్రవాదులు ఇంకా కుట్రదారుల కుటుంబాలకు సమిష్టి శిక్ష విధించడం, అదికూడా నిర్ధారణలకు ముందే శిక్ష విధించడం గమనిస్తే ఉగ్రవాదులు చేస్తున్న నష్టం కంటే ఈ కుటుంబాలకు భద్రతా దళాల వలన జరుగుతున్న నష్టం చాలా ఎక్కువగా ఉండటం ఆందోళనకు కారణం అవుతుంది.
ఈ కుట్రలో వందలాది మంది పాల్గొనడం అది కూడా అడుగడుగునా భద్రతాదళాలు అలుముకున్న చోట వాళ్లకు ఉప్పందకుండా ఇంతమంది కుట్రలో భాగస్వాములు కావడం అసంభవం. ఇటీవలి అధికారిక అంచనాల ప్రకారం, కశ్మీర్లో పనిచేస్తున్న ఉగ్రవాదుల సంఖ్య పదులకు పడిపోయింది. వీరిలో స్థానిక ఉగ్రవాదులు పది కంటే తక్కువ. జరుగుతున్న పరిణామాలు, వాటి తీవ్రత స్థాయిని పరిశీలిస్తే, వారి అంచనా తప్పు అని మనం నమ్మాలా లేదా ప్రభుత్వం దేశానికి అబద్ధం చెబుతోందని నమ్మాలా?
ప్రభుత్వం ఇటీవల చేసిన వాదనలకు భిన్నంగా, నిర్బంధాల స్థాయి చాలా ఎక్కువగా ఉంది. ఉగ్రవాదులనే పేరుతో స్థానికుల ఇళ్లను కూల్చివేసే చర్య క్రూరంగా ఉంది. ఒకరో ఇద్దరో కుటుంబ సభ్యులు చేసిన పనులకి మొత్తం కుటుంబాలకు శిక్ష విధించడం ఎంతవరకు సమంజసం?
పహల్గాం హత్యల తరువాత ఆదర్శప్రాయమైన పరిణతిని చూపించిన కశ్మీరీలను సమిష్టి శిక్షకు బలి చేసే చర్యలు అన్యాయమైనవి. అంతేకాదు, ఈ రకమైన సాముహిక శిక్షలు ప్రతికూల ప్రభావాలకు పర్యవసానాలకు దారితీసే ప్రమాదం ఉంది. కశ్మీర్లోని జనాభాను ఇప్పటికే అణచివేయబడిన వారిని, మరింత దూరం చేసుకోవడానికి దారితీస్తాయి. నేను పరాయివాడనే భావన ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది.
అలా జరిగితే, పాకిస్తాన్ సరిహద్దుల వద్ద ఏదైనా దురదృష్టకర సంఘటన లేదా పాకిస్తాన్ మిత్రదేశమైన చైనా ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న తూర్పు సరిహద్దులో ఉద్రిక్తత పెరిగితే
ఇప్పటికే అంతులేని విద్వేష ప్రచారాల ప్రభావంతో అంతర్గత ఐక్యత బలహీనంగా ఉన్న దశలో ఇటువంటి దుందుడుకు చర్యలు ఏ రకమైన ఉత్పాతానికి అయినా దారి తీయవచ్చు.
భారతదేశం లేదా పాకిస్తాన్ రెండూ దీర్ఘకాలిక ఉద్రిక్తతలను భరించలేవు, యుద్ధం సంగతి పక్కన పెట్టండి. భారతదేశం, పాకిస్తాన్ రెండూ ఒక అడుగు వెనక్కి తీసుకొని బాధ్యతారహితంగా రెచ్చగొట్టుడు చర్యల నుంచి వెనుదిరగటమే ముందున్న ఏకైక మార్గం. ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టాలి. యుద్ధోన్మాదం, ఉద్రిక్తతలను అదుపు చెయ్యాలి. చారిత్రక ఉద్రిక్తతలను, ప్రస్తుత సంక్షోభాన్ని దౌత్యపరంగా పరిష్కరించాలి.
భారతదేశం ఉగ్రవాదం సమస్య వలన ఎదుర్కుంటున్న ఇబ్బందులను, ఉగ్రవాదుల మూలాలను పాకిస్తాన్ గుర్తించాలి. అదే సమయంలో భారతదేశం పహల్గామ్ దాడిపై దర్యాప్తు చేయడంలో తగిన శ్రద్ధ వహించాలి. ఇంకా ఆ తర్వాత పాకిస్తాన్తో దానికి సంబంధించిన ఆధారాలను పంచుకోవాలి. తద్వారా నేరస్థులను చట్టం ముందు నిలబెట్టేలా సహకరించేలా పాకిస్తాన్పై ఒత్తిడి తేవాలి.
సాక్ష్యాలను పంచుకోవడం, సహకారంపై గత అనుభవాలు గొప్ప ఆశాజనకంగా లేనప్పటికీ ఈ ప్రతిష్టంభన నుంచి బయటపడటానికి, పహల్గాం బాధితులకు న్యాయం చేయడానికి ఇదే ఏకైక మార్గం.
కశ్మీర్ విషయానికొస్తే, పహల్గాం సంఘటన దావానలంలా కమ్ముకుంటే ఉగ్రవాద చర్యలను అడ్డుకోవచ్చనే భారత వ్యూహం వైఫల్యాల వైపు దృష్టి సారించేలా చేస్తోంది. కశ్మీర్లో జరుగుతున్న చర్యలు, ఇజ్రాయెల్ పాలస్తీనాను నేలమట్టం చేసినట్టుగా ‘కశ్మీర్ను నేల మట్టం చేయడం’వంటి నినాదాలు దేశవ్యాప్తంగా ఇవ్వడం. ఇంకా భావోద్వేగాలు, వాటి తీవ్రత అసలు ప్రభుత్వం అమలు చేయాల్సిన రాజధర్మానికి భిన్నంగా ఉన్నాయి.
అనురాధా భాసిన్
(అనురాధ భాసిన్ కశ్మీర్ టైమ్స్ మేనేజింగ్ ఎడిటర్, డిసెంబర్ 2022లో హార్పర్కాలిన్స్ ప్రచురించిన ఎ డిస్మాంటల్డ్ స్టేట్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ కశ్మీర్ ఆఫ్టర్ 370 రచయిత్రి.)
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.