
మానవ సమాజం ఉన్నతిని మరింత పెంచేది సౌందర్య కవిత్వమా లేక కవిత్వ సౌందర్యమా ఏది ముందో ఏది వెనుకో కవిత్వ ప్రేమికులు కవులు విమర్శకులు వింగడించుకొని తేల్చుకోవాల్సిన ప్రస్తుతం సందర్భం ఏర్పడినది. ఆ పిదపనే సాహిత్య సౌందర్య మూలాల అన్వేషణకు ఒక స్పష్టమైన ఒక తొవ్వ దారి దొరుకుతుంది. వర్తమాన కవిత్వం పోకడలను గమనంలోకి తీసుకుంటే అనేక అంశాలపై మరింత లోతైన చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉందని అనిపిస్తున్నది .
పువ్వు పూయడం ఒక సౌందర్యం. ఆ పూలను తెంపుకొని స్రీలు కొప్పులో ధరించడం మరో సౌందర్యం. ఆ పూలతో దేవున్ని పూజించడం ఇంకొక సౌందర్యం. ఆ మొక్కను పెంచి పెద్ద చేసి పూలను తెంపిన కూలీల చెమట శ్రమ సమాజ నిర్మాణ సౌందర్యం ఒకటి ఉన్నది. ఇక్కడ మనం అంటే కవి ఏ సౌందర్యాన్ని ఆశిస్తున్నామన్నది ఆస్వాదిస్తమన్నది ప్రధానం.
దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది విషయం మరొకటి ఉన్నది. అది సకల కళలు సమాజాన్ని ఊనిక చేసుకొని వికసిస్తాయా లేక సమాజం నుంచి మనిషిని విడదీసి కేవలం మనిషి ఉనికిని హృదయాన్ని కేంద్రం చేసుకొని నిర్మాణం అవుతాయయా అనేది నేటి సాహిత్య కారుల ముందున్న ప్రశ్న. ఈ ప్రశ్నలను ఛేదించగలిగితే గానీ మిగతా విషయాలు అన్నీ ‘దూద్ కా దూద్ పానీ కా పానీ’ కుల్లం కుల్లా తెలుస్తుంది. ఈ చర్చ ఆది నుంచి ఉన్నప్పటికీ అంతిమంగా శ్రమ సౌందర్యమే పై చేయి సాదిస్తూ వస్తున్నది.
సామాజిక శాస్త్రవేత్తలు యోచించి మరింత విపులంగా చెప్పాల్సిన తెలుగులో సాహిత్య వాతావరణం ఏర్పడినది. ఆధునికత, ఆధునికాంతరవాదం , ద్రవాధునికత అనేక వాదాలు కళలను పునాది ఆసరా చేసుకుని అనేకానేక దోరణులు ,చర్చలు విశ్లేషణలు కొనసాగించాయి.
అయితే ఈ చర్చల విశ్లేషణ సారాంశమంతా ఉత్పత్తిలో జరిగిన మార్పు చేర్పుల యొక్క ఉపరితల అంశాలలో ఇమిడి ఉన్నాయి. అచ్చు యంత్రం సృష్టి ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలకు అంకురార్పణ చేసింది. శాస్త్రజ్ఞులు మనిషి తద్వారా సమాజం సర్వతోముఖోన్నతి కోసం నూతన ఆవిష్కరణలను కనుగొన్నాడు.. అత్యాధునికత ఆలంబన చేసుకొని కంప్యూటర్ ను కనుగొన్న తర్వాత గ్యారెంటీ వారంటీ లేని సేవల నేపథ్యంలో ద్రవాదునికత ప్రారంభమైంది. ఆవిధంగా ఉజ్జాయింపుగా మన సామాజిక విశ్లేషకులు ఒక అంచనాకు వచ్చారు.
మొత్తానికి మొత్తంగా చూస్తే పెట్టుబడి కేంద్రంగా మనిషి వలసలు నిరంతరంగా కొనసాగాయి. అలాగే వాటి వెంట కవిత్వమూ సకల సృజనాత్మక ప్రక్రియలు ప్రయాణించాయి. ఇవి కొన్నిసార్లు రాచరికానికి ఊడిగం చేస్తే మరికొన్నిసార్లు దేవాలయం చుట్టూ బాడుగకు నిర్మితమైనవి. ఇలా ఆలోచిస్తే అక్షరాన్ని కొన్ని వర్గాలు తమ గుప్పిట్లో సంకెళ్లు వేసి కొన్ని వేల సంవత్సరాలు బంధించడం వలన ఇదంతా జరిగిందని అనిపిస్తున్నది. అక్షరాస్యులు, నిరక్షరాస్యుల మధ్య భేదాలు నిచ్చెన మెట్ల కుల సమాజం ఒకవైపు అయితే ఆ వెంటే ఎక్కి వచ్చిన నిచ్చెనమెట్లను తన్నేసే తరం మరొకవైపు వచ్చి చేరింది . అంటే ఇక్కడే ఆధిపత్య కులాల ప్రాంతాల వారు ప్రయోజనాలు రక్షించుకునే విధంగా మిగితా ఉత్పత్తి కులాలకు మధ్య అంతరం అంటరానితనం ఏర్పడినది.. అంటే శ్రమ చేసేవారు కొందరైతే కూర్చొని తినేవారు మరికొందరు ఈ సమాజాన్ని అవిఛ్ఛినంగా ఏలారు ..ఏది ఏమైనా పునాదిలో వచ్చిన ఉత్పత్తి సంబంధాల మార్పు ఉపరితలంలో కనబడుతున్న గందరగోళాలు అన్నిటికీ మనిషి లేక కవి కలత చెంది తక్షణ హృదయ స్పందనను కవిత్వంగా వ్యక్తీకరించాడు . ఇది సమాజం మీద ప్రభావం చూపింది.
ఇది ఏందని ప్రశ్నించిన కవి అన్ని కాలాలలో రాజ్యానికి కంటగింపుగా కనిపిస్తూనేవున్నాడు . మతాలు హింస యుద్ధాలు యుక్తులు కుట్రలు కుతంత్రాలు ప్రజ్వరిల్లాయి. మానవజాతి వికాస చరిత్ర అంతా భూమి ఉన్నవాడిదే ఆధిపత్యంగా కొనసాగింది.
ఇదిగో ఇక్కడే శ్రమ పెట్టుబడి అదనపు విలువల మధ్య ఒక సంఘర్షణ వాతావరణం నెలకొన్నది. పెట్టుబడి లాభాపేక్షతో అనేక దేశాలకు విస్తరించింది. ఆ వెంటనే సృనాత్మక ప్రక్రియలను విభజించే ఆధునికత, ఆధునికాంతరవాదం మరియు ద్రవాదునికత వాదాలు వాటి వెనుకనున్న అంతర్గత సూత్రాలను ఆయా సామాజిక సందర్భాల లో విశ్లేషించారు. సామాజిక శాస్త్రజ్ఞులు అనేక నూతన విషయాలను సమాజం ముందు విపులంగా అరటిపండులా ఒలిచి పెట్టారు. మరియు వింగడించారు.
రాచరికము మతం భూస్వామ్యము సోషలిజం ప్రజాస్వామ్యం పరిపాలన విధానాలు శాస్త్రీయంగా రాజనీతి శాస్త్రము తెలియజేసింది అలాగే ప్రజలు బానిసలు భూస్వామ్య కాలంలో వెట్టి కౌలు రైతులు, కూలీలు, జెండర్ వివక్ష అసమానతలు లేని సమాజం వెంట వ్యక్తీకరణల రూపం అయిన కళల ద్వారా తమదైన శైలిలో సమాజం మీద చెరగని ముద్రవేశారు. పెట్టుబడిదారీ విధానం ముసుగులో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. అలాగే ఈ అన్ని దశలలో ఆయా వ్యవస్థలలో కవిత్వం కొనసాగుతూ వచ్చింది. రాజు బానిసలు భూస్వామ్యం ముందు చేతులు కట్టుకొని నిలబడి ప్రజలు మనుగడ సాగించారు. ఆయా కాలాలోని అణచివేతకు వ్యతిరేకంగా సృజనాత్మక కళలు వర్ధిల్లాయి.
వారసత్వ రాజకీయాల లాగా వారసత్వ సాహిత్య కారులు కొనసాగారు. ఈ చట్రాన్ని బదాబదలు చేస్తూ
మిగతా శ్రమ కులాల నుండి వారి వారి జీవిత సంఘర్షణలను నేపద్యాన్ని తెలుగు సాహిత్యంలో రక్షించే ఒక విఫల ప్రయత్నం నిరంతరంగా కొనసాగుతుంది. తెలుగు సాహిత్యంలో ఎప్పుడూ లేనంత తమ తమ కులాల వర్గాల జీవితం అణచివేతల సాచివేత నుండి సుసంపన్న మైన సాహిత్యం పండిస్తున్నారు. వేయి సంవత్సరాల పైబడిన తెలుగు సాహిత్య యవనిక మీద ఒక అత్యద్భుతమైన మహత్తర దృశ్యం దుర్గోచరమవుతున్నది. కవిత్వ ప్రేమికులను కనికట్టుగా ఆకట్టుకుంటున్నది.
చివరగా చెప్పేదేమంటే అంతిమంగా మనిషి సంఘజీవి మాత్రమే కాదు రాజకీయ జీవి కూడా అని తత్వవేత్తలు నిర్ధారించారు. ఈ నిర్ధారణతో రాజకీయాలకతీతంగా సాహిత్య ప్రక్రియలలో అగ్రశ్రేణి భాగాన ఉన్న కవిత్వం రాజకీయాలకు అతీతంగా ఉండడానికి వీలు లేదని వీలు కాదనే నమ్మే సాహిత్య కాలం ఇదని గొంతెత్తి నినదిస్తున్నది. తెలుగు కవిత్వంలో ప్రధాన పాయగా ప్రవహిస్తున్నది. ఇదిగో ఇక్కడే అనుభూతివాదుల హృదయ సంబంధమైన అరాజకీయ కవిత్వం పూర్వ పూర్వపక్షమైపోయింది. ఎట్టకేలకు తెలుగు కవిత్వం శ్రమ సౌందర్యం అంతిమంగా అనుభూతి సౌందర్యంమీద పై చేయి సాధించినది.
ప్రస్తుత వినియోగ సంస్కృతీ సేవల
భావనల పైన నిలకడలేని స్థలంలో మనిషి కేవలం వినియోగదారుడుగా ఒకే ఒక్క రిమోట్ కంట్రోల్ అజమాయిషీలో తన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడు. అత్యాధునిక విజ్ఞాన శాస్త్రాలు అందించిన అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ గతంలో జీవించే పద్ధతి ఒకటి ఒకటి కొనసాగుతున్నది .
అంతిమంగా శ్రమ మాత్రమే కవిత్వ సౌందర్యంగా బాసిస్తున్నదనే విషయీవిషయాన్ని అంగీకరింప చేస్తున్నది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా కాలం గీటురాయి మీద విభిన్న వాదాల పరీక్షలను ఎదుర్కొని నిఖార్సుగా నిటారుగా అజేయంగా శ్రమ విలువనే కవిత్వ సౌందర్యంగా నిలబడింది.
(నా “ఒక కప్పు చాయ్ నాలుగు మెస్సేజులు” కవితా సంకలనానికి ఈ 26న కొలకలూరి అవార్డు ప్రధానం స్సందర్భంగా…….)
—- జూకంటి జగన్నాథం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.