
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారిలో మహావీర్ చక్ర అందుకున్న ఎయిర్ వైస్ మార్షల్ సెసిల్ వివియన్ పార్కర్(రిటైర్డ్), ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితులపై తన అభిప్రాయాలను, 1971 భారత్- పాకిస్తాన్ యుద్ధ అనుభవాలను ద వైర్తో పంచుకున్నారు.
సికింద్రాబాద్లోని వాయుపురి కాలనీలో సాధారణంగా కనిపించే ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో యుద్ధం చేసిన ఒక వీరుడు ఉంటున్నాడని ఆ పరిసర ప్రాంతాల్లోనే కాదు, హైదరాబాద్లోని ఎవరికీ తెలియదు. ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం, జరుగుతున్న పరిణామాలపై ద వైర్ తెలుగు ఆయనను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లింది. ద వైర్ బృందం కాలింగ్ బెల్ కొట్టగానే ఇంటి తలుపును ఓ వ్యక్తి తెరిచారు. 93 ఏళ్ల పెద్దాయన ఒక ఫైటర్ పైలట్, చెక్కుచెదరని పట్టుదలతో ఉన్న మనిషి ద వైర్ బృందం ముందు నిలబడ్డారు. ఆయనే ఎయిర్ వైస్ మార్షల్ సెసిల్ వివియన్ పార్కర్(రిటైర్డ్). తన ఫ్రెండ్స్ తనని”నోసీ” అని ఇప్పటికి ముద్దుగా పిలుచుకుంటారు. తన హియరింగ్ ఎయిడ్ను సరిచేసుకుంటూ ద వైర్ బృందానికి సైగ చేస్తూ కూర్చోండని అన్నారు. ఇంకా యుద్ధంలో ఆజ్ఞాపించే ఒక యోధుడిలానే ఆయన గొంతు ఉంది. ఆయన రూపానికి వయసుకు సంబంధమే లేనట్టు అనిపించింది.
పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఇండియా- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత సమయంలో సైన్యం ఆపరేషన్ సింధూర్తో బాగా స్పందించిందని అందరూ మెచ్చుకుంటుంటే, పార్కర్ చెప్పే విషయాలు మాత్రం ఉద్వేగపూరిత చారిత్రక ఘట్టాలను గుర్తు చేశాయి. 1971లో ఆయన పాకిస్తాన్లోకి వెళ్లి ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో చాలా ధైర్యంగా ఎయిర్ రైడ్స్ చేశారు. శత్రువుల హృదయాలలో భయం పుట్టించారు, అంతేకాకుండా భారత దేశ ప్రముఖ పైలట్లలో ఒకరుగా నిలిచారు.
ఇప్పుడు, దేశం ప్రతీకారం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు “పాకిస్తాన్ పహల్గాం దాడికి మూల్యం చెల్లించాలి” అని పార్కర్ చాలా స్పష్టంగా అన్నారు. తర్వాత చిన్నగా నవ్వుతూ “నిజానికి, వాళ్ళు ఆల్రెడీ చెల్లిస్తున్నారు” అని చెప్పారు.
1971 నాటి రోజులు..
పార్కర్ ఇంట్లోని ఆయన గది గతానికి సంబంధించిన మ్యూజియంలా ఉంది. పార్కర్ ఫ్లైట్ సూట్లో ఉన్న యంగ్ ఏజ్ ఫోటోలు, ఫ్రేమ్ చేసిన అవార్డు పేపర్లు, ఇంకా హాకర్ హంటర్ అనే ఫైటర్ జెట్ మోడల్ ఆయన యుద్ధంలో ఉపయోగించిన విమానం ఫొటోలను చూస్తుంటే మనకు తెలియకుండానే గతంలోకి వెళ్లిపోతాం.
భారతదేశంలో ఇచ్చే రెండో అతి పెద్ద మిలిటరీ అవార్డు, సైన్యంలో దేశానికి ఆయన చేసిన సేవకు లభించిన మహా వీర్ చక్రం ఆయన కోసమే అన్నట్టుగా గోడ మీద వేలాడుతోంది.
ఆయన కుర్చిలో వెనక్కి వాలి కూర్చొని మాట్లాడుతుంటే, ఆయన మసకగా ఉన్న కళ్ళు ఇంకా ఆకాశాన్ని ఏలిన మనిషి తేజస్సును చూపిస్తున్నాయి. “యుద్ధం మారలేదు, ఆయుధాలు మాత్రమే మారాయి.” అని చెబుతూ పార్కర్ తన గతంలోకి వెళ్లిపోయారు.
1971 డిసెంబర్లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య యుద్ధంలో భారత్- పాకిస్తాన్ ఎదురెదురుగా నిలబడినప్పుడు, అప్పుడు వింగ్ కమాండర్గా ఉన్న పార్కర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF)20 స్క్వాడ్రన్కు లీడర్గా ఉన్నారు. “మేము కేవలం ఫ్లైట్స్ నడపలేదు, ఒక సందేశాన్ని ఇచ్చాం” అని ఆయన తన జ్ఞాపకాల చిట్టాను విప్పుతూ తెలియజేశారు.
ఆయన చేసిన సాహాసోపేత దాడుల్లో ఒకటి పాకిస్తాన్ లోపల 120 కిలోమీటర్ల లోపల ఉన్న మురీద్ ఎయిర్బేస్పై దాడి. రాడార్కు చిక్కకుండా చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ, పార్కర్ బృందం పాకిస్తాన్ యాంటీ- ఎయిర్క్రాఫ్ట్ ఫైర్ను ఇంకా పాక్ ఎఫ్-86 సాబర్ జెట్లను ధ్వంసం చేసింది.
“మేము అంత లోపలికి వస్తామని వాళ్ళు ఎప్పటికీ అనుకోలేదు” అని ఆయన చెబుతున్నప్పుడు ఆయన మొఖంలో చిరునవ్వు అప్పటి ఆయన విజయాన్ని గుర్తు చేసింది. “మేము వాళ్ళ అంచనాలను తలకిందులుగా చేశాం” అని చెప్పారు.
పాకిస్తాన్ ఎప్పటికీ నేర్చుకోదు: పార్కర్
అలా ఆయన మాటలు గతం నుంచి ప్రస్తుత పరిస్థితుల వైపు మారినప్పుడు, పార్కర్ గొంతు కఠినంగా మారింది. ఆయన తాజా ఉద్రిక్తత పరిస్థితుల గురించి వార్తలను గమనిస్తున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి, ఇండియా చేసిన రిటాలియేషన్ దాడులు, అన్ని అంశాలను ఆయన క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
“వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోరు” అని ఆయన అన్నారు. పాకిస్తాన్ అణు బెదిరింపులను కొట్టిపారేస్తూ “మా అప్పుడు మాకు ఇలాంటి బెదిరింపులు ఏమీ లేవు. మేము పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి పని పూర్తి చేసేవాళ్ళం.”
ఇండియా రియాక్షన్ సరిపోతుందని మీరు అనుకుంటున్నారా అని ద వైర్ అడిగినప్పుడు “ఇది ఒక్క దాడి గురించే కాదు. వాళ్లు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసినప్పుడు, దాని మూల్యం చాలా ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుందని ఎప్పటికి మర్చిపోకూడదు.” అని తెలియజేశారు. “మేము 1971లో అదే చేశాము. ఇప్పుడు కూడా అదే చేయాలి.” అని అన్నారు.
పార్కర్ తెలుగు రాష్ట్రాల నుంచి జీవించి ఉండగా మహా వీర్ చక్రం పొందిన ఏకైక వ్యక్తి. మిగిలిన ఇద్దరు మేజర్ పద్మపాణి ఆచార్య, కల్నల్ బి సంతోష్ బాబు చనిపోయిన తర్వాత ఈ గౌరవాన్ని పొందారు.
35 సంవత్సరాలు, 22 రకాల విమానాలు, 3,850 గంటల ఫ్లైయింగ్ టైమ్ అనుభవం పార్కర్కు ఉంది. 1986లో ఎయిర్ వైస్ మార్షల్గా రిటైర్ అయిన తర్వాత, ఆయన ఎయిర్లూమ్స్ రాండమ్ రికలెక్షన్స్ ఆఫ్ ఎన్ ఏన్షియంట్ ఏవియేటర్ అనే మెమోయిర్ను రాశారు. ఆయన జీవితంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం 2018లో జరిగింది. పార్కర్ చేసిన 20 స్క్వాడ్రన్ మురీద్ దాడిలో తన పాత్రను రిటైర్డ్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అధికారి ఎయిర్ కమోడోర్ ఎం కైసర్ తుఫైల్ యుద్ధం జరిగిన 47 సంవత్సరాల తర్వాత అంగీకరించారు.
ఇంటర్వ్యూ అయిపోయే సమయానికి పార్కర్ ఆలోచనలు, మాటలు ప్రస్తుతం జరుగుతున్న విషయాల వైపు తిరిగాయి. “ఈ రోజుల్లో ప్రజలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. కానీ తక్కువగా మాట్లాడాలి, చేతల్లో ఎక్కువగా చూపించాలి. పాకిస్తాన్ విషయంలో ఇదే సూత్రాన్ని పాటించాలని ఆయన చెప్పారు.
ప్రసుత్తం ఆర్మీ చేస్తున్న ఆపరేషన్లు సరైనవేనాని ద వైర్ అడిగినప్పుడు, “ఖచ్చితంగా, వాళ్ళు చేయాల్సింది చేస్తారు.” అని ఆయన ఏమాత్రం ఆలోచించకుండా సమాధానం ఇచ్చారు.
తన వాలు కూర్చిలో వెనక్కి వాలుతూ ఒక యోధుడు తన ఆలోచనలను ద వైర్ తెలుగుతో పంచుకున్నారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్లేటప్పుడు, ఒక చివరి ప్రశ్న మిగిలి పొయింది. అడగకపోయినా ఆయనకు అర్థమైంది. ఒకవేళ యంగ్గా ఉంటే, ప్రస్తుతం పాక్పై భారత్ చేస్తున్న దాడులలో కీలక పాత్ర పోషించి లీడ్ చేస్తారాని ఆయనను అడిగితే, ఏమాత్రం ఆలోచించకుండా నవ్వుతూ “ఖచ్చితంగా”అని పార్కర్ సమాధానం ఇచ్చారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.