
కశ్మీర్లోని లేహ్ నుంచి సిర్ క్రీక్ ప్రాంతాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖను పాకిస్తాన్ సైన్యం పలుమార్లు ఉల్లంఘించిందనీ, పౌర విమానాల ముసుగులో పలు నగరాలపై డ్రోన్లు ప్రయోగించిందనీ, భారత దేశపు సాయుధ సైనిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని కేంద్రం ఆరోపించింది.
మే 9న భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్లు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విధంగా గగనతలంలో వాస్తవాధీన రేఖను పదేపదే ఉల్లంఘించటం కేవలం భారతీయ సాయుధ సైనిక వ్యవస్థకు చెందిన మౌలిక వసతులను తనిఖీ చేయటం కోసమేనని చెప్పారు. తదుపరి దాడుల వ్యూహాన్ని రూపొందించుకునేందుకు ఇలాంటి సమాచార సేకరణ అక్కరకొస్తుంది. పాకిస్తాన్ ప్రయోగించిన కొన్ని డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. కూల్చి ఆ శకలాలను పరిశీలిస్తే ఈ డ్రోన్లు టర్కీ నుంచి దిగుమతి అయినట్లుగా అర్థమవుతుందని సోఫియా ఖురేషి తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో మే 7న భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్- పాక్ ఆక్రమిత భూబాభాగాల్లోని తొమ్మిది ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు, సాయుధ వసతులపై దాడులు చేసిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి. మే 9 తేదీ సాయంత్రానికి రెండు దేశాల పదాతి దళాలు, వాయుసేన చెదురుమదురు ఘటనల్లో పరస్పరం తలపడటంతో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
‘‘మే 8వ తేదీ రాత్రి వేళ, 9వ తేదీ ఉదయం- మధ్యరాత్రి సమయంలో పాకిస్తాన్ నుంచి దాదాపు 400 డ్రోన్లు ఉపయోగించి కశ్మీర్ లోని లేహ్ నుంచి గుజరాత్లోని సిర్ క్రీక్ వరకూ ఉన్న భారత సైనిక స్థావరాల వివరాలు సేకరించేందుకు ప్రయత్నం జరిగింది’’ అని వ్యోమిక సింగ్ తెలిపారు.
‘‘వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్ భారీ ఆయుధాలతో కాల్పులకు తెగబడింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి లేహ్ నుంచి సిర్క్రీక్ వరకూ పాక్ ప్రయోగించిన మూడు నాలుగు వందల డ్రోన్లు సరిహద్దు దాటి రావడానికి ప్రయత్నించాయి. భారత వైమానిక రక్షణ కవచం సామర్ధ్యాన్ని తనిఖీ చేయటం, భారతీయ సైనిక స్థావరాల స్థితిగతుల గురించిన సమాచారాన్ని సేకరించటం లక్ష్యంగా ఈ ప్రయత్నాలు జరిగి ఉండొచ్చు. ఈ ద్రోణులను భారత్ సేనలు కూల్చేశాయి. ఈ శకలాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపుతున్నాము. ప్రాథమిక విశ్లేషణలో ఈ డ్రోన్లు టర్కీ తయారు చేసి ఆసిస్గార్డ్ సోంగర్ శ్రేణి ద్రోణులుగా గుర్తించాము’’అని వ్యోమిక సింగ్ వివరించారు.
పైలట్ లేని విహంగ వాహకం ఒకటి భటిండా సైనిక స్థావరాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తే భారత సైన్యం ఆ ప్రయత్నాలను వమ్ము చేసింది. దీనికి ప్రతిస్పందనగా భారతదేశం నాలుగు పాకిస్తాన్ సైనిక స్థావరాలు లక్ష్యం చేసుకుని డ్రోన్లు ప్రయోగించింది. లక్ష్యంగా మార్చుకున్న నాలుగు పాక్ సైనిక స్థావరాలు ఏమిటన్నది వివరించలేదు కానీ భారత్ ప్రయోగించిన డ్రోన్లు పాక్కు చెందిన వైమానిక రక్షణకు సంబంధించిన రాడార్ను నాశనం చేశాయని మాత్రం వ్యోమిక తెలిపారు.
‘‘జమ్ము కశ్మీర్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఉధంపూర్, తాంగ్ధార్, ఉరి, పూంఛ్, రాజౌరి, మేంధర్, అఖ్నూర్లను లక్ష్యంగా చేసుకుని పాక్ దళాలు భారీ ఎత్తున పేలుడు సామాగ్రితో ఆధునిక ఆయుధాలతో దాడులు చేశాయి. భారత సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో పాక్ దళాలకు కూడా గణనీయంగా నష్టం జరిగింది’’ అని ఆమె వివరించారు.
పాకిస్తాన్ పౌర విమాన సేవలు రద్దు చేయలేదనీ, పౌరవిమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటోందని భారత్ ఆరోపించింది. ‘‘అంతేకాదు, పాకిస్తాన్ బాధ్యతా రాహిత్యం కూడా మరోసారి ప్రపంచం ముందుకొచ్చింది. పలు దఫాలుగా విఫల ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా పౌర విమానసేవలు నిలిపి వేయకుండా దాన్ని కవచంగా వాడుకోవాలన్న కుతంత్రం కనిపిపోస్తోంది. మే 7వ తేదీ సాయంత్రం ఎనిమిదిన్నరకు భారత్ వైపు నుంచి ఎటువంటి రెచ్చగొట్టుడు చర్యలు లేకపోయినా పాకిస్తాన్ డ్రోన్లు ప్రయోగించింది. పాక్ ఎటువంటి తొందరపాటు చర్యలకు పాల్పడినా భారత వైమానిక దళాలు సమర్థవంతంగా తిప్పికొడతాయన్న విషయం తెలుసు కాబట్టే పౌరవిమానసేవలను కవచంగా ఉపయోగించుకొంటోంది.’’
భారత వైమానిక దళాలు కరాచీ, లాహోర్ మధ్య పాకిస్తాన్ పౌరవిమానాలను నడుపుతున్నట్లు గుర్తించింది. భారతదేశం మాత్రం ఉద్రిక్తతలు మొదలైన వెంటనే దేశంలోని 28 నగరాలకు పౌరవిమాన సేవలు నిలిపివేసింది.
భారత్ పాకిస్తాన్ల మధ్య అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జరుగుతున్న భారీ కాల్పులు, ఎదురు కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో రాత్రి 10 గంటల నుంచి విద్యుత్ సరఫరాలను ప్రభుత్వం నిలిపి వేసింది. ఈ కాల్పులు, ఎదురు కాల్పుల్లో ఒక మహిళ మరణించగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సరిహద్దు రేఖ వెంబడి గ్రామాల ప్రజలకు పరిస్థితులు కాళరాత్రిని తలపిస్తున్నాయి.
ద వైర్ స్టాఫ్
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.