
పహల్గాం తీవ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. నీటి ఒప్పందాల నిలిపివేత, ఆపరేషన్ సింధూర్ దాడితో పరిస్థితి మరింత జటిలంగా మారింది. ఇరు దేశాలు పరస్పర ప్రతీకార దాడులకు దిగుతుండడంతో యుద్ధం తీవ్రమవుతోంది. ఒక్కసారి యుద్ధం ప్రారంభం అయితే ఎప్పుడు ఆగుతుందో చెప్పడం కష్టం. “కన్నుకు కన్ను- పన్నుకు పన్ను” అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్న ఇరు దేశాల చర్యలకు యుద్ధప్రభావిత ప్రాంతాలలో యుద్ధ దాహానికి అమాయక ప్రజలు చనిపోతున్నారు. తీరని ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది.
ఇరు దేశాలలో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో యూఎన్ సెక్రెటరీ జనరల్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ ఫర్హాక్ హక్ విచారణ వ్యక్తం చేస్తూ కీలక ప్రకటన చేశారు. భారత్-పాక్ మధ్య మరో సంఘర్షణను ఈ ప్రపంచం అస్సలు భరించబోదని పేర్కొన్నారు. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆయన తెలియజేశారు. భారత్, పాక్ రెండు దేశాలు సంయమనం పాటించాలని తాము బలంగా కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ఆవేశంలో యుద్ధం అస్సలు చేయకూడదని సూచించారు. ఆవేశం అనర్థానికి మూలమని, ఆవేశంలో యుద్దం చేస్తే నష్టం తప్ప లాభం ఉండదని వెల్లడించారు.
మరో వైపు అమెరికా కూడా దీని మీద మరోసారి స్పందించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ “రెండు అణుశక్తి దేశాలు ఘర్షణ పడుతూ భారీ సంక్షోభం వైపుగా వెళ్తుండడంపై మేము ఆందోళన చెందుతున్నాం. వీలైనంత తొందరగా పరిస్థితులు శాంతించాలని కోరుకుంటున్నాం. ఉద్రిక్తత పరిస్థితులు తగ్గేలా మేము వీరిని ప్రోత్సహించగలం. కానీ యుద్ధంలో మాత్రం తలదూర్చం. అది మా పని కాదు.” అని స్పష్టం చేశారు.
భారత్- పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు ప్రశాంతంగా ఉండాలని, శాంతియుత చర్చలతో ముందుకు సాగాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ పిలుపునిచ్చారు.
అయితే, ఆపరేషన్ సింధూర్కు ప్రతిగా పాకిస్తాన్ సైన్యం చర్యలకు దిగుతోంది. భారత నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతోంది. వీటిని భారత ఆర్మీ తిప్పికొడుతోంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో పాకిస్తాన్కు చెందిన పలు సైనిక పోస్టులను భారత దళాలు ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించిన వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లతో పాక్ మిలిటరీ పోస్ట్లను భారత దేశం ధ్వంసం చేస్తోంది. భారత దాడిలో పాక్ పోస్ట్ కుప్పకూలిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. సరిహద్దుల్లో పాక్ డ్రోన్ దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నామని భారత సైన్యం ప్రకటించింది. ఇప్పటివరకు 50 డ్రోన్లను కూల్చినట్టుగా తెలిపింది.
S-400, L-17 సిస్టమ్ యాక్టివేట్..
యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉండడంతో భారత సరిహద్దులో ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో హైఅలర్ట్ ప్రకటించింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు, పాలనాధికారులకు పూర్తిగా సెలవులను రద్దు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యాసంస్థలను కూడా మూసివేశారు. పాక్ సరిహద్దును పంచుకుంటున్న గుజరాత్ సముద్రం తీరం వెంట కోస్ట్ గార్డ్స్ను రౌండ్ ద క్లాక్ పహారా కాయాలని సూచించారు. పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సెలవులును కూడా రద్దు చేశారు. ఇక హిమాచల్ప్రదేశ్లోనూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హమీపుర్, ఉనా, బిలాస్పుర్లో భద్రతా దళాలు రంగాలోకి దిగాయి. ప్రముఖ దేవాలయాల దగ్గర తనిఖీలు ముమ్మరం చేశారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని బయటకు రావొద్దని సూచించారు. హై అలర్ట్ ప్రాంతాలలో ఎవరూ అనవసర ప్రయాణాలు చేయొద్దని పేర్కొన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిదాడిగా ఆజాద్ కశ్మీర్(పీఓకే)లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ “ఆపరేషన్ సింధూర్”పేరుతో ఖచ్చితమైన వైమానిక దాడులు నిర్వహించిన ఒక రోజు తర్వాత, పాకిస్తాన్ జమ్మూ ప్రాంతంపై దాడులు చేసింది. జమ్మూలోని అనేక ప్రాంతాలపై గురువారం(మే 8) సాయంత్రం పాకిస్తాన్ ఫిరంగి కాల్పులు, డ్రోన్ దాడులు, క్షిపణి ప్రయోగాలు చేసింది. ఈ దాడుల్లో జమ్మూ ఎయిర్స్ట్రిప్ సహా పలు కీలక ప్రాంతాలు లక్ష్యంగా మారాయి. భద్రతా సంస్థల నివేదికల ప్రకారం, పాకిస్తాన్ ప్రయోగించిన 8 క్షిపణులను భారత వైమానిక రక్షణ వ్యవస్థలోని అత్యాధునిక S-400 వ్యవస్థ గాల్లోనే అడ్డుకోవడంలో విజయవంతమైంది. ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
ఇస్లామాబాద్ టార్గెట్గా డ్రోన్లు, మిస్సైల్లతో భారత సైన్యం దాడికి దిగింది. పాక్ మిస్సైల్లను భారత సైన్యం గాల్లోనే కూల్చి వేసింది. జమ్మూలోని ఎయిర్పోర్టుపై 8 సూసైడ్ డ్రోన్లతో పాక్ దాడి చేయగా వాటిని తిప్పి కొట్టింది. జైసల్మేర్, అక్నూర్లో ఇద్దరు పాక్ పైలట్లను పట్టుకున్న భారత ఆర్మీ. మొత్తం 20కి పైగా పాక్ డ్రోన్లను భారత్ కూల్చివేసింది. లాహోర్ , సియాల్ కోట్లో కౌంటర్ ఎటాక్కు దిగిన సైన్యం భారత్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 14 మంది పాక్ సైనికులు చనిపోయారు. అంతేకాకుండా S-400, L-17 సిస్టమ్ను భారత్ సైన్యం యాక్టివేట్ చేసింది. అయితే, జమ్మూ ఎయిర్పోర్టు టార్గెట్గా పాక్ దాడులకు దిగింది. ఈ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని, పాక్ దాడులను సమర్ధవంతగా తిప్పికొట్టామని భారత ఆర్మీ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టులకు కేంద్రప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.
పాకిస్తాన్లోని తొమ్మిది నగరాలపై భారత సైన్యం దాడులు చేసింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్పై కూడా దాడులు చెయ్యడంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ని సురక్షిత ప్రాంతానికి పాకిస్తాన్ సైన్యం తరలించింది. మరోవైపు భారత సరిహద్దు జిల్లాల్లో బ్లాక్అవుట్ అమల్లో ఉంది. ఆ ప్రాంతాలలో కరెంటు సరఫరాని భారత్ నిలిపివేసింది. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సైరన్లతో హెచ్చరించింది. తమ ప్రాంతాలను కాపాడుకుంటూ, ప్రజలకు రక్షణ కల్పిస్తునే లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత సైన్యం దెబ్బతీసింది. దీంతో భారత్లోని పంజాబ్కు సరిహద్దులోనే ఉన్న లాహోర్పై భారత్ చేసే దాడులను పాకిస్తాన్ అడ్డుకోలేదు.
యుద్ధ ఉద్రిక్తత వేళ భారత దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. తాజా పరిణామాలతో దేశంలో ఢిల్లీ నుంచి జమ్మూ, గుజరాత్, రాజస్థాన్ వెళ్లే రైళ్లన్నీ రద్దు అయ్యాయి. దీంతో పాటు ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించింది. భారీగా ఎన్ఎస్జీ కమాండర్లు ఆ ప్రాంతాన్ని మోహరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర సేవల కింద యధావిధిగా ఆఫీసులకు రావాల్సిందిగా ఆదేశించింది.
పరస్పర దాడులు- అప్రమత్తత..
చర్యకు ప్రతిచర్యగా ఇరు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఈక్రమంలో జమ్మూ, పంజాబ్, రాజస్థాన్పై పాకిస్తాన్ క్షిపణులతో దాడికి దిగింది. జమ్మూ ఎయిర్పోర్టు సమీపంలో పాకిస్తాన్ ఆత్మాహుతి డ్రోన్ దాడులకు పాల్పడినట్టు సమాచారం. సిద్ధంగా ఉన్న భారత సైన్యం పాక్ దాడులను తిప్పికొట్టింది. యుద్ధవాతావరణ పరిస్థితుల కారణంగా అఖ్నూర్, కిష్త్వార్, సాంబా సెక్టార్లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. జమ్మూ ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీచేసింది. జమ్మూతో సహా పఠాన్కోట్, ఉధమ్పుర్లలో ఈ దాడులు జరుగుతున్నాయి. మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. పంజాబ్ సరిహద్దులోని ప్రాంతాలపై కూడా పాక్ డ్రోన్ దాడులకు దిగింది. దీనికి ప్రతిస్పందనగా పాక్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. పది పాక్ క్షిపణులను నిర్వీర్యం చేసింది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో రెండు డ్రోన్లను ధ్వంసం చేశారు. మొత్తంగా ఇప్పటివరకు ఎనిమిది డ్రోన్లు నిర్వీర్యం అయ్యాయి.
అమెరికా, యూకే, యూఏఈలతో భారత దేశం టచ్లో ఉంది. SZU-23, శిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సైన్యం రంగంలోకి దింపింది. తాజా పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోడీతో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ సమావేశం అయ్యారు. త్రివిధ దళాధిపతులు, సీడీఎస్తో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. కేవలం భూ దాడులకు పరిమితం కాకుండా రంగంలోకి దిగిన భారత నౌకాదళం పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ సీపోర్టుపై ప్రతీకార దాడి చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత నుంచి మిస్సైల్స్, డ్రోన్లను ప్రయోగించింది. ఈ పోర్టులో ఏడు భారీ పేలుళ్లు జరిగాయి. కరాచీ పోర్టులో మొత్తం 10 పాక్ కార్గో నౌకలను ఇండియన్ నేవీ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో అనేక షిప్పులు ధ్వంసం అయ్యాయి. అరేబియా సముద్రంలో పాక్పై గురి పెట్టిన భారత నేవీ ఏకంగా 26 యుద్ధ నౌకలతో విరుచుకుపడింది.
ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలు భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయి. దీంతో జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీచేశారు. అయితే, హై అలర్ట్ ప్రాంతాలలో రాత్రిపూట విద్యుత్ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను జారీ చేశాయి. ఆస్పత్రులు, సెంట్రల్ జైళ్లకు వీటి నుంచి మినహాయింపు ఉంది. అయినప్పటికీ నిర్దేశించిన సమయంలో జైలు, ఆస్పత్రుల కిటికీలు మాత్రం కచ్చితంగా మూసి ఉంచాలి. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇవి అమల్లో ఉంటాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కొనేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.
పలు పరీక్షలు వాయిదా- బడులు మూసివేత..
యుద్ధనేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా పలు పరీక్షలు వాయిదా పడ్డాయి, విద్యాసంస్థలను మూసివేశారు. ఇందులో భాగంగా సీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఐసీఏఐ ప్రకటించింది. అయితే ఈ పరీక్షలు మే 9 నుంచి మే 14 వరకు జరగాల్సి ఉంది. సీఎ ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. తిరిగి నిర్వహించేది ఎప్పుడో త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు వచ్చే 3 రోజుల పాటు విద్యా సంస్థలన్ని మూసి వేస్తున్నట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.
మ్యాచ్ రద్దు- ఆట స్థలాల మార్పు..
పాకిస్తాన్ సూపర్ లీగ్పై యుద్ధ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన జారీ చేసింది. పిఎస్ఎల్ వేదికను పాక్ నుంచి దుబాయ్కు మారుస్తున్నట్టు పీసీబీ వెల్లడించింది. మరోవైపు భారతదేశంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచుల విషయంలో కూడా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్లో మిగిలిన మ్యాచులను ఇతర దేశాల్లో నిర్వహించాలని చూచించింది. అంతేకాకుండా పాకిస్తాన్ వివిధ ప్రాంతాలలో దాడులకు దిగడంతో ధర్మశాల బ్లాక్ఔట్గా మారిపోయింది. దీంతో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గురువారం(మే 8) జరగాల్సిన మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయ్యింది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ధర్మశాలకు పక్కనే ఉన్న జమ్మూ, పఠాన్ కోట్లో దాడులు జరగడంతో ధర్మశాలలో కరెంట్ను ఆపేశారు. మొదట ఫ్లడ్లైట్ల సమస్య అని చెప్పినా తర్వాత పాక్ దాడులు మొదలుపెట్టడంతో వెంటనే స్టేడియాన్ని ఖాళీ చేయించారు.
అయితే, మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో బీసీసీఐ విచారం వ్యక్తం చేసింది. స్టేడియంలో ఉన్న క్రికెట్ అభిమానులను తక్షణమే ఖాళీ చేయించారు. ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, ప్రసార సిబ్బందిని సురక్షితంగా హోటల్కు తరలించారు ‘క్రీడాకారులందరినీ పఠాన్ కోట్కు రోడ్డు మార్గంలో తీసుకెళ్తాం. అక్కడి నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి తరలిస్తాం. ప్రస్తుతానికి మ్యాచ్ రద్దైంది. రేపటి పరిస్థితిని బట్టి టోర్నీ భవిష్యత్పై నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి మాకు క్రీడాకారుల భద్రత ఎక్కువ ముఖ్యమైంది’అని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వెల్లడించారు.
అంతేకాకుండా ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ మరో నిర్ణయం తీసుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 నిర్వహించడం సరికాదని నిర్ణయించింది. ఐపీఎల్ లీగ్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం(మే 9) ఉదయం జరిగిన సమావేశంలో వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ లీగ్ దశలో భాగంగా ఇంకా 12 మ్యాచ్లున్నాయి. లక్నో, హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబయి, జైపుర్ నగరాలు ఈ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.