
నాగోల్ సమీపంలోని అల్కాపురి కాలనీలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు పది గుడిసెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సాయి నగర్ కాలనీలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో పెను విషాదం తప్పింది.
ప్రమాదం జరిగిన తీరును ప్రత్యక్షంగా చూసిన స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఒక గుడిసె నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే ఆ మంటలు పక్కనే ఉన్న గుడిసెలకు కూడా వ్యాపించాయి. దీనికి ప్రధాన కారణం బలమైన గాలులు వీస్తుండటమేనని భావిస్తున్నారు. ఒక గుడిసెలో వంట కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని కొందరు అనుమానిస్తుండగా, మరికొందరు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం జరిగిన గుడిసెల్లో నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉండటంతో వెంటనే బయటకు వెళ్లారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.
మంటలతో కూడిన దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే కొందరు అగ్నిమాపక శాఖతో పాటు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే నాగోల్, ఉప్పల్, మల్లాపూర్ ప్రాంతాల నుండి నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే, కాలనీలోని ఇరుకైన వీధుల కారణంగా అగ్నిమాపక యంత్రాలు మంటలు చెలరేగిన ప్రాంతానికి చేరుకోవడానికి కొంత సమయం పట్టింది.
అగ్నిమాపక సిబ్బంది శ్రమించి దాదాపు రెండు గంటల పాటు పోరాడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సమయంలో పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు మరో వైపు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుడిసెల్లోని గడ్డి, ఎండు కర్రలు, ప్లాస్టిక్ వస్తువులు, ఇతర మండే స్వభావం కలిగిన పదార్థాలు ఉండటం వల్ల మంటలు చాలా వేగంగా వ్యాపిచెందాయని ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు. భారీ మంటల కారణంగా ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో నిండిపోయింది. దీంతో చాలా సేపు స్థానికులు ఊపిరాడక చాలా ఇబ్బందులు పడ్డారు.
ప్రమాదంలో తమ ఇళ్లను కోల్పోయిన బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారికి ఆహారం, నీరు తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు స్థానికంగా ఉన్న పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. నష్టపోయిన వారికి ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. జరిగిన ఆస్తి నష్టం విలువ ప్రాథమిక అంచనాల ప్రకారం లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది. అయితే, పూర్తిగా అంచనా వేసిన తర్వాత మరింత స్పష్టత వస్తుంది.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు ఏమిటనే దానిపై అధికారులు కూపీ లాగుతున్నారు. గ్యాస్ లీకేజీ, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా మరేదైనా ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ దుర్ఘటన నివాసిత ప్రాంతాల్లో భద్రతా వైఫల్యాలు మరోసారి బయటపడ్డాయి. ఇరుకైన వీధుల వల్ల అగ్నిమాపక సిబ్బంది సరైన సమయానికి వచ్చినప్పటికీ సంఘటన స్థాలానికి చేరుకోలేకపోయారు. ప్రభుత్వం ఇలాంటి ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి, నాగోల్ సమీపంలోని అల్కాపురి కాలనీలో జరిగిన ఈ అగ్నిప్రమాదం పెను విషాదాన్ని తప్పించినప్పటికీ, అనేక కుటుంబాలను నిరాశ్రయులను చేసింది. ప్రభుత్వం, కొంత మంది దాతలు ముందుకు వచ్చి వారికి తక్షణ సహాయం అందించాలని స్థానికులు ఆశిస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.