
తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో వేలమంది ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారు. ఉద్యమం విజయవంతం కావాలని, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడాలని కోట్ల మంది ఆశించారు. తెలంగాణ ఉద్యమంలో తమ రచనల ద్వారా క్రీయశీలకంగా పాల్గొన్న ఇద్దరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి జనధర్మ వరంగల్ వాణి పత్రికా మొదటి సంపాదకులు ఎంఎస్ ఆచార్య, రెండో వ్యక్తి కేఎల్ రెడ్డి. బాలాజీ ప్రింటింగ్ ప్రెస్ వద్ద ఈ ఇద్దరు వ్యక్తులు ఎన్నోసార్లు కలుసుకుని మనసు విప్పి మాట్లాడుకునే వారు. జనధర్మ ప్రచురించే కథనాలు, సమకాలీన అంశాలు, జర్నలిజం మీద తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకునేవారు.
“పెద్ద పత్రికలో చిన్నజర్నలిస్టుగా పనిచేయడం మంచిదా? లేక చిన్న పత్రికైనా భారీ ప్రచురణలు చేస్తూ, తమదైన ముద్రవేయడం గొప్పా?” అని ఆచార్యను ఒకానొక సందర్భంలో కేఎల్ రెడ్డి అడిగారు. ఆచార్య నడిపించేది చిన్నపత్రిక అందుకే కేఎల్ రెడ్డి ఆ విధంగా ప్రశ్నించారు. “పెద్ద పత్రిక లక్షల మందికి వరకు చేరుతుంది. ఒకవేళ జిల్లా ఎడిషన్ అనుకున్నా కొన్ని వేలమందికి చేరుతుంది. మీరు ఎంతలా వార్తలను సేకరించి, మంచిమంచి కథనాలతో ఎంత గొప్పగా ప్రచురించినా, ఎందరికి అందుతుందో తెలుసా”ని ప్రశ్నించారు. ఇటువంటివ విషయాలను దృష్టిలో పెట్టుకొని, వరంగల్లు జర్నలిస్టుగా పెద్దప్రతికలో ఉండడమే మంచిదని కేఎల్ రెడ్డి అనుకునేవారు. మొదట వరంగల్లు విలేకరిగా కేఎల్ రెడ్డి పని చేశారు. ఆ తర్వాత ఈనాడు సబ్-ఎడిటర్గా సేవలు అందించారు. ఆ తర్వాత ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమిలాంటి పత్రికలకు తన రచనలను అందించారు.
1950 సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీలో కేఎల్ రెడ్డి తన డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత సూర్యదేవర రాజ్యలక్ష్మి ప్రచురించే తెలుగు దేశం రాజకీయ వారపత్రికతో చేరి, తన సుదీర్ఘ జర్నలిజ యాత్రను కొనసాగించారు. ఠాకూర్ హరిప్రసాద్కు చెందిన ఆంగ్ల పత్రిక ‘ఇండియన్ హెరాల్డ్’లో హైదరాబాద్ వేదికగా పనిచేశారు. స్వర్గీయ వీ హనుమంతరావు వారపత్రికలోనూ, జీ రామారావు ‘వారంవారం’లోనూ, బైసా దేవదాసు ‘నేటి నిజం’లోనూ, పాంచజన్య ‘మహానగర్’ అనే పత్రికలలో వార్తలను రాశారు. అంతేకాకుండా, 1969 నాటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నడిపిన ‘తెలంగాణప్రభ’లో కూడా చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినపుడు 14 స్థానాల్లో 10 లోక్సభ స్థానాలను తెలంగాణ ప్రజాసమితి గెలిచింది. ఈ సందర్భంగా ‘తెలంగాణ సింహ కిశోరం’ కేఎల్ రెడ్డి ప్రశంసిస్తూ రాశారు. ఆ తర్వాత కేఎల్ రెడ్డినే ‘తెలంగాణ ద్రోహి చెన్నా’ అని మొహమాటలేకుండా నిర్భయంగా రాసి మర్రి చెన్నారెడ్డి చర్యలను ఖండించారు.
నేరం- జైలు శిక్ష..

1969 కాలంలో తెలంగాణ కోసం నేడు అనే పేరుతో వారం వారం ఒక “కరపత్రిక”ను ప్రచురించారు. తెలంగాణ ఉద్యమ వార్తలను ఇందులో ప్రముఖంగా ప్రచురించేవారు. ఆయన చేసిన నేరం ఏంటంటే వార్తాపత్రికల రిజిస్ట్రార్ అనుమతి లేకుండా పత్రిక స్థాయిలో “నేడు”ను వెలువరించడమేనట. అసలు కారణమేంటంటే అప్పుడున్న ముఖ్యమంత్రికి, అధికార పార్టీకి, ఎంపీ లేదా ఎమ్మెల్యేకి తన పత్రికలో వచ్చే కథనాలు నచ్చలేదు. దీంతో ఏదో ఒక వంకతో కేఎల్ రెడ్డిని అధికారుల ప్రోద్బలంతో పోలీసులు అరెస్టు చేశారు. జడ్జి ముందు నిలబెట్టియించారు. న్యూస్ పేపర్స్ రిజిస్ట్రేషన్ చట్టం రూపకల్పన కోసం బ్రిటిష్ కాలపు ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్ యాక్ట్- 1867ను ఉపయోగించుకున్నారు. పోలీసులైనా, ప్రభుత్వాధికారులైన సరే ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ఒక పౌరుడిని జైలు పాలు చేస్తారని ఈ చర్యలు రుజువు చేస్తాయి. ఈ చట్టాన్నే 2023లో పార్లమెంట్లో బిల్లుగా ఆమోదించారు. అప్పుడైనా ఇప్పుడైన ఉన్నది ఉన్నట్టు రాసే జర్నలిస్టులను జైలు జీవితం తప్పట్లేదు. ఇటువంటి చర్యలకు, నిర్బంధాలకు పాల్పడడానికే ది ప్రెస్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా(పీఆర్జీఐ) యాక్ట్- 2023ను ప్రవేశపెట్టారు. న్యూస్ ప్రచురించినందుకు శిక్ష విధించే అన్యాయమైన ఈ చట్టాన్ని పాత చట్టంలానే తెచ్చారు. చట్టాన్ని ఆమోదించే సమయంలో ఆధునిక కాలానికి అనుకూలంగా మార్చామని ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకుంది.
అప్పుడూ ఇప్పుడూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమే. రకరకాల కారణాల పేరుతో ఇప్పుడు కూడా అధికారాన్ని, చట్టాలను దుర్వినియోగపరుస్తూ ఆరునెలలు ఎవరినైనా జైలుకు పంపవచ్చు. లేదా పది వేల నుంచి రెండులక్షల వరకు జరిమానా విధించవచ్చు. ఆ కాలంలో కేఎల్ రెడ్డికి నెల రోజులపాటు కఠిన కారగార శిక్ష విధించారు. దీంతో ముషీరాదాబ్ జైలులో శిక్షను అనుభవించారు. “మీరు హత్య చేశారా, దొంగతనమాని”అని తోటి ఖైదీలు అడిగిన దానికి కేఎల్ రెడ్డి సమాధానంగా ‘‘నేను ఎటువంటి నేరం చేయలేదు. ఒక కరపత్రికను ప్రింట్ చేశానంతే’’ అన్నారు. ఈ మాటతో “అవునా.. ఇదో నేరమా?” అని ఖైదీలు పెద్దగా నవ్వుకున్నారు.
పెద్ద పత్రికలలో పెద్ద స్థాయిలో పనిచేస్తే అన్ని విధాలుగా లాభం, ప్రోద్బలం ఉంటుంది. ప్రతిపక్షం వారయితే అధికార పక్షం వారి పోలీసులు అరెస్టు చేస్తారు. అధికారులు 14 రోజుల దాకా రిమాండ్ పేరుతో జైలుకు పంపిస్తారు. హైకోర్టుకు వెళ్లాలి, ఇది పెద్ద ఖర్చు. ఓడిపోవచ్చు. తప్పదు కనుక సుప్రీంకోర్టుకు వెళ్లాలి. ఇది మరీ పెద్ద ఖర్చు అవుతుంది.
ప్రతిపక్ష పార్టీ అయితే భారీ ఎత్తున ఫీజుచెల్లించాలి. వాదించడానికి ఒక సీనియర్ లాయర్ ఉండాలి. ఒకరుంటే సరిపోదు. కాబట్టి, గంటకు లక్షలరూపాయలు ఫీజు చెల్లించే ఇద్దరు, ముగ్గురు సీనియర్లు ఉండాలి. పోటీగా అధికార తెలుగుదేశం పార్టీవారు కూడా గంటకు కొంత లక్షల రూపాయల డబ్బు ఫీజు చెల్లించాలి. ఆర్టికిల్ 19(1)(ఎ) అనే భారత రాజ్యాంగం ప్రకారం పత్రికా స్వాతంత్ర్యం లేదా? టీవీ షోలో మాట్లాడినందుకు ఎంతో విలువైన స్వేఛ్చ సాధిస్తారు. పెద్ద పత్రికలో పెద్ద టీవీ షో యాంకర్ వంటి స్వేచ్ఛను రాజ్యాంగం రక్షిస్తుంది. కానీ కేంద్ర రాజకీయ పెద్దతనానికి సంబంధించి విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి అయినా సరే జైల్లో రెండుమూడు నెలల కారాగార శిక్షను విధిస్తారు.
కేఎల్ రెడ్డిలాంటి చిన్నపత్రికల రచయితలు అంత పెద్ద మొత్తంలో జరిమానాలు కట్టలేరు. జిల్లా కోర్టు దగ్గరే ఆగిపోయి మూడు నెలలు జైలు జీవితాన్ని అనుభవిస్తారు. అందుకే చిన్న పత్రికలలో పెద్ద విలేకరికి ఎటువంటి లాభం ఉండదు. అప్పుడు మోపపడిన తప్పు వల్ల ‘‘నేడు’’ అనే కరపత్ర రచయిత కేఎల్ రెడ్డి జైల్లో ఉంటారు, ఉన్నారు. ఇంకా పెద్ద మరో పార్టీ అయితే, అధికార పక్షంవారైతే అసలు అరెస్టు చేయనే చేయరు. ప్రతిపక్షం అయితే ఇక చెప్పేదేముంది?
రామోజీరావు ఒక ఇంటర్వ్యూలో కేఎల్ రెడ్డిని ‘‘నువ్వు తాగుతావా?’’ అని అడిగారట. ‘‘నేను తెలంగాణ రెడ్డోణ్ణి. రెడ్లందరూ తాగుతారు. నేనైనా అంతే. పండగలూ- పబ్బాలూ, పెళ్లి, పెండ్లిండ్లూ వస్తే తాగుతాం. కానీ తాగి వాంతులు చేసుకోలేదు. పండుగల్లో పబ్బాల్లో తాగితే తప్పా” అని అన్నారు. ముక్కుసూటితనం నచ్చి రామోజీరావు ఉద్యోగం కల్పించారు.
రామోజీనే నిలదీసిన కేఎల్ రెడ్డి..

తన ఈనాడు పత్రికలో తప్పులు దొర్లినపుడు రామోజీరావు ఘాటుగా స్పందించేవారు. ఇటువంటి వాటి మీద చర్యలు కూడా తీసుకునే వారు. రచన బాగుందనుకుంటే నగదు బహుమతి కూడా ఇచ్చేవారు. ఒకసారి ఎడిటోరియల్ బృందంతో సమావేశం జరిగింది. పేపర్ను నిశితంగా పరిశీలించినప్పుడు ఏవైన తప్పులు కనబడితే, నిర్వహించే సమావేశాలలో పలువురు ప్రముఖులకు వాయింపులు వచ్చేవి. సమావేశం జరగబోతుందంటే ఉద్దండులు కూడా భయపడేవారు. అంతటి చండశాసనుడైన చైర్మన్ను పట్టుకుని ఒకానొక సందర్భంలో ‘‘మీరసలు పేపర్ చదివారా?’’ అని కేఎల్ రెడ్డి అన్నారు. దీనికి చైర్మన్ నవ్వేశారట. అది రామోజీరావు గొప్పతనం.
ఆ తరువాత కేఎల్ రెడ్డి ఆ పెద్ద పత్రికను వదిలేసి, అనేకానేక చిన్న పత్రికలకు పెద్దదిక్కుగా నిలబడ్డారు. తన చివరి జీవితాన్ని మొత్తం వీటికే అంకితం చేశారు. 93 ఏళ్ళ తరువాత మరణించారు.
సమ్మె తదనంతరం ..
పత్రికలు, రాతలు తప్ప మరో పేజీ తిప్పి చదవడం తెలియని అమాయకుడు కేఎల్ రెడ్డి. నిజమైన, గట్టిగా కట్టుబాటు కలిగిన పాత్రికేయ రచయిత. అయితే చారిత్రకమైన ఈనాడు సిబ్బంది సమ్మెలో కేఎల్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మొత్తానికి అయితే ఈ సమ్మెను అణచివేశారు. సిబ్బంది మీద కేసులు పెట్టారు. కీలకమైన ఒకరిద్దరిని ఎంపిక చేసి వారిని ఇబ్బంది కూడా పెట్టారు.
హైదరాబాద్ పత్రికా రచయితలు సమ్మె నిర్వహించిన సమయంలో, అన్నీతానై వివిధ కార్యక్రమాలను ఓ కమిట్మెంట్తో కేఎల్ రెడ్డి నడిపారు. పాత్రికేయ వృత్తిలో సమర్థులైన ఎంవీఆర్ శాస్త్రి, కేఎల్ రెడ్డితో కలిసి పనిచేశారు. ఆ తరువాత కాలంలో ఆంధ్రభూమి సంపాదకుడిగా ఎంవీఆర్ శాస్త్రి 20 సంవత్సరాలు పనిచేశారు.
ఏ పత్రికయినా ప్రతిపక్షంగా ఉండాల్సిందే, ప్రజల తరఫున గొంతు వినిపించాల్సిందే. పత్రిక ఒక బలమైన ప్రతిపక్షంలా జనం పక్షాన ఉండాలనే సూత్రాన్ని కేఎల్ రెడ్డి నమ్మారు. తన జీవితాంతం తాను పనిచేసిన ప్రతీచోట తన చర్యల ద్వారా చూపించారు. దీన్నే నిబద్దత అంటారు. ఇది చాలామందికి అర్థం కాదు.
అయితే, సమ్మె పోరాటానికీ ఈ నిబద్ధతకు సంబంధం ఏంటి? అందరూ జర్నలిస్టుల నుంచి సమ్మె సమయంలో విమర్శలను ఎదుర్కొంటూ ఈనాడు కోసం ఒక్కొక్క క్షణాన్ని వెచ్చించారు. పత్రికను నిలబెట్టడానికి ప్రతీ అక్షరాన్ని అందించారు. ఇదంతా డబ్బుకోసమా? లేక ఎడిటర్గా గొప్ప పదవి వస్తుందనా? కాదు. మంచి జీతం ఉన్నా, ఎడిటర్ తరువాత మంచి పదవి ఇస్తే బాగుంటుందనుకోవచ్చు కదా. కేవలం పత్రికా లైబ్రరీ పైన చిన్న గదిలో ఉంటూ, ప్రతిపక్షాన్ని గెలిపించాలనే కమిట్మెంట్ ఎందుకు? ఎవరికి లాభం? అని ఎప్పుడూ అనుకొలేదు. మరి అంతగా నమ్మిన పత్రికను మూడుసంవత్సరాల తరువాత కేఎల్ రెడ్డి ఎందుకు వదిలేయవలసి వచ్చిందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సమాధానం మరొక సంఘటనలో దొరుకుతుంది.
ఈనాడులో ఎందుకు రాజీనామా చేశారు?
ఓ రోజు హటాత్తుగా కేఎల్ రెడ్డి ఈనాడులో ఉద్యోగానికి రాజీనామా చేశారు. నిష్పాక్షికంగా ఉండవలసిన పత్రికా రచయిత ఒక పార్టీకి అంకితం కావడం, మరొక పార్టీని వ్యతిరేకించడం, ఒక పాలసీగా, పార్టీ, వ్యాపారం కోసం మార్చడం మంచిదాని తనను తాను ప్రశ్నించుకున్నారు. ఆయన మనసు ఒప్పుకోలేదు. మనసు ఒప్పుకోని, తాను ఇష్టపడని పనిని కేఎల్ రెడ్డి చేయరు. అదే ఆయన వ్యక్తిత్వం.
కేఎల్ రెడ్డి ఎవరినీ లెక్కచేయరు. నచ్చకపోతే వినరు. తెలంగాణా ఊసే ఎవరికీ, ఏ నాయకుడికీ పట్టని కాలాన 1980లోనే “తెలంగాణ” పత్రిక పెట్టి అన్యాయాలపై ధ్వజమెత్తారు. తెలంగాణ క్షేమం కోసం తపించి, నిస్వార్థంగా తెలంగాణ కోసం కేఎల్ రెడ్డి పోరాడారు. అప్పట్లో ఫతే మైదాన్ ప్రాంగణంలో చిన్నగదిలో ఉండి అక్కడి నుంచే పత్రికను నడిపారు.
కేసీఆర్ ఆర్థిక సహాయం..
అది 2016 సంవత్సరం ఒక రోజు ఆంధ్రభూమి ఆఫీసులో ఎంవీఆర్ శాస్త్రిని కేఎల్ రెడ్డి కలిశారు. “నెలకు 15 వేలు ఉంటే హాయిగా గడిచిపోతుంది. రోజూ వచ్చి వార్తలు, కథనాలు రాసి పెడతాను” అన్నారు. అప్పటికే కేఎల్ రెడ్డి వయసు 80 దాటింది. గూని కూడా వచ్చింది. “ఇంకా రాయటం నీ వల్ల కాదు. అది పరిష్కారం కూడా కాదు. నీ గురించి పత్రికలో ప్రత్యేక వ్యాసం వేద్దాం. దాన్ని చూపించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయానికి ప్రయత్నం చేద్దాం” అని ఎంవీ ఆర్ శాస్త్రి అన్నారు.
అన్నట్టుగానే ప్రముఖ రచయిత గోవిందరాజు చక్రధర్ కేఎల్ రెడ్డి మీద వ్యాసం రాశారు. ఆ వ్యాసం “భూమిక” మొదటిపేజీలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఎవరూ పనిగట్టుకుని పైరవీ చేయాల్సిన అవసరం లేకుండా అందరికంటే ముందు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన సిబ్బందితో కేఎల్ రెడ్డికి పొద్దున్నే ఫోన్ చేయించి తన దగ్గరకు పిలిపించుకున్నారు. ‘‘నీకు పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నాను” అని కేసీఆర్ అంటే, “దాని వల్ల నాకు నెలకు 12 వేలు మిత్తి వస్తుందా”అని అడిగారు. కేఎల్ రెడ్డి అన్నమాటలకు కేసీఆర్ నవ్వి ఒక అధికారిని పిలిచి, “ఈయనకు ఎంత ఇస్తే నెలకు 12 వేలు మిత్తి వస్తుంది?” అని అడిగారు. ఆ అధికారి లెక్కచేసి 15 లక్షలని చెప్పారు. ‘‘సరే, 15 లక్షలు ఇస్తున్నాను’’ అని అక్కడికక్కడే 15 లక్షల చెక్కును కేఎల్ రెడ్డి చేతికిచ్చారనే సంఘటనను ఎంవీఆర్ శాస్త్రి గుర్తుచేసుకున్నారు.
దొందు దొందే..
తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఓ పార్టీని కేసీఆర్ ప్రారంభించబోతున్నారని 2001లో కేఎల్ రెడ్డికి తెలిసింది. ఒకరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసగృహం నుంచి కేసీఆర్ వస్తుండగా ‘మనిషి బక్కపలుచగా ఉన్నాడు. అతని ముక్కుతో ఓ కార్టూన్ వేసుకోవచ్చు. ఆయనలో ఆత్మవిశ్వాసం గుండె నిండా కనిపిస్తున్నాయి’ అని కేఎల్ రెడ్డి అనుకున్నాడట. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంటే కేఎల్ రెడ్డికి చాలా ఇష్టం. తెలంగాణ రాష్ట్ర సమితిని సమర్థించారు. కాంగ్రెస్, బీజేపీ దొందుదొందే అని తెలిసిన తరువాత కేసీఆర్ సరైన నాయకుడనీ, ఆయన కన్నా కేటీఆర్ సమర్థుడని చక్రధర్ అన్నారు.
కేవలం పత్రిక విషయంలోనే కాదు. వార్తా కథనాలలో వాడే అక్షరాల మీద కూడా కేఎల్ రెడ్డి దృష్టి పెట్టేవారు. అక్షరాల విషయంలో జాగ్రత్త పడేవారు. “వార్తలు రాస్తున్నపుడు ‘‘నిరుడు’’ అనడం చాలు కదా, ‘‘గత సంవత్సరం’’ అని రాయడం వల్ల ఎక్కువ పదాలను వాడాల్సి ఉంటుంది. భార్య అంటే సరిపోతుంది. కానీ సతీమణి అని పత్రికల్లో రాస్తూ ఉంటారు. అసలు రాసేవాళ్లకు దాని అర్థం తెలుసా? బహుభార్యలలో మణివంటిదని. ఇది ఎంత వరకు సబబు? భార్య అనకుండా సతీమణి అనడం ఎందుకు? జర్నలిస్టులకు ఇదొక పాఠం. ‘‘.. ఆ పార్టీ నాయకుడు మాట్లాడుతూ … అని అన్నాడు’’ అని రాస్తారు. మాట్లాడకపోతే ‘అనడం’ ఎందుకు? మరో మాట ‘‘ముఖ్య అతిధి బహుమతి ప్రదానం చేశారు’’ బదులు “ఇచ్చారు” అంటే చాలు కదా.
కేఎల్ రెడ్డి తన వార్తలతో జనాన్ని కదిలించారు, వారిని ఆలోచించేలా చేశారు. తాను నమ్మిన వ్యక్తిగత సిద్ధాంతానికి, భావజాలానికి కట్టుబడి పనిచేశారు. పత్రికలు ప్రజల కోసం కానీ, ధనికుల కోసమో ప్రభుత్వాల కోసమో కాదని నమ్మారు. తన రాతలలో, చర్యలలో వీటిని ప్రతిబింబించారు.
(జూన్ 21న జర్నలిస్టు కేఎల్ రెడ్డి జయంతి..)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.