
తెలుగు రాష్ట్రాల్లో కవిగా, విమర్శకునిగా, అనువాదకునిగా, అధ్యాపకునిగా సౌభాగ్య ప్రసిద్ధులు. తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో సౌభాగ్య విశేష కృషి చేశారు. సంధ్యా బీభత్సం, కృత్యా వ్యవస్థ, సింహావలోకనం, పునరుత్థానం, ప్రేమ కవితలు, ప్రసిద్ధ ఉర్దూ కవులు, ఆధునిక ప్రపంచకవులు, ఇరవయ్యో శతాబ్దం ఇంగ్లీషు కవులు, ఈ కాలం కవులు, ప్రపంచ సాహిత్య పరిచయం గ్రంథాలు, ఆస్కార్ వైల్డ్ ఆలోచనలు, పాశ్చాత్య సంగీతకారులు, ఈసఫ్ కథలు, గ్రీకు రోమన్ కథలు, అక్బర్ బీర్బల్ కథలు, ఓషో రచనల పరిచయంలాంటి ఎంతో విలువైన గ్రంథాలను సౌభాగ్య రాశారు.
సాభాగ్య అనేది కలం పేరు. అసలు పేరు విజయకుమార్. తెలుగు పాఠకలోకానికి జిడ్డుకృష్ణమూర్తి ఆలోచనలను పరియచం చేస్తూ “జిడ్డు కృష్ణమూర్తి ఆలోచనలు” అనే పుస్తకాన్ని సౌభాగ్య రాశారు. ద్వైదీభావాన్ని, వైరుధ్యాన్ని అధిగమిస్తూ అధ్యయనం చేయాల్సిన పుస్తకం ఇది.
తన తమ్ముడు చనిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయిన జిడ్డు కృష్ణమూర్తి సత్యాన్వేషణలో పడ్డారు. కోట్ల ఆస్తిని వదిలి బుద్ధుని అన్వేషణలో మునిగారు. ప్రపంచమంతా పర్యటించారు. ఆ తర్వాత తనకు తెలిసిన జ్ఞానం, జీవిత సత్యాలు, ఉపన్యాసాలుగా కృష్ణమూర్తి ప్రజలకు చెప్పారు. ఈక్రమంలోనే ఒకానొకసారి జిడ్డు కృష్ణమూర్తిని అనిబిసెంట్ ఐరోపా తీసుకెళ్లారు.
అయితే, ఆయన ఆలోచనలు తెలియజేస్తూ సత్యం ఎంత బలమైనదో 45 భాగాల్లో సౌభాగ్య అద్భుతంగా, అర్థవంతంగా అక్షరీకరించారు. ఈ పుస్తకంలో సత్యం అన్నది ఎంత “స్వచ్ఛమైనదో, మన సరిహద్దులకు లొంగనిదో గ్రంథం తెరిస్తే తెలిసి వస్తుంది. ఎన్నో జీవిత సత్యాలను జిడ్డు కృష్ణమూర్తి తెలియజేస్తే, సౌభాగ్య తెలుగుపాఠకులకు పరియచం చేశారు.
ఏకాంతం- ఒంటరితనం, జీవించడం- మరణించడం, మతం- దేవుడు, ధ్యానం- జ్ఞానం, యధార్థం- సత్యం, బాధ- విషాదం, హింస- భయం, కోరిక- సెక్స్, మానవ సంబంధాలు- నమ్మకం, ఆధిపత్యం- అధికారం, చర్య- చేతన, తెలివి- బుద్ధిబలంలాంటి అంశాలపై చక్కటి విశ్లేషణతో పాఠకులకు అవగాహన కల్పిస్తారు. సీరియస్గా ఒక లక్ష్యం, ఆశయం, తర్కబద్ధమైన ఆలోచనతో అర్ధం చేసుకుంటూ ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి.
సాంకేతిక జ్ఙానం- మానసిక జ్ఞానం మనిషికి ఎంతో అవసరం. వివేకం ఉండాలి. మన అంతః చేతనలో, చేతనలో పేరుకుపోయిన గతాన్ని నిర్మూలించాలి. అప్పుడే ప్రేమ పుడుతుంది. ఆత్మజ్ఞానం అన్నది ఏ క్షణానికాక్షణం తెలిసి వచ్చేదే. ఈర్ష్య, ద్వేషం, దురాలోచన, భయం, కాంక్ష, అత్యాశ, వగైరాలన్నీ మనలిని ఒకలాగే నడిపిస్తాయి. ఆర్థిక- సామాజిక అంతరాలు మనలిని వేరుచేస్తున్నాయి. మనిషి నమ్మకంతో పనిచేయాలి. మనమే ప్రపంచం, మన సమస్యలే ప్రపంచ సమస్యలు. ఇలా ఎన్నో అంశాలు , శాస్త్రీయ అన్వేషణాపూర్వక విశ్లేషణే “జిడ్డు కృష్ణమూర్తి ఆలోచనలు”అనే ఈ గ్రంథం.
సమీక్షకులు: తంగిరాల చక్రవర్తి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.