
ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నీ యుద్ధ వాతావరణంలో మునిగి తేలుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మూడవ ప్రపంచ యుద్ధం తప్పదని కొందరు పరిశీలకులు చెపుతున్నారు. అయితే, మానవ సమాజానికి యుద్ధం అవసరమా? పరిణతి సాధించిన మానవుడు సహృదయంతో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోలేడా? అని అనిపిస్తుంది. ఒక్క యుద్ధం కొన్ని తరాల మీద ప్రభావం చూపుతుంది కదా? కాలుష్యం పెరిగిపోతుంది, ప్రగతి కుంటుపడుతుంది కదా? కుట్రలు, కుతంత్రాలతో వివేచన లేని నాయకులంతా అధికారం చేజిక్కించుకోవడడం వల్ల, అహంభావంతో నిర్ణయాలు తీసుకుంటున్నందు వల్ల కదా ప్రపంచం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది? ఏదిఏమైనా, యుద్ధం ఎప్పుడూ వాంఛనీయం కాదు. అది మానవ సమాజాన్ని అతలాకుతలం చేస్తుంది. మానవీయ విలువలకు విలువిచ్చే వారు ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు. ఉగ్రవాదాన్ని అసలే సమర్ధించరు. అది ఏ మతానికి చెందిన ఉగ్రవాదమైనా!
ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది యుద్ధమా? బౌద్ధమా? అన్న ఆలోచన రాగానే అశోకుడి కళింగ యుద్ధం గుర్తుకొస్తుంది. పశ్చాత్తాపంతో ఛండాశోకుడు కరుణామయుడిగా మారడం. ఆయుధాలను వదిలేసి, బౌద్ధం స్వీకరించడం గుర్తుకొస్తుంది. అంతేకాకుండా ఈ దేశాన్ని, చుట్టు పక్కల దేశాలన్నింటినీ బౌద్ధ దేశాలుగా మార్చిన విషయం గుర్తుకొస్తుంది. తన సొంత కొడుకును, కూతురినీ బౌద్ధవ్యాప్తి కోసం పనిచేసేలా చేయడం గుర్తుకొస్తుంది. ఆధునిక సాహిత్యంతో పరిచయం ఉన్నవారికి ప్రపంచ ప్రసిద్ధ రచయిత లియోటాల్స్టాయ్ నవల “వార్ అండ్ పీస్” గుర్తుకొస్తుంది.
“ఈ ప్రపంచం నాశనమైతే అది తుపాకుల వల్లనో, మిస్సైల్స్ వల్లనో, అణుబాంబుల వల్లనో కాదు. నైతిక విలువ పతనం వల్ల నాశనమౌతుంది” అని మహాశాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నారు. “శాంతిని నెలకొల్పే శక్తి ఒక్క బోధిసత్వుడికి మాత్రమే ఉంది. బుద్ధుడు, ఏసుకు గురువు. ఏసు కశ్మీర్లో పదమూడేళ్లు ఉండి, బౌద్ధసారం గ్రహించి, బౌద్ద జీవన విధానం నేర్చుకుని వెళ్లాడు. ఏసు ద్వారానే బుద్ధుడి బోధనలు యూరప్ దేశాలకు చేరాయి. జాలి, కరుణ, దయ గురించి బుద్ధుడే మొదట చెప్పింది. ప్రకృతిని, ప్రాణులన్నింటినీ ప్రేమించాలని కూడా బుద్ధుడే చెప్పింది. ఇప్పుడు యూరోపియన్లు ఈ విషయం ఒప్పుకోరు. మళ్లీ అది వేరే విషయం. కానీ ఇదే వాస్తవం” అని ఐన్స్టీన్ రాసుకున్నారు.
యుద్ధం అనగానే, ఇతర దేశాలలో జరుగుతున్న యుద్ధాలతో పాటు, మన దేశంలో ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ కూడా గుర్తుకు వస్తుంది కదా? ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వివరాలు ఇద్దరు మహిళా ఆర్మీ ఆఫీసర్లు ప్రపంచానికి వెల్లడించారు(బ్రీఫింగ్). అది దేశ ప్రజలకు ఎంతో గర్వించే సన్నివేశంగా చెప్పుకోవాలి. ఆ ఇద్దరు ఆర్మీ మహిళలవి భిన్నమైన మతవిశ్వాసాలు. వారు భిన్నమైన నేపథ్యం గల కుటుంబాల నుంచి వచ్చారు. కానీ, దేశానికి సేవలందించడమే వారి లక్ష్యం. ఆ ఇద్దరు మహిళా ఆర్మీ అధికారుల్లో ఒకరు సోఫియా ఖురేషి అయితే, మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. భారత దేశానికి ఉన్న శక్తి ఏంటంటే వివిధ మతాల, వివిధ ప్రాంతాల సమైక్యతతోనే దేశం ముందుకొచ్చింది. దేశమంతటా ప్రతిరంగంలో ప్రతిరోజూ ఇలాంటి ఐక్యతను మనం సాధిస్తూ వస్తున్నాం. “హం ఏక్ హై” అన్న నినాదమే మనలని బలంగా, స్థిరంగా ఉంచుతుంది.
సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్లలానే సావిత్రిబాయి ఫూలే, ఫాతిమా షేక్లు కూడా. ఇందులో ఒకరు హిందువు, మరొకరు ముస్లిం. జ్యోతిబాఫూలే నేతృత్వంలో దేశంలో బాలికలకు విద్య అత్యవసరమని 1848లో పాఠశాలలను వీరిద్దరు ప్రారంభించి నిర్వహించారు. దాని ఫలితం 177 ఏళ్ల తర్వాత, తొలి సారిగా దేశంలో ఇప్పుడు మళ్లీ కనిపించింది. మిలట్రీ ఆపరేషన్లో ఇద్దరు మహిళలు ముందుండి నాయకత్వం వహించడం దేశం గర్వించదగ్గ అంశం. ఆనాడు అవమానాలకు, అవహేళనలకు గురైన ఫూలే దంపతుల కృషి, ఫాతిమా షేక్ తోడ్పాటు వృధా పోలేదని అనిపించింది.
“మా ప్రాధాన్యత మొదట దేశానికి, తరువాతే మతమైనా మరేదైనా” అని కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి తాజుద్దీన్ అన్నారు. తాజుద్దీనే కాదు, ఆయన తండ్రి కూడా భారత సైన్యంలో పని చేశారు. ఇప్పుడు తాజుద్దీన్ కూతురు కల్నల్ సోఫియా ఖురేషి “ఆపరేషన్ సిందూర్”కు నాయకత్వం వహించారు. సోఫియా భర్త కల్నల్ తాజుద్దీన్ బాగేవాడి కూడా ఆర్మీ ఆఫీసరే. బెలగావి- బెల్గామ్(కర్ణాటక)కు చెందిన బాగేవాడిని 2015లో బరోడాకు(గుజరాత్)చెందిన సోఫియా పెండ్లి చేసుకున్నారు. ఒక స్త్రీ ఎక్కడా మస్జీద్లో మౌలానా కాలేదు. గుళ్లో పూజారి కాలేదు. చర్చ్లో ఫాదర్(పోప్) కాలేదు. కానీ, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, ప్రధాని వంటి ఏ పదివికైనా ఎదగొచ్చు. ఈరోజు ఆపరేషన్ సిందూర్కు నాయకత్వం వహించే అవకావం రాజ్యాంగమే కల్పించింది. అందువల్ల డా బీఆర్ అంబేద్కర్ ఈ దేశ ప్రజలకు ఎంత విలువైనది సమకూర్చాడో అర్థం చేసుకోవాలి.
ఆపరేషన్ సిందూర్ ఎందుకు విజయవంతమైందంటే, రాజ్యాంగం ప్రకారం దేశరక్షణకు ఏర్పాటైన త్రివిధ దళాల భారత సేన అంకిత భావం, నైపుణ్యం మాత్రమే. మతతత్వంతో దశాబ్దకాలంగా దేశంలో ఊగిపోతున్న “జైశ్రీరామ్ సేన” ప్రమేయం ఇందులో ఏమీ లేదు. అందుకే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఏమన్నారు? “మేం భారత సైన్యానికి వెన్నుదన్నుగా ఉంటాం. ఉగ్రవాదాన్ని రూపుమాపడంలో దేశవ్యాప్తంగా మా క్యాడర్ అంతా సైన్యం వెంటే ఉంద”ని అన్నారు. పాలకుల పేర్లు ఎవరివీ తీసుకోలేదు.
మరోవైపు కొన్నికొన్ని దారుణాలు జరుగుతున్నాయి కదా? పహల్గాం ఉగ్రదాడిలో అమరుడైన నేవీ ఆఫీసర్ వినయ్ భార్యపై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం చాలా దారుణమైన విషయంగా పరిగణించాలి. హద్దులు దాటి సంస్కారహీనంగా ట్రోల్స్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లలో, అధికార బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులవే అధికంగా ఉన్నాయని తేలింది. అలాంటి అకౌంట్లు ఎందుకు బ్లాక్ చెయ్యలేదు? అధికారంలో ఉన్న నాయకుల జాతీయవాదం ఇదేనా? కల్నల్ సోఫియా ఖురేషిని “ఉగ్రవాదుల సోదరి”గా అభివర్ణించారొక అధికార పార్టీ బీజేపీ నేత. పాకిస్తాన్కు దేశరహస్యాలు అందించిన యూట్యూబర్ జ్యోతిమల్హోత్రా అధికార పార్టీకి సంబంధాలున్న వ్యక్తి. మరో అధికారపార్టీ నేత తప్పంతా పహల్గాం దాడిలో భర్తలని కోల్పోయిన మహిళలదని అన్నారు. భర్తలని కాల్చి చంపుతుంటే, ఈ మహిళలు ఉగ్రవాదులపై ఎందుకు తిరగబడలేదని ప్రశ్నించారు. టూరిస్ట్లకు భద్రత కల్పించలేని కేంద్ర ప్రభుత్వం, ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి, పౌరులదే తప్పు అన్నట్లు మాట్లాడొచ్చా? మరో అధికార పార్టీ నేత హైవే మీదనే ఒక మహిళతో లైంగికంగా కలిశారు. నైతికతలేని, విద్యలేని, దార్శనికులు కాని వారంతా అధికారంలో ఉంటే, దేశం ఎలా ఉంటుందో దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు.
నీతి, నిజాయితీ వదిలేసి మనువాదానికి భజనలు చేసే వారంతా ఎన్ని కుట్రలు చేసైనా అధికారం చేజిక్కించుకుంటున్నారు. అందుకే దేశం ఇంత ప్రమాదకరంగా తయారయ్యింది. రాజ్యాంగం స్థానంలో “మనుస్మృతి”ని తేవాలని పన్నుతున్న కుట్రలు దేశ ప్రజలకు స్పష్టంగా తెలిసిపోతున్నాయి. ఈ దేశం శతాబ్దాలుగా మనువాదానికి బలైపోతూ, చివరకు ఇలా తయారైంది. భారతదేశ చరిత్ర అంతా బౌద్ధానికి బ్రాహ్మణిజానికి జరిగిన సంఘర్షణే అని అన్నారు అంబేడ్కర్. నిజమే కదా? ఈ దేశం బయటి ఉగ్రవాదం కంటే అంతర్గత ఉగ్రవాదానికి ఎక్కువగా బలైపోతూ ఉంది. ఒకప్పుడు మహోన్నతమైన విలువలతో బౌద్ధ దేశంగా, విశ్వగురువుగా ప్రపంచానికి వెలుగులు పంచిన దేశాన్ని మనువాదులు వారి ఆధిపత్యం కోసం నాశనం చేసుకుంటూ వచ్చారు. ప్రపంచంలోనే తొలి బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఏర్పరిచి దేశవిదేశాల విద్యార్థులకు విద్యనందించిన దేశం ఇది. ఆ విద్యాలయాలను ఎవరు నాశనం చేశారు? ఎందుకు నాశనం చేవారు? చరిత్ర పుటల్లోకి పరిశీలనగా చూస్తే తెలుస్తుంది.
మనం చిన్నప్పుడు తరగతి గది గోడల మీద రాసిపెట్టిన వాక్యాలు చదువుతూ పెరిగాం. సత్యమునే పలుకుము/ అబద్ధమాడరాదు/ జీవహింస చేయరాదు/ మంచి అన్నది పెంచుము/ ప్రేమ, కరుణ, జాలి ముఖ్యము వంటివి. చదివీ చదివీ అవి మనకు కంఠతా వచ్చేశాయి. కానీ, వాటిని ప్రపంచానికి మొదటగా చెప్పిన మహనీయుడెవరు అన్న విషయం మన ఉపాధ్యాయులు మనకు చెప్పలేదు. తరువాత్తరువాత సత్యాన్నీ, అహింసని ఆయుధాలుగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహానుభావులు ఎన్నో ఉద్యమాలు చేపట్టారని తెలుసుకున్నాం. కానీ, వాటిని మొట్టమొదటగా చెప్పి, ప్రపంచం కళ్లు తెరిపించిన పరిపూర్ణుడు బుద్ధుడన్నే విషయాన్ని మనం చర్చించుకోలేదు. కారణం- మనువాదుల కుట్రలు! బుద్ధుడిని మరిపించి, వారు కల్పించిన దేవదేవతల ఆరాధన వైపు, మూఢ భక్తి వైపు మళ్లించారు. వాస్తవాలని మరిపించి, భ్రమల్లో ముంచేశారు.
సుమారు 2,500 ఏళ్ల క్రితం ప్రపంచంలో ఎక్కడా ఏ జ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో “కార్యకారణ సిద్ధాంతాన్ని” చెప్పి ఆధునిక వైజ్ఞానికి పరిశోధనలకు దారి వేసిన వాడు బుద్ధుడు. బుద్ధుడిని, బుద్ధుడి బోధనలని అర్ధం చేసుకున్న వారెవరైనా అసలు యుద్ధాన్ని సమర్ధిస్తారా? మానవవాదమన్న పదం ఆ ప్రాచీన యుగంలో లేదు. కానీ బుద్ధుడు బోధించింది. అశోకుడు ప్రచారం చేసింది. మానవవాదమే కదా?
పశ్చిమదేశాలకు బౌద్ధాన్ని పరిచయం చేసిన జర్మన్- అమెరికన్ రచయిత పాల్ కారస్(18 జులై 1852- 11 ఫిబ్రవరి 1919) ది గాస్పల్ ఆఫ్ బుద్ధ (1894)అనే గ్రంథాన్ని ప్రచురించారు. అందులో రాజగృహంలో బుద్ధుడు చెప్పిన మాటలు కొన్ని పొందుపరిచారు.
“ఒకరినొకరు మోసగించుకోకండి. ఒకరినొకరు తక్కువ చేసుకోకండి. మీ ఆధిక్యతను ప్రదర్శించకండి. అది, క్షణికం! కోపాన్ని, ద్వేషాన్ని, పగని వదిలేయండి. తల్లి బిడ్డను వేయి కళ్లతో ఎలా రక్షించుకుంటుందో, ప్రాణమివ్వడానికి ఎలా సిద్దపడుతుందో అలాంటి ప్రేమను మీరు మీతోటి వారికి పంచండి. ప్రేమకు హద్దులుండవని నిరూపించండి. జాలి, కరుణలతో కరిగిపోయే మృదువైన వ్యక్తిత్వాన్ని పెంచుకోండి. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరినైనా అక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. అసూయ, ద్వేషాలను పారద్రోలి ఏ స్థితిలో ఉన్నా అందిరీని ప్రేమిస్తూ, అన్యోన్యంగా ఉండడమే ఉత్తమ జీవిత మార్గం” అని రాజగృహంలో బుద్దుడు చెప్పిన జీవన సూత్రం. ఇది జీర్ణించుకున్న వారెవరైనా యుద్ధాలకు పూనుకుంటారా? ఆపరేషన్ సిందూర్కు నాయకత్వం వహించిన కల్నల్ సోఫియా ఖురేషి వ్యక్తిగతంగా బౌద్ధ అనుయాయి. తిరోగమిస్తున్న ప్రస్తుత దశలో భారతదేశ ప్రజలు ఉద్యమించాలి. విజ్ఞత లేని నాయకత్వాన్ని గద్దె దించాలి.
(వ్యాస రచయిత డాక్టర్ దేవరాజు మహారాజు, కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ తొలి పురస్కార గ్రహీత)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.