
మతోన్మాదాన్ని ఆయుధంగా వాడడానికి చరిత్రను తిరగరాసే, చరిత్ర బోధన, అధ్యయన పద్ధతులను మార్చే లక్ష్యాలతోనే ఎన్సీఇఆర్టీి పాఠ్యపుస్తకాల మార్పులు జరుగుతున్నాయంటున్నారు ఆదిత్య ముఖర్జీ, మృదులా ముఖర్జీ.
కొవిడ్-19 కల్పించిన అంతరాయాల వల్ల విద్యా కార్యక్రమం దెబ్బతిన్న విద్యార్థుల మీద చదువు భారం తగ్గించే అవసరం కొద్దీ తాము చేపట్టిన ‘హేతుబద్ధీకరణ’ కార్యక్రమంలో భాగంగానే తమ పాఠ్య పుస్తకాలలో ఇటీవల కొన్ని తొలగింపులు చేయవలసి వచ్చిందని ఎన్సీఇఆర్టీ డైరెక్టర్ వివరించారు.
ఇంతకన్న సత్యదూరమైన విషయం ఉండదు.
చరిత్ర, సమాజశాస్త్రం, రాజనీతిశాస్త్ర పాఠ్యపుస్తకాలలో తొలగించిన అంశాలను, అధికార పార్టీ సభ్యులు ఈ నేపథ్యంలో చేసిన రాజకీయ ప్రకటనలను, హిందూ మతోన్మాదులు చరిత్రను వక్రీకరించడానికి చేస్తున్న ప్రయత్నాల సుదీర్ఘ చరిత్రను విశ్లేషిస్తే, ఎన్సీఇఆర్టీ డైరెక్టర్ మాటలు ఎంత సత్యదూరమో స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుత ప్రయత్నం మతోన్మాదులు చారిత్రకంగా ప్రదర్శిస్తున్న కపటత్వపు ధోరణిలోనే ఉంది. తాము సాహసికంగా చేసిన పనులకు బాధ్యత వహించి, ప్రవాసం, జైలు నిర్బంధం, మరణశిక్ష వంటి పర్యవసానాలను కూడ ధైర్యంగా ఎదుర్కొన్న భగత్ సింగ్, గాంధీ, తిలక్ వంటి అసంఖ్యాక యోధులకు భిన్నంగా, గాంధీ హత్యకు ఏ సంస్థా బాధ్యురాలు కాదని చెపుతారు. (ఆ హత్యకు బాధ్యులెవరో రాసిన భాగాలను ఎన్సీఇఆర్టీ పాఠాల నుంచి తొలగించారు).
బాబ్రీ మసీదును ధ్వంసం చేయడం అనే ‘‘నేరపూరితమైన చర్య’’కు ఎవరూ బాధ్యులు కారని సుప్రీంకోర్టు అన్నట్టుగా, గుజరాత్ మారణకాండకు ఎవరూ బాధ్యులు కారని చెపుతారు. (అందుకు సంబంధించిన భాగాలన్నిటినీ ఎన్సీఇఆర్టీ పాఠం నుంచి తొలగించారు).
చరిత్ర వక్రీకరణల చారిత్రక విహంగావలోకనం
మతోన్మాద కార్యక్రమం సాగించాలంటే మతోన్మాద భావజాల వ్యాప్తి కేంద్ర స్థానంలో ఉండాలని ఆర్ఎస్ఎస్ తొలిరోజుల్లోనే గుర్తించింది. ఆ మతోన్మాద భావజాలానికి పునాదిగా చరిత్ర పట్ల ఒక ప్రత్యేక తరహా కథనం ఉంటుంది.
అందువల్లనే మహాత్మా గాంధీ హత్య తర్వాత వారి మీద విధించిన నిషేధాన్ని వారు కేవలం సాంస్కృతిక సంస్థగా మాత్రమే పని చేస్తారనే, రాజకీయాలకు దూరంగా ఉంటారనే వాగ్దానం మీద ఆధారపడి ఎత్తివేసినప్పుడు, వారు ఇక మతోన్మాద భావజాలపు ప్రచారం అనే కర్తవ్యానికి మాత్రమే పూర్తిగా బద్ధులై ఉండాలని నిర్ణయించుకున్నారు.
1950ల తొలిరోజుల నుంచీ, వారు స్థాపించిన పాఠశాలల ద్వారా (మొట్టమొదటి సరస్వతీ శిశుమందిర్ను ఆర్ఎస్ఎస్ అధినేత ఎంఎస్ గోల్వాల్కర్ ప్రారంభించాడని గుర్తుంచుకోవాలి), పాఠ్యపుస్తకాల ద్వారా, వక్రీకరించిన, పూర్తిగా ఊహాపోహలతో కల్పించిన చరిత్ర కథనాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు.
ఈ కథనం ఇతర మత సమూహాల ప్రజలను రాక్షసులుగా చూపుతుంది.
ఉదాహరణకు, ఆర్ఎస్ఎస్ పాఠశాలల పాఠ్యపుస్తకాలు, ఆరో తరగతిలో ఉన్న తొమ్మిది సంవత్సరాల లేలేత మనసులకు ఇస్లాం గురించి ఏమి బోధిస్తాయో చూడండి:
‘‘వాళ్లు వెళ్లిన చోటికల్లా చేతిలో కరవాలం పట్టుకుని వెళ్లారు… ఎదురైన ప్రతి దేశాన్నీ ధ్వంసం చేశారు. ప్రార్థనాలయాలనూ విశ్వవిద్యాలయాలనూ నేలమట్టం చేశారు. గ్రంథాలయాలను తగులబెట్టారు. మత గ్రంథాలను పాడు చేశారు. తల్లులనూ అక్కాచెల్లెళ్లనూ అవమానించారు. దయ, న్యాయం అనేవి వారికి తెలియవు.’
‘‘ఢిల్లీ లోని కుతుబ్ మినార్ … వాస్తవంగా సముద్రగుప్త చక్రవర్తి నిర్మించాడు. దాని అసలు పేరు విష్ణు స్తంభం…. ఈ సుల్తాన్ (కుతుబుద్దీన్ ఐబక్) వాస్తవంగా దానిలోని కొన్ని భాగాలను పడగొట్టి, దాని పేరు మార్చాడు.’’
ఇటువంటి నిందలే క్రైస్తవులు, పార్సీలు, వగైరా ఎందరి మీదనో చేశారు. ముస్లింలలాగనే వాళ్లందరినీ కూడా ‘‘పరాయివాళ్లు’’, ‘‘విదేశీయులు’’ అని నిర్వచించి, వాళ్లకు పూర్తి స్థాయి పౌరసత్వ హక్కుల అర్హత లేదని అన్నారు.
భారతదేశాన్ని పితృభూమిగానూ, పుణ్యభూమిగానూ గుర్తించేవారికి మాత్రమే భారతీయులుగా ఉండే అర్హత ఉంటుందని సావర్కర్ ఇచ్చిన నిర్వచనాన్ని వాడుకున్నారు. అది ఎంత అర్థరహితమైన నిర్వచనమంటే యూరప్, అమెరికా, కొరియాలలో ఉన్న క్రైస్తవులకు, లేదా జపాన్లోని బౌద్ధులకు ఈ నిర్వచనాన్ని అన్వయిస్తే, వాళ్లు నివసించే దేశాలలో వాళ్ల పవిత్ర స్థలాలు లేవు గనుక వారందరూ ఆయా దేశాలలో విదేశీయులు అయిపోతారు!
చరిత్ర వక్రీకరణకు ప్రభుత్వాధికార ఉపయోగం 1977-79
కాలక్రమంలో వేలాదిగా పెరిగిపోయిన ఆర్ఎస్ఎస్ పాఠశాలల్లో ఇటువంటి తరహా చరిత్ర పాఠాలను ప్రబోధిస్తుండడం సరిపోనట్టు, ఇటువంటి చరిత్రను ప్రభుత్వం నడిపే పాఠశాలల్లో, జాతీయ పాఠ్యాంశాలలో కూడ ప్రవేశపెట్టడానికి, లౌకిక, శాస్త్రీయ చరిత్ర మీద దాడి చేయడానికి ఆర్ఎస్ఎస్కు ప్రభుత్వాధికారం చేజిక్కినప్పుడల్లా, ఆ ప్రభుత్వాధికారాన్ని ఉపయోగించుకుని ప్రయత్నించడం ఇంకా ప్రమాదకరం.
అటువంటి మొట్టమొదటి దాడి 1977-79 మధ్య జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఆర్ఎస్ఎస్కు రాజకీయ/ఎన్నికల విభాగం అయిన జనసంఘ్, జనతా పార్టీలో విలీనమైనప్పుడు జరిగింది. మన మేధావులలో అత్యున్నతులూ, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందినవారూ అయిన రొమిల్లా థాపర్, బిపిన్ చంద్ర, సతీష్ చంద్ర, ఆర్ఎస్ శర్మ, అర్జున్ దేవ్ వంటి వారు రాసిన ఎన్సీఇఆర్టీ పాఠ్యపుస్తకాలను నిషేధించడానికి ప్రయత్నించారు. కాని ఆ సమయంలో దేశంలో ఎన్సీఇఆర్టీ ఇంకా చెప్పుకోదగినంత స్వయం ప్రతిపత్తి తో పని చేస్తుండిరది గనుక ఆ ప్రయత్నాన్ని దృఢంగా అడ్డుకున్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికి మరో ముఖ్య కారణం దేశంలో ప్రతిపక్షాలు ప్రధానంగా వామపక్షాలు పార్లమెంటరీ రాజకీయాల్లో మెరుగైన ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండటం కూడా.
ఎన్సీఇఆర్టీ లోపలీ నుంచీ, దేశవ్యాప్తంగా పత్రికా రంగం నుంచీ, విశ్వవిద్యాలయాల నుంచీ నిరసన పెల్లుబికింది. పుస్తకాలు నిషేధానికి గురి కాకుండా మనుగడ సాగించాయి.
1999 – 2004
ఆ తర్వాత, 1999లో కేంద్ర ప్రభుత్వాధికారాన్ని ఎన్డీఏ చేపట్టిన తర్వాత, అర్ఎస్ఎస్ రాజకీయ అంగంగా జనసంఘ్ స్థానంలో భారతీయ జనతా పార్టీ సారథ్య స్థానంలోకి వచ్చింది. గత అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్న భారతీయ జనతా పార్టీ మొదట పాఠ్యాంశాల నిర్ణాయక కమిటీల నుంచి కీలక వ్యక్తులను తొలగించింది.
ఎన్సీఇఆర్టీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఐసిఎస్ఎస్ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసర్చ్), ఐసిఎస్ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసర్చ్) వంటి సంస్థలలో అత్యున్నత పాలనాధికార స్థానాలలో తమ మాట వినేవాళ్లను నియమించారు. శాస్త్రీయ చరిత్రకారుల మీద మూకుమ్మడి దాడి ప్రారంభించడానికి ముందు ఈ పనులన్నీ చేశారు.
ఆర్ఎస్ శర్మ, రొమిల్లా థాపర్, బిపన్ చంద్ర, సతీష్ చంద్ర వగైరాలు రాసిన ఎన్సీఇఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని భాగాలను కొన్ని సామాజిక తరగతుల, మతానుయాయుల మనోభావాలు గాయపడుతున్నాయనే కారణంతో తొలగించారు.
అంతకు ముందు ఆర్ఎస్ఎస్ ప్రచురించిన ‘ది ఎనెమీస్ ఆఫ్ ఇండియనైజేషన్: ది చిల్డ్రన్ ఆఫ్ మార్క్స్, మెకాలే అండ్ మదరసా’ అనే పుస్తకంలో అట్లా తొలగించవలసిన 41 భాగాలను గుర్తించారనేది గమనార్హం. కొత్తగా నియమితులైన ఎన్సీఇఆర్టీ డైరెక్టర్ జెఎస్ రాజపుత్ రాసిన వ్యాసం కూడా ఆ పుస్తకంలో ఉంది.
దేశంలోని వృత్తిపరమైన చరిత్రకారుల ప్రాతినిధ్య సంస్థ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్, భారత రాష్ట్రపతి కెేఆర్ నారాయణన్తో సహా ఈ చరిత్రకారులను సమర్థించిన లౌకిక మేధావులను ‘‘దేశద్రోహులు’’ అని నిందించారు.
ఆర్ఎఎస్ఎస్ అధినేత కెఎస్ సుదర్శన్ అయితే వారిని ‘‘హిందూ వ్యతిరేక యూరో-ఇండియన్స్’’ అని అభివర్ణించాడు.
చరిత్ర పట్ల హిందుత్వ వైఖరితో (హిందూ మతోన్మాదంతో) అంగీకరించని వారందరినీ బెదిరించే ధోరణి నానాటికీ ప్రమాదకరంగా పెరిగింది. భారత జాతీయవాదానికి పరిరక్షకులమని తమకు తాము చెప్పుకుంటున్న కొంతమంది విద్యాశాఖ మంత్రి మురళీ మనోహర్ జోషి ఇంటికి చేరి, రొమిల్లా థాపర్, ఆర్ఎస్ శర్మ, అర్జున్ దేవ్ వంటి చరిత్రకారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేయడమే ఆ ధోరణికి నిదర్శనం. ఆ ఫాసిస్టు ధోరణి అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా మంత్రి ఈ మేధావులు రాసిన చరిత్రను ‘‘మేదో తీవ్రవాదం’’ అని వ్యాఖ్యానించాడు. అది ‘‘సీమాంతర ఉగ్రవాదం కన్న ఎక్కువ ప్రమాదకరమైనదని, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని అన్నాడు.
చివరికి, ఈ ‘‘మేదొ తీవ్రవాదులు’’ అనబడేవాళ్లు రాసిన ఎన్సీఇఆర్టీ పుస్తకాలను తొలగించి, కొత్త పుస్తకాలను ప్రవేశపెట్టారు.
ఈ కొత్త పుస్తకాల నాణ్యత ఎంత అన్యాయంగా ఉన్నదంటే, ఈ పుస్తకాల్లో మన పిల్లలకు వండివార్చిన మతోన్మాద దురభిప్రాయాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, 2003లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ‘హిస్టరీ ఇన్ ది న్యూ ఎన్సీఇఆర్టీ టెక్స్ట్ బుక్స్: ఎ రిపోర్ట్ అండ్ యాన్ ఇండెక్స్ ఆఫ్ ఎర్రర్స్’ (‘కొత్త ఎన్సీఇఆర్టీ పుస్తకాలలో చరిత్ర: ఒక నివేదిక, ఒక తప్పుల సూచిక’) అనే పుస్తకం ప్రచురించక తప్పలేదు.
ఆ నివేదిక ముగింపులో ఇలా రాసి ఉంది. ‘‘చాలా తరచుగా ఈ తప్పులు అజ్ఞానపు ఫలితాలు మాత్రమేననిపిస్తుంది. కాని అంతే తరచుగా అవి చరిత్రను బలమైన దురహంకార, మతోన్మాద దురభిప్రాయాలతో సమర్పించే ఉత్సాహం నుంచి పుట్టాయనిపిస్తుంది. సంఘ పరివార్ ప్రచురణలనబడేవి చాల కాలంగా ముందుకు తెస్తున్న ప్రచారం నుంచి ఈ పుస్తకాలు చాల ఎక్కువగా సంగ్రహించాయి’’.
హిందూ మతోన్మాద శక్తులు కేంద్ర ప్రభుత్వాధికారాన్ని పోగొట్టుకున్న 2004 నుంచి ఒక దశాబ్దం పాటు ఈ మతోన్మాద దాడికి కాస్త విరామం దొరికింది. వాళ్లు రాసిన పుస్తకాలను ఉపసంహరించారు. దేశవ్యాప్తంగా మేధావులను కలుపుకుని ఒక బృందాన్ని తయారుచేసి, వారిచే కొత్త పుస్తకాలు రాయించి ప్రవేశపెట్టారు. ఈ బృందాన్ని పూర్తిగా మేధస్సునూ కృషినీ దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేశారు గాని వారు రాజకీయంగా వంది మాగధులవునా కాదా అని కాదు. అది ఒక ఆహ్వానించదగిన చర్యే అయినప్పటికీ, ఆర్ఎస్ఎస్ పాఠశాలల్లోనూ, మత మైనారిటీలు నిర్వహిస్తున్న పాఠశాలల్లోనూ చరిత్రకు దుర్మార్గమైన, మతోన్మాద పూరితమైన వ్యాఖ్యానాల ప్రచారం ద్వారా సమాజంలో వేగవంతంగా సాగిపోతున్న మతోన్మాదాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఎదుర్కోవడానికి ఈ అవకాశాన్ని వాడుకోవడంలో లౌకిక శక్తులు దురదృష్టకరంగా విఫలమయ్యాయి.
2021-23
భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ మళ్లీ 2014లోనూ, 2019లోనూ కేంద్ర ప్రభుత్వ అధికారానికి రావడంతో, ఆర్ఎస్ఎస్, బీజేపీ కూటమికి భారత గత చరిత్రను తమ సొంత ఊహల ప్రకారం తిరగరాయడం అనే ఇష్టమైన వ్యావృత్తికి కొత్త అవకాశాలు దొరికాయి.
అమలులో ఉన్న ఎన్సీఇఆర్టీ పాఠ్యపుస్తకాలలోంచి ప్రధాన భాగాలను తొలగిస్తున్నారనే వార్తలు తరచుగా రావడం మొదలయింది. 2001లో జరిగినట్టుగానే, ఎన్సీఇఆర్టీ పుస్తకాలలోంచి తొలగింపులు అంతకు ముందు ఆర్ఎస్ఎస్ ప్రచురణలో కోరినట్టుగానే జరగడం మొదలయింది.
భారతీయ జనతా పార్టీకి చెందిన ఇ-ట్రేనింగ్ సెల్ కన్వీనర్ నాయకత్వంలో నడిచే పబ్లిక్ పాలసీ రిసర్చ్ సెంటర్ 2021 జూన్లో, అమలులో ఉన్న చరిత్ర పాఠ్య ప్రణాళికలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక నివేదిక వెలువరించింది.
దానితోపాటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త వినయ్ సహస్రబుద్ధే నాయకత్వంలోని ఒక పార్లమెంటరీ కమిటీ అటువంటి నివేదికనే తయారు చేసింది. ఆ తర్వాత ఎన్సీఇఆర్టీ సవరించిన పాఠ్యప్రణాళికను రూపొందించింది. ఆ వివరాలన్నిటినీ ఇండియన్ ఎక్స్ప్రెస్ 2022 ఏప్రిల్లో బైటపెట్టింది. ఈ కొత్త పాఠ్య ప్రణాళికలో మొఘల్ కాలం నుంచీ, తుగ్లక్ లు, ఖిల్జీలు, లోడీలతో సహా ఢిల్లీ సుల్తానత్ల కాలపు చరిత్ర నుంచీ ప్రధాన భాగాలను తొలగించారు.
ఇదంతా కేవలం విద్యా సంబంధమైన కసరత్తు మాత్రమేనని ఎవరైనా అనుకుంటారేమోనని, 2022 నవంబర్ 24న హోం మంత్రి ఒక ప్రకటన చేశాడు. పాత వక్రీకరణలను తొలగిస్తూ గర్వంగా చరిత్రను తిరగరాయకుండా భారత్ను ఎవరూ ఆపలేరని ఆయన అన్నాడు. అలాగే ఇంతకాలమూ నేర్పిన ‘‘కల్పిత కథనాలను సరిచేయవలసి ఉందని ప్రధాన మంత్రి 2022 డిసెంబర్ 26న అన్నాడు.
‘‘ఒకవైపున తీవ్రవాదం ఉండిరది, మరొకవైపున ఆధ్యాత్మికవాదం ఉండిరది… ఒక పక్క మత తీవ్రవాద ఉన్మాదంతో కళ్లు మూసుకుపోయిన శక్తిమంతమైన మొఘల్ సుల్తనత్ ఉండిరది. మరొక పక్కన, జ్ఞాన ప్రకాశంతో వెలిగిపోతూ, ప్రాచీన భారత సూత్రాలతో జీవితం గడుపుతుండిన గురు పరంపర ఉండిరది…’’ అని కూడా అన్నాడు.
అన్ని తొలగింపులతో కూడిన కొత్త పాఠ్యపుస్తకాలు 2023 ఏప్రిల్ మొదట్లో మార్కెట్లోకి వచ్చాయి.
మళ్లీ, ఈ పుస్తకాలు విడుదల అయిన వెంటనే, భారతీయ జనతా పార్టీ నాయకుడు కపిల్ మిశ్రా ప్రకటన ఒకటి ఏప్రిల్ 4న వెలువడింది. ఆ ప్రకటనలో ఆయన, ‘‘ఎన్సీఇఆర్టీ పుస్తకాల నుంచి మొఘల్ల తప్పుడు చరిత్రను తొలగించాలనే నిర్ణయం మహత్తరమైనది. తస్కరులను, జేబుదొంగలను, దారిదోపిడీగాళ్లను మొఘల్ సుల్తాన్లుగా, భారత చక్రవర్తులుగా పిలిచారు. ఇప్పుడిక అక్బర్, బాబర్, షాజహాన్, ఔరంగజేబ్ చరిత్ర పుస్తకాలలో లేరు, చెత్తబుట్టలో ఉన్నారు’’ అన్నాడు.
ఈ నేపథ్యంలో, కొవిడ్-19 వల్ల ఇబ్బంది పడిన విద్యార్థుల మీద చదువు భారాన్ని తగ్గించడానికి హేతుబద్ధీకరణలో భాగంగానే ఈ తొలగింపులు జరిగాయని ఎన్సీఇఆర్టీ డైరెక్టర్ పదే పదే చేస్తున్న ప్రకటనలకు అర్థంలేదని తెలిసిపోతున్నది. అలాగే, ఏవో కొన్ని ‘‘పనికిరాని’’ భాగాలను తొలగించామని ఆయన చెప్పుకుంటున్నదానికి కూడా అర్థం లేదు.
అలా తొలగింపుకు గురైన ‘‘పనికిరాని భాగాలను’’ ఊరికే పైపైన చూసినా అసలు కారణమేమిటో అర్థమైపోతుంది. కొన్ని తొలగింపులకైతే, సంపూర్ణమైన అజ్ఞానమూ అసమర్థతా తప్ప మరే కారణమూ కనిపించదు.
పైన చెప్పినట్టుగా చాల తొలగింపులు మొఘల్ కాలానికీ, ఢిల్లీ సుల్తానత్ కాలానికీ సంబంధించినవి.
ముస్లిం సముదాయాన్ని నిరంతరం శత్రువుగా చూపుతుండడం, వాళ్ల పేర్లను రోడ్ల నుంచి, నగరాల నుంచి, ఇప్పుడు పుస్తకాల నుంచి తొలగించడం, వారిని జన సమ్మర్థంతో నిండిన మురుకి వాడల్లోకి తోసివేయడం అన్నీ ఒక వరుసలో సాగుతున్నవే.
అలాగే, 2002 గుజరాత్ మారణకాండ ప్రస్తావనలను, ఆ మారణకాండ గురించి నరేంద్ర మోడీ నాయకత్వంలోని గుజరాత్ ప్రభుత్వ వైఖరి పట్ల జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యాఖ్యలను, అటువంటి మారణకాండలు కొన్ని సముదాయాలను ఎలా ఘెట్టోలలోకి తోస్తాయో, మిశ్రమ సమూహాల స్థలాలను ఒకే సమూహపు స్థలాలుగా మారుస్తాయో చేసిన వ్యాఖ్యలు అన్నిటినీ కూడా తొలగించారు.
ఒక సమూహం మీద హననకాండ జరిగిందంటే, సాధారణంగా అంతకుముందు ఆ సమూహం మీద దురభిప్రాయాలు ప్రచారం చేయడం, వారిని రాక్షసులుగా ప్రచారం చేయడం, వారి పేర్లు మార్చడం, వారి చరిత్రను తుడిచివేయడం, వారిని ఘెట్టోలలోకి తోసివేయడం జరిగాయని, సాధారణ ప్రజలు వారితో నిత్య జీవిత సంబంధాలలోకి రాకుండా చేశారని, ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలు చూపుతున్నాయి.
భారతదేశంలో కూడా ఈ పనుల క్రమం ప్రారంభమయింది.
ముస్లింల హననకాండ జరపాలని దేశంలో అనేక చోట్ల బహిరంగంగా పిలుపులు వినవస్తున్నాయి. ఆశ్చర్యకరంగా వాటి మీద శిక్షలు గాని, విచారణలు గాని జరగడం లేదు. దేశంలోని ప్రజాస్వామిక శక్తులన్నీ ఈ ముందస్తు సూచనలను గుర్తించి ప్రతిఘటించవలసి ఉంది.
అంతే కాదు, ఇలా మొఘల్, సుల్తానత్ కాలాలను తుడిచివేయడం మన సొంత చరిత్రను అర్థం చేసుకోవడంలో తీవ్రమైన అవరోధాలు కల్పిస్తుంది. ఈ కాలంలో జరిగినదంతా చెడు మాత్రమే అయితే, పద్దెనిమిదో శతాబ్ది ప్రారంభంలో ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు పావు భాగాన్ని భారతదేశం ఉత్పత్తి చేస్తుండే అవకాశం ఉండేది కాదని గుర్తుంచుకోండి. ఆనాటి భారత జాతీయోత్పత్తి మొత్తం పశ్చిమ యూరప్ దేశాల జాతీయోత్పత్తి కన్న ఎక్కువ. యునైటెడ్ కింగ్డం జాతీయోత్పత్తి కన్న ఎనిమిది రెట్లు ఎక్కువ. అప్పటికి భారతదేశం ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ చేనేత వస్త్రాల ఎగుమతిదారు. భారతదేశపు చేనేత వస్త్రోత్పత్తి సాంకేతిక విధానాలనూ, నమూనాలనూ దొంగిలించడానికి బ్రిటిష్ వాళు పారిశ్రామిక గూఢచర్యానికి పాల్పడుతుండేవారు. అదే సమయంలో అది భారతదేశంలో ఒక సంకీర్ణ సంస్కృతి ఆవిర్భవించిన సమయం కూడ. సంగీతం, కళ, భవన నిర్మాణం, సాహిత్యాలలో అపూర్వమైన ముందంజ సాధించిన సమయం కూడ అదే.
భారత ప్రజానీకం ఎన్నడూ ఈ కాలాన్ని హిందువుల మీద ముస్లిం అత్యాచారాల కాలంగా చూడలేదు. ఈ రకమైన దృష్టిని మొట్టమొదటిసారి ప్రవేశపెట్టినవాళ్లు బ్రిటిష్ వలసవాద సిద్ధాంతకర్తలు. సరిగ్గా ఆ దృష్టినే హిందూ మతోన్మాదులు అందిపుచ్చుకుని ప్రచారం చేయడం ప్రారంభించారు.
1857 తిరుగుబాటు సమయంలో అన్ని సముదాయాలకు చెందిన సైనికులు, ప్రజలు బ్రిటిష్ వారిని కూలదోయాలని, ఆ స్థానంలో మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ను నెలకొల్పాలని ప్రయత్నించారని మనకు మనం గుర్తు తెచ్చుకోవడం సముచితం! ఈ కాలానికి సంబంధించి మన పిల్లలు తొంగిచూడకుండా చేయడం మన కాళ్లను మనం నరుక్కున్నట్టే.
హిందూ రాష్ట్రం కోరుకుంటున్నవాళ్లు పాకిస్తాన్లో చరిత్ర బోధనలో ఏమి జరుగుతున్నదో దానికి సరిగ్గా అద్దంలో ప్రతిబింబంలాంటి వాళు ముస్లిం పాకిస్తాన్ను అనుకరిస్తున్నవారు. పాకిస్తాన్లో హిందూ పూర్వ హరప్పా, మొహెంజోదారోలు పాకిస్తాన్లో ఉన్నాయి గనుక వాటి గురించి చెప్పి, ఆ తర్వాత ఇస్లామిక్ పూర్వకాలం లోని కొన్ని శతాబ్దాలను, భారత జాతీయోద్యమాన్ని తప్పించి చరిత్ర బోధిస్తున్నారు. పైగా, ఈ అనుకరణ, సరిగ్గా భారతదేశంలో చరిత్ర అధ్యయనం, రచన, బోధన ప్రపంచంలోకెల్లా ప్రగతిశీలంగా ఉన్న సమయంలో జరుగుతున్నది.
తొలగింపులకు గురైన మరొక సమూహపు భాగాలు మహాత్మా గాంధీ హత్యకు సంబంధించినవి. ఈ తొలగింపులను రహస్యంగా, దొంగతనంగా జరిపారు. 2022 ఏప్రిల్లో పాఠశాలలకు పంపిన ఉత్తర్వులలో కూడా ప్రస్తావించలేదు. ఈ విషయాలను కూడా ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తా కథనంలో రాశారు. ‘‘భారతదేశాన్ని హిందువులకు మాత్రమే సంబంధించిన దేశంగా మార్చే ఏ ప్రయత్నమైనా దేశాన్ని ధ్వంసం చేస్తుంది’’ అని గాంధీ ప్రకటించిన విశ్వాసాన్ని తొలగించారు.
గాంధీ కట్టుబడిన ‘‘హిందూ ముస్లిం ఐక్యత అనే దృఢమైన ఆకాంక్ష హిందూ అతివాదులను రెచ్చగొట్టింది, అందువల్లనే వారు ఆయన మీద అనేకసార్లు హత్యాప్రయత్నాలు చేశారు’’ అనే మాటలనూ తొలగించారు. అలాగే, ‘‘మత విద్వేషాలను రెచ్చగొడుతున్న సంస్థల మీద భారత ప్రభుత్వం కొమ్ము బిరుచుకుని ఎంచుకుని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ వంటి సంస్థలను కొద్ది కాలం కొరకు నిషేధించారు’’ అనే మాటలనూ తొలగించారు.
పన్నెండో తరగతి చరిత్ర పుస్తకంలో గాంధీ హంతకుడి రాజకీయాభిప్రాయాల గురించిన పారాగ్రాఫులో సవరణలు చేశారు.
సవరణల తర్వాత ఆ పారాగ్రాఫు, ‘‘జనవరి 30న సాయంత్రం ప్రార్థనల తర్వాత గాంధీని ఒక యువకుడు కాల్చి చంపాడు. ఆ తర్వాత లొంగిపోయిన ఆ హంతకుడి పేరు నాథూరాం గాడ్సే’’ అని మాత్రమే ఉంది. జాతిపిత హత్యలో హిందూ మతోన్మాద శక్తుల పాత్ర ఉందని చెప్పిన మాటలను మాసిపూసి మారేడుకాయ చేసి, వారి బాధ్యతను తప్పించడానికి స్పష్టమైన ప్రయత్నం జరిగిందని ఇక్కడ కనబడుతుంది. అదే సమయంలో ఇవాల్టి రాజకీయ వాతావరణంలో నాథూరాం గాడ్సేను ఆరాధించే ప్రయత్నాలను అనుమతిస్తున్నారు. గాడ్సేను ‘‘దేశభక్తుడు’’ అని అభివర్ణించిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు నభ్యురాలు ప్రజ్ఞా ఠాకూర్ తన పదవిలో యథాతథంగా కొనసాగుతున్నారు! భారతీయులలో అత్యంత ఉన్నతుడైన ఒక వ్యక్తిని దారుణంగా హతమార్చడానికి దారి తీసిన పరిస్థితుల గురించి రాబోయే తరం ఎటువంటి పాఠాలు నేర్చుకోనక్కరలేదని బోధించబోతున్నారని స్పష్టమే.
పారిశ్రామిక విప్లవం, కుల అణచివేత, ప్రజా ఉద్యమాల అభివృద్ధి, సంస్కృతుల ఘర్షణ, ప్రజాస్వామ్యం వైవిధ్యం, ప్రజాస్వామ్యానికి సవాళ్లు, ఎమర్జెన్సీ, ప్రధాన ఇస్లామిక్ దేశాలు, పర్యావరణం – సమాజం, పట్టణ వాతావరణం (పట్టణాలలో అసమానతల గురించీ, అక్కడ పేదలకు వ్యతిరేకంగా సంపన్నులను కాపాడే పోలీసుల వైఖరి గురించీ చెప్పిన భాగం) వగైరా ఇతర ‘‘పనికిరాని’’ అంశాలను తొలగించడానికి కారణాలను చర్చించడానికి స్థలాభావం వల్ల ఇక్కడ ప్రయత్నించడం లేదు.
ఇటువంటి తొలగింపులతో మనం ఎటువంటి ప్రశ్నలూ అడగని, ఆలోచించలేని భక్తులను తయారు చేయడంలో విజయం సాధించగలం. కాని మనం మన పిల్లలు మూఢులూ తెలివితక్కువవాళ్లూ కావాలని కోరుకోవడం లేదు.
అదృష్టవశాత్తూ, చాల మంది విద్యావేత్తలూ, ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ తొలగింపుల మీద తీవ్రమైన నిరసనలు ప్రకటించారు. ఈ మార్పులన్నిటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మార్పులన్నీ రాజ్యాంగ ఆదర్శాలకూ, భారత ఉపఖండంలోని ప్రజాస్వామిక, సంకీర్ణ సంస్కృతికీ వ్యతిరేకమైన విచ్ఛిన్నకర దురుద్దేశాలతో సాగుతున్నవని అన్నారు. ఎన్సీఇఆర్టీ నిర్ణయాన్ని విమర్శిస్తూ ఎన్నో వార్తాపత్రికలు సంపాదకీయాలు రాశాయి. మన పిల్లల విద్యా బాధ్యతలు చూస్తున్న వారికి ఈ మంచి మాటలు మనసుకెక్కి వారు పిల్లల ఉత్తమ ప్రయోజనాలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి చేస్తాయని ఆశిద్దాం.
ఆదిత్య ముఖర్జీ, మృదులా ముఖర్జీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ లో అధ్యాపకులుగా పని చేశారు.
(తెలుగు అనువాదం: ఎన్ వేణుగోపాల్)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.