
సరిగ్గా 50 ఏళ్ల క్రితం మాట. అప్పడప్పుడే వార్తలు, వ్యాసాలు రాస్తున్న దశలో ఈ వ్యాస రచయితకు ఎమర్జెన్సీ- స్వేచ్ఛా వ్యతిరేకత లక్షణాల గురించి అర్థమవుతోంది. 1975 సంవత్సరంలో సీకేఎం కాలేజ్లో నేను బీఎస్సీ చదువుతున్నాను. 1973లో అరెస్టయిన వరవరరావు అప్పటికింకా జైల్లోనే ఉన్నారు. ఆ సమయంలోనే కాలేజ్ మ్యాగజైన్ ‘చైతన్య’ను ప్రచురించారు. ప్రముఖ రచయిత తెలుగు లెక్చరర్ శ్రీవేంకటరత్నం మ్యాగజైన్కు సంబంధించి వివిధ అంశాలపై మాకు మార్గదర్శనం చేసేవారు. చైతన్య మ్యాగజైన్ సంపాదకీయంలో విప్లవ కవితలు, ఇందిరాగాంధీ పాలనలో అన్యాయాల మీద వివరణాత్మక వ్యాసాలు, చల్లటి కోకాకోలా ప్రియమనే వారికి, కాదనే వారికి మధ్య వాదోపవాదాలు. భారతదేశానికి విదేశీ శీతలపానీయాలు అవసరమా? దాని వల్ల ఏం లాభం? దీని వల్ల విదేశీ సంపన్నులకు కోట్ల రూపాయల భారతీయ సొమ్మును అప్పగించాల్సి వస్తుందని అనుకునేవాళ్లం. అంతేకాకుండా, దేశాన్ని ఆర్థిక రంగంలో అభివృద్ధి చేయకుండా ఈ కోకాకోలాలు తాగడమేంటని అభిప్రాయపడేవాళ్లం.
వరంగల్ దేశాయపేట కళాశాల ప్రిన్సిపల్ అంజయ్య ‘‘ఏం నాయనా విప్లవాలు వస్తున్నాయని సంపాదకీయంలో రాస్తావా? కొంపలు మునగవా మరి. కనీసం భావవిప్లవం అన్నా బాగుండేది కదా”ని ఆగ్రహించేవారు. ఎవరేమన్నా సరే, అప్పటికి చైతన్య మ్యాగజైన్ ప్రింట్ అయిపోయింది. మ్యాగజైన్ కాపీలు పంచడం అయిపోయింది. ఈ సమయంలోనే 1975 జూన్ 25న ఎమర్జెన్సీ సమస్య మొదలైంది. దేశమంతా భయం ఆవహించింది.
కాలేజ్ ఆవరణలో పోలీసులు దిగారు. అంజయ్యసార్, కాలేజీ యాజమాన్యం మ్యాగజైన్లను భద్రపరచడానికి ప్రయత్నించారు. చివరికి విప్లవ వ్యాసాలున్న పేపర్లైనా తీసేద్దామాని అనుకున్నారు. కానీ సాధ్యం కాదని బాధపడ్డారు. సాధ్యం కాదని తెలిసి మ్యాగజైన్లు మొత్తం కట్టగట్టి తీసి పారేయాలని ఎవరనుకుంటారు? ఇదంతా ఆలోచించేలోపే కలెక్టర్ తరఫున అధికారులు ప్రిన్సిపల్ ఆఫీసు వరకు చేరుకున్నారు.
విద్యార్థులందరు తమ దగ్గర ఉన్న మ్యాగజైన్లను తిరిగి ఇవ్వాలని అధికాకరులతో పాటు కాలేజీ యాజమాన్యం గట్టిగా చెప్పారు. కాలేజ్లో ఎంతమంది ఉన్నారని లెక్క రాసుకుని, ప్రతీ క్లాస్లో ఒక్కొక్కరి నుంచి పేరు, రోల్ నెంబర్ ప్రకారం చైతన్య మ్యాగజైన్ సంచికలను వసూలు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఒక్క కాపీ అయినా మళ్లీ దొరకలేదు, అడిగితే దిక్కులేదు.
పత్రికా సెన్సార్ కమిటీకి ప్రెసిడెంట్గా జిల్లా కలెక్టర్ ఉన్నారు. అప్పుడు కలెక్టర్ స్మరజిత్ రాయ్. ఎమర్జేన్సీ వల్ల ఎవరూ ఏమీ చేయలేని స్థితి. అప్పటికే, జనధర్మ పత్రికలో వార్తా రచనలు చేస్తూ ఉండేవాణ్ని.
సమాచార భారతికి, వివిధ న్యూస్ పేపర్లకు విడివిడిగా ఉన్న న్యూస్ ఏజన్సీలను ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ రద్దు చేశారు. పీటీఐ, యూఎన్ఏ, హిందూస్తాన్ సమాచార్, సమాచార భారతి ఏజెన్సీని కలిపి‘సమాచార్’ ఏజెన్సీగా మనుగడ సాగించింది. ప్రభువుల ఆజ్ఞల ప్రకారమే వార్తలు ఇచ్చేవారు. అందుకు ఎమర్జెన్సీ కాలంలో పత్రికలన్నీ మౌనంగా ఉంటూ సంపాదకీయాల స్థలాలలో ఖాళీగా వదిలివెళ్లే స్థితి. ఎందుకంటే ఇందిరాగాంధీని విమర్శిస్తే జైలుకుపోవలసిందే.
‘‘ఇంకెక్కడిదీ ‘చైతన్య’ శ్రీధర్. ఏమైందో నీకు తెలుసా, నువ్వు ఎడిటర్గా ఉన్న చైతన్య సంచికలను వెతికి కట్టగట్టి వాటి మీద పెట్రోల్ చల్లి మరీ కాల్చిపడేశారు. దానికి నేను సాక్షిగా ఉన్నాను. సంచికలన్నీ బూడిదయ్యే దాకా ప్రభుత్వ అధికారులు, పోలీసులు అక్కడే నిలబడి చూశారు, ఇంకా దీనికంటే ఏం చెప్పను’’ అని బాధగా చెప్పారు జయశంకర్ సర్.
వరంగల్ పత్రిక జనధర్మ ప్రీసెన్సార్..
జనధర్మ పత్రికలో కార్మికులు కంపోజ్ చేసి ప్రింట్ చేయడానికి ముందు తడిసిన ప్రూఫ్ కాగితాలను ఎండబెట్టేవారు. ఆ తరువాత ప్రీసెన్సార్ కోసం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత ఆఫీసర్కు ఇవ్వాలి. జనధర్మ పత్రిక ప్రెస్ నుంచి ఎడిటర్ నాయకత్వంలో దీనిని పర్యవేక్షించాను.
ప్రతివారం కట్టల కట్టలుగా పత్రిక ప్రూఫ్లు చదివి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నారో లేదా తెలుసుకోవడానికి ఆ ఆఫీసర్ చదవక తప్పదు. చదివితే అర్థమవుతుందో లేదో మనం చెప్పలేం కదా. దాదాపు చదివినా చదవక పోయినా చదవలేకపోయినా సంతకాలు చేసి దానికి కింద కలెక్టర్ కార్యాలయం ముద్ర స్టాంప్ చేయాల్సిందే. అప్పుడు ఎంఎస్ ఆచార్య పంపిన వార్తలను కార్మికులతో కలిసి మేకప్ చేసేవాడిని. సాయంత్రానికి ఆ పేజీ రెడీ చేయడం నా పని. మూడుగంటల దాకా ప్రింట్ చేసేది. మరికొన్ని పేజీల తరువాత గురువారానికి ముందు రాత్రి ప్రింట్ ముగించి ఉదయం ఎనిమిది గంటలకే పోస్ట్ ఆఫీస్కు ఇవ్వాలి.
ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవం కోసం ప్రత్యేక సంచిక తయారు చేశాము. అందులో ‘‘నాకూ స్వాతంత్య్రం వచ్చింది’’ పేరుతో సెటైర్ సిద్ధం చేశాము. అంతకు ముందు ఒక సెటైర్ రాసిన అనుభవంతో నేనే కంపోజ్ చేసి, మేకప్ చేసి, ప్రింటింగ్ కోసం ఆ సెటైర్ను ఎడిటర్ పరిశీలనకు పంపాను. ఆయన ఓకే అన్న తరువాత మెషిన్కు పంపి ప్రింట్ చేయించాలి. ఎడిటర్కు పంపిన తరువాత జిల్లా ఆఫీసర్ల ప్రీసెన్సారింగ్ పూర్తయింది. ప్రింటింగ్ కూడా జరిగింది. తరువాత అనేకానే సమస్యలు మొదలైయ్యాయి. కలెక్టర్లకు ఎవరో పోలీసులకు కంప్లయింట్ చేశారు. దాని మీద జనధర్మ ఎడిటర్కు ఫిర్యాదు వచ్చింది.
‘‘నాకూ స్వాతంత్య్రం వచ్చింది!’’
ఆచార్యా సాబ్ అని స్వయంగా పత్రిక ఎడిటర్తో స్మరజిత్ రాయ్ కలెక్టర్ మాట్లాడారు. ‘‘ఇది ఎమర్జెన్సీ కదా, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పత్రికలో రాయడం తప్పు కదా. మీపైన చర్య తీసుకోవలసి వస్తుంది. ఈ వ్యాసం మీరు రాశారో ఇంకెవరైనా రాశారో మాకు తెలియదు. కానీ వ్యాసంలో శ్రీధర్ అనే పేరు ఉంది. ఈయన ఎవరు” అని అడిగారు. నా రచన సమస్యగా తయారైందని ఎడిటర్కు అర్థమైంది. ‘‘ప్రీసెన్సార్ సంతకాలు తీసుకున్నాను కదా. మీ ఆఫీసర్ అంగీకరించారు కదా. మళ్లీ నన్ను ఎందుకు అడుగుతున్నారు’’అని కలెక్టర్ను నిలదీసినట్టు ఆచార్యా అడిగారు.
‘‘నాకు తెలుగు రాదు. ఇంగ్లీషులోనూ అప్పుడప్పుడు హిందీలో మాట్లాడుతూ ఉంటాను. ఇక మా ఆఫీసర్కి అర్థం అయిందో లేదో, ఇప్పుడు ఆ తెలుగు తెలిసిన ఆఫీసర్ను అరెస్టు చేయాలి. ఎందుకండీ ఇంత బాధ పెట్టడం. కనుక దయచేసి మీరు ఇటువంటి ప్రచురించకుంటే బాగుంటుంది’’అని కలెక్టర్ అన్నారు. ‘‘మీరు ప్రీసెన్సార్ తరువాత మా పైన ఏం చర్య తీసుకుంటారు. మీ ఆఫీసర్లమీదే చర్య తీసుకోవాలి కదా’’ అని వాదన సాగింది.
ఎమర్జెన్సీ సమయంలో ‘మనకు స్వరాజ్యం వచ్చింది. కానీ, స్వతంత్య్రం రాలేదు’ అనే ఇతివృత్తంతో ‘నాకూ స్వతంత్య్రం వచ్చింది’ అనే టైటిల్తో వ్యంగ్యరచన చేశాను. ‘‘వీడు ఇంకా డిగ్రీ పూర్తి చేయలేదు. ఇందిరాగాంధీ మీద సెటైర్ రాసేంత స్థాయికి ఎదగాడా? వాడిని అరెస్టు చేస్తే ఇప్పుడేం చేయాలి’’ అని ఎడిటర్ విమర్శించారు. వారి శ్రీమతికి బోలెడంత కామన్సెన్స్ ఉంది. తన ఇంగితంతో ‘‘వాడు ఇందిరాగాంధీని తిట్టడం, మీరు జనధర్మ పత్రికలో ప్రింట్ చేయడం ఏంటి?’’ అని అడిగితే అమ్మకు ప్రశ్నలన్నీ వివరించారు నాన్న. ఇప్పుడు అమ్మ ‘‘ఓహో ఇందన్నమాట. వాడేదో రాసిండనుకో, మీరు పేపర్లో ఎందుకు వేశారండి’’ అని ఎదురు ప్రశ్న వేశారు.
‘‘వాడిని రానీ, మీకు ఇబ్బందులు తేవడం ఎందుకని నేను కూడా అడుగుతాను. అయినా రాసిందేమిటసలు?’’ అమ్మ అడిగారు. ‘‘నాకూ స్వతంత్రం వచ్చింది!’’ అని ఒక వ్యంగ్యం. “ఉద్ధరించాడు మహానుభావుడు’’ అన్నారు.
‘‘అవును, అయినా వాడు చాలా బాగా రాసిండు’’ అని ఎడిటర్ నన్ను మెచ్చుకున్నారు. ‘‘ఎందుకీ పిచ్చిరాతలు. నాన్నకు ఎందుకు సమస్యలు తీసుకొస్తావు?’’ అని అమ్మ నన్ను అడిగారు. ‘‘అది సరే కానీ నీకు తెలుసా, చివరకు నువ్వు రాసిందేదో బాగుందని మెచ్చుకున్నాడ్రా’’ అన్నారు. ఎమర్జెన్సీలో జరిగిన ఈ సంఘటన మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.